28, ఆగస్టు 2025, గురువారం

:: వటపత్ర బాలగణపతి ::  

    సత్యలోకంలో కమలాసనంమీద కూర్చుని, పగలంతా సృష్టిచేసి చేసి అలసిన బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవులించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి, అగ్నులను వెదజల్లాయి. నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయమేఘాలు మెరుపులతో భయంకరంగా ఘర్జిస్తూ, ఏనుగుతొండాలవంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలముకున్నది. 

    ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభం ప్రారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తుమీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తూండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. 

    ఆయన పద్మాసనంవేసి కూర్చొని, నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులూ కలయజూశాడు. 

    కింద ఉన్న జగత్తు అంతా నీటిమయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాలమధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లుకొలిపే తెల్లని కాంతిరేఖ కనిపించింది. 

    ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రిఆకు, దానిపై చందమామలాంటి పసివాడు పడుకొని కుడికాలు బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు. 

    బ్రహ్మ చేతులు జోడించి, కన్నులుమూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింతదృశ్యం కనిపించింది. 

    ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. కాని ఇప్పుడా పిల్లవాని తల ఏనుగుతలను పోలి, చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుతూన్నట్టుగా కనిపించింది. 

    ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరునిముషంలో, ఆకుతోసహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టిదిబ్బ ఒకటి కనిపించింది. 

    క్రమక్రమంగా నీటినుండి సువిశాలమైన భూభాగాలూ, సముద్రగర్భాలూ ఏర్పడ్డాయి. 

    బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలూ, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరుతీసి జగత్తుమీద చల్లాడు. తరువాత వృక్షాలనూ, సస్యాలనూ, ఖనిజాలనూ సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని - మొదట సముద్రంలో చేపలనూ, భూమ్మీద జంతుజాలాన్నీ, క్రిమికీటకాదుల్ని, పక్షుల్నీ సృజించాడు. తరువాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. 

    బ్రహ్మ సృష్టిచేస్తున్నంతసేపూ సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది. ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతి నివ్వెరపడుతూ కిందకు చూసి మరింత నివ్వెరపడింది. బ్రహ్మ అర్థాంగి నివ్వెరపాటు అర్థంగాక కమలాసనంనుంచి వంగి కిందకు చూశాడు. 

    పర్వతాలు బోర్లపడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూన్నవి. 

    నదులు సాగరంనుంచి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నవి. వృక్షాలు తలకిందులుగా, వేళ్ళు ఆకాశానికి తన్నుతున్నవి. 

    జంతువులూ చాలా అనర్థాలతో పుట్టాయి. తలలులేకుండా కొన్ని, వెనుకకాళ్ళు లేకుండా కొన్ని, ఒంటికాలువి, మూడుకాళ్ళవీ, కళ్ళూ, చెవులూ అన్నీఉండి నోరు అనేది లేనివీ, తోకలకు తలలున్నవీ, తలలకు తోకలున్నవీ కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే కాళ్ళు లేక నేలమీద దొర్లుకుంటున్నవి. 

    ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు. 

    మనుషులలో కొందరికి రెండుతలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది.  

    పురుషులు జానెడు, బెత్తెడుగా ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటిచెట్లలాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్నవాళ్ళు, నాలుగు, మూడు, ఒంటికాళ్ళవాళ్ళూ, పొట్టకే పెద్దనోళ్ళున్న కబంధులూ ఆక్రందనలుచేస్తూ కనిపించారు. 

    జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి. మూగగా చూస్తున్నవి. బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నవి, కదనుతొక్కుతున్నవి. 

    ఒక జానెడు మగవాడు తాటిచెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ " ఓ బ్రహ్మదేవుడా! ఇలాంటి స్త్రీతో నేనెలా సంసార సాగరం ఈదేది? " అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. 

    " నాలుగుతలలంటూ ఉన్నా, అసలు తల అంటూలేని ఓయీ బ్రహ్మదేవుడా! మమ్మల్నెందుకిలాగ పుట్టించావు? " అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనలు మిన్నుముట్టుతున్నవి. 

    బ్రహ్మ నాలుగుతలలూ గిర్రున తిరిగిపోయాయి. ఎనిమిది కళ్ళూ బైర్లుకమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతివంక అయోమయంగా చూశాడు. అతని నాలుగు తెల్లమొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకున్నది. 

    " ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా! నేను సృష్టికి పూనుకున్నాను. ఇలాగ ఎందుకు జరిగింది? " అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలుపైకెత్తి అరిచాడు బ్రహ్మ. అతని ప్రశ్న దశదిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగుతల ఉన్నది. నాలుగు చేతులలో పాశము, అంకుశము, కలశము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడివలె ప్రకాశిస్తున్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతున్నది. అప్పుడు సరస్వతివీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ, మాయామాళగౌరవ రాగానికి మారుతూ, హంసధ్వనిరాగాన్ని అందుకొన్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతనిచుట్టూరా శరత్కాల పూర్ణిమనాటి వెన్నెలవంటి వెలుగు ఆవరించి ఉన్నది. 

    బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, " మహానుభావా! అద్భుతమూర్తివైన నీవెవ్వడవు? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని. అనుగ్రహించు " అని అడిగాడు. 

    " నాయనా! బ్రహ్మదేవా! సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూంటుంది. అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్నీ నిండుకలశంలాగ జయప్రదంచేసే విఘ్ననాయకుడిని. పంచభూతములనబడే పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని. ఆహారధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనంచేసే మదించిన ఏనుగులవంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడని పిలువు " అని గంభీరస్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు. 

    అప్పుడు బ్రహ్మ " దేవా! విఘ్నేశ్వరా! నా సృజన శక్తికి ఎందుకిలాగ ఘోరమైన విఘ్నం జరిగింది. ఇన్ని వంకరలెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు " అన్నాడు. 

    " విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రిఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించ లేకపోయావు.  నా గురించి  ఆలోచించడమంటే విఘ్నం గురించి ముందుజాగ్రత్తపడే జ్ఞానాన్ని కలిగి ఉండడమే! ఆ జ్ఞానస్వరూపుణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతిజీవీ కార్యరంగానికి దిగేముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తనూ, జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసేముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తూన్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్నీ అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్రశాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో! వాటిని తిరిగి గ్రహించి సృష్టి నిర్వర్తించు " అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలనిచ్చాడు. 

    బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ " విఘ్నేశ్వరా! నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి, మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలాగా చెయ్యి " అని కోరాడు. 

    విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకూ జరిగిన వంకరటింకరుల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో " ఓ బ్రహ్మదేవుడా! వక్రతను తుండతుండములుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండుడు అనేపేరు సార్ధకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూంటాను. వక్రతుండుణ్ణి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పనికూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు. సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకరటింకరులు పోకుండా జగత్తు నీవు మలచిన కళానిలయంగా భాసిస్తుంది. నీకుమల్లే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలిపూజలందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాలనుంచి కాపాడుతూ, సంకల్పసిద్ధిని కలిగించే సిద్ధివినాయకుడిగా, సకల గణాలకూ అధిపతిగా గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను " అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్థానమయ్యాడు.  

    సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందోళ, శ్రీరాగాలతో మంగళస్వరాల్ని మహాకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది. 

    బ్రహ్మ " విఘ్నేశ్వరాయనమ: " అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులూ, అమృత జలాలతో నదులూ,  సుందర వనాలూ, రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలమూ, శారీరకంగానూ, మానసికంగానూ ఉన్నతులూ, బలవంతులూ అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. 


21, ఆగస్టు 2025, గురువారం

:: ప్రాణంపొందిన ప్రతిమ ::  

    దేవతల శిల్పి విశ్వకర్మ. రాక్షస శిల్పి మయుడు. ఇద్దరూ గొప్ప శిల్పులే. కానీ, యిద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే, అతను రాక్షస శిల్పి కావటంచేత అతణ్ణి దేవతలు ఎన్నడూ మెచ్చేవారు కాదు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునే వారు.  

    మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడే వాడు కాడు. కాని, మిగిలిన రాక్షసులు, మయుడి దగ్గరకెళ్ళి " నీకామాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలి గోరికైనా సమం కాడుగదా! అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకొంటావా? " అన్నారు. 

    మయుడు నవ్వి " నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సౌభకనగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారుగదా? " అన్నాడు. 

    " విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబట్టి, అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసిపెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడా పాతవిషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకూ, విశ్వకర్మకూ పోటీని ఏర్పాటుచేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు " అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు. 

    " సరే, పోటీ ఏర్పాటుచెయ్యండి " అన్నాడు మయుడు. 

    రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి " మీ విశ్వకర్మకూ, మా మయుడికీ పోటీ ఏర్పాటు చెయ్యండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయిందీ తేలిపోతుంది. మాటలతో పని ఏమిటి? " అని అడిగారు. 

    దేవతలు తమలో తాము గుసగుసలాడుకుని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. 

    " బృహస్పతికి బావమరిదిని. సూర్యుడికి పిల్లనిచ్చిన మామను. ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా? " అన్నాడు విశ్వకర్మ. 

    దేవతలు మయుణ్ణి పిలిపించి " నీకూ, విశ్వకర్మకూ పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఎటువంటి మహత్తుగల వస్తువు నిర్మిస్తావో చెప్పు. అటువంటిదే విశ్వకర్మను గూడా నిర్మించమంటాం " అన్నారు. 

    " మహిమలకేమిటి? అందరి మహిమలూ అందరెరిగినవే. నేను మూడు లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారుచేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వెయ్యటానికి వారూ వీరెందుకు? సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చెయ్యండి " అన్నాడు మయుడు. 

    దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు. 

    త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణంగల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. 

    విశ్వకర్మకు కాలూ, చెయ్యీ ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి " తాతా! ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. మూడు లోకాలలోనూ ఎక్కడాలేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని ఋజువు చెయ్యటానికే అతను ఈ పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంతకాలమూ మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలమూ నీకూ, నాకూ కూడా అపకీర్తి తప్పదు " అన్నాడు. 

    మిగిలిన దేవతలుకూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి " తాతగారూ! మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి. లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి, అపజయమూ తప్పవు " అని వేడుకున్నారు. 

    మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయీక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. 

    ఆయన మయుడితో " నాయనా! నీవు కుర్రవాడివయినా ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కాని, నాకు ఒక్కటే విచారంగా ఉన్నది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించినవాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే, దీనికి ప్రాణం ఉంటే యింకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి వనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృథా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది.అంతకన్నా కావలసిందేమిటి? " అన్నాడు. 

    మయుడు కొంచెంసేపు ఆలోచించి " దేవా! అలాగే చెయ్యండి. నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను " అన్నాడు. 

    దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణంపోసి, మనిషిని చేసి, ఆమెకు 'హేమ' అని నామకరణం చేశాడు. అప్పటికప్పుడే మయుడికీ, హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడూ, మిగిలిన దేవతలూ వెళ్ళిపోయారు. 

    " ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు చేస్తాయి, ముసలితనం వస్తుంది, చివరకు చచ్చిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది " అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. 

    ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి, మండోదరీ, మాయావీ, దుందుభీ అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయసుతో ముడతలుకూడా పడ నారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు. 

    ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. " హేమ మా ఆడపడుచు. మా లోకంలో ఉన్నట్లయితే, శరీర ధర్మాలకు అతీతంగా ఉండి, నిత్య యౌవనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది, చూడు! " అంటూ వారామెను తీసుకొని వెళ్ళిపోయారు. 

    మయుడు విరక్తిచెంది తన పిల్లలను వెంటవేసుకొని దేశాటనచేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కుమార్తె మండోదరిని యిచ్చి పెళ్ళిచేశాడు.  ఆ కథ అంతా మీకు తెలిసినదే! 

    అయితే, ఈ కథలో అందరకూ మయుడు సాటిలేని శిల్పి అయిఉండి కూడా, విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వతకీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మా మారుస్తానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలుననా? అనే సందేహాలు తప్పక కలుగుతాయి. వాటికి ఇలా సమాధానాలు చెప్పుకోవచ్చు. " బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే, మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వంగాని, ఆ తరువాతగాని బ్రహ్మదేవుడు ప్రాణం పొయ్యటం జరుగలేదు. అదీగాక, శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవటం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలూ, మయుడు నిర్మించిన నగరాలూ ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కాని, సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి, బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటారా? హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను గూడా త్రిలోకసుందరి అన్నారు. ఈనాటికీ కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉంది. ప్రపంచం ఉన్నంతకాలమూ అది నశించదు. ఇది తెలుసు కనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. 

17, ఆగస్టు 2025, ఆదివారం

:: రామనవమి ::  

    లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు. 

    కొడుకు, కోడలూ వచ్చేవేళకి పులస్త్యులవారు పురాణం చదువుకుంటున్నారు. అది చూచి రావణుడు " ఏమిటండి, ఈ గాథ? " అని ఆయనను అడిగాడు. 

    " ఇది రామాయణం. దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రమేమిటంటే, ఇందులో చెప్పబడిన కథ అంతా యిదివరలో జరిగినదికాక, ఇకముందు జరుగబోతున్నది " అన్నారు పులస్త్యులవారు. 

    " ఆ జరుగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా? " అని ఆయనను కోరినాడు రావణుడు. 

    " శ్రీమహావిష్ణువు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి, యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తారట " అన్నారు పులస్త్యులవారు. 

    యాధాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి, ఎంతో ఆదుర్దాగా " రావణుడంటున్నారు, ఆ రావణుడు మీరు కాదుగదా, కొంపతీసి? " అన్నది భర్తతో. 

    అందుకు పులస్త్యులవారు, " లోకంలో ఇద్దరు రావణులు లేరుసుమా! రావణుడంటే మనవాడేను " అన్నారు. 

    ఈమాట వినడంతోనే మండోదరీదేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దు:ఖించటం మెదలుపెట్టింది. 
    
    రావణుడు నవ్వుతూ, " దశరథుడంటే ఎవడో మనుష్యుడై ఉంటాడు. మనుష్యులను జంతికలకుమల్లే కరకర నమిలి మ్రింగే రాక్షసకులానికంతటికీ రాజును నేను. నన్నా! ఆ దశరథకుమారుడు చంపటం? ఈ పుక్కిటి పురాణం నమ్మకు " అన్నాడు. ఈ మాటకు పులస్త్యులవారు, " అలాగ తోసిపారెయ్యకు. ఇది పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు " అన్నారు. 

    " అటైతే, ఒక పని చేస్తాను " అన్నాడు రావణుడు. " ఏమిటి " అన్నది మండోదరి. 

    " ఆ దశరథుడనే వాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాణ్ణి పట్టుకు చంపివేస్తే, ఇంక వాడికి కొడుకు పుట్టడం, ఆ కొడుకు నన్ను చంపటం అనేది ఉండదు కదా! " అన్నాడు రావణుడు. అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. చారులను రప్పించి, " దశరథుడనే వాడెవడో, వానికి పెళ్ళి అయినట్టయితే ఆ భార్య ఎవరో, వెంటనే తెలుసుకురండి " అని చెప్పి పంపాడు. 

    కొంతకాలమయేసరికి ఆ చారులు తిరిగివచ్చి, " ప్రభూ! హేమ పట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోసల దేశపు రాజునూ, కేకయ దేశపు రాజునూ ఓడించాడు. కోసలదేశపు రాజునకు కౌసల్య అనీ, కేకయ దేశపు రాజునకు కైకేయీ అని కుమార్తెలు ఉన్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్టణానికి తెచ్చి భార్య కిచ్చి " ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతోబాటు పెంచు. ఈ ముగ్గురికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేద్దాం " అన్నాడు అని చెప్పారు. 

    అప్పుడు రావణుడు " నేను దశరథుని సంగతి కనుక్కు రండర్రా అని పంపిస్తే మీరు హేమ పట్టణం సొద చెప్పుకొస్తున్నారేమిటి? " అని విసుక్కున్నాడు. 

    అందుకు చారులు, " ప్రభూ! చిత్తగించండి. ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదటి పెళ్ళికుమారుణ్ణి వెతికి తెచ్చారు. అతడే దశరథుడు " అన్నారు. " అయితే, ఎప్పుడు పెండ్లి? అన్నాడు రావణుడు. 

     అందుకు వాళ్ళు,  "  జైమిని అనే మహర్షి వచ్చి  ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభూ! అదీగాక మరొక్క చిత్రం కూడా విన్నాము " అన్నారు. " ఏమిటది ? " అన్నాడు రావణుడు. 

    " సుమిత్రకు, కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ, మేము ముగ్గురం కలసి మెలసి పెరిగాము. మమ్మల్నికూడా ఆ దశరథుడికే యిచ్చి పెళ్ళిచేస్తే ముగ్గురం ఒకచోటనే ఉంటాం అన్నారట. అందువల్ల సుమిత్రను, కైకేయినీ కూడా ఆ దశరథునికే యిచ్చి పెళ్ళి చేస్తారట " అని చెప్పారు. 

    " ఈ పెళ్ళి కాకుండా చూడాలి " అంటూ రావణుడు కొలువు చాలించి లేచి, వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనుని పైకి దండెత్తి వెళ్ళాడు.

    ఆ రాజుని యుద్ధంలో ఓడించి పారద్రోలి, రావణుడు విజయగర్వంతో అంత:పురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురునీ తెచ్చి రథంమీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంక ఆ దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్యానగరం వేపు పోనిచ్చాడు. దారిలో గంగానది అడ్డువచ్చింది. ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది. " ఎవరిదీ ఓడ? " అని అడిగేసరికి ఆ ఓడవాళ్ళు " హరసేన మహారాజులంగారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్ళికి తరలివచ్చినపుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారండి " అన్నారు. 

    ఈమాట వినేసరికి రావణునకు ఒక ఆలోచన తోచింది. " ఈ మానవుణ్ణి చంపటం కోసం నేను పనికట్టుకుని ఆ అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయటానికి నా సేవకులే చాలు " అని అనుకొని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్ళతో " మీరు ఈ ఓడవాళ్ళ నందరినీ చంపి భక్షించండి. నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకుమల్లే నటిస్తూ, దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచివెయ్యండి " అని ఆజ్ఞాపించాడు. 

    రావణుడు రాజకుమార్తెలతో లంకా పట్టణం చేరుకోవడంతోనే మండోదరి వాళ్ళను చూసి " ఎవరీ పిల్లలు ? " అంది. రావణుడు సంగతంతా చెప్పి " దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగానది మధ్యలో పెద్ద పెళ్ళి అయిపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్ళి చేసుకుంటాను " అన్నాడు. 

    మండోదరి నెత్తి నోరూ బాదుకుంటూ " నీకూ నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలనా పెండ్లి చేసుకుంటానంటున్నావు? కొరివితో తలగోక్కోవడమా? " అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్ళి ప్రయత్నం మానివేశాడు. 

    తరువాత పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఆ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి, మూసివెయ్యమన్నాడు. అయితే, ఆ పెట్టెను దాచటం ఎలాగా అని సమస్య రాగా, రావణునికి వికర్ణుడనే మాయరాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడంటే, వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకన్నమాట. ఈ సోమకాసురుణ్ణి చంపటానికే శ్రీమహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చిందికూడా! 

    వికర్ణుడు రావటంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి " దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు. నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చి యిద్దువుగాని " అన్నాడు. 

    వికర్ణుడు " చిత్తం ప్రభూ! అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తుండగానే దానిని తన కడుపులో దాచేసి,  ఇంక దీని సంగతి ఎవరికీ తెలియదుగా " అంటూ ఒకమారు వెకిలిగా నవ్వి, తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. 

    అంతలో అక్కడ దశరథుడు పెండ్లికొడుకై తరలి రావడం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయారాక్షసులు నట్టేట ఓడను ముంచి వెయ్యటం జరిగింది. 

    కాని, ఆయుర్దాయం ఉన్న వాళ్ళు నట్టేట మునిగినా చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి, కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటబడ్డాడు. 

    ఏదో పనిమీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి, కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి, తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బ్రతికి బయటపడి, పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్కచూసి, " జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక్క అర ఘడియలో ఆసన్నమౌతుంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయే తీరుతుంది " అన్నాడు. 

    ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికొక పెట్టె కొట్టుకు వచ్చింది. ఆ పెట్టెను తెరచి చూసేసరికి దశరథుని పెండ్లికుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలూ కనబడ్డారు. " చూశావా, నా జ్యోతిషం ఎలా నిజమైందో మరి, " అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునకూ, ఆ రాజకుమార్తెలకూ మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి, తను కైలాసం చేరుకున్నాడు. 

    సముద్రమధ్యలో జరిగిన ఆ వివాహాన్ని రెండు తిమింగలాలు చూసినై. మగ తిమింగలం ఆడ తిమింగలంతో " రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్ళి ఆపలేకపోయాడు, చూశావా? బ్రహ్మ రాతకు తిరుగు లేదు " అంది. 

    " అయితే, ఈ మానుపెట్టె ఎక్కడిది? " అన్నది ఆడ తిమింగలం. 

    " అది వికర్ణుని పొట్టలోంచి వచ్చింది. రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు. ఇందుకే దారుణమైన శూలపోటు బయలుదేరి, పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు. తరువాత వాడికి కునుకు పట్టింది. వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టె ఇలా కొట్టుకొచ్చింది " అన్నది మగ తిమింగలం. 

    " అయ్యో పాపం, రావణునకీసంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా! " అంది మళ్ళీ ఆడ తిమింగలం. 

    వికర్ణుడు చస్తే సముద్రానికే పీడ వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జాలి పడనక్కరలేదు. కానీ, రావణునకీసంగతి తెలవనే తెలవదు. దశరథుడు చనిపోయాడనీ, రాకుమార్తెలు యింకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకొని, కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబుసే పూర్తిగా మరచి పోతాడు. 

    ఈ రాకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి, లోకకంటకుడైన రావణున్ని వధించబోతాడు " అని చెప్పింది మగ తిమింగలం. 

    ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమినాడు భూలోకమందు అవతరించడం, రావణాసురుణ్ణి వధించడమూ కథలో వ్రాసిన ప్రకారం జరిగింది. 


    

11, ఆగస్టు 2025, సోమవారం

:: శివరాత్రి వ్రత మహిమ - గుహునికథ ::

    చాలానాళ్ళకు పూర్వం గుహుడనే కిరాతకుడొకడుండేవాడు. వేటతో జీవించే వాడు. వేట దొరకకపోతే దారి దోపిడీలకు తలపడేవాడు. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. ఆ రోజు శివరాత్రి అనిగాని, అది పర్వదినం అనిగాని ఆ గుహుడనేవాడికి తెలియదు. 

    కుటుంబ పోషణార్థం యధావిధిగా ఆ రోజున కూడా విల్లమ్ములు తీసుకుని వేటకు బయలుదేరాడు. సాయంత్రమయింది గాని, జంతువు దొరకలేదు. వేట లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెఱువు దగ్గర చేరాడు. 

    సంధ్యవేళ అయింది గనుక నీటికోసం జంతువులక్కడకు వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు. తనవద్ద నున్న నీటి పాత్రతో నీళ్ళు పట్టుకుని, చెరువు గట్టుననే ఉన్న మారేడు చెట్టు నెక్కి కూర్చున్నాడు. 

    మొదటి ఝాము ముగియకుండానే ఒక లేడి వచ్చింది. దానిని చంపదలచి విల్లునెక్కు పెట్టబోయాడు. ఆ సందట్లో - అతని వద్ద నీటికుండ తొణికింది. అది మారేడు చెట్టు కావడం వలన - కొమ్మలు కదిలి కాసిన్ని బిల్వపత్రాలు కుండలోంచి తొణికిన జలయుతంగా చెట్టు క్రిందనున్న శివలింగంమీద పడ్డాయి. 

    పగటి ఉపవాసం, శివరాత్రినాటి నిశి - ప్రథమయామంలో శివపూజ చేసిన ఫలం కలగలసి సంక్రమించాయి ఆ బోయవాడికి. కాని, ఈ లోపల ఆ లేడి వేటగాణ్ణి పసిగట్టింది. " ఓ కిరాతకా! నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు. కాని, నాకు పసి కూనలున్నాయి. వాటిని నా భర్తకూ, సవతికీ అప్పగించి వస్తాను. నన్ను నమ్ము " అని ప్రార్థించింది. అప్పటికే పాపాలు తొలగి పోసాగాయి బోయవాడివి. అందువల్ల కాబోలు - " సరే, చూద్దాం వెళ్ళి రా! " అన్నాడు. ఆ లేడి గృహోన్ముఖి అయ్యింది. దానికోసం ఎదురు చూస్తూ తొలిఝామంతా నిద్ర లేకుండా గడిపాడు బోయవాడు. 

    రెండవఝాము కూడా వచ్చేసింది. ఆ సమయాన మొదటి లేడి యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది. దానిని చూసి గుహుడు మళ్ళా విల్లూ బాణం తీశాడు. ఈ సారి కూడా కుండ తొణికి నీళ్ళూ కొమ్మా వణకి బిల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి. శివరాత్రి నాటి రేయి రెండవ ఝామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమపడిపోయింది. ఈ గలగలకా లేడికూడా బోయవాణ్ణి గుర్తించింది. అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తాననీ మాట తప్పననీ మరీమరీ చెప్పి వెళ్ళింది. ఈ లేడి కోసం ఎదురు తెన్నులు చూడటంతో గుహుడికి ఆ రెండవ ఝాము కూడా నిద్రలేకుండా పోయింది. 

    ఈ రెండు లేళ్ళూ కూడా మోసం చేసాయని అనుకున్నాడా బోయ. ఇంతలోనే మూడవ ఝాము సమీపించింది. ఆ సమయానికి - గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరిణాల భర్త - తన భార్యలను వెదుకుతూ - అక్కడికి వచ్చాడు. దీన్ని వదలకూడదని గుహుడు మళ్ళా బాణం పుల్ల తీసే సరికి యధాప్రకారం కొమ్మనుంచి బిల్వ పత్రాలూ, కుండనుంచి నీళ్ళు శివలింగంపై ఒలికాయి. 

    ఇంతలో మూడవ ఝాములో శివార్చన చేసిన పుణ్యంకూడా గుహుడికి సంక్రమించింది. ఇంతలో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది. తాను భార్యాన్వేషణలో వచ్చాననీ, ఇంటి దగ్గర పిల్లలు తల్లులకోసం అల్లాడిపోతున్నారనీ వాళ్ళని వాళ్ళకు వప్పగించి వస్తాననీ నమ్మబలికి వెళ్ళిపోయింది. ఈ ఎదురు చూపులో మూడవ ఝాము కూడా నిద్రలేకుండా గడిపాడు బోయవాడు. 

    ఒకళ్ళోదారీ, మరొకళ్ళు మరొకదారిగా గృహం చేరిన దంపతులు కలిశారు. జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. పిల్లలను ఓదార్చారు. భార్యలూ, భర్త కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయల్దేరారు. తల్లిదండ్రులు అల్లా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరుగదుగదా! అందువల్ల లేడిపిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి. 

    నాలుగో ఝాము అయ్యేసరికి బందుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి - పున: ధనుర్బాణాలు సంధించబోయాడు బోయవాడు. మళ్ళా శివార్చన జరిగిపోయింది. శివరాత్రి నాటి జాగరణ, నాలుగు ఝాములూ శివార్చనా ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు. తన గత జీవిత పాపాలు తలుచుకుని దు:ఖించాడు. సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలేశాడు. 

    తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళముందు తోచాడు శివుడు. అతణ్ణి అనుగ్రహించాడు. శివుడతనికి గుహుడనే పేరు పెట్టాడు. శృంగబేరిపురం రాజధానిగా నిషాదరాజ్యం పాలించుకోమన్నాడు. విష్ణ్వవతారుడైన రాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు. ఆడితప్పని లేడికుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు. అద్భుతాచలమనే ఆ గిరిమీద ఆ భక్తునిపేర వ్యాథేశ్వరుడనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇంత మాహాత్మ్యం ఉంది శివరాత్రికి కాబట్టి - మానవుడు  శివరాత్రి వ్రతం తప్పక ఆచరించి తీరాలి. 

 

:: కుమారస్వామి జననం ::        " విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూం...