29, అక్టోబర్ 2025, బుధవారం

:: గోదావరి అవతరణ :: 

    గంగా పార్వతులమధ్య ద్వేషం వర్థిల్లుతూండగా గంగా పుష్కరం వచ్చింది.

   నారదుడు పార్వతితో " ముక్కోటి దేవతలు వారి వారి మహత్తులు, శక్తులు గంగానదికి
సంక్రమించేలాగ పుష్కర స్నానాలు చేస్తున్నారు. అమ్మా గౌరీ! నీవు కూడా అలాగ చేస్తే, విశాల హృదయంగల మంచిదానివి నీవేనని, లోకం నిన్ను మెచ్చుకుంటుంది " అని చెప్పి అలాగే వెళ్ళి గంగతో " గంగాభవానీ! నిన్ను పావనం చేద్దామని పార్వతి విజయం చేస్తున్నది. తెలుసా? " అన్నాడు. 

    " అలాగా! దయాదాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా, రానీ చెబుతాను " అన్నది గంగ. 

    పార్వతి పూలుజల్లి గంగలో దిగబోతూంటే " ఆగు! నన్ను మలినపర్చకు " అని గంగ ఆటంక పరిచింది. ఇద్దరికీ గొప్ప వివాద సంవాదం జరిగింది. 

" కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది. నీ అవిటి చేతుల్లో నలిగిన బొమ్మ బాబు, పాపం గజముఖుడయ్యాడు. నీవు మాత్రం ఒఠ్ఠి గొడ్రాలివి " అన్నది గంగ. 

    " నే నెవర్నో తెలుసా, పరమ శివుని అర్థాంగిని. భాగేశ్వరిని " అన్నది పార్వతి 

    " తెలియకేం, కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి " అన్నది గంగ. 

    " జారిపడిన భ్రష్ఠురాలివి నువ్వు " అన్నది పార్వతి. 

    " హాలాహలం గొంతు దిగకుండా మ్రింగిన తాపాన్ని చల్లార్చితే  మెచ్చి, వచ్చి మనోహర కుసుమకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టురాలినో, భ్రష్టురాలినో లోకానికి తెలుసు " అంది గంగ. 

    " ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులుపడిన అర్భకురాలివి  వల్లమాలిన సుకుమారితనం దేనికి? " అన్నది పార్వతి. 

" నువ్వలాగే అంటావులే! బలులుకోరే జాలిలేని అమ్మతల్లివి. వామాచారిణివి. మలినవు. అంటరాని మాతంగివి. మోటుదానివి. శక్తివి " అని గంగ గడగడా అనేసింది. 

    " బాగా గుర్తుచేశావు, గంగా! ఔను. నేను శక్తిని. మహాశక్తిని " అంటూ పార్వతి ఆవేశం పొందింది. ప్రళయ ప్రభంజనాలు వీచాయి. చీకట్లు కమ్మాయి. మెరుపులతో ఆకాశం గర్జించింది. పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. మంచుశిఖరాలు కరిగాయి. 

    పార్వతి ఆవేశానికి గంగ పరిహాసం చేస్తూ " చాల్లే! చల్లని దాన్ని కదా! అని నన్ను చిన్నచూపు చూశావే కాని, నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు. నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే " అంటూ గంగ హిమాలయ శిఖరాగ్రాల ఎత్తు పొంగింది. గంగానది పరవళ్ళు తొక్కుతూ ఉత్తరభూమిని జలమయం చేసింది. 

    దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన భీభత్సాన్ని చూస్తూ " అమ్మలు ఆడిపోసుకోవడం కాదుగాని ప్రళయం తెచ్చిపెట్టారు " అని నిట్టూర్చి, కలహబీజం నాటిన నారదుణ్ణి ఒక్కుమ్మడిగా నిందించారు. 

    విఘ్నేశ్వరుడు దక్షిణం నుంచి తిరిగి వస్తూ, నారదుణ్ణి చూసి, " కలహభోజనా! కడుపు నిండిందా? ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా! " అన్నాడు. 

    నారదుడు " ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా! కడుపునిండిన వినాయకులెవరో, లోకకల్యాణం కోసం నడుంబిగించి పాటుపడే నాయకుడెవడో తెలిసేది " అని చలోక్తిని విసురుతూ వెళ్ళాడు.  విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు. 

    కైలాసంలో పార్వతి పశ్చాత్తాపంతో తనలో తాను " మళ్ళీ మరొక భగీరథుడు తర్లించుకుపోతేనే గాని గంగ ఉధృతి తగ్గదు " అని గట్టిగా అనుకున్నది. 

    ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభివందనం చేసి " అమ్మా! ఒక మంచి పని తలబెట్టాను. ఆశీర్వదించమ్మా! అన్నాడు. 

    " విఘ్నేశ్వరుడు తలపెట్టితే అడ్డేమిటి నాయనా! ఇంతకూ నువ్వేదో దక్షిణంగా వెళ్ళినట్లున్నావు. విశేషమేమిటి? " అన్నది పార్వతి. 

    విఘ్నేశ్వరుడు " ఏం చెప్పమంటావు? వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది.  ఆ ప్రదేశం అంతా పైరుపచ్చగా, నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంతబాగుంటుంది అని అనిపించిందమ్మా! గంగమ్మ కాస్త అటువెళ్ళి చల్లగా చూస్తేకాదా, ఏమంటావమ్మా? " అన్నాడు. 

    పార్వతి " నేననేదేముందబ్బా! అంతా ఆ విశ్వనాథుడిదేకదా భారం " అన్నది. 

    విఘ్నేశ్వరుడు " అలా అని మనం ఊరికే చూస్తూండ వలసిందేనా? మన ప్రయత్నం ఉండాలా వద్దా! " అన్నాడు. 

    " తప్పకుండా ఉండాలి. అందునా నీలాంటి వాడు పూనుకుంటే జరగనిదేముంది " అంది పార్వతి 

" ఆ మాట చాలునమ్మా! వెళ్ళి వస్తాను " అని పార్వతి పాదాలు తొండంతో  కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు, తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. 

    గౌతముడు పడమటి కనుమల నడుమ ఆశ్రమం ఏర్పరుచుకొని, అవసరం మట్టుకు సేద్యం చేసుకంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు. 

    పెరిగిన చేను తొక్కుకుంటూ మేస్తున్న ఆవును అదలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు. ఆ నీటి చుక్కలు పడీ పడటంతో ఆవు పడిపోయి గిలగిల తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృతాన్ని, తపస్సును ధారపోసినా మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు. 

    నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు. ఇంద్రునికి గౌతముడి మీద తీరని పగఉంది. బ్రహ్మ అపూర్వసుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది పోటీ పడ్డారు. భూదేవిని ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే, అహల్య అతని దవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. 

    గౌతముడు ప్రసవిస్తూన్న ఆవుచుట్టూరా తిరిగి వచ్చి, బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు. 

    గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతిమీదుగా గోహత్య జరిగింది. పగతీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప మునిపుంగవుడి వేషంతో తిరిగి తిరిగి, " గౌతముడు గోహత్య చేసిన మహాపాపి. అతని ఆశ్రమం మైల పడిపోయింది. గౌతముడిని చూసినా, ఆశ్రమంలో అడుగుపెట్టినా మహాపాతకం చుట్టుకుంటుంది. గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీదనుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏమీ లేదు " అని లోకమంతా చాటి, సాటి మహర్షులను రెచ్చగొట్టాడు.  ఋషులు గౌతముణ్ణి వెలివేశారు. ఆశ్రమ వాసులంతా వెళ్ళిపోయారు. 

    ఎక్కడి గంగానది? ఎక్కడి పడమటి కనుమలు? అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు. 

    కపిలమహాముని కోపాగ్నికి బూడిదపోగులైన తన తాతలను తరింప చేయడానికి భగీరధుడు జలాధి దేవతైన గంగాదేవిని తపస్సుచేసి మెప్పించి దివినుండి భువికి దింపాడు. శివుడు తన జటాజూటంలో గంగను ధరించాడు. గంగ గంగాభవాని అనిపించుకుంది. గంగను ఒదలమని భగీరధుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు జడలముడి సవరించి గంగను కొద్దిగా ఒదిలాడు. గొప్ప వేగంతో గంగ చిమ్ముకొచ్చి నలుదెసలా హిమాలయాల్లో పడింది. భగీరధుడి వెంట గంగ ప్రవాహంగా తూర్పుముఖంగా వెళ్ళింది.  గంగకు భాగీరధి అని పేరు వచ్చింది. 

    హిమాలయాల్లో పడిన గంగ కొంత హిందూకుశ శిఖరాల మీదుగా పడమరకు ఇందు నదిగా ప్రవహించింది. ఇందునదినే సింధునది అన్నారు. భరతఖండానికి వాయవ్యంగా ఉన్న సింధునది మూలంగా హిందూదేశమనే పేరు వచ్చింది. 

    భగీరధుడి వెంట మహావేగంగా వెడుతున్న గంగను తన ఆశ్రమం పాడవకుండా జహ్ను మహాముని తాగేశాడు. భగీరధుడు జహ్ను మునిని ప్రార్థించి గంగను విడుదల చేయించాడు. జహ్ను మహాముని చెవినుండి గంగ వెలికి వచ్చినందువల్ల గంగకు జాహ్నవి అనే పేరుకూడా వచ్చింది. తరువాత కపిలాశ్రమం చేరి, భగీరధుడి పితరుల మీదుగా ప్రవహించి తరింపజేసి భగీరధుడి ప్రయత్నాన్ని ఫలింపజేసింది. 

    భగీరధుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగ ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది. దారిపొడవునా గంగాదేవి అడుగుజాడల్లో ఎన్నో యేర్లూ, వాగులూ పుట్టాయి. 

    గౌతమాశ్రమం చేరుతూనే గంగ నదీప్రవాహమై గౌతముడు దారిచూపుతూ ముందు నడుస్తూంటే, ఆవుమీదనుంచి జలజలా పారి గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది. మాయదారి ఆవు దిగ్గునలేచి నాలుగడుగులు వేసి, అలా పైకెగసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. 

    విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి " అమ్మా! తనయుణ్ణి మన్నించు. నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని యింతపని చేశాను. దక్షిణగంగగా అవతరించిన నీవు, గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరుపొందుతావు " అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు. 

    గోదావరి అనేక ఉపనదులతో తూర్పుగా పయనించి తూర్పు మైదానాన్ని సస్యశ్యామలం చేసింది. సప్తఋషులు, దేవతలు గోదావరిలో జలకమాడారు. గౌతముణ్ణి ఎన్నోవిధాల శ్లాఘించి అపర భగీరధుడు అన్నారు. గోదావరి సప్త గోదావరిగా చీలి తూర్పు సముద్రాన్ని చేరింది. 

    గంగ, గోదావరి ప్రవాహంగా మారుతున్నప్పుడు, ఆమె నల్లని వేణీభరము విరజిమ్ముకుని పడమటి కనుమల్లో చిక్కుపడింది. విష్ణువు తన చేతివేళ్ళతో ఆ చిక్కు విడదీశాడు. కృష్ణవర్ణుడైన విష్ణువు వేళ్ళసందులనుంచి కొప్పులోని నీరు జారుతూ కృష్ణవేణి, కృష్ణానది అని పిలువబడుతూ మరొక గొప్పనది ప్రవహించింది. 

    అలాగే గంగాజలం ఆకాశంలో ఎగిరి, దక్షిణంగా ఉన్న కవేర మహాముని ఆశ్రమంలో కమండలంలో పడి, కన్యగా పెరిగి, అగస్త్యుని వెంట అరణ్యాల్లో విహరిస్తూ, కావేరీనదిగా మారి, అందమైన జలపాతాలతో దక్షిణసీమలో ప్రవహించింది. 

    ఆ విధంగా గౌతమ మహర్షి తెచ్చిన గంగ మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారతభూమిని సుభిక్షం చేసింది. 

    గంగ, గోదావరి, కృష్ణ, కావేరి అని నదులపేర్లు చెప్పుకోవటం పరిపాటి అయింది. 

    గౌతముని ఆశ్రమం తిరిగి కళకళ లాడింది. గోదావరి పొడవునా అనేక క్షేత్రాలు వెలిసాయి. గౌతముడి కీర్తిగూడా వ్యాపించింది. గంగ పడమటి కనుమలకు ప్రవహించడం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడే గాని, అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి క్షమాపణ వేడుకున్నాడు. 

    గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది. అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా ఉండమని శపించి, ఉత్తరదేశంనుంచి వింధ్యదాటి  పడమటి చరియలో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకొంటున్నాడు. గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి. అత్రిమహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు. అనసూయ అతిథులకు నిరతాన్నదానం చేస్తున్నది. 

    గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్నా, అహల్యలేని కొరత కనిపిస్తూనేఉంది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనస్సులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి " గౌతమా! త్వరలోనే విష్ణువు రాముడై తన పాదంమోపి, నీ భార్యను మనిషిగా చేస్తాడు. పాషాణ పునీత అవుతుంది. గోదావరి అవతరణానికిగాను నీకు చాలా శ్రమ యిచ్చాను. గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది " అన్నాడు. 

    గౌతముడు ఆ మాటలకు సంతోషంతో " విఘ్నేశ్వరా! అంతా నీ సంకల్పబలం వల్లనే కదా జరిగింది. గోదావరి జలాలూ, విఘ్నేశ్వరుని కృపా ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి " అన్నాడు. 





     

25, అక్టోబర్ 2025, శనివారం

:: స్వామి అవతరణ ::  

    గణాధిపత్య పట్టాభిషేకానికి పార్వతి ధగధగ మెరిసే రంగుబట్టల్ని ఎన్నిక చేసింది. కాని, విఘ్నేశ్వరుడు తెల్లని వస్త్రాలు ధరించాడు. 

    " మంచి బట్టలు వేసుకోవలసిన సమయంలో శుక్లాంబరధరుడు అనిపించుకున్నావేమయ్యా " అంది పార్వతి. 

    " మంచి బట్టలు కదమ్మా వేసుకోవాలి? అవే వేసుకున్నానమ్మా! తెలుపు మంచితనాన్ని, వివేకాన్ని తెలుపుతుంది " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    పట్టాభిషేకం జరిగింది. విఘ్నేశ్వరుడు గణనాథుడు అయ్యాడు. జయలక్ష్మి పేరుగల సిద్ధి, విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుణ్ణి వరించి ఇరుప్రక్కలా చేరారు. గణనాథుడు సిద్ధిబుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అదే సమయంలో ఎనిమిది దిక్కులనుండి అష్ట సిద్ధులు ఎనమండుగురు చక్కని కన్యలై వచ్చి వకుళమాలలు వేసి వినాయకుణ్ణి వరించారు. విఘ్నేశ్వరుడు సిద్ధివినాయకుడు అనిపించుకున్నాడు. కళ్యాణమహోత్సవాలు వైభవంగా జరిగాయి. 

    విష్ణువు మహేశ్వరుడితో " కోటి విఘ్నాలు వచ్చినా వినాయకుడి పెళ్ళి ఆగదు అనే కొత్తసామెత అమలుజరిగింది. ఓ కళ్యాణ గణేశా! ఇక నీ చేతి మీదుగా కళ్యాణాలు జరగాలి. అలా జరిగిన కళ్యాణ ఫలంగా అవతరించిన జన్మే జన్మ! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " అలాగే జరుగుతుందిలే. కౌసల్యకు రాముడివై అవతరించి రావణ దశ అంతం చేద్దువుగాని " అని అన్నాడు. 

    మళ్ళీ విష్ణువు " గజాననా! నీ ప్రసన్న వదనం చూస్తూంటే ఏనుగు అంటే మక్కువగా ఉందోయ్ " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " మొసలి బారినుండి గజేంద్రుణ్ణి రక్షించి కరివరదుడు అనిపించుకుందువులే " అన్నాడు.  

    ఎనమండుగురు సిద్ధి కన్యలు చామర వింజామరాలు వీస్తూండగా, సింహాసనంపై సిద్ధిబుద్ధులతో చుక్కల్లో చంద్రుడిలాగ విఘ్నేశ్వరుడు ప్రకాశిస్తున్న ఆ సమయంలో, లక్ష్మి ముఖం తిప్పుకొని వెళ్ళిపోబోతూంటే  విష్ణువు ఆమెను ఆపి, విఘ్నేశ్వరుడితో " సిద్ధివినాయకా! లక్ష్మి స్థిరమైనది కాదు అని వాదు పడుతున్నది. నీ ఒడిలో కాస్త కూర్చుండనియ్యి. లక్ష్మికి స్థిరత్వం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను " అని అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు మహానందంతో " తల్లీ! మహాలక్ష్మిని ఒడి పట్టే నా అదృష్టం ఎంత గొప్పది " అని అంటూ లక్ష్మి పాదాలను తొండంతో చుట్టి తన కుడి తొడమీద కూర్చుండ బెట్టుకున్నాడు.

    అప్పుడు విష్ణువు " ఇప్పుడు విఘ్నేశ్వరుడు " లక్ష్మీగణపతి " . తల్లి కుమారుణ్ణి ఏ విధంగా కనిపెట్టుకుని ఉంటుందో అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది " అని చెప్పాడు. 

    నారదుడు " ఓహో! విఘ్నేశ్వరుడికి ఎన్ని పేర్లు? సిద్ధివినాయకుడు, లక్ష్మీగణపతి, శుక్లాంబరధరుడు - ఇంకా...ఎన్నో ఎన్నో ! " అని అంటూ మహతివీణను వాయిస్తూ " జయజయ గణనాయక జయహే " అని గానంచేస్తూ లోకాలన్నీ తిరిగాడు. 

    ఒకనాడు విఘ్నేశ్వరుడు ఎలుక వాహనంపైన ఆకాశమార్గంలో పయనిస్తూ వింధ్య పర్వతశ్రేణిని దాటి ఇంకా దక్షిణంగా వెళ్ళి ఒక పెద్ద నల్లని కొండగగ్గర దిగాడు. కొండ దిగువనే శబరులు డోళ్ళు, డప్పులూ కోలాహలంగా వాయిస్తూ పెద్ద సంబరం జరుపుకుంటున్నారు.

    విఘ్నేశ్వరుడు తన రూపాన్ని ఉపసంహరించుకొని అందమైన కుర్రవాడి రూపంతో ఉత్సవాన్ని సమీపించాడు. 

    శబరులు కుర్రవాణ్ణి చుట్టుముట్టి " దేవర తనకోసం మంచి చిన్నోడిని పంపినాడు " అంటూ ఎత్తుకుపోయి ఉత్సవం మధ్యలో దింపారు. 

    అక్కడ రక్తచారలతో పెద్ద నల్లని గండశిల ఉన్నది. ఎదురుగా ఒక పసివాడు మూగగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి ఒంటినిండా పసుపురాసి, మొలకు నల్లని గుడ్డ కట్టి, ఎర్రని మందారమాలతో అలంకరించారు. 

    విఘ్నేశ్వరుడు శబర నాయకుడితో " మీ దేవరతో నేను మాట్లాడాలి. నన్ను అతని దగ్గరకు తీసుకు వెళ్ళండి " అన్నాడు. 

    శబర నాయకుడు పకపకా నవ్వుతూ " బలే చిన్నోడివే. మా స్వామితోనే మాటాడతావా? మా స్వామి కారుచీకటిలాగ మహా భీకరంగా ఉంటాడు. ఎవరూ చూళ్ళేరు. చూస్తే రక్తం కక్కుకొని చచ్చిపోతారు." అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నవ్వి, తటాలున వెళ్ళి గండశిలను సమీపించి  " మీ భయాన్నే మీ స్వామికి అంటగట్టి భయంకరంగా ఉంటాడని అనుకుంటున్నారు. భయాన్నే భక్తి అనుకుంటున్నారు. మీలో ఉండే క్రూర స్వభావమే బలిగా తయారయింది.  ఇదంతా తప్పు. మీరెవ్వరూ మీ స్వామిని చూసి ఎరుగరు. మీ స్వామి ఎన్నడు ఇలాంటి ఉత్సవాన్ని, బలినీ కోరలేదు. మీ స్వామి ఎంతో అందంగా ఇలాగ ఉంటాడు " అని చెబుతూ అరచేత్తో రాతిని తట్టాడు. నల్లని బండరాయి తెల్లని అరటి దవ్వలాంటి అందమైన స్వామి విగ్రహంగా మారింది. ముణుకులపై చేతులుచాచి కూర్చున్న స్వామి విగ్రహం నవ్వు ముఖంతో మనోహరంగా కనిపించింది. విఘ్నేశ్వరుడు పసివాడి తల నిమిరాడు.

    ఆ పిల్లవాడు గొంతెత్తి " స్వామీ! నీవే శరణం " అంటూ విగ్రహం ముందు మోకరిల్లి స్తోత్రం మొదలుపెట్టాడు. 

    నల్లరాయి స్వామి విగ్రహంగా మారడం, మూగపిల్లవాడు గొంతెత్తి మాటలు పలకడమూ రెప్పపాటున జరిగాయి. 

    అద్భుతాలకు శబరులు నివ్వెరపాటుతో చేతులెత్తి, భయం భయంగా విఘ్నేశ్వరుడికి మ్రొక్కారు. 

    కుర్రవాడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు వారిస్తూ " నన్ను కాదు మీరు మ్రొక్కవలసింది మీ స్వామిని. భయాన్ని విడిచి ప్రేమతో కొలవండి. మీరు నమ్మిన దేవరను తండ్రిలాగ, అన్నలాగ, స్నేహితుడిలాగ చూసుకోండి. బలులు మొదలైన చెడ్డపనులు మానేసి ఫల పుష్పాలతో, అరటి తోరణాలతో ఆనందంగా పండుగలు చేసుకోండి. ఈ మాటలు వచ్చిన పిల్లవాడె మీకు గురువుగ, స్వామి పూజారిగా ఉంటాడు. నేను మీ స్వామి దగ్గరకు వెడుతున్నాను. మీ స్వామి మీకు దర్శనమిస్తాడు " అని చెప్పి చరచరా కొండను ఎక్కుతూ వెళ్ళాడు. 

    శబరులు కొంతవరకు అతనిని అనుసరించి వెళ్ళి ఆగిపోయారు. 

    విఘ్నేశ్వరుడు కుర్రవాని రూపంతోనే పర్వతాగ్రానికి చేరాడు. అక్కడ భైరవస్వామి తలవాల్చుకొని విచారంగా కూర్చొని ఉన్నాడు. అతని శరీరం కారునల్లగా ఉన్నది. 

    విఘ్నేశ్వరుడు పరుగున వెళ్ళి భైరవుణ్ణి రెండు చేతులా చుట్టి ఆలింగనం చేసుకున్న క్షణంలో భైరవుడి శరీరం తెల్లగా వెన్నెలకాంతితో ప్రకాశించింది. 

    దివ్యమంగళరూపాన్ని పొందిన భైరవుడు కుర్రవాణ్ణి ఆనందంతో కౌగలించుకొని " నీవు విఘ్నేశ్వరుడివి. నాకు తెలుసు. నీ అనుగ్రహంతో నా కారుదనం పోయి దైవత్వం సిద్ధిస్తుందని నేను అవతరించినపుడు ఆకాశవాణి చెప్పింది. ఈ కొండ ఎక్కడానికి ఎవ్వరూ సాహసించరు. నన్ను చూసి పక్షులుగూడా ధ్వని చెయ్యవు. నన్ను నేనే అసహ్యించుకొంటూ నీకోసం ఎంతకాలం నుంచో నిరీక్షిస్తూ ఉన్నాను. నీ నిజరూపంతో నా కన్నులకు విందు చెయ్యి " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నిజరూపాన్ని పొంది అతనితో " ఇకనుండి నీవు దైవంగా ఆరాధింపబడే స్వామివి. శివకేశవులిద్దరూ నీలో ఉన్నారు. నీ గురించి అమ్మ చెప్పినప్పట్నుంచి నిన్ను కలుసుకోవాలని తహతహ పడుతూనే ఉన్నాను. మోహం చీకటి లాంటిది. శివుడు మోహపరవశుడై జగన్మోహినీ రూపం ధరించిన విష్ణువు వెంట బడ్డాడు. శివ, విష్ణువుల తేజస్సులు ఒకటిగా కలిసి నీ అవతరణం జరిగింది. అందువలన నీకు నల్లని రూపు వచ్చింది. ఇప్పుడు నీ అంత దివ్య మంగళ సుందరుడైన స్వామి వేరొకడు లేడు. శబరులకు ఒకసారి కనిపించు " అన్నాడు. 

    తరువాత కుర్రవాని రూపంతో శబరుల దగ్గరకు వచ్చి " మీ స్వామి విగ్రహం ముందు మోకరిల్లి ఏకకంఠంతో " స్వామీ శరణం " అని పిలవండి. మీ స్వామి మీకు కనిపిస్తాడు. పిలిచినప్పుడల్లా పలుకుతాడు. పంటలు పండించండి. ఇళ్ళు వాకిళ్ళు పల్లెలు కట్టుకొని సుఖంగా మనుష్యుల్లా జీవించండి. మీ స్వామి అండదండలెప్పుడూ మీకు రక్షగా ఉంటాయి, వెళ్ళండి " అని చెప్పి అదృశ్యమయ్యాడు. 

    శబరులు నివ్వెరపోయి దండాలు పెట్టి, విగ్రహం దగ్గరకు చేరుకొని స్వామిని నోరారా పిలుస్తూ మ్రొక్కారు. దివ్యసుందర రూపంతో స్వామి వారికి సాక్షాత్కరించి చిరునవ్వులతో అభయముద్ర పట్టి వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. 

    అప్పటినుంచి శబరులు ఏటేటా మార్గశిరమాసంలో అరటిచెట్టు బోదెను, లేత ఆకును అనేక విధాలుగా ఉపయోగించి స్వామికి మంటపాలనూ, పందిళ్ళనూ అలంకరణచేసి, బలులు మొదలైనవి మాని సాత్వికారాధనతో స్వామిని భయంలేని భక్తితో అర్థిస్తూ, నాగరికులై, విద్యావంతులై ఉన్నత మానవత్వాన్ని సాధించారు. స్వామి నివసించిన కొండపై గొప్ప ఆలయాన్ని శిల్పకళానిలయంగా నిర్మించి సంగీతనృత్యకవితలతో అలరించి గర్వించదగ్గ మానవజాతిగా రూపొందారు. 

    కుర్రవాని రూపంలో వచ్చినదెవరో శబరులకు తెలియదు. వారి దేవర స్వామియే ఆ రూపంలో వచ్చి తమ అజ్ఞానాన్ని తొలగించి అనుగ్రహించాడని అనుకున్నారేగాని, విఘ్నేశ్వరుని లీల అని ఎరుగరు. విఘ్నేశ్వరుడు అలా ఎరుకపడి ఉంటే విఘ్నేశ్వరుడే దేవుడని ఆరాధనలు మొదలుపెట్టి  తమ స్వామినే విస్మరించుతారని విఘ్నేశ్వరుడు అజ్ఞాత బాలకుడిగానే ఉండిపోయాడన్న సంగతి స్వామి పదే పదే తలచుకొని మనసారా విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తూండే వాడు. కైలాసానికి వెళ్ళి విఘ్నేశ్వరునితో, కుమారస్వామితో  ఆనందం పంచుకోవాలని ఉవ్విళ్ళూరేవాడు. 

    విఘ్నేశ్వరుడు శబరులను సంస్కరించి మూషికవాహనుడై ఆకాశమార్గంలో క్రిందకు చూస్తూ ఉత్తరదిశగా తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. కొండచరియలన్నీ కీకారణ్యములతో నిండి ఉన్నాయే గాని, భూమి అంతా బీడుపడిన మైదానంలా కనిపించింది. జలసమృద్ధి ఉంటే కనులపండుగగా పైరుపచ్చగా ఉండవలసిందిగాని, నీటి కొరత తీర్చే నదులు లేక సౌభాగ్యశూన్యంగా భూములు వెలవెల పోతున్నవి. ప్రజలు ఆకాశాన్ని మబ్బుల్ని నమ్ముకొని ఏదోఒకలాగ జీవయాత్ర సాగిస్తున్నారు. 

    గంగమ్మలాంటి నది కలిగిన ఉత్తరదేశ ప్రజలు ఎంత పుణ్యం చేసి పుట్టారో! అంత గంగ మనకు లేకపోయినా అందులో ఒక పాయ మనకు ఏ దేవుడైన్నా కనికరించి ఇవ్వకూడదా? ముక్కోటి దేవుళ్ళున్నారంటారు, ఎందుకు? ఒక్కరికీ జాలిలేదు " అంటూ సామాన్య ప్రజలు అనుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి విఘ్నేశ్వరుడి పెద్ద చెవులకు. 

    అటు పడమటి దిక్కున ఎత్తైన పర్వత శ్రేణులు, ఇటు తూర్పున చిన్న చిన్న కొండలబారుతో నిండిఉన్న భూభాగాలు విశాలంగా తూర్పు సముద్రం వరకూ ఊరికే ఉన్నాయి. ఎక్కువమంది జనులు జంతువుల్ని, పక్షుల్ని వేటాడి తింటూ ఆటవిక జీవనం సాగిస్తున్నారు. సేద్యం మీద ఆధారపడ్డ వారు అగచాట్లు పడుతూనే ఉన్నారు. సముద్రంమీద ప్రాణభీతి విడిచి చేపలుపట్టే జాలరులు విశేషంగా కనిపించారు. చాలీచాలని మేతతో పశుగణాలు బక్కచిక్కి దీనంగా కనిపించాయి. తూర్పుతీరం పొడవునా జాలరిపల్లెలే కనిపించాయి గాని మంచి ఊళ్ళు లేవు. 

    ఉత్తరభూమితో పోల్చి చూస్తే విఘ్నేశ్వరుడికి చాలా విచారం కలిగింది. హిమాచలసీమలో ఎటు చూసినా సుందరజలపాతాలతో, రమణీయ సరోవరాలతో, నదీనదాలతో మనోహరంగా కనిపించే పచ్చని ప్రకృతి కళకళలాడుతూ ఆనందదాయకంగా ఉంటుంది. ఇక్కడ పడమటి పర్వతాలు దిష్టిబొమ్మల్లాగా బోడిగా ఉన్నాయి.

    ఆ పర్వతశ్రేణి నడుమ సహ్యాద్రి చేరువనున్న లోయలో గౌతముని ఆశ్రమం మసిబొగ్గుల్లో మరకతంలాగా ఆకుపచ్చగా మెరుస్తున్నది. విఘ్నేశ్వరుడికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా తలపంకించాడు. ఎలుకను వేగం పెంచమని హెచ్చరికగా తట్టి దక్షిణాదిని, వింధ్యను దాటి ఉత్తరాది చేరుకున్నాడు. ఉత్తరభూమి దూరానికి అంతా ఏదో కొత్తగా ఉన్నట్టు కనిపించింది. 

    సమీపించేసరికి అక్కడ అంతా అయోమయంగా ఉంది. 

( సశేషం. తరువాత విఘ్నేశ్వరుడేం చేశాడన్నది వచ్చే వారం. అంతవరకు శలవు. ) 

18, అక్టోబర్ 2025, శనివారం

:: ప్రమథగణాధిపత్యం :: 

    కుమారస్వామికి తన పెళ్ళి ఆగిపోవడానికి కారణమైన విఘ్నేశ్వరుడి మీద గుర్రుగా ఉంది. 

    ఒకనాడు అతడు తల్లితో " వాజమ్మ గాక జేజెమ్మ ఎలాగౌతాడమ్మా! అన్న. నలుగుముద్ద తిండిముద్దకే గాని ఘనకార్యం చేయగలడా? " అన్నాడు ఎకసెక్కెంగా. 
    
    వినాయకుడు గుడ్ల నీరు బెట్టుకొని " చూడమ్మా! తమ్ముడు ఎంతలేసి మాటలంటున్నాడో " అంటూ ఏడ్చినంత పని చేశాడు. 

    పార్వతికి కూడా కోపం వచ్చింది. వినాయకుణ్ణి అక్కున చేర్చుకొని బుజ్జగిస్తూ " నాన్నా! నేను చేసిన బొమ్మవని వీళ్ళకు అక్కసురా! తండ్రి చంపనే చంపేశాడు. తమ్ముడు ఇలాగ దెప్పుతున్నాడు. పోనీలే. వాళ్ళ అజ్ఞానం వాళ్ళకే తలవంపు " అంది. 

    " తమ్ముడు అజ్ఞాని అయితే అవుతాడు గాని, నాన్నకు అజ్ఞానం ఏమిటమ్మా! నీ పిచ్చిగాని....." అన్నాడు గణపతి ఆశ్చర్యంగా. 

    పార్వతి ఏదో తలంచుకొని " నాకు కాదురా పిచ్చి, ఆ శంకర మహాదేవుడికే పిచ్చి ఎక్కి విష్ణుదేవుడి జగన్మోహిని అవతారం వెంటబడి నవ్వులపాలవలేదా ఏమిటి? " అన్నది.

    " ఆ తర్వాతేం జరిగిందమ్మా? " అన్నాడు గణపతి. 

    " ఏదో ఘోరమే జరిగింది. వాళ్ళిద్దరి మధ్యా ఒక భైరవుడనే కారుచీకటిలాంటి భూత పిల్లడు పుట్టాడుట " అంది తల్లి.

" భైరవు డెక్కడుంటాడమ్మా? వాణ్ణి చూడాలని ఉంది " అన్నాడు కొడుకు. 

    " ఎక్కడో ఉంటాడు. నల్లటి బట్టలు కడతాడట. వాడి దగ్గరకు పొరబాటున కూడా వెళ్ళకుసుమీ! " అంది పార్వతి. 

    " ఝడుసుకోవడమంటే ఏమిటమ్మా? అదికూడా తెలుసుకోవద్దూ? " అన్నాడు గణపతి. 

    " పెళ్ళాడితే తెలుస్తుంది " అంది పార్వతి. 

    " అదీ సంగతి. భార్యా రత్నాలు అంటే అంత భయంకరం అన్నమాట. అందుకే నేను పెళ్ళిచేసుకోనమ్మా! " అన్నాడు గణేశుడు. 

    కుమారస్వామి అందుకొని " అదే నీ ఘనకార్యం. నేను యిప్పుడే పోయి సూర్యుణ్ణి చుట్టి వస్తాను " అంటూ నెమలినెక్కి తుర్రుమన్నాడు. 

    విఘ్నేశ్వరుడు తిన్నగా వెళ్ళి మేరుపర్వతం ఎక్కి చిట్టచివర శిఖరాగ్రం మీద కూర్చున్నాడు. 

    మేరుపర్వతం చుట్టూరా సూర్యుడు తిరుగుతూంటాడు. అక్కడ సూర్యాస్తమయం అనేది ఉండదు. 

    కుమారస్వామి శ్రమపడి సూర్యుడి చుట్టూరా ప్రదక్షిణం చేసి వచ్చి అన్న మేరుపర్వతం ఎక్కి కూర్చున్నాడని తెలుసుకొని, విచారంగా ముఖం వేలవేసి ఊరుకున్నాడు. 

    " ఏం కుమారా! అలా తల వేలాడదీసుకున్నావు? " అని పార్వతి ఆశ్చర్యపోతూ అడిగింది. 

    " అమ్మా! నేను సూర్యుడి చుట్టూరా తిరిగితే, అన్న సూర్యుణ్ణి తన చుట్టూరా త్రిప్పుకొంటున్నాడమ్మా! నిజం చెప్పాలంటే అన్న చేసినదే ఘనకార్యం " అన్నాడు కుమారస్వామి. 

    కొద్దిరోజుల తర్వాత పార్వతి మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. 

    " అమ్మా! సౌందర్యంలో నీకు సమఉజ్జీ అయిన సుందరి కనిపిస్తే పెళ్ళాడాలని ఉందమ్మా! " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    పార్వతి చురక తగిలినట్లు పెదవి కరచుకొని " అలాగైతే ఇంటి మొగసాల కూర్చొని, దారివెంట వచ్చి పోయేవాళ్ళను చూస్తూండరా, కుంకా! " అంటూ కదిలింది. 

    " అలాగే తల్లీ! నీ ఆజ్ఞ " అని వినాయకుడు వీధిలో కూర్చొని, కొంతసేపు తూర్పుకి, మరికొంతసేపు ఉత్తరంగా, అలాగా ఎనిమిది దిక్కులకూ ముఖం పెట్టి చూడసాగాడు. 

    పార్వతి అతని వింత చేష్టకు వింతగా చూసి, " ఏం నాయనా! కనిపించిందా? " అని అడిగింది. 

    విఘ్నేశ్వరుడు " అమ్మా! ఏ దిక్కు చూచినా నాకు మరేమీ కనిపించలేదు. జగజ్జననివైన నీవే ఎనిమిది చేతులతో ఎనిమిది దిక్కులా కనిపిస్తున్నావమ్మా! " అన్నాడు. 

    పార్వతి ఆనందంతో మైమరచిపోయింది. " నాయనా! విఘ్నరాజా! అందరు దేవుళ్ళూ తూర్పుముఖంగా ఉండి పూజలందుకోవాలని నియమం ఉందిగాని, నీవు ఎటు ముఖం పెట్టి ఉన్నా ఆరాధనీయుడివే! " అని వరం యిచ్చింది. అతని పెళ్ళిమాటే మర్చిపోయి, ముద్దుల కొడుకు మురిపెంపు మాటలు శివుడితో ఒకటికి రెండుసార్లు చెప్పిచెప్పి ఆనందించింది. 

    చివరకు పార్వతి పట్టుబట్టి పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. " అమ్మా! తమ్ముడు దేవసేనాధిపతి పదవిలో ఉన్నాడు. అతను యిద్దర్ని పెళ్ళాడినా తగును. నేను ఊరికే తింటూ కూర్చున్నాను. ఎలా పెళ్ళి చేసుకునేది? " అన్నాడు విఘ్నరాజు. 

    శివుడు " నువ్వు నా ప్రమథగణాలన్నిటికీ గణనాథుడివిగా ఉండు " అన్నాడు. 

    " నాన్నగారూ! ఉండమంటే సరా? అర్హత ఉండాలికదా! తమ్ముడు ఎలాగూ సేనాధిపత్యంలో ఆరితేరి ఉన్నవాడు, ఉండనే ఉన్నాడు గదా! " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    ప్రమథులు కుమారస్వామినే అభిమానించారు. శివుడు " లేదు నా గణాలకు గణనాథుడుగా విఘ్నేశ్వరుడే ఉండాలి. కుమారస్వామికి దేవసేనాధిపత్యం ఉండనే ఉంది. అదీగాక రెండు పనులు చూసుకోవడం శ్రమకూడా! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " నాన్నగారూ! ఏదైనా పరీక్షపెట్టి నెగ్గిన వారికే గణనాయకత్వం యివ్వడం సమంజసంగా ఉంటుందిగదా! " అన్నాడు. 

    దేవతులు, ప్రమథులు కలిసి ఒక పందెం పెట్టారు. ఈ భూమ్మీదున్న అన్ని క్షేత్రాల్ని, తీర్థాల్ని ఎవరు ముందు సేవించి తిరిగి వస్తారో వారు గెల్చినట్టు అని. 

    కుమారస్వామి నెమలిమీద ఎగిరి వెళ్ళాడు. వినాయకుడు చక్కా చతికిలబడి కూర్చున్నాడు. 

    అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతానికి తీసుకువెళ్ళి, " నాయనా! మేము నిన్ను అభిమానిస్తున్న వాళ్ళం. నీ ఓటమి మా దేవతలందరికీ ఓటమి అవుతుంది. మాకు తలవంపులు తేవడం నీకు భావ్యంకాదు. అదీగాక, తండ్రి గొప్పదనం తనయుడు నిరూపించితేనే జన్మ సార్ధకత అవుతుంది. నువ్వేమీ తిరగనక్కరలేదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు " అని విఘ్నేశ్వరుడి చెవిలో రహస్యం ఉపదేశించాడు. 

    పార్వతి " హమ్మయ్య " అనుకుంటూ విష్ణువును కృతజ్ఞతగా చూసింది. 

    విఘ్నేశ్వరుడు మఠం వేసి కన్నులు మూసి శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. 

    కుమారస్వామి వెళ్ళినచోటల్లా అంతకంటే ముందే విఘ్నేశ్వరుడు ఎలుకమీద వచ్చి తీర్థమాడి సేవించి వెళ్ళినట్లు తెలుసుకొని ఆశ్చర్యపడుతూ హతాశుడై తిరిగి వస్తూనే తాను ఓడిపోయినట్లూ, విఘ్నేశ్వరుడిదే విజయమని చెప్పాడు. 

    విఘ్నేశ్వరుడు తమ్ముడితో చేతులు కలిపి శివుడి వద్దకు తీసుకెళ్ళి " తమ్ముడూ ! నేను జయించనూ లేదు, నీవు ఓడనూ లేదు. మనం యిద్దరం నిమిత్తమాత్రులం. జయించింది నాన్నగారే! శివపంచాక్షరీ మహిమ అలాంటిది. గెలిచినది శివనామం. గెలిపించింది విష్ణువు " అని జరిగింది చెప్పాడు. 

    విఘ్నేశ్వరుడు, కుమారస్వామి చెరో పాదం పట్టుకొని తండ్రికి మ్రొక్కారు. 

    కుమారస్వామి అందరి మధ్య నిలబడి " విఘ్నేశ్వరుడికి ప్రమథగణాధిపత్య పట్టాభిషేకం సత్వరమే జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం " అని నొక్కి చెప్పాడు. 

    దేవతలు సంతోషించారు. సిద్ధ, సాధ్య, యక్ష, భూత గణాల వారంతా హర్షం ప్రకటించారు. ప్రమథగణ ప్రముఖులైన భృంగీశ్వర, శృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం వ్యతిరేకించారు. లోగడ పుత్రగణపతి రూపంలో వాళ్ళకు విఘ్నేశ్వరుడు శృంగభంగం చేశాడు. 

    ఆ అక్కసుతో వారు " కుమారస్వామికి తన బలాలు అంటూ దేవగణసేనలు ఉన్నాయి. మేము శివుని నమ్మినబంట్లుగా శివగణంగా మొదటినుంచీ పరిగణింపబడుతున్నాం. అటువంటప్పుడు విఘ్నేశ్వరుడు మాకు అదిపతి ఎలాగ అవుతాడు. గణపతి అనిపించుకోవడానికి కూడా అతనికి తనది అంటూ ఎలాంటి బలగమూ లేదు. గణాధిపత్య పట్టాభిషేకం దేనికి? " అని కుళ్ళు వెళ్ళబోసుకున్నారు. 

    శివుడు కళ్ళెర్రజేశాడు. " నా నిర్ణయాన్నే అధిక్షేపించగలంతగొప్పవారై పోయారా మీరు? " అని ప్రమథనాయకుల్ని ఈసడించుకున్నాడు.

    విఘ్నేశ్వరుడు శాంతంగా " ఔను ఔను నిజమే! నా గణాలు ఎక్కడ? ఏవీ? లేవు. లేవు కాబోలు! అన్నట్టు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొంత బలగం ఉన్నట్లు అనుమానం. ఆ గణాలు ఎక్కడ? ఎక్కడ? అని అరిచాడు. 

    అప్పుడు కోటానుకోట్ల విఘ్నేశ్వరుడిలాంటి వారు దిక్కులు ఈనినట్లు పుట్టుకొచ్చి దిక్కులు పిక్కటిల్లేలాగా జయజయధ్వానాలు చేస్తూ విఘ్నేశ్వరుడి బలాలుగా వచ్చి నిలుచున్నారు. 

    వారందరికీ తలా నాలుగు చేతులున్నాయి. నాలుగు చేతుల్లో అనేక ఆయుధాలు, పరికరాలు, చిత్రవిచిత్ర వస్తుజాలమూ ఉన్నాయి. కొందరి చేతుల్లో గంటాలు, లేఖినులు, కుంచెలు, రంగులు ఉంటే మరికొందరి చేతుల్లో శూలాలు, విల్లమ్ములు, కత్తులు, గదలు ఉన్నాయి. కొందరు కొడవళ్ళు, సుత్తులు, కత్తులు, రంపాలు, ఉలులు, శేనాలు పట్టుకొని ఉన్నారు. మరికొందరు వీణలు, మృదంగాలు, వేణువులు, డప్పులు వాయిస్తున్నారు. మూలికలు, ఔషధాలు, పానీయాలు, నాగళ్ళు, రాట్నాలు, నవరత్నాభరణాలు, పూలమాలలు, పండ్లు, తినుబండారాలు మొదలైన వెన్నెన్నో పట్టుకొని ఉన్నారు. వారిమధ్య దేవుళ్ళూ, దేవతలూ, ప్రమథాదిగణాలవాళ్ళు, బియ్యం రాశిలో రాళ్ళలా అక్కడక్కడ కనిపించారు. 

    విఘ్నేశ్వర రూపులు కొందరు ఆకాశంలో ఎగురుతూ అంతరిక్షానికి దూసుకుపోతున్నారు. ఆ గణాధిప గణాల చేతుల్లో ఛత్రచామరాలు, వీవనలు, వింజామరలు, ఆడుతున్నవి. ఆకాశంలో రెపరెపలాడుతున్న అరుణారుణ పతకాల్ని, ఇంకా అనేక రంగురంగుల ధ్వజాల్ని పట్టుకొని ఉన్నారు. వారు రత్నభూషితమైన పెద్ద భద్రసింహాసనాన్ని తెచ్చారు. విఘ్నేశ్వరుణ్ణి దానిపై కూర్చుండబెట్టి ఛత్రచామరాలు పట్టారు. శ్వేతఛత్రం ముత్యాల జాలరులతో ప్రకాశించింది. చిట్టెలుక సింహాసనం క్రింద చిందులు వేసింది. 

    పార్వతి మరొకసారి మళ్ళీ మైమరచి భద్రసింహాసనాశీనుడైన విఘ్నేశ్వరుడికి నమస్కరించబోయింది. " అమ్మా! అమ్మా! వద్దు. నీ ముద్దుల కుమారుణ్ణి " అని విఘ్నేశ్వరుడు వారిస్తూ చేతులూపేసరికి అంతా అదృశ్యమై విఘ్నేశ్వరుడు ఒక్కడూ వినయంగా తల్లికి ప్రణమిల్లాడు. 

    " విఘ్నేశ్వరా! " అన్న పిలుపు శంఖధ్వనిలా వినిపించింది. ఆ పిలిచింది విష్ణువు. విఘ్నేశ్వరుడు అటు చూడకుండానే " నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు " అన్నాడు 

    " నీకు తెలిసినా అది అందరకూ కూడా తెలియాలి కదా! అదే చెబుతున్నాను " అంటూ విష్ణువు " విఘ్నేశ్వరుడి పెళ్ళి వేయి విఘ్నాల సామెతగా విఘ్నేశ్వరుడు కల్పించుకొన్న విఘ్నాలు ఇప్పటికి వెయ్యీ పూర్తయ్యాయి. ఇటు పైని విఘ్నం కల్పించుకోవడానికి వీల్లేదు. కల్పించుకున్నా చెల్లదు " అని గట్టిగా పలికాడు. 



  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...