:: ప్రమథగణాధిపత్యం ::
కుమారస్వామికి తన పెళ్ళి ఆగిపోవడానికి కారణమైన విఘ్నేశ్వరుడి మీద గుర్రుగా ఉంది.
ఒకనాడు అతడు తల్లితో " వాజమ్మ గాక జేజెమ్మ ఎలాగౌతాడమ్మా! అన్న. నలుగుముద్ద తిండిముద్దకే గాని ఘనకార్యం చేయగలడా? " అన్నాడు ఎకసెక్కెంగా.
వినాయకుడు గుడ్ల నీరు బెట్టుకొని " చూడమ్మా! తమ్ముడు ఎంతలేసి మాటలంటున్నాడో " అంటూ ఏడ్చినంత పని చేశాడు.
పార్వతికి కూడా కోపం వచ్చింది. వినాయకుణ్ణి అక్కున చేర్చుకొని బుజ్జగిస్తూ " నాన్నా! నేను చేసిన బొమ్మవని వీళ్ళకు అక్కసురా! తండ్రి చంపనే చంపేశాడు. తమ్ముడు ఇలాగ దెప్పుతున్నాడు. పోనీలే. వాళ్ళ అజ్ఞానం వాళ్ళకే తలవంపు " అంది.
" తమ్ముడు అజ్ఞాని అయితే అవుతాడు గాని, నాన్నకు అజ్ఞానం ఏమిటమ్మా! నీ పిచ్చిగాని....." అన్నాడు గణపతి ఆశ్చర్యంగా.
పార్వతి ఏదో తలంచుకొని " నాకు కాదురా పిచ్చి, ఆ శంకర మహాదేవుడికే పిచ్చి ఎక్కి విష్ణుదేవుడి జగన్మోహిని అవతారం వెంటబడి నవ్వులపాలవలేదా ఏమిటి? " అన్నది.
" ఆ తర్వాతేం జరిగిందమ్మా? " అన్నాడు గణపతి.
" ఏదో ఘోరమే జరిగింది. వాళ్ళిద్దరి మధ్యా ఒక భైరవుడనే కారుచీకటిలాంటి భూత పిల్లడు పుట్టాడుట " అంది తల్లి.
" భైరవు డెక్కడుంటాడమ్మా? వాణ్ణి చూడాలని ఉంది " అన్నాడు కొడుకు.
" ఎక్కడో ఉంటాడు. నల్లటి బట్టలు కడతాడట. వాడి దగ్గరకు పొరబాటున కూడా వెళ్ళకుసుమీ! " అంది పార్వతి.
" ఝడుసుకోవడమంటే ఏమిటమ్మా? అదికూడా తెలుసుకోవద్దూ? " అన్నాడు గణపతి.
" పెళ్ళాడితే తెలుస్తుంది " అంది పార్వతి.
" అదీ సంగతి. భార్యా రత్నాలు అంటే అంత భయంకరం అన్నమాట. అందుకే నేను పెళ్ళిచేసుకోనమ్మా! " అన్నాడు గణేశుడు.
కుమారస్వామి అందుకొని " అదే నీ ఘనకార్యం. నేను యిప్పుడే పోయి సూర్యుణ్ణి చుట్టి వస్తాను " అంటూ నెమలినెక్కి తుర్రుమన్నాడు.
విఘ్నేశ్వరుడు తిన్నగా వెళ్ళి మేరుపర్వతం ఎక్కి చిట్టచివర శిఖరాగ్రం మీద కూర్చున్నాడు.
మేరుపర్వతం చుట్టూరా సూర్యుడు తిరుగుతూంటాడు. అక్కడ సూర్యాస్తమయం అనేది ఉండదు.
కుమారస్వామి శ్రమపడి సూర్యుడి చుట్టూరా ప్రదక్షిణం చేసి వచ్చి అన్న మేరుపర్వతం ఎక్కి కూర్చున్నాడని తెలుసుకొని, విచారంగా ముఖం వేలవేసి ఊరుకున్నాడు.
" ఏం కుమారా! అలా తల వేలాడదీసుకున్నావు? " అని పార్వతి ఆశ్చర్యపోతూ అడిగింది.
" అమ్మా! నేను సూర్యుడి చుట్టూరా తిరిగితే, అన్న సూర్యుణ్ణి తన చుట్టూరా త్రిప్పుకొంటున్నాడమ్మా! నిజం చెప్పాలంటే అన్న చేసినదే ఘనకార్యం " అన్నాడు కుమారస్వామి.
కొద్దిరోజుల తర్వాత పార్వతి మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెచ్చింది.
" అమ్మా! సౌందర్యంలో నీకు సమఉజ్జీ అయిన సుందరి కనిపిస్తే పెళ్ళాడాలని ఉందమ్మా! " అన్నాడు విఘ్నేశ్వరుడు.
పార్వతి చురక తగిలినట్లు పెదవి కరచుకొని " అలాగైతే ఇంటి మొగసాల కూర్చొని, దారివెంట వచ్చి పోయేవాళ్ళను చూస్తూండరా, కుంకా! " అంటూ కదిలింది.
" అలాగే తల్లీ! నీ ఆజ్ఞ " అని వినాయకుడు వీధిలో కూర్చొని, కొంతసేపు తూర్పుకి, మరికొంతసేపు ఉత్తరంగా, అలాగా ఎనిమిది దిక్కులకూ ముఖం పెట్టి చూడసాగాడు.
పార్వతి అతని వింత చేష్టకు వింతగా చూసి, " ఏం నాయనా! కనిపించిందా? " అని అడిగింది.
విఘ్నేశ్వరుడు " అమ్మా! ఏ దిక్కు చూచినా నాకు మరేమీ కనిపించలేదు. జగజ్జననివైన నీవే ఎనిమిది చేతులతో ఎనిమిది దిక్కులా కనిపిస్తున్నావమ్మా! " అన్నాడు.
పార్వతి ఆనందంతో మైమరచిపోయింది. " నాయనా! విఘ్నరాజా! అందరు దేవుళ్ళూ తూర్పుముఖంగా ఉండి పూజలందుకోవాలని నియమం ఉందిగాని, నీవు ఎటు ముఖం పెట్టి ఉన్నా ఆరాధనీయుడివే! " అని వరం యిచ్చింది. అతని పెళ్ళిమాటే మర్చిపోయి, ముద్దుల కొడుకు మురిపెంపు మాటలు శివుడితో ఒకటికి రెండుసార్లు చెప్పిచెప్పి ఆనందించింది.
చివరకు పార్వతి పట్టుబట్టి పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. " అమ్మా! తమ్ముడు దేవసేనాధిపతి పదవిలో ఉన్నాడు. అతను యిద్దర్ని పెళ్ళాడినా తగును. నేను ఊరికే తింటూ కూర్చున్నాను. ఎలా పెళ్ళి చేసుకునేది? " అన్నాడు విఘ్నరాజు.
శివుడు " నువ్వు నా ప్రమథగణాలన్నిటికీ గణనాథుడివిగా ఉండు " అన్నాడు.
" నాన్నగారూ! ఉండమంటే సరా? అర్హత ఉండాలికదా! తమ్ముడు ఎలాగూ సేనాధిపత్యంలో ఆరితేరి ఉన్నవాడు, ఉండనే ఉన్నాడు గదా! " అన్నాడు విఘ్నేశ్వరుడు.
ప్రమథులు కుమారస్వామినే అభిమానించారు. శివుడు " లేదు నా గణాలకు గణనాథుడుగా విఘ్నేశ్వరుడే ఉండాలి. కుమారస్వామికి దేవసేనాధిపత్యం ఉండనే ఉంది. అదీగాక రెండు పనులు చూసుకోవడం శ్రమకూడా! " అన్నాడు.
విఘ్నేశ్వరుడు " నాన్నగారూ! ఏదైనా పరీక్షపెట్టి నెగ్గిన వారికే గణనాయకత్వం యివ్వడం సమంజసంగా ఉంటుందిగదా! " అన్నాడు.
దేవతులు, ప్రమథులు కలిసి ఒక పందెం పెట్టారు. ఈ భూమ్మీదున్న అన్ని క్షేత్రాల్ని, తీర్థాల్ని ఎవరు ముందు సేవించి తిరిగి వస్తారో వారు గెల్చినట్టు అని.
కుమారస్వామి నెమలిమీద ఎగిరి వెళ్ళాడు. వినాయకుడు చక్కా చతికిలబడి కూర్చున్నాడు.
అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతానికి తీసుకువెళ్ళి, " నాయనా! మేము నిన్ను అభిమానిస్తున్న వాళ్ళం. నీ ఓటమి మా దేవతలందరికీ ఓటమి అవుతుంది. మాకు తలవంపులు తేవడం నీకు భావ్యంకాదు. అదీగాక, తండ్రి గొప్పదనం తనయుడు నిరూపించితేనే జన్మ సార్ధకత అవుతుంది. నువ్వేమీ తిరగనక్కరలేదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు " అని విఘ్నేశ్వరుడి చెవిలో రహస్యం ఉపదేశించాడు.
పార్వతి " హమ్మయ్య " అనుకుంటూ విష్ణువును కృతజ్ఞతగా చూసింది.
విఘ్నేశ్వరుడు మఠం వేసి కన్నులు మూసి శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు.
కుమారస్వామి వెళ్ళినచోటల్లా అంతకంటే ముందే విఘ్నేశ్వరుడు ఎలుకమీద వచ్చి తీర్థమాడి సేవించి వెళ్ళినట్లు తెలుసుకొని ఆశ్చర్యపడుతూ హతాశుడై తిరిగి వస్తూనే తాను ఓడిపోయినట్లూ, విఘ్నేశ్వరుడిదే విజయమని చెప్పాడు.
విఘ్నేశ్వరుడు తమ్ముడితో చేతులు కలిపి శివుడి వద్దకు తీసుకెళ్ళి " తమ్ముడూ ! నేను జయించనూ లేదు, నీవు ఓడనూ లేదు. మనం యిద్దరం నిమిత్తమాత్రులం. జయించింది నాన్నగారే! శివపంచాక్షరీ మహిమ అలాంటిది. గెలిచినది శివనామం. గెలిపించింది విష్ణువు " అని జరిగింది చెప్పాడు.
విఘ్నేశ్వరుడు, కుమారస్వామి చెరో పాదం పట్టుకొని తండ్రికి మ్రొక్కారు.
కుమారస్వామి అందరి మధ్య నిలబడి " విఘ్నేశ్వరుడికి ప్రమథగణాధిపత్య పట్టాభిషేకం సత్వరమే జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం " అని నొక్కి చెప్పాడు.
దేవతలు సంతోషించారు. సిద్ధ, సాధ్య, యక్ష, భూత గణాల వారంతా హర్షం ప్రకటించారు. ప్రమథగణ ప్రముఖులైన భృంగీశ్వర, శృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం వ్యతిరేకించారు. లోగడ పుత్రగణపతి రూపంలో వాళ్ళకు విఘ్నేశ్వరుడు శృంగభంగం చేశాడు.
ఆ అక్కసుతో వారు " కుమారస్వామికి తన బలాలు అంటూ దేవగణసేనలు ఉన్నాయి. మేము శివుని నమ్మినబంట్లుగా శివగణంగా మొదటినుంచీ పరిగణింపబడుతున్నాం. అటువంటప్పుడు విఘ్నేశ్వరుడు మాకు అదిపతి ఎలాగ అవుతాడు. గణపతి అనిపించుకోవడానికి కూడా అతనికి తనది అంటూ ఎలాంటి బలగమూ లేదు. గణాధిపత్య పట్టాభిషేకం దేనికి? " అని కుళ్ళు వెళ్ళబోసుకున్నారు.
శివుడు కళ్ళెర్రజేశాడు. " నా నిర్ణయాన్నే అధిక్షేపించగలంతగొప్పవారై పోయారా మీరు? " అని ప్రమథనాయకుల్ని ఈసడించుకున్నాడు.
విఘ్నేశ్వరుడు శాంతంగా " ఔను ఔను నిజమే! నా గణాలు ఎక్కడ? ఏవీ? లేవు. లేవు కాబోలు! అన్నట్టు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొంత బలగం ఉన్నట్లు అనుమానం. ఆ గణాలు ఎక్కడ? ఎక్కడ? అని అరిచాడు.
అప్పుడు కోటానుకోట్ల విఘ్నేశ్వరుడిలాంటి వారు దిక్కులు ఈనినట్లు పుట్టుకొచ్చి దిక్కులు పిక్కటిల్లేలాగా జయజయధ్వానాలు చేస్తూ విఘ్నేశ్వరుడి బలాలుగా వచ్చి నిలుచున్నారు.
వారందరికీ తలా నాలుగు చేతులున్నాయి. నాలుగు చేతుల్లో అనేక ఆయుధాలు, పరికరాలు, చిత్రవిచిత్ర వస్తుజాలమూ ఉన్నాయి. కొందరి చేతుల్లో గంటాలు, లేఖినులు, కుంచెలు, రంగులు ఉంటే మరికొందరి చేతుల్లో శూలాలు, విల్లమ్ములు, కత్తులు, గదలు ఉన్నాయి. కొందరు కొడవళ్ళు, సుత్తులు, కత్తులు, రంపాలు, ఉలులు, శేనాలు పట్టుకొని ఉన్నారు. మరికొందరు వీణలు, మృదంగాలు, వేణువులు, డప్పులు వాయిస్తున్నారు. మూలికలు, ఔషధాలు, పానీయాలు, నాగళ్ళు, రాట్నాలు, నవరత్నాభరణాలు, పూలమాలలు, పండ్లు, తినుబండారాలు మొదలైన వెన్నెన్నో పట్టుకొని ఉన్నారు. వారిమధ్య దేవుళ్ళూ, దేవతలూ, ప్రమథాదిగణాలవాళ్ళు, బియ్యం రాశిలో రాళ్ళలా అక్కడక్కడ కనిపించారు.
విఘ్నేశ్వర రూపులు కొందరు ఆకాశంలో ఎగురుతూ అంతరిక్షానికి దూసుకుపోతున్నారు. ఆ గణాధిప గణాల చేతుల్లో ఛత్రచామరాలు, వీవనలు, వింజామరలు, ఆడుతున్నవి. ఆకాశంలో రెపరెపలాడుతున్న అరుణారుణ పతకాల్ని, ఇంకా అనేక రంగురంగుల ధ్వజాల్ని పట్టుకొని ఉన్నారు. వారు రత్నభూషితమైన పెద్ద భద్రసింహాసనాన్ని తెచ్చారు. విఘ్నేశ్వరుణ్ణి దానిపై కూర్చుండబెట్టి ఛత్రచామరాలు పట్టారు. శ్వేతఛత్రం ముత్యాల జాలరులతో ప్రకాశించింది. చిట్టెలుక సింహాసనం క్రింద చిందులు వేసింది.
పార్వతి మరొకసారి మళ్ళీ మైమరచి భద్రసింహాసనాశీనుడైన విఘ్నేశ్వరుడికి నమస్కరించబోయింది. " అమ్మా! అమ్మా! వద్దు. నీ ముద్దుల కుమారుణ్ణి " అని విఘ్నేశ్వరుడు వారిస్తూ చేతులూపేసరికి అంతా అదృశ్యమై విఘ్నేశ్వరుడు ఒక్కడూ వినయంగా తల్లికి ప్రణమిల్లాడు.
" విఘ్నేశ్వరా! " అన్న పిలుపు శంఖధ్వనిలా వినిపించింది. ఆ పిలిచింది విష్ణువు. విఘ్నేశ్వరుడు అటు చూడకుండానే " నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు " అన్నాడు
" నీకు తెలిసినా అది అందరకూ కూడా తెలియాలి కదా! అదే చెబుతున్నాను " అంటూ విష్ణువు " విఘ్నేశ్వరుడి పెళ్ళి వేయి విఘ్నాల సామెతగా విఘ్నేశ్వరుడు కల్పించుకొన్న విఘ్నాలు ఇప్పటికి వెయ్యీ పూర్తయ్యాయి. ఇటు పైని విఘ్నం కల్పించుకోవడానికి వీల్లేదు. కల్పించుకున్నా చెల్లదు " అని గట్టిగా పలికాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి