:: నారదుడికి 60 మంది పిల్లలు ఎలా పుట్టారు? ::
ఒకసారి నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది. "స్వామీ! ఈ సంసార మాయ అంటే ఏమిటి? నాలాంటి బ్రహ్మచారిని అది ఏమీ చేయలేదు కదా!" అని విష్ణుమూర్తిని కొంచెం గర్వంగా అడిగాడు. విష్ణుమూర్తి నవ్వి, "నారదా! సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది, రా ఒకసారి భూలోకానికి వెళ్దాం" అని నారదుడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు.
అలా వెళ్తుండగా ఒక అడవిలో విష్ణుమూర్తి అలసిపోయినట్లు నటిస్తూ, "నారదా! దాహంగా ఉంది, ఆ సరస్సు నుండి కొంచెం నీరు తీసుకురా" అని కమండలాన్ని ఇచ్చాడు. నారదుడు సరస్సు దగ్గరకు వెళ్లి, ముఖం కడుక్కుందామని ఆ నీటిలో మునిగాడు. అంతే! విష్ణుమాయ మొదలైంది. నీటిలోంచి బయటకు వచ్చేసరికి నారదుడు తన గతాన్ని మర్చిపోయి, ఒక అందమైన స్త్రీగా (నారదిగా) మారిపోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక రాజు ఆమెను చూసి మోహించి వివాహం చేసుకున్నాడు.
నారది ఆ రాజుతో సంసార జీవితం గడుపుతూ, ఏకంగా 60 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కొన్నేళ్ల తర్వాత ఆ రాజ్యంపై యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారది కళ్లముందే భర్త, 60 మంది కొడుకులు చనిపోయారు. పుట్టెడు దుఃఖంతో నారది చితి మంటల్లో దూకబోతుండగా... విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, "అమ్మా! ఎందుకు అంత బాధ? ముందు ఆ సరస్సులో స్నానం చేసి రా" అన్నాడు.
నారది ఆ సరస్సులో మునిగి పైకి లేచేసరికి, మళ్లీ పాత నారద మహర్షిలా మారిపోయాడు! ఎదురుగా విష్ణుమూర్తి నిలబడి నవ్వుతూ, "నారదా! నీరు తెచ్చావా? దాహంగా ఉంది" అన్నాడు. అప్పుడు నారదుడికి అర్థమైంది... తాను గడిపిన ఆ సంసారం, ఆ పిల్లలు అంతా విష్ణుమాయ అని! అప్పుడు శ్రీహరి నారదుడిని ఓదారుస్తూ, "నారదా! నీకు పుట్టిన ఆ 60 మంది పిల్లలు కాలక్రమంలో శాశ్వతంగా నిలిచిపోతారు" అని వరమిచ్చాడు.
ఆ 60 మంది పిల్లల పేర్లే... ఈరోజు మనం పిలుచుకుంటున్న ప్రభవ నుండి క్షయ వరకు గల 60 తెలుగు సంవత్సరాల పేర్లు. మాయ అంటే ఏంటో నారదుడికి తెలిసొచ్చిన సందర్భం ఇది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి