17, ఆగస్టు 2025, ఆదివారం

:: రామనవమి ::  

    లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు. 

    కొడుకు, కోడలూ వచ్చేవేళకి పులస్త్యులవారు పురాణం చదువుకుంటున్నారు. అది చూచి రావణుడు " ఏమిటండి, ఈ గాథ? " అని ఆయనను అడిగాడు. 

    " ఇది రామాయణం. దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రమేమిటంటే, ఇందులో చెప్పబడిన కథ అంతా యిదివరలో జరిగినదికాక, ఇకముందు జరుగబోతున్నది " అన్నారు పులస్త్యులవారు. 

    " ఆ జరుగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా? " అని ఆయనను కోరినాడు రావణుడు. 

    " శ్రీమహావిష్ణువు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి, యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తారట " అన్నారు పులస్త్యులవారు. 

    యాధాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి, ఎంతో ఆదుర్దాగా " రావణుడంటున్నారు, ఆ రావణుడు మీరు కాదుగదా, కొంపతీసి? " అన్నది భర్తతో. 

    అందుకు పులస్త్యులవారు, " లోకంలో ఇద్దరు రావణులు లేరుసుమా! రావణుడంటే మనవాడేను " అన్నారు. 

    ఈమాట వినడంతోనే మండోదరీదేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దు:ఖించటం మెదలుపెట్టింది. 
    
    రావణుడు నవ్వుతూ, " దశరథుడంటే ఎవడో మనుష్యుడై ఉంటాడు. మనుష్యులను జంతికలకుమల్లే కరకర నమిలి మ్రింగే రాక్షసకులానికంతటికీ రాజును నేను. నన్నా! ఆ దశరథకుమారుడు చంపటం? ఈ పుక్కిటి పురాణం నమ్మకు " అన్నాడు. ఈ మాటకు పులస్త్యులవారు, " అలాగ తోసిపారెయ్యకు. ఇది పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు " అన్నారు. 

    " అటైతే, ఒక పని చేస్తాను " అన్నాడు రావణుడు. " ఏమిటి " అన్నది మండోదరి. 

    " ఆ దశరథుడనే వాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాణ్ణి పట్టుకు చంపివేస్తే, ఇంక వాడికి కొడుకు పుట్టడం, ఆ కొడుకు నన్ను చంపటం అనేది ఉండదు కదా! " అన్నాడు రావణుడు. అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. చారులను రప్పించి, " దశరథుడనే వాడెవడో, వానికి పెళ్ళి అయినట్టయితే ఆ భార్య ఎవరో, వెంటనే తెలుసుకురండి " అని చెప్పి పంపాడు. 

    కొంతకాలమయేసరికి ఆ చారులు తిరిగివచ్చి, " ప్రభూ! హేమ పట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోసల దేశపు రాజునూ, కేకయ దేశపు రాజునూ ఓడించాడు. కోసలదేశపు రాజునకు కౌసల్య అనీ, కేకయ దేశపు రాజునకు కైకేయీ అని కుమార్తెలు ఉన్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్టణానికి తెచ్చి భార్య కిచ్చి " ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతోబాటు పెంచు. ఈ ముగ్గురికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేద్దాం " అన్నాడు అని చెప్పారు. 

    అప్పుడు రావణుడు " నేను దశరథుని సంగతి కనుక్కు రండర్రా అని పంపిస్తే మీరు హేమ పట్టణం సొద చెప్పుకొస్తున్నారేమిటి? " అని విసుక్కున్నాడు. 

    అందుకు చారులు, " ప్రభూ! చిత్తగించండి. ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదటి పెళ్ళికుమారుణ్ణి వెతికి తెచ్చారు. అతడే దశరథుడు " అన్నారు. " అయితే, ఎప్పుడు పెండ్లి? అన్నాడు రావణుడు. 

     అందుకు వాళ్ళు,  "  జైమిని అనే మహర్షి వచ్చి  ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభూ! అదీగాక మరొక్క చిత్రం కూడా విన్నాము " అన్నారు. " ఏమిటది ? " అన్నాడు రావణుడు. 

    " సుమిత్రకు, కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ, మేము ముగ్గురం కలసి మెలసి పెరిగాము. మమ్మల్నికూడా ఆ దశరథుడికే యిచ్చి పెళ్ళిచేస్తే ముగ్గురం ఒకచోటనే ఉంటాం అన్నారట. అందువల్ల సుమిత్రను, కైకేయినీ కూడా ఆ దశరథునికే యిచ్చి పెళ్ళి చేస్తారట " అని చెప్పారు. 

    " ఈ పెళ్ళి కాకుండా చూడాలి " అంటూ రావణుడు కొలువు చాలించి లేచి, వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనుని పైకి దండెత్తి వెళ్ళాడు.

    ఆ రాజుని యుద్ధంలో ఓడించి పారద్రోలి, రావణుడు విజయగర్వంతో అంత:పురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురునీ తెచ్చి రథంమీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంక ఆ దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్యానగరం వేపు పోనిచ్చాడు. దారిలో గంగానది అడ్డువచ్చింది. ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది. " ఎవరిదీ ఓడ? " అని అడిగేసరికి ఆ ఓడవాళ్ళు " హరసేన మహారాజులంగారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్ళికి తరలివచ్చినపుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారండి " అన్నారు. 

    ఈమాట వినేసరికి రావణునకు ఒక ఆలోచన తోచింది. " ఈ మానవుణ్ణి చంపటం కోసం నేను పనికట్టుకుని ఆ అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయటానికి నా సేవకులే చాలు " అని అనుకొని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్ళతో " మీరు ఈ ఓడవాళ్ళ నందరినీ చంపి భక్షించండి. నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకుమల్లే నటిస్తూ, దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచివెయ్యండి " అని ఆజ్ఞాపించాడు. 

    రావణుడు రాజకుమార్తెలతో లంకా పట్టణం చేరుకోవడంతోనే మండోదరి వాళ్ళను చూసి " ఎవరీ పిల్లలు ? " అంది. రావణుడు సంగతంతా చెప్పి " దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగానది మధ్యలో పెద్ద పెళ్ళి అయిపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్ళి చేసుకుంటాను " అన్నాడు. 

    మండోదరి నెత్తి నోరూ బాదుకుంటూ " నీకూ నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలనా పెండ్లి చేసుకుంటానంటున్నావు? కొరివితో తలగోక్కోవడమా? " అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్ళి ప్రయత్నం మానివేశాడు. 

    తరువాత పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఆ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి, మూసివెయ్యమన్నాడు. అయితే, ఆ పెట్టెను దాచటం ఎలాగా అని సమస్య రాగా, రావణునికి వికర్ణుడనే మాయరాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడంటే, వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకన్నమాట. ఈ సోమకాసురుణ్ణి చంపటానికే శ్రీమహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చిందికూడా! 

    వికర్ణుడు రావటంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి " దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు. నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చి యిద్దువుగాని " అన్నాడు. 

    వికర్ణుడు " చిత్తం ప్రభూ! అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తుండగానే దానిని తన కడుపులో దాచేసి,  ఇంక దీని సంగతి ఎవరికీ తెలియదుగా " అంటూ ఒకమారు వెకిలిగా నవ్వి, తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. 

    అంతలో అక్కడ దశరథుడు పెండ్లికొడుకై తరలి రావడం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయారాక్షసులు నట్టేట ఓడను ముంచి వెయ్యటం జరిగింది. 

    కాని, ఆయుర్దాయం ఉన్న వాళ్ళు నట్టేట మునిగినా చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి, కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటబడ్డాడు. 

    ఏదో పనిమీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి, కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి, తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బ్రతికి బయటపడి, పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్కచూసి, " జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక్క అర ఘడియలో ఆసన్నమౌతుంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయే తీరుతుంది " అన్నాడు. 

    ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికొక పెట్టె కొట్టుకు వచ్చింది. ఆ పెట్టెను తెరచి చూసేసరికి దశరథుని పెండ్లికుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలూ కనబడ్డారు. " చూశావా, నా జ్యోతిషం ఎలా నిజమైందో మరి, " అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునకూ, ఆ రాజకుమార్తెలకూ మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి, తను కైలాసం చేరుకున్నాడు. 

    సముద్రమధ్యలో జరిగిన ఆ వివాహాన్ని రెండు తిమింగలాలు చూసినై. మగ తిమింగలం ఆడ తిమింగలంతో " రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్ళి ఆపలేకపోయాడు, చూశావా? బ్రహ్మ రాతకు తిరుగు లేదు " అంది. 

    " అయితే, ఈ మానుపెట్టె ఎక్కడిది? " అన్నది ఆడ తిమింగలం. 

    " అది వికర్ణుని పొట్టలోంచి వచ్చింది. రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు. ఇందుకే దారుణమైన శూలపోటు బయలుదేరి, పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు. తరువాత వాడికి కునుకు పట్టింది. వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టె ఇలా కొట్టుకొచ్చింది " అన్నది మగ తిమింగలం. 

    " అయ్యో పాపం, రావణునకీసంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా! " అంది మళ్ళీ ఆడ తిమింగలం. 

    వికర్ణుడు చస్తే సముద్రానికే పీడ వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జాలి పడనక్కరలేదు. కానీ, రావణునకీసంగతి తెలవనే తెలవదు. దశరథుడు చనిపోయాడనీ, రాకుమార్తెలు యింకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకొని, కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబుసే పూర్తిగా మరచి పోతాడు. 

    ఈ రాకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి, లోకకంటకుడైన రావణున్ని వధించబోతాడు " అని చెప్పింది మగ తిమింగలం. 

    ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమినాడు భూలోకమందు అవతరించడం, రావణాసురుణ్ణి వధించడమూ కథలో వ్రాసిన ప్రకారం జరిగింది. 


    

11, ఆగస్టు 2025, సోమవారం

:: శివరాత్రి వ్రత మహిమ - గుహునికథ ::

    చాలానాళ్ళకు పూర్వం గుహుడనే కిరాతకుడొకడుండేవాడు. వేటతో జీవించే వాడు. వేట దొరకకపోతే దారి దోపిడీలకు తలపడేవాడు. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. ఆ రోజు శివరాత్రి అనిగాని, అది పర్వదినం అనిగాని ఆ గుహుడనేవాడికి తెలియదు. 

    కుటుంబ పోషణార్థం యధావిధిగా ఆ రోజున కూడా విల్లమ్ములు తీసుకుని వేటకు బయలుదేరాడు. సాయంత్రమయింది గాని, జంతువు దొరకలేదు. వేట లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెఱువు దగ్గర చేరాడు. 

    సంధ్యవేళ అయింది గనుక నీటికోసం జంతువులక్కడకు వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు. తనవద్ద నున్న నీటి పాత్రతో నీళ్ళు పట్టుకుని, చెరువు గట్టుననే ఉన్న మారేడు చెట్టు నెక్కి కూర్చున్నాడు. 

    మొదటి ఝాము ముగియకుండానే ఒక లేడి వచ్చింది. దానిని చంపదలచి విల్లునెక్కు పెట్టబోయాడు. ఆ సందట్లో - అతని వద్ద నీటికుండ తొణికింది. అది మారేడు చెట్టు కావడం వలన - కొమ్మలు కదిలి కాసిన్ని బిల్వపత్రాలు కుండలోంచి తొణికిన జలయుతంగా చెట్టు క్రిందనున్న శివలింగంమీద పడ్డాయి. 

    పగటి ఉపవాసం, శివరాత్రినాటి నిశి - ప్రథమయామంలో శివపూజ చేసిన ఫలం కలగలసి సంక్రమించాయి ఆ బోయవాడికి. కాని, ఈ లోపల ఆ లేడి వేటగాణ్ణి పసిగట్టింది. " ఓ కిరాతకా! నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు. కాని, నాకు పసి కూనలున్నాయి. వాటిని నా భర్తకూ, సవతికీ అప్పగించి వస్తాను. నన్ను నమ్ము " అని ప్రార్థించింది. అప్పటికే పాపాలు తొలగి పోసాగాయి బోయవాడివి. అందువల్ల కాబోలు - " సరే, చూద్దాం వెళ్ళి రా! " అన్నాడు. ఆ లేడి గృహోన్ముఖి అయ్యింది. దానికోసం ఎదురు చూస్తూ తొలిఝామంతా నిద్ర లేకుండా గడిపాడు బోయవాడు. 

    రెండవఝాము కూడా వచ్చేసింది. ఆ సమయాన మొదటి లేడి యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది. దానిని చూసి గుహుడు మళ్ళా విల్లూ బాణం తీశాడు. ఈ సారి కూడా కుండ తొణికి నీళ్ళూ కొమ్మా వణకి బిల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి. శివరాత్రి నాటి రేయి రెండవ ఝామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమపడిపోయింది. ఈ గలగలకా లేడికూడా బోయవాణ్ణి గుర్తించింది. అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తాననీ మాట తప్పననీ మరీమరీ చెప్పి వెళ్ళింది. ఈ లేడి కోసం ఎదురు తెన్నులు చూడటంతో గుహుడికి ఆ రెండవ ఝాము కూడా నిద్రలేకుండా పోయింది. 

    ఈ రెండు లేళ్ళూ కూడా మోసం చేసాయని అనుకున్నాడా బోయ. ఇంతలోనే మూడవ ఝాము సమీపించింది. ఆ సమయానికి - గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరిణాల భర్త - తన భార్యలను వెదుకుతూ - అక్కడికి వచ్చాడు. దీన్ని వదలకూడదని గుహుడు మళ్ళా బాణం పుల్ల తీసే సరికి యధాప్రకారం కొమ్మనుంచి బిల్వ పత్రాలూ, కుండనుంచి నీళ్ళు శివలింగంపై ఒలికాయి. 

    ఇంతలో మూడవ ఝాములో శివార్చన చేసిన పుణ్యంకూడా గుహుడికి సంక్రమించింది. ఇంతలో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది. తాను భార్యాన్వేషణలో వచ్చాననీ, ఇంటి దగ్గర పిల్లలు తల్లులకోసం అల్లాడిపోతున్నారనీ వాళ్ళని వాళ్ళకు వప్పగించి వస్తాననీ నమ్మబలికి వెళ్ళిపోయింది. ఈ ఎదురు చూపులో మూడవ ఝాము కూడా నిద్రలేకుండా గడిపాడు బోయవాడు. 

    ఒకళ్ళోదారీ, మరొకళ్ళు మరొకదారిగా గృహం చేరిన దంపతులు కలిశారు. జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. పిల్లలను ఓదార్చారు. భార్యలూ, భర్త కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయల్దేరారు. తల్లిదండ్రులు అల్లా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరుగదుగదా! అందువల్ల లేడిపిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి. 

    నాలుగో ఝాము అయ్యేసరికి బందుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి - పున: ధనుర్బాణాలు సంధించబోయాడు బోయవాడు. మళ్ళా శివార్చన జరిగిపోయింది. శివరాత్రి నాటి జాగరణ, నాలుగు ఝాములూ శివార్చనా ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు. తన గత జీవిత పాపాలు తలుచుకుని దు:ఖించాడు. సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలేశాడు. 

    తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళముందు తోచాడు శివుడు. అతణ్ణి అనుగ్రహించాడు. శివుడతనికి గుహుడనే పేరు పెట్టాడు. శృంగబేరిపురం రాజధానిగా నిషాదరాజ్యం పాలించుకోమన్నాడు. విష్ణ్వవతారుడైన రాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు. ఆడితప్పని లేడికుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు. అద్భుతాచలమనే ఆ గిరిమీద ఆ భక్తునిపేర వ్యాథేశ్వరుడనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇంత మాహాత్మ్యం ఉంది శివరాత్రికి కాబట్టి - మానవుడు  శివరాత్రి వ్రతం తప్పక ఆచరించి తీరాలి. 

 

21, జులై 2025, సోమవారం

:: వింతభక్తులు ::  

    పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా యిష్టం. ' భక్తులూ ' అంటే మనుష్యులే కాదు. జంతువులు, పక్షులు. పురుగులు - వీటిలో ఏవి కాస్త భక్తి కనబరచినా సరే ఆయన సంతోషించి, వాటిని అనుగ్రహిస్తాడు. 

    ఒకమాటు ఆయన తాను అంతకు మున్ను గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లనగ్రోవిని ఊదుకుందామని బుద్ధిపుట్టి, మురళి తెచ్చి హాయిగా వాయించటం మొదలెట్టేడు. ఆ గానం వినేటప్పటికి చుట్టుప్రక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపుకు వచ్చాయి. ఎవరూ పితక్కుండానే అవి ధారలు కట్టి కురిసాయి. అంతలో ఒక పెద్ద గాలివేసి, ఆ పాల నురగలో రవంత తుంపరపోయి పాండురంగస్వామి శిరస్సుపైన పడింది. 

    ఆ ఆవు భక్తి పారవశ్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాలచుక్క తన శిరస్సుపై పడ్డంతోనే అదే ఒక గొప్ప సేవగా తలచి, ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదాన్నిగా చేర్చుకున్నాడు. 

    పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావిచెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగస్వామి కోసం అత్తెసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికిమల్లే వేగంగా వచ్చి స్వామి ముందు వ్రాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్ము అంతా ఎగిరిపోయి తుడిచినట్లై, పాండురంగనికి సంతోషం కలిగింది. 

    " నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకుని చిమ్మినట్లు పోగెట్టేవు కనుక నిన్ను నా భక్తులలో ఒకణ్ణిగా చేసుకుంటా " నని కాకిని గూడా తన భక్తులలో చేర్చుకున్నాడు. 

    ఇంతలో అక్కడకు ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడినుంచి వచ్చిందో కాని, వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తితీరా ఈత లాడింది. తర్వాత స్వామి వద్దకు వచ్చి, రెక్కలు తపతపా కొట్టుకుంది. ఆ నీళ్ళన్నీ అక్కడ నేలమీద పడి నేల శుభ్రంగా పాచి చేసినట్లై పోయింది. " కాకి తుడిచేసింది. నీవు నీళ్ళు జల్లేవు గనుక నిన్ను కూడా కాకితోబాటే నా భక్తుల్లో చేర్చుకుంటా " నన్నాడు పాండురంగస్వామి.

    " కాకి తుడిచింది. హంస నీళ్ళు చల్లింది. ఇంక ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును " అని పాండురంగస్వామి అనుకుంటుంటే ఒక చిలుక ఎగిరివచ్చి స్వామి ప్రక్కన వ్రేలాడే ఒక దండెం మీద వ్రాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూండేది. ఆనాడేం బుద్ధి పుట్టిందో కాని ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకొచ్చింది. ఆ హారాన్ని దండేం మీద కాళ్ళక్రింద నొక్కిపట్టి తన కరుకు ముక్కుతో పుటుకూ పుటుకూ నాలుగు పోట్లు పొడిచేటప్పటికి హారం తెగపోయి ముత్యాలు స్వామి సన్నిధిని చిందర వందరగా పడ్డాయి. 

    " సెబాష్ చిలుకా! ఉత్తుత్తి మ్రుగ్గుకాక నాయింట ముత్యాలతో మ్రుగ్గులు పెట్టేవు. కనుక కాకి, హంసలకు మల్లేనే నిన్నుకూడా అనుగ్రహిస్తున్నాను " అన్నాడు విఠలుడు. 

    ఆ తరువాత అక్కడికి ఒక ఎలుకపిల్ల పరుగెత్తుకు వచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకొచ్చింది. స్వామిని చూచేటప్పటికి ఆ పాము ఎలుక మాట మరచిపోయింది. పాండురంగడంటే ఆ పాముకు అమిత భక్తి.

    " స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్ళు జల్లి ముగ్గులుపెట్టేరు. కానీ, దీపం పెట్టేరుకారు " అనుకుంది. 

    పాము నెత్తిమీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారుకదూ? ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికి, దీపంకన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యంమూలాన్ని అక్కడ చీకట్లన్నీపోయి వెలుగొచ్చింది. 

    " సెబాష్ సర్పరాజా! నువ్వుకూడా నా భక్తులలో చేరేవు " అన్నాడు స్వామి. 

    మరికాసేపటికి ఆ దారినే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరి పోతున్నాయి. వాటిల్లో ఒక్క ఈగ మటుకు ఆగి స్వామి పాద సన్నిధిని ఉన్న ఒక పువ్వుమీద వ్రాలి అందులో స్వామియొక్క పాద తీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని త్రాగింది. మహాభక్తులూ, మునులూ పాద తీర్థంతో కలిసి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ త్రాగింది కనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈవిధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ పాండురంగని భక్తులైనై. భక్తులై ఏమి లాభం పొందాయో వినండి. 

    ఆ ఆవు చాలాకాలం బ్రతికి, ముసలి పండై, అఖరికి ప్రాణాలు విడిచేసింది. తర్వాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయవల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయిపుట్టింది. ఆ విష్ణు భక్తుడా అమ్మాయికి 'సుశీల' అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది. 

    సుశీల పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేశారు. ఆ అమ్మాయి ఎంతమంచిదో, దాని మగడు అంత చెడ్డవాడు. ఉత్త నీచుడు. డబ్బుకోసం ఎలాంటి కక్కుర్తి అయినా సరే పడేవాడు. తినటానికి సరిపోయేది ఉన్నా, ఎరగని వాళ్ళ దగ్గరకెళ్ళి " అయ్యా! బీద బ్రాహ్మణ్ణి. పిల్లకి పెళ్ళి చేసుకోవడానికి డబ్బులేదు " అని యాచించే వాడు. పోనీ, ఆ యాచించి తెచ్చిందైనా కడుపునిండా తినేవాడా? ఉహూ! , పాతరేసి, దాచుక్కూచునేవాడు. అంత లోభి. పైగా ఏదో వంక పెట్టుకుని సుశీలను కొడుతూండేవాడు. కాని, సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు. మహా పతివ్రత గనుక ఓర్చుకునేది. 

    వాని సంగతి తెలిసిన చుట్టం ఎవరూ వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్ళు కాదు. ఒకవేళ తెలియని వాడెవడైనా వస్తే సుశీల మొగుడు " అయ్యా! మాకు మైల వచ్చింది " అని చెప్పి పంపేవాడు. కాని సుశీలకు మాత్రం అది కష్టంగా ఉండేది. ఏమంటే, ఆవిడకు అతిథులంటే చాలా గౌరవమూ, భక్తీని. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం ఆ విష్ణుమూర్తితో సమానమని ఆమె నమ్మకం. కాని, తన భర్త ఒప్పుకోనప్పుడేం చేస్తుంది? 

    తన దయవల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చినా, భర్త దుర్మార్గుడవటంవల్ల సుఖపడలేక పోతున్నదన్న సంగతి పాండురంగస్వామికి తెలిసి సుశీలను కటాక్షించటం కోసం, ఒకనాడు ఒక వడుగు రూపంలో వచ్చాడు. 

    అప్పుడామె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరిక్షించడానికి యిదే సమయం అని ఆలోచించి, ఆ బ్రహ్మచారి, ఇంటి లోపలున్న సుశీలను పిలిచి " అమ్మా! ఆకలి వేస్తోంది. పట్టెడన్నం ఉంటే పెట్టు " అని అడిగేడు. 

    ఆమె, " ఉండు నాయనా! ఒక్క నిముషంలో వండి వడ్డిస్తాను " అంది. 

    " అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడాగగలను? చద్దికుండలో చద్ది అన్నమైనా సరే, ఉంటే పెట్టు .  పెట్టి పెట్టి చద్ది అన్నం పెట్టడమేమిటి? పెడితే, నాకు పాపం. తింటే నీకు పాపం " అంటావేమో! నువ్వేమీ సందేహించకు. నా ఆకలి తీరిస్తివా, మూడు లోకాలనూ తృప్తి పరచినట్లే. ఇంక నాకు వచ్చే పాపం మాటన్నావ్? జపంచేసి పోగొట్టుకుంటాను " అని ఆమెను తొందరపెట్టేడు. సుశీల ఏం చేస్తుందింక? పీటవేసి, అరిటాకు పరచి, చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూచేటప్పటికి, ఆ కపట బ్రాహ్మణ వడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకుని ఆకులో ఒక్క మెతుకైనా మిగల్చకుండా అన్నమంతా తినేశాడు. " అమ్మా! ఇంకా ఆకలి తీరలేదు. ఆ కుండలో, అడుగునా పక్కల్నీ అంటిబెట్టుకుని ఏమైనా మెతుకులు ఉన్నాయేమో చూడు " అన్నాడు. 

    ఆమె వెతికి చూచింది కాని, కుండలో ఒక్క మెతుకుగూడా మిగలలేదు. మూడు రోజుల్నుంచి ఏ పూట కాపూట వండుకోవడం, భర్త ఊళ్ళో లేడు గనుక, పతివ్రతయైన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవడం, అదంతా ఆ తరవాణి కుండలో వెయ్యటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటుగా ఆ పొట్టివాడు తినేశాడూ అంటే, ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రమేమంటే అదంతా తిన్నాకూడా అతని ఆకలి తీరలేదు. 

    నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తెసరు అన్నం తెచ్చి వడ్డించింది. తినేశాడు. పొయ్యిమీద కాగుతున్న చిక్కటి పాలు తెచ్చి త్రాగమంది. తాగేశాడు. కాని, ఆకలి తీరలేదు. " ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు " అన్నాడు. 

    అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చక్కిలాలూ, చేగోడీలూ మొదలైన పిండివంటలు కొన్ని మొగుడు ఊరికెళ్ళక పూర్వమే చేసి యిచ్చింది. ఆ లోభి మగడు, ఆ వంటలు ఒక్కమాటుగా తినేస్తే అయిపోతాయేమోనన్న భయంకొద్దీ కొంచెమే తిని, సుశీలకేనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండలలో దాచి అటకమీద పెట్టుకుని వెళ్ళేడు. అవి తెచ్చిపెడితే యీ పిల్లవాని ఆకలి తీరుతుందేమో! 

    భర్తవచ్చి, ఆ మినపసున్నీ అవీ లేకపోవడం చూస్తే మండిపడి తనని చావకొడతాడని తెలిసుండికూడా సుశీల ఆ అతిథిని అర్థాకలితో పంపటం ఇష్టంలేక పిండివంటల్ని క్రిందికి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించటం తడవుగా విస్తరి ఖాళీచేసేసాడు ఆ దొంగ అతిథి. పోనీ అప్పుడైనా విస్తరిముందు నుంచి లేవచ్చా? ఉహు, " ఇంకా ఏమైనా ఉంటే తే " అన్నాడు. 

    అప్పుడు సుశీలకంతా అర్థమైంది. " ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనబడుతున్నాడే గాని, నిజంగా ఇతడు పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించటానికి వచ్చిన ఆ పాండురంగస్వామియే అయి ఉండాలి కాని, ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను? " అనుకుంది. 

    సుశీల ఇలా ఆలోచించుకుంటూంటే ఆమెకో ఉపాయం తట్టింది. " స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రిలాంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని. ఆమె తక్షణమే  అగ్ని దేవుణ్ణి ప్రార్థించింది. అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నిరకాల భోజన పదార్ధాలతోటి, పిండివంటలతోటి నింపేశాడు. 

    అప్పుడు పాండురంగస్వామి తన వామనరూపం వదిలేసి నిజరూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. " సుశీలా! నువ్వు మహా పతివ్రతవు. అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి, అతిథి భక్తికి మెచ్చుకున్నాను. వరం కోరుకో! " అన్నాడు. 

   "  స్వామీ!నాకు మోక్షం యియ్యి " అని కోరుకుంది సుశీల. 

    అది విని పాండురంగస్వామి " మోక్షమా! మోక్షమెలాగా యిస్తాను. ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి, కొడుకులూ, మనుమలూ, మునిమనుమలూ ఎత్తేక మోక్షం సంపాదించుదువు గాని " అన్నాడు. 

    " స్వామీ! నాకింతవరకూ ఒక్క కుమారుడైనా కలుగలేదు. మనుమలూ, మునిమనమలూ అంటావేమిటి? " అంది సుశీల. 

    " ఒక్కడే కాదు. నీకు అయిదుగురు కుమారులు పుడతారు. ఆ అయిదుగురూ కూడా పూర్వజన్మలో నా భక్తులే. అన్నట్లు చెప్పటం మరచిపోయాను. నీ పూర్వ జన్మలో నువ్వో ఆవువి. నాకు భక్తురాలివి కావటంవల్ల నీకీ జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకీ, హంసా, చిలుకా, పామూ, తేనెటీగ నాకు భక్తులయాయి. ఆ అయిదుగురూ నీకు కొడుకులై పుడతారు " అని చెప్పి అంతర్ధానమయిపోయాడు. 

    పాండురంగడు పోతూ పోతూ సుశీలకు మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఉత్తి పిసినారి, నీచుడు, దుర్మార్గుడు అనికదూ చెప్పేను. పాండురంగవిఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండటంకోసమని, ఆమె మగని స్వభావమే మార్చివేశాడు. 

    ఊరినుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పటికే, ఆ లోభి అల్లా గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీలదే ఇప్పుడు. కొట్టడం, తిట్టడం మచ్చుకైనా లేదు. అప్పట్నుంచీ వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. 

    క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిదుగురు కొడుకులూ పుట్టేరు. ఆ కొడుకులకు కొడుకులు ఆ కొడుకులకు గూడా కొడుకులు పుట్టేదాకా ముత్తయిదువై బ్రతికుండి ఆఖరుకు సుశీల భర్తతో పాండురంగస్వామి వద్ద మోక్షాన్ని పొందింది. 

    

    

    

18, జులై 2025, శుక్రవారం

:: సంధ్యాదేవి ::  

    పూర్వం త్వష్టప్రజాపతి అని ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకు విమానాలు, ఆయుధాలు చేసి యిచ్చేవాడు. 

    విశ్వకర్మకు సంధ్యాదేవి అనే చక్కటి కూతురు. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్య పెళ్ళి యీడుకు రాగా, సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీచేయక ఊరుకున్నారు. సూర్యుడు లోకాలన్నీ నిత్యం తిరిగొచ్చేవాడు కనుక ఎక్కడెక్కడి పెళ్ళి కూతుళ్ళ సంగతి అతనికి తెలుసును. వాళ్ళందరిలోకి సంధ్యాదేవి అందమైనదని తోచి ఆమెనే పెళ్ళిచేసుకుందామని నిశ్చయించాడు. సూర్యభగవానుడి గొప్పదనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి పెండ్లి చేశాడు. 

    గొప్పవాణ్ణి పెళ్ళిచేసుకున్నందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిందే కాని అత్తవారింటికెళ్ళడంతోనే ఆ సంబరమంతా చప్పబడిపోయింది. సూర్యుడు లోకబాంధవుడే కావచ్చు కాని ఆ భగభగ మండే భర్తతో ఎలా కాపురం చెయ్యటం? అందులోనూ సంధ్యాదేవి లాంటి సుకుమారి అసలే చెయ్యలేదు. " స్వామీ! మీరు చాలా వేడిగా ఉన్నారు. మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది " అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకునేది గాని ఆయన ఏమనుకుంటాడో అని భయపడి చెప్పకుండా ఊరుకొనేది. 

    కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే యిద్దరు కుమారులు, యమున అనే ఒక కూతురూ పుట్టారు. క్రమంగా సూర్యుని వేడి, తగ్గడానికి బదులు ఎక్కువైపోయి, సంధ్యాదేవికి సహించటానికి వీల్లేనంత బాధ కలిగించింది. ఆమె తన బాధ ఎవళ్ళకీ చెప్పుకోలేక ఒంటరిగా కూచుని దు:ఖించింది. అప్పుడు ఆమె నీడ ఆమె ప్రక్కనే కనబడింది. ఆ నీడ సరిగ్గా తనలాగా కనబడేసరికి సంధ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది తనలాగే సుందరి అయి, సరిగ్గా తనలాగే ఉంటుంది. తన స్థానంలో ఆమెను సూర్యునకు భార్యగా ఉంచేసి, తాను పుట్టింటికి వెళ్ళి, ఇంతవరకూ సూర్యుని వేడి వల్ల కమిలిపోయిన తన శరీరం తేరుకునే వరకు అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ పిమ్మట రావచ్చు అని. 

    వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణంపోసి అచ్చు తనవలెనే ఉన్న ఆ సుందరికి, ఛాయాదేవి అని పేరు పెట్టింది. ' ఛాయ ' అంటే నీడ. ఛాయాదేవి " అక్కా! నన్నెందుకు పుట్టించావు? అని అడిగింది. సంధ్య తన బాధంతా చెప్పి, " నువ్వు భర్తగారికి అనుమానం తగలకుండా నడుచుకోవాలి. ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే విడిచి వెడుతున్నాను. వాళ్ళకి కూడా ఏ సంశయమూ కలగకుండా ' ఇది అమ్మే ' అనే నమ్మకం పుట్టేటట్లు నువ్వు వాళ్ళని పెంచాలి. మన యీ రహస్యం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు " అని చేతిలో చెయ్యి వేయించుకుని, మర్నాడే సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది. 

    సంధ్యాదేవి తనంత తానే వచ్చిందనేటప్పటికి " ఏం చెప్మా " అనిపించింది విశ్వకర్మకి.  ఆమె మనసు విడిచి చెప్పటానికి బిడియపడింది. బహుశ: మొగుడితో ఏదో పేచీ వచ్చి, ఇలా వచ్చేసి ఉంటుందనీ, కొన్నాళ్ళుపోతే  అల్లుడే వచ్చి ఆమెను సమాధాన పరచి తీసుకువెడతాడనీ, అంతగా రాకపోతే, తామే తీసుకుపోయి అప్పుడే దిగబెట్టవచ్చుననీ తల్లిదండ్రులు అనుకున్నారు. 

    కానీ వాళ్ళు అనుకున్నట్లు సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకొస్తాడు? అతడికి సంధ్యాదేవి బాధకాని, ఆమె పుట్టింటికి వెళ్ళిందనిగానీ తెలిస్తేగా? ఛాయాదేవి కాస్త గూడా సూర్యునికి అనుమానం కలగకుండా అచ్చం సంధ్యాదేవిలాగే వర్తిస్తున్నదాయె! పోనీ అంటే, పిల్లలకు కూడా అనుమానం తగలలేదు. ఛాయాదేవి వాళ్ళని స్వంత తల్లిలాగానే ప్రేమతో పెంచుతోంది. ఇంక వాళ్ళకెలా అనుమానం తగుల్తుంది? 

    అక్కడ విశ్వకర్మ, అల్లుడు రాకపోవటం చూచి, ఇంక ఉపేక్ష చేయటం మంచిది కాదని తోచి సంధ్యతో, " అమ్మాయ్! చెట్టుకు కాయ బరువు కాదుకదా! నువ్వు ఎన్నాళ్ళున్నా మా కానందమే. కాని భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింట ఉండటం క్షేమంకాదు " అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి, " నిజమే నాయనా నీవు చెప్పిన మాట. నేనొక్కర్తెనూ వెళ్ళగలను. నీకెందుకు శ్రమ? " అని చెప్పేసి వెంటనే బయల్దేరింది. కాని సూర్యభగవానుని తీవ్రత తలచుకునేటప్పటికి ఆమె గుండె ఝల్లుమంది. సూర్యలోకానికని బయలుదేరిన ఆమె దారిలో ఒక అడవిలో ఆగిపోయింది. తనలాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం క్షేమం కాదని తోచి, ఆమె తన మనుష్యరూపాన్ని వదిలేసి, ఒక ఆడ గుర్రం అయిపోయి, అక్కడే ఉండిపోయింది. విశ్వకర్మకు ఈ సంగతేమీ తెలియక తన కుమార్తె అత్తింట జేరుకుని సుఖంగా ఉందనే అనుకున్నాడు. 

    సూర్యుడికి ఇదేమీ తెలియక ఛాయాదేవినే సంధ్యాదేవి అనుకుని ఆమెను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. సంధ్యాదేవి పిల్లలైన వైవస్వతుడు, యముడు, యమునా కూడా ఆమే తమ అమ్మ అనుకుని, అమ్మమీద ఉండే చనవూ, గౌరవం చూపుతున్నారు. 

    కొంతకాలానికి ఛాయాదేవికి కూడా పిల్లలు పుట్టేరు. సౌవర్ణుడు, శని అనే యిద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే, తనకు పిల్లలు పుట్టటం తోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకూ తాను కన్నబిడ్డలకుమల్లే చూచి పెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమె కిప్పుడు ప్రేమపోయి, వాళ్ళని సవతి పిల్లల్ని చూచినట్లు చూడటం మొదలెట్టింది. తమను కన్నతల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తూందని తేలిపోవడంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తన్నడానికి సిద్ధపడ్డాడు. ఛాయ తక్షణం వెళ్ళి సూర్యునితో ఫిర్యాదుచేసి ఉన్నవీ లేనివీ కలిపి చెప్పింది. 

    అయితే, సూర్యుడు తొందరపడే రకం కాదు. " యముడు పిన్నవాడైనా ధర్మపరాయణుడు. అతడిలా ఎందుకు ప్రవర్తించాడు చెప్మా " అనిపించిందతనికి. కుమారుణ్ణి పిలిచి విచారించాడు. 

    " తపతి పుట్టినప్పట్నుంచీ అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూచినట్లు చూస్తోంది, మీకు తెలుసో లేదో? " అన్నాడు యముడు. సూర్యుడా మాటలు విని ఆశ్చర్యపోయి, యముడన్నమాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి, ఆమె చిన్న పిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తోందనీ తెలుసుకున్నాడు. ఏమిటిది? తన కడుపున పుట్టిన ఆరుగుర్నీ సమంగా చూడటానికి బదులు సంధ్యాదేవి మొదటి వాళ్ళను సవతి పిల్లలకుమల్లే ఉపేక్షచేస్తూ కడసారి వాళ్ళని నెత్తి నెక్కించుకుంటోందేమిటి? సూర్యుడు ఉండబట్టలేక భార్యను పిలిచి నిలేసి అడిగాడు. ఛాయాదేవి తప్పించుకుపోదామని చూసింది. కాని సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుడికి మల్లే భగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజ వణుకుతో తాను సంధ్యాదేవిని కాదనీ, సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయిందనీ యధార్థం చెప్పేసింది. 

    అదివిని సూర్యుడు చాలా విచారించాడు. " కూతురును నేను సుఖపెట్టలేక పోయానని మామగారేమనుకున్నాడోకదా! " అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికెళ్ళి " సంధ్యాదేవి ఏదండీ? " అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికి విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. " మీ వద్దకే వెడుతున్నానని బయల్దేరిందే! " అన్నాడు. సూర్యుడు జరిగినదంతా మామగారికి పూసగ్రుచ్చినట్లుగా చెప్పగా, విశ్వకర్మ అల్లుణ్ణి ఓదార్చి తన యంత్రసామాగ్రి దెచ్చి, సూర్యుణ్ణి చేత్తో పట్టుకుని, భగభగ మండే పెచ్చులన్నీ ఊడి క్రిందపడేటట్లు సాన పట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనమూ, కాంతి మిగిలి సూర్యుడు చూడటానికెంతో అందంగా కనబడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెతుకుతూ వెళ్ళిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునెందుకని ఆడ గుర్రమై అడవిలో ఉందని తెలిసి, తానుకూడా ఒక గుర్రం రూపంతో అక్కడకు వెళ్ళేడు. 

    సంధ్యాదేవికి సూర్యుడు తెలియజెప్పుకునేసరికి " ప్రభూ! మీరు మళ్ళీ మీ సూర్యరూపం ధరించకండి. మీ వేడి భరించలేను " అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్ళలా కొంతకాలం గుర్రాల రూపంలోనే ఉండగా, వారికి అశ్వనీకుమారులు పుట్టేరు. ఈ అశ్వినీ కుమారులే దేవతలకు వైద్యులయారు. కాని సూర్యుడు, సంధ్యాదేవి అడవిలో గుర్రాల రూపంలో ఆట్టే కాలం ఉండటానికి వీల్లేకపోయింది. ఏమంటే, సూర్యుడు లేకపోతే లోకాలకు వెలుగో, మరి? అంచేత అదివరకుమల్లే గాక తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చచెప్పి తన లోకానికి తీసుకుపోయాడు. 

    

14, జులై 2025, సోమవారం

:: నత్కీరుడు :: 

    ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద కోనేరు, కోనేటి ఒడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు క్రిందకు ఒక కుష్ఠువాడు నడచివచ్చి, ఆయాసం తీర్చుకోవటానికి ఆ నీడను కూర్చున్నాడు. కూర్చుని యధాలాభంగా చెఱువుకేసి చూశాడు. అతడలా చూస్తుండగానే, ఆ చెట్టునుంచి ఆకొకటి రాలి చెఱువులో పడింది. పడీపడ్డంతోటే అది ఒక చేపగా మారిపోయి బుడుంగుమని నీటిలో మునిగి పోయింది. 

    `ఆకు చేప అయిపోవటం చూచి అతను ఆశ్చర్యపడుతూ ఉంటే మరో ఆకు రాలింది. ఆ ఆకు నీటిలో కాకుండా గట్టుమీద పడింది. అది ఒక పిట్టగా మారిపోయి, తుర్రుమని పైకెగిరి పోయింది.

    ఇంతలో ఇంకో ఆకు రాలింది. ఈమాటు రాలిన ఆకు పూర్తిగా చెఱువులోనూ పడలేదు, పూర్తిగా ఒడ్డునా పడలేదు. సగం నీటిలోనూ, సగం ఒడ్డునా పడింది. నీటిలో పడ్డ సగం చేప అయింది. ఒడ్డున పడ్డ సగం పక్షి అయింది. 

    చేపగా మారిన భాగం నీటిలోకి పారిపోదామని అటు లాగింది. పక్షిగా మారిన భాగం పైకి ఎగిరిపోదామని అటువైపు లాగింది. కుష్ఠువాడు లేచివెళ్ళి ఆ చోద్యం చూట్టం మొదలెట్టేవరకు అది ఒక పెద్ద భూతంగా మారిపోయింది. నెత్తిమీద మేకులకుమల్లే నిటారుగా నిలబడి ఉన్న బిరుసు వెంట్రుకలు, చింత నిప్పులకుమల్లే ఎర్రగా కణకణ లాడుతూ ఉండే కళ్ళూ, వాడి కోరలూ, గూని నడ్డీ, బాన కడుపూ గల ఆ భూతం, భయంతో వణికిపోతూ నోట మాట లేకుండా నిలబడ్డ ఆ కుష్ఠువాణ్ణి అమాంతం ఎత్తి భుజంమీద వేసుకుని గబగబా పారిపోయింది. 

    భూతం అలా వెళ్ళి వెళ్ళి ఒక గుహ దగ్గర ఆగింది. ఆ గుహ ద్వారం ఒక పెద్ద రాయితో మూసేసి ఉంది. భూతం ఆ రాయిని సునాయాసంగా పక్కకు ఒత్తిగించి లోపల ప్రవేశించింది. భుజం మీద మోసుకొచ్చిన కుష్ఠువాణ్ణి నేలమీద పడేసి, అక్కడ తానంతకుముందు ఇలాగే తెచ్చి పడేసి ఉంచిన మనుష్యులనందరినీ ఒక్కమాటు లెక్కపెట్టుకుంది. కుష్ఠువానితో కలిపి వాళ్ళు నూరుమందయ్యారు. అప్పుడా భూతానికి కలిగిన సంతోషం ఏమని చెప్పం? ఎప్పుడు దొరికిన మనిషినప్పుడు తినెయ్యదా భూతం. అలా తినేస్తే దానికి కడుపు నిండినట్టే ఉండదు. నూరుమందయే దాకా ఊరుకొని, ఆవేళ వాళ్ళనందర్నీ దొంతరపెట్టి తినేసి, ఆ చెరువులో ఉన్న నీళ్ళు తాగి, కొన్నాళ్ళపాటు ఆ గుహలో నిద్రపోతుంది. 

    ఈవేళ కుష్ఠువానితో నూరుగురయారు కనుక కడుపునిండా భోజనం దొరికిందన్న సంతోషంతో ఒక్కమాటు ఎగిరి గంతేసింది. చెరువుకెళ్ళి స్నానం చేసి వచ్చి మింగేద్దామని తలచి బయల్దేరింది. 

    గుహలో అంతకుముందు పడిఉన్న తంభైతొమ్మండుగురూ ఆ కుష్ఠువాణ్ణి చూచి, " నాయనా! నీతో నూరుగురం అయాం. నేటితో మనకు నూరేళ్ళూ నిండేయి " అని గొల్లుమంటూ ఏడవడం మొదలుపెట్టేరు. 

    " ఈ భూతాన్ని చంపేసే ఉపాయమేమీ లేదా? " అన్నడు కుష్ఠువాడు. 

    " ఈ భూతాన్ని చంపాలంటే కేవలం ఆ పరమశివుడో లేకపోతే అలాంటి మరో దేవుడో రావలసిందే గాని మనుష్యమాత్రులం మనం ఏమి చెయ్యగలం? " అన్నారు వాళ్ళు. 

    కుష్ఠువాడు " శివుడికి వినిపించేటట్లు నేను స్తోత్రం చేయగలనుగాని, వినిపించికూడా ఆయన రాడేమో? నేనంటే ఆయనకు కోపం " అన్నాడు. 

    " నీమీద శివునికి కోపం ఎందుకొచ్చింది? " అని వాళ్ళల్లో ఒకడు అడిగాడు. 

    " ఆ కథను చెబుతూ కూచుంటే భూతం వచ్చి మనని మింగేస్తుంది. ముందు ఆ భూతాన్ని చంపే మార్గం చూడాలి. భూతం చచ్చిపోయాక ఎన్ని కథలైనా చెప్పుకోవచ్చు " అంటూ కుష్ఠువాడు శివుని కుమారుడైన కుమారస్వామిని భక్తితో స్తోత్రం చేసే వరకు ఆ దేవుడు ప్రత్యక్షమై " ఎందుకు నన్ను రప్పించావు? " అని అడిగాడు. 

    అప్పటికప్పుడే భూతం స్నానం చేసేసి గుహకి తిరిగి వచ్చింది. 

    కుష్ఠువాడు కుమారస్వామికి మ్రొక్కి " స్వామీ! మొదట ఈ భూతాన్ని చంపేసి మమ్మల్ని కాపాడు " అని కోరేసరికల్లా, కుమారస్వామి తన ఆయుధంతో ఆ భూతాన్ని ఒక్క దెబ్బకు నరికి పారేశాడు. 

    కుమారస్వామి కుష్ఠువానివైపు చూసి " ఏమయ్యా! నువ్వు గొప్ప కవిలాగా ఉన్నావే ? కవులు తప్ప ఇంత చక్కటి శ్లోకాలు మరెవరు చెప్పగలరు? మరి, నీకీ కుష్ఠురోగం ఎలా వచ్చింది? " అని అడిగేటప్పటికి కుష్ఠువాడు, " స్వామీ! మీ తండ్రి పరమేశ్వరుడి శాపం వల్లనే నాకీ రోగం వచ్చిందని చెప్పాడు. 

    " భూతం చచ్చిపోయింది కనుక ఆ కథంతా ఇప్పుడు సావకాశంగా చెప్పు " అని గుహలోని వాళ్ళంతా ఆ కవీశ్వరుణ్ణి కోరారు. 

    కుమారస్వామి కూడా వింటుంటే అతడు తన కథను ప్రారంభించాడు. 

    మాది పాండ్యరాజ్యం. నాపేరు నత్కీరుడు. మధురలో పాండ్యరాజు ఆస్థానంలో రత్నాలపీఠం ఒకటి ఉంది. సరస్వతీదేవితో సమానమైన కవీశ్వరులు కూచోటం కోసమని ఆ పీఠాన్ని అగస్త్యమహాముని పాండ్యరాజుకి ఇచ్చాడు. ఆ పీఠం ఒక్క కవి కూచోటానికి సరిపోయింది. కాని, చిత్రమేమిటంటే, గొప్పకవు లెందరొచ్చినా అది విస్తరించి కూచోటానికి చోటిస్తుంది. 

    నేను పాండ్యరాజు సభలోకి వెళ్ళేటప్పటికి ఆ పీఠం అప్పటికప్పుడే పదకొండుగురు మహాకవీశ్వరులకు చోటిచ్చింది. నేను నా కవిత్వంతో అందర్నీ మెప్పించాను. చటుక్కున ఆ పీఠం పెరిగి నాకూ చోటిచ్చింది. నా తర్వాత కూడా చాలామంది కవులు పాండ్యరాజు సభకు వచ్చి కవిత్వం చెబుతూండేవారు. వాళ్ళెవ్వరికీ ఆ పీఠం చోటివ్వలేదు. రాజు వాళ్ళనెవళ్ళనీ ఉత్తి చేతులతో పంపేవాడు కాడు. ఆ పీఠం మీద కూర్చొని 'గొప్ప కవులం' అనిపించుకున్న మేము పన్నెండుగురం అక్కడకు వచ్చిన ఒక్కొక్క కవినే పరీక్షచేసి శిఫార్సు చేశాక, ఆ శిఫార్సు ప్రకారం కానుకలిచ్చి పంపేవాడు. క్రమక్రమంగా సభకు కవులు రావటం తగ్గిపోయింది. దానికి కారణం ఆ పీఠంలో తమకు చోటు దొరకదనే మాటెలా ఉన్నా, వారు మా ముందువచ్చి నిలబడడానికే భయపడే వారు. దానితో మాకందరికీ గర్వం, అహంకారం ఎక్కువైపోయినై. ముఖ్యంగా నాకు మరిన్నీ. 

    ఒకనాడు కవినంటూ ఒకడు రాజసభకు వచ్చి ఒక పద్యం చదివేడు. ఆ పద్యంలో " ఒక స్త్రీయొక్క జుట్టుముడి సహజమైన సువాసనతో ఉన్నదంటూ " చెప్పేడు. నేను నవ్వుతో " ఇదేం కవిత్వమయ్యా? ఎక్కడైనా జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా? ఏ వాసన నూనో రాసుకుంది కాబోలు " అని ఎగతాళి చేశాను. దానితో వాడు కిక్కురు మనకుండా సభలోంచి అవతలికి పోయాడు. " మంచి బాగా చివాట్లు పెట్టి పంపించేశావయ్యా! " నత్కీరా, అని తక్కిన పదకొండుగురు నన్ను మెచ్చుకున్నారు. 

    ఇంతలో సభలోంచి పోయినవాణ్ణి వెంటబెట్టుకుని మరొకాయన కోపంతో ప్రవేశించి " ఇతడు నా భక్తుడు. తిండికిలేక బాధపడుతూంటే ఒక పద్యం రాసిచ్చి, దాన్ని తీసుకెళ్ళి రాజసభలో చదివి బహుమానం తెచ్చుకోమనగా, ఇతనిక్కడకొచ్చి ఆ పద్యం చదివితే ఎవడో దానిలో తప్పుపట్టాడట! ఎవడు వాడు? అని గద్దించి అడిగేడు. 'నేనే' అంటూ మీసం మీద చెయ్యివేసి నిలబడి " జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా ఏ స్త్రీకైనా? " అన్నాను. అందుకాయన నీకు తెలియదేమోగాని అలాంటి స్త్రీ ఒకామె ఉంది. నా భార్యయైన పార్వతీదేవి కేశములు సహజ పరిమళం కలవి. తెలియకపోతే తెలియనట్టుగా ఊరుకోవాలిగాని, ప్రతిదానికీ తప్పులు వెతకడం సత్కవుల లక్షణం కాదు " అంటూ ఆయన తన నిజ రూపంలో సాక్షాత్కరించాడు. " శివుడు - శివుడు " అంటూ సభలోని వారంతాలేచి నిలబడ్డారు. 

    రత్నపీఠం మీద కూర్చున్న తక్కిన పదకొండుగురు కవులూ లేచి " వందే శంభు ఉమాపతిం " అంటూ స్తోత్రాలు మొదలెట్టేరు. వాదన వచ్చినపుడు నువ్వా? నేనా? అని ఢీకొనాలే గాని శివుడు గదా అని బెదిరిపోయి స్తోత్రాలు మొదలెట్టడమా? అని నాకు వళ్ళు మండిపోయింది. ఏమైనా సరే, నీ పద్యంలో తప్పు లేకుండా పోయిందా? అని నేను వాదించే సరికి, శివునకు కోపం వచ్చి " వళ్ళు తెలియకుండా మాట్లాడావు గనక నీ వళ్ళంతా కుష్ఠురోగం వచ్చి అసహ్యంగా కనబడుదువు గాక " అని శపించాడు. గజగజ వణుకుతో పీఠం మీదనుంచి దిగి పరుగున శివుని కాళ్ళమీద పడి క్షమించమని ప్రార్థించగా, ఆయనకు జాలి కలిగి " సరే వెళ్ళు, కైలాస దర్శనం చేసి రా! అప్పుడు నీ కుష్ఠురోగం పోతుంది. ఎవడి కవిత్వంలోనైనా సరే, మంచి ఉంటే మెచ్చుకో! అంతేకాని తప్పులు పట్టటం పనిగా పెట్టుకోకు " అని బుద్ధిచెప్పి అంతర్ధానం అయిపోయాడు. కైలాసం చూడటానికి వెడుతూ ఈ భూతానికి పట్టుబడి ఇక్కడకొచ్చాను - అని ముగించాడు. 

    నత్కీరుడలా తన కథను ముగించాక కుమారస్వామి వెళ్ళిపోతూ " నువ్వెలాగైనా గొప్ప కవివి. కనుక నీకేమైనా వరమిద్దామని ఉంది. కోరుకో. ఇచ్చి వెడతాను " అన్నాడు. 

    నత్కీరుడు " స్వామీ! నేనీ కుష్ఠురోగంతో ఉండలేను. కైలాసాన్ని చూస్తే తప్ప ఈరోగం పోదు. కైలాసం ఎక్కడో హివవత్పర్వతాలలో ఉంది. అంతవరకూ నేనీ రోగంతో నడిచి వెళ్ళలేను. నాకు సులభంగా కైలాస దర్శనం చేయించు " అన్నాడు. 

    అప్పుడు కుమారస్వామి ఒక యుక్తి చేశాడు. " కైలాసమంటే శివుడుండే కొండగదా! ఎక్కడ శివుడుంటే అదే కైలాసం. ప్రస్తుతం శివుడు మీ దక్షిణ దేశంలోనే కాళహస్తి అనే చోట వెలిశాడు. అక్కడున్న కొండనే దక్షిణ కైలాస మంటున్నారు. అక్కడ దిగబెడతాను. ఆ కొండచూచి నీరోగం పోగొట్టుకో " అన్నాడు. 

    గుహలో వాళ్ళందరివద్దా నత్కీరుడు శలవు పుచ్చుకొని కుమారస్వామితో బయల్దేరి కాళహస్తి వెళ్ళి అక్కడున్న కైలాస పర్వతాన్ని దర్శించాడు. కుష్ఠురోగం పోయి అతనికి మామూలు శరీరం వచ్చింది. అప్పుడా కవి శివునిమీద నూరు పద్యాలు చెప్పి స్తోత్రం చేసి, ఆ దేవుణ్ణి మెప్పించి మోక్షం సంపాదించుకున్నాడు. 


13, జులై 2025, ఆదివారం

 :: సక్తుప్రస్థుడు :: 

    పంచపాండవులలో మొదటి వాడైన ధర్మరాజు 'అశ్వమేధయాగం' అనే యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళూ ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు. ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మలూ, ఋషులూ, మునులూ, సాధులూ, సన్యాసులూ, భిక్షువులూ వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో భోంచేసి వెళ్ళేవారు. ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రలలో భోజనం పెట్టించి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలనుకూడా బహుమానం కింద పట్టుకు పొమ్మనేవాడు. ఆయన అన్నదానానికీ, దాతృత్వానికీ వచ్చిన వాళ్ళంతా అనేక విధాల మెచ్చుకున్నారు. ఆ స్తోత్రాలు చెవినిబడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు. ఆ తర్వాత అతిథులలో ఒక్కొక్కడికీ రెండేసి, మూడేసి బంగారపు గిన్నెలు ఇచ్చేయటం మొదలెట్టేడు. 

    దగ్గర ఉండి యజ్ఞం అంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి " ఏమిటి చెప్మా, ధర్మరాజు ఇలా వళ్ళు తెలియకుండా ఖర్చుపెడుతున్నాడు? " అనిపించింది. " ఏమిటి బావా! చాలా జోరుగా దానాలిచ్చేస్తున్నావు? " అని అడిగేడు కూడాను. 

    అప్పుడు ధర్మరాజు దర్జాగా " జోరుకాక మనకేమిటోయ్! వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టంలేదూ? ధర్మరాజువంటి అన్నదాత ఇదివరలో లేడు, ఇకముందు పుట్టబోడు అనుకుంటున్నారు " అన్నాడు. 

    శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు. కాని, ధర్మరాజు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకుంటాడు? 'మహాన్నదాతనైపోయాను' అనే అహంభావం అతన్ని కమ్ముకుపోయింది. 

    శ్రీకృష్ణుడు తన భక్తులన్నా, బంధువులన్నా, మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు. కాని, వాళ్ళలో ఏమాత్రం గర్వం బయల్దేరినా ఆయన సహించడు. ఆ గర్వాన్ని భంగపరిస్తేగాని ఆయనకు నిద్రపట్టదు. మహాన్నదాత ననుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చెయ్యాలని ఆలోచించి, అతణ్ణి భోజనశాల కవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్ళేడు. కోట్లకొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటూండంవల్ల, ఆ నీరంతా ఒక నదిలా ప్రవహించటం మొదలెట్టింది. 

    ధర్మరాజు శ్రీకృష్ణుడితో " బావా! చూశావా, ఈ నదిని? " అన్నాడు. 

    అందుకు కృష్ణుడు " నదికేంగాని ఆ బురదలో అటూ ఇటూ దొర్లుతూ ఓ ముంగిస ఉంది చూశావా? " అన్నాడు. 

   " ఆ చూశాను. బురదలోంచి ఇవతలికి వచ్చి నిలబడి, తన ఎడంవైపు చూసుకుంటోంది. అదిగో, మళ్ళీ బురదలోకెళ్ళి దొర్లుతోంది చూడు " అన్నాడు ధర్మరాజు. 

    ఆ ముంగి మళ్ళీ బయటకొచ్చేసింది. అదిచూచి ధర్మరాజు " ఇందాకట్లాగే తన ఎడమవైపు చూసుకుంటోంది. ఎందుకు చెప్మా, బురదలో దొర్లివచ్చి అలా చూసుకుంటోంది " అని కృష్ణుడ్ని అడిగాడు. 

    కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగి ధర్మరాజు ఎదుటికి వచ్చి మనిషికి మల్లే మాట్లాడటం మొదలెట్టింది. 

    " మహారాజా! విను. కొన్ని సంవత్సరాలకి పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్థుడనే పేద బ్రాహ్మడొకడుండేవాడు. ఆయన పూరిగుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో దొర్లితే నా కుడిప్రక్క బంగారమయింది. నా ఎడమ పక్కగూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్లబోతే అక్కడ చాలినంత బురద లేక, ఆ ప్రక్క మామూలుగానే ఉండిపోయింది. " అన్నది ముంగి. 

    ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. " బురదలో దొర్లితే వళ్ళు బంగారమవుతుందా ఎక్కడన్నా? " అన్నాడు. 

    " మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా" అంటూ ముంగిస ఆ నీళ్ళల్లోకి పరుగెత్తి వెళ్ళి తన వంటి బురద కడుగేసికొచ్చి, ధర్మరాజుకు తన కుడివైపు చూపించింది. 

    " నిజమే! ఈ వైపు అంతా బంగారమే! ఇదెలా సాధ్యమైంది? " అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు. 

    " సక్తుప్రస్థుడు మహాన్నదాత. అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథులు చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది " అన్నది ముంగి. 

    " నాకంటే ఎక్కువ అన్నదాతా, ఆ పేద బ్రాహ్మడు? ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతోంది. సక్తుప్రస్థుడి పర్ణశాల ప్రక్క బురద నీ కుడిప్రక్కకు మాత్రమే సరిపోయి, ఎడమ పక్కకు లేకపోయిందన్నావు! " అన్నాడు ధర్మరాజు. 

    " నిజమే కానీ, ఆ కాస్త బురద, అంతటినే నాకు ఒక పక్క బంగారమయింది. నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడకు వచ్చి ప్రొద్దుటినుంచీ ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను. కాని, ఒక్క పెసరగింజంత మేర అయినా నా ఎడం ప్రక్కని బంగారమవలేదు. సక్తుప్రస్థుడు పూటకు ఠికాణా లేని పేదవాడే గాని ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకీ రాదని తేలిపోయింది " అన్నది ముంగి. 

    ఆ ముంగి ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిని వెళ్ళిపోయింది. ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు తానేమీ ఎరగనట్లు దిక్కులు చూడటం మొదలెట్టాడు. ధర్మరాజు ఆయనతో, " బావా! ఈ సక్తుప్రస్థుడు ఎవరు? " అని అడిగాడు. 

    అప్పుడు కృష్ణుడు సక్తుప్రస్థుని గురించి యిలా చెప్పసాగాడు. 

        " ఆ ముంగి చెప్పిందిగా అతడొక పేద బ్రాహ్మడని. పేదవాళ్ళల్లోకల్లా పేదవాడతను. అయితేనేం? అతను, అతని కుటుంబం కూడా 'దేహీ' అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపేరు. అతను, అతని భార్య, కొడుకూ, కోడలు ఈ నలుగురూ కూడా పొలాలలో రాలిపడ్డ ధాన్యం యేరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి, ఆ బియ్యంతో పొట్టపోసుకునే వారు. ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు. 

    ఇలా రోజులు గడిచిపోతూంటే, ఉన్నట్టుండి కరువొచ్చింది. పేదవాళ్ళ సంఖ్య ఎక్కువై, పొలాలలో రాలిన గింజలు ఏరుకు పొయ్యేవాళ్ళు ఎక్కువయ్యారు. అంచేత సక్తుప్రస్థుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది. వాళ్ళు నలుగురూ వెళ్ళి వరుసగా నాలుగు రోజులు ఏరితెస్తే తప్ప ఒక పూటకు సరిపడే గింజలు దొరికేవికావు. అంచేత నాలుగేసి రోజులకోమాటు భోజనంచేసి, తక్కిన రోజులలో పస్తులుండేవారు. 

    ఇలా ఓ మాటు నాలుగు రోజులూ ఉపవాసాలుండి, కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి, ఆ అన్నం నాలుగు వాటాలు చేసుకుని, విస్తళ్ళలో వడ్డించుకుని తిందామనుకుంటుంటే ఎక్కడినుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు. మరెవరైనా ఔతే ఆ సందర్భంలో, " అయ్యా! నాలుగు రోజులనుంచి మాకు తిండి లేదు. ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు. కనుక మరోచోటు చూసుకోండి " అని నిర్మొగమాటంగా చెప్పేద్దురు. కాని, సక్తుప్రస్థుడలా  చెయ్యలేదు. విస్తరిముందు కూర్చున్నవాడు దభీమని లేచి, ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకుని, ఆయనను తన విస్తరిముందు కూచోబెట్టి 'ఆరగించండి బాబూ! " అని అన్నాడు. 

    ఆ అతిథి, ఈ కాస్తా నేను తినేస్తే నీమాట ఏమిటి? అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నం అంతా తినేశాడు. పోనీ, అంతా తినేసి లేచాడా? అదీ లేదు. పైగా, 'నాకేం కడుపు నిండలేదు' అన్నాడు. 

    అతిథి అర్ధాకలితో లేవకూడదు- అని సక్తుప్రస్థుడు బాధపడ్డాడు. " ఎందుకూ, నా వాటా వడ్డిస్తాను "  అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది. ఆయన, అయ్యో! నీకు నేను తెచ్చిపెట్టవలసినది బదులు నీ వాటానే పుచ్చేసుకోవడమా? ఏ భర్తా తన భార్య కిలాంటి అన్యాయం చెయ్యడు " అని వాపోయాడు. అందుకామె, అబ్బే, ఇందులో అన్యాయమేముంది? అన్నాతురుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకూ బాధ్యత ఉంది." అంటూ, తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణునకు వడ్డించేసింది. 

    ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివెయ్యటానికి, వడ్డించినంత సేపైనా పట్టలేదు. తినేసి, 'ఇంకా కావాలి' అన్నాడు. 

    " మహాత్మా! ఇదిగో సిద్ధంగా ఉంది. ఆరగించండి " అంటూ సక్తుప్రస్థుని కుమారుడు తన వాటా అన్నాన్ని తెచ్చి వడ్డించాడు. 

    అతిథి అదికూడా తినేసి ' నా ఆకలి తీరలేదు. ఇంకా లేదా? " అన్నాడు. 

    ఆ మాట విని సక్తుప్రస్థుని కోడలు మహదానందంతో, " మహాత్మా! నా అత్తమామలూ, నా భర్తా ధన్యులైనట్లే, నేను కూడా ధన్యురాలినవటానికి అవకాశం వచ్చింది. ఇదిగో, ఈ అన్నం కూడా భుజించండి " అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది. అతిథి ఆ అన్నం కూడా తినేసి, 'నా కడుపు నిండింది' అంటూ లేచి, అవతలికి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. అతని చేతినుంచి నీళ్ళతోబాటు పడ్డ మెతుకులకోసం ఆశపడి వచ్చి ఈ ముంగి తన కుడి ప్రక్క బంగారం చేసుకుంది. 

    " అంతవరకు మసలి బ్రాహ్మడికిమల్లే ఉన్న ఆ అతిథి ఓ దివ్యపురుషునికిమల్లే మారిపోయాడు. ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్థుడూ వాళ్ళు ఆశ్చర్యపోయి, " మహాత్మా! మమ్మల్ని అనుగ్రహించటానికి ఈ అతిథి రూపంలో వేంచేసిన శ్రీమహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు. అందుకాయన , నేను మిమ్మల్ని పరిక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును. మీ ఆతిధ్యానికి మెచ్చుకున్నాను. నాలుగు రోజులనుంచీ తిండిలేక, తిందామని వడ్డించుకున్న సిద్ధానాన్ని మనస్ద్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు. మీ చిత్తశుద్ధి గొప్పది. ఈ పుణ్యానికి ఫలంగా మీరు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లు వరం యిచ్చాను. అనిచెప్పి అంతర్ధానమయాడు. మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగుర్నీ కైలాసం  తీసుకుపోయింది." 

    ఈ కథ విన్న ధర్మరాజు, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టి, బంగారు పాత్రలు దక్షిణగా యిచ్చినా, తన అన్నదానం సక్తుప్రస్థుని అన్నదానం ముందు ఎందుకూ పనికిమాలినదైనదని తెలుసుకుని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు. 



:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...