29, జనవరి 2025, బుధవారం

గరుత్మంతుని కథ  

    కశ్యపప్రజాపతికి కద్రువ, వినత అనేవారు యిద్దరు భార్యలు. భర్త వలన కద్రువ వేయిమందినీ, వినత యిద్దరు కొడుకులను వరాలుగా పొందారు. 1500 సంవత్సరాలు గడచిన తరువాత కద్రువ పెట్టిన గ్రుడ్లనుండి వేయి పాములు పుట్టాయి. వినత గ్రుడ్లు పిగలలేదు. ఆమె అసూయతో ఒక గ్రుడ్డును పగులగొట్టింది. అందులోనుండి సగం శరీరంగల అరుణుడు పుట్టి, తల్లి తొందరపాటుకు కోపించి, ఆమె కద్రువకు దాసి అయ్యేటట్లు శపించాడు. ఆ తరువాత అయిదువేల సంవత్సరాలకు రెండవ అండం నుండి మహాబలవంతుడు పుట్టి, తల్లికి దాస్య విముక్తి చేస్తాడని అనుగ్రహించాడు. గరుత్మంతుడు మహాబలశాలిగా పుట్టి స్వేచ్ఛగా అంతరిక్షంలో తిరుగుతూ బ్రహ్మ సూచించిన ఆహారాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. అరుణుడు సూర్యుని సేవించటానికి వెళ్ళాడు. 

    ఒకనాడు కద్రూవినతలు విహారార్థం సముద్రతీరానికి పోయి అక్కడ ఉచ్చైశ్రవాన్ని చూచారు. ధవళకాంతులతో వెలుగొందుతున్న ఆ ఇంద్రాశ్వాన్ని చూచి వినత ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది. కద్రువ ఆ గుర్రం తోక నల్లగా ఉన్నది కదా! అని అన్నది. వినత దానికి అంగీకరించలేదు. తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేసేటట్లు పందెం వేసికొన్నారు. ఆనాడు పతిసేవకు సమయం కావటంతో ఇంటికి వెళ్ళి, మరునాడు ఉదయం వచ్చి సత్యాసత్యాలు నిరూపించుకొనాలని నిశ్చయించుకొన్నారు. ఆ రాత్రి కద్రువ కుటిలబుద్ధితో తన కొడుకులతో కుతంత్రం చేసింది. కొడుకులను తోకకు వ్రేలాడి అది నల్లగా తోచేట్టు చేయండని అడిగింది. చాలామంది అది అన్యాయమని భావించి తల్లి ఆనతిని తిరస్కరించారు. వారిని జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో హతులయ్యేటట్లు కద్రువ నిర్దాక్షిణ్యంగా శపించింది. ఆ శాపానికి భయపడిన కొందరు నాగులు తల్లి మాటను పాటించి ఉచ్చైశ్రవ వాలానికి నల్లగా వ్రేలాడి నిలిచారు. వినత కద్రువకు దాసిగా ఉండవలసి వచ్చింది. సవతిని హీనంగా చూస్తూ దాస్యవృత్తిని చేయించుకొనేది కద్రువ. వినత గరుత్మంతుడి వలన తనకు దాస్య విముక్తి కలుగుతుందని ఆశతో కాలం గడపసాగింది. 

    ఒకనాడు నారదుని వలన ప్రబోధితుడై గరుత్మంతుడు మాతృ దాస్యాన్ని తొలగించటానికి పూనుకొని కద్రువ వద్దకు వచ్చి వేడుకొన్నాడు. అమృతాన్ని తెచ్చి మాతృదాస్య విముక్తి చేసికొమ్మని కద్రువ గరుత్మంతుడిని ఆజ్ఞాపించింది. అమృతాన్ని తెస్తానని శపథం చేసి గరుత్మంతుడు వెంటనే కశ్యపప్రజాపతి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని కోరుకొన్నాడు. 

    ఇంద్రుడు అమృతాన్ని భద్రంగా రక్షిస్తుంటాడు. జలం మధ్య అగ్ని మండుతూ ఉండగా తీవ్రమైన ఆయుధాలతో భయంకర రాక్షసులు రక్షిస్తుండగా ఇనుప వలలో అమృతం సురక్షితంగా ఉంటుంది. దానిని సాధించటం దేవతలకైనా సాధ్యం కాదు. దానిని సాధించాలంటే గరుత్మంతా!  తూర్పు సముద్రం చెంత ఉండే మహాపర్వతం మీద రెండు గజకచ్ఛపాలున్నాయి. ఆ రెండూ పూర్వ కాలంలో మధుకైటభులు. పరస్పరం ఘర్షణ పడుతూంటాయి.  ఆ రెండింటినీ పట్టి భక్షిస్తే కలిగే బలం వలన నీవు అమృతాన్ని హరించ గలవని కశ్యపుడు గరుత్మంతునకు సూచించాడు. వెంటనె గరుత్మంతుడు బయలుదేరి  వాడి గోళ్ళతో ఆ గజకచ్ఛపాలను పట్టి ఆకాశానికి ఎగిరి, అయిదు యోజనాల పొడవున ఉన్న ఒక మహావృక్ష శాఖమీద వాలాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ కొమ్మ మీద మహామునులు తపస్సు చేసుకొంటున్నారు. అందువలన ఆ కొమ్మ కిందపడకుండా ముక్కుతో పట్టుకొని గరుత్మంతుడు ఎగిరాడు. మునులు ఆ మహాత్ముడి మహిమను చూచి కొమ్మనుండి దిగిపోయారు. ఆ కొమ్మను దురాచారంతో అపవిత్రమైన కులించ దేశ సముద్రప్రాంతంలో వదలమని చెప్పారు. గరుత్మంతుడా పని చేసి, ఒక మహా గిరిశిఖరం మీద విశాల ప్రాంతంలో గజకచ్ఛపాలను భక్షించి మహాబలోపేతుడై అమృతమున్న స్థానానికి చేరాడు. దానిచుట్టూ మండుతున్న అగ్నిని దాటటానికి ఉపాయం కొరకు బ్రహ్మను ఆశ్రయించాడు. కొండంత వెన్నను అగ్నిపై ఉంచమని పితామహుడు ఉపాయం చెప్పాడు. సప్రయత్నంగా వెన్నను సంపాదించి అగ్నిపై ఉంచి, దాని ఉధృతి తగ్గడంతో అమృతభాండంపై లంఘించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది విఫలమై పోవటంతో అతడు విముఖుడయ్యాడు. గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కద్రువ ముందు పెట్టి తల్లి దాస్యానికి విముక్తి కలిగించాడు. అమృతం తేవడమే నియమం కాబట్టి తెచ్చి కద్రువకు చూపించి, మరల ఆ అమృతాన్ని ఇంద్రుడికి ఒప్పగించి గరుత్మంతుడు దేవతల మన్ననలను పొందాడు. పాములపై పగ సాధించాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని సాక్షాత్ విష్ణువుగా కీర్తించి, భవిష్యత్కాలంలో యదువంశంలో శ్రీకృష్ణుడిగా అవతరించి లోకకల్యాణం నిర్వహిస్తాడని ప్రకటించాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...