6, జూన్ 2025, శుక్రవారం

:: నలదమయంతులు :: 

    పూర్వం నిషధ దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరత ఖండాన్ని ఏలిన షట్చక్రవర్తులలో అంటే ఆరుగురు చక్రవర్తులలోనూ ఈ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్ళి చాలా చిత్రంగా జరిగింది. 

    ఒకనాడు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఈ హంస నలుడి దగ్గర విదర్భదేశపు రాజు కూతురైన దమయంతి అందచందాలను, గుణగణాలను చక్కగా వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్లు చేసింది. 

    ఆ తరువాత ఆ హంస విదర్భకు వెళ్ళి నలుడికి చిక్కినట్లుగానే దమయంతికి కూడా చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలను, గుణగణాలను మహోన్నతంగా పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మోహం కలిగింది. ఈ హంస రాయబార ఫలితంగా నలదమయంతులిద్దరూ ఒకరి నొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. 

    ఇంతలో విదర్భ దేశపు రాజు తన కూతురైన దమయంతికి స్వయంవరం చాటించాడు. ఈ చాటింపు విని నానా దేశాల రాజులూ బయలుదేరి వచ్చారు. ఆఖరకు స్వర్గంనుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా మోహించిన వాడు కనుక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు. 

    దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకుని అతణ్ణి పరీక్షించటానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్ళాడేటందుకు నలుణ్ణి రాయబారం వెళ్ళమన్నారు. మాట యిచ్చాడు కనుక నలుడు ఒప్పుకుని రహస్యంగా దమయంతి దగ్గరకు వెళ్ళి దిక్పాలకుల కోరిక ఆమెకు తెలియజేశాడు. కాని, దమయంతి ఒప్పుకొనలేదు. ఆమె నలుణ్ణి ప్రేమించింది. 

    స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతి రాజును గురించి వర్ణించటం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజునే  దాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒకచోట చెలికత్తెకు వరుసగా అయిదుగురు నలమహారాజులు కనిపించారు. అందులో నిజంగా ఒకడే నలుడు. మిగిలిన నలుగురు ఇంద్రాగ్ని యమవరుణులు. 

    ఈ అయిదుగురునీ చూడగానే దమయంతి దిగ్భ్రమచెంది, నిజమైన నలుణ్ణి చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యదార్థ స్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెళ్ళో వేసింది. 

    కొంతకాలంపాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కాని కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయినాడు. కట్టుబట్టలతో నలదమయంతులు అడవులపట్టి పోయినారు. కట్ట గుడ్డ లేకా, తిన తిండీ లేక, ఇద్దరూ అష్టకష్టాలు పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపొమ్మన్నాడు. కాని దమయంతి భర్తతో పాటు కష్టాలు పడటానికే నిశ్చయించుకున్నది. తన వెంట ఉండటంవల్ల దమయంతి కష్టాలు పడుతున్నదనీ, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందనీ గ్రహించి నలుడు ఒక రాత్రివేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయినాడు. 

    దమయంతి భర్తకోసం చాలా దు:ఖించింది. ఎన్నో ప్రయాసలు పడి ఆఖరుకు విదర్భ చేరుకున్నది. వెంటనే నలుణ్ణి వెతికించటానికి అన్ని వేపులా మనుషుల్ని పంపించింది. 

    దమయంతిని విడచిన తరువాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా కర్కోటకుడనే పాము కరచింది. ఆ విషానికి అతని శరీరమంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్ట లేనంతగా మారిపోయినాడు. కురూపిగా తయారయ్యాడు. ఈ అవకాశం చూసుకుని నలుడు బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడుగా చేరాడు. నలుడు వంట చేయటంలో కూడా గొప్ప నేర్పరి. నలపాకం, భీమపాకం అనే మాటలు మీరు వినే ఉంటారు. 

    దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మణుడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు. బాహుకుణ్ణి చూచాడు. అతడు నలుడే అయి ఉండాలని పసికట్టాడు. ఈ వార్త పట్టుకుని విదర్భ వెళ్ళాడు. బాహుకుడు నలుడు అవునో కాదో తేల్చుకోవటం ఎట్లా? దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది. నలుడికి " అశ్వహృదయం " అనే విద్య తెలుసు. అతడు గుర్రాలను వాయువేగంతో తోలగలడు. అందుచేత కాలవ్యవధి లేకుండా ఋతుపర్ణుడిని విదర్భకు రప్పించితే రథాన్ని తోలటానికి నలుడు పూనుకుంటాడు. ఈ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి పెళ్ళాడబోతున్నాననీ, స్వయంవరానికి రావలసిందనీ ఋతుపర్ణుడికి కబురు పంపింది. 

    మర్నాడు స్వయంవరం. ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్క రోజులో ఎలా పోతాడు? రాజుగారీ విషయం విచారించటం చూసి బాహుకుడు తాను సారథ్యం చేసి ఋతుపర్ణుణ్ణి ఒక్కరోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు. తన భార్య మరొకరిని పెళ్ళాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టమేసింది. ఈ పెళ్ళి చూడటానికే అతడు సారథ్యానికి ఒప్పుకున్నాడు. . 

    బాహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు. కానీ, దమయంతి స్వయంవరం అబద్ధమనీ, బాహుకుడే నలుడని రుజువు చెయ్యటానికే ఈ ఎత్తు వేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. 

    ఇంద్రుడి దయవల్ల నలుడు తన పూర్వరూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించటంవల్ల అతణ్ణి ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలు అతని దగ్గరకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం చెయ్యమని ప్రార్థించారు. నలుడు వారు కోరిన ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...