30, సెప్టెంబర్ 2025, మంగళవారం

:: కుమారస్వామి జననం ::  

    " విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూంటాయి. ముందుకాలంలో ప్రజల స్వేచ్ఛ, శ్రేయస్సులకోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జయప్రదంగా కొనసాగి ఫలిస్తాయి. ఉత్సవాలన్నిటికి గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది " అని ఆకాశవాణి పలికింది. 

    విష్ణువు విఘ్నేశ్వరుడితో " పార్వతీ నందనా! మేనల్లుడివని చెప్పి నాకు మరొక పనికూడా కల్పించావా! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " మేనమామ వరసపెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి, చంపుతావుగదా! ఇలాంటి వరసలన్నీ నీవు నేర్పిన విద్యలేగదా! నీరజాక్ష! " అన్నాడు. 

    విష్ణువు " విఘ్ననాశకా! నీ పరశువుముందు నా చక్రాయుధం ఏపాటి? నీ గొడ్డలి సాము చూసినప్పుడు మహముచ్చటేసిందిసుమా! " అన్నాడు. 

    " పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకెళ్ళి గర్వపోతులైన క్షత్రియుల్ని తెగనరుకుదువుగానిలే " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    విష్ణువు " గజవిఘ్నాసురుడిమీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీ బుడిబుడి నడకల గుజ్జురూపం కూడా నన్నెంతో మురిపించిందోయ్ " అన్నాడు. 

    " అలాగైతే,వామనుడవై బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కుదువుగానిలే " అని విఘ్నేశ్వరుడు అన్నాడు . 

    " నీ బుద్ధి విశేషం గూడా నన్ను అమితంగా ఆకర్షించుతోంది. ఏం చెయ్యను? " అని విష్ణువు అనగా, విఘ్నేశ్వరుడు " ఏ యుగానికి అవసరమైన ధర్మాన్ని,  ఆ యుగంలో స్థాపించడమేగదా, నీ అవతారాలకు మూలకారణం. ధర్మ సంస్థాపనకు అసలు అర్థం సంఘం హింసతో, మూఢాచారాలతో కుళ్ళిపోతున్న రోజుల్లో బుద్ధుడవై మానవులకు సక్రమ సంఘ జీవనాన్ని, నిర్వాణాన్ని బోధించుతావులే! మాయాదేవి స్వప్నంలో నా తెల్లని ఏనుగురూపం గర్భంలో ప్రవేశించి బుద్ధుడైన సిద్ధార్థుడి అవతారానికి నాంది పలుకుతుంది " అని చెప్పాడు. 

    విష్ణువు మహదానందం పొందాడు. 

    పరమాణు రూపంలో ఉన్న విఘ్నం " విఘ్నరాజా! నీ బానిసను. నీ ఆజ్ఞానువర్తిని. వెడుతున్నాను " అని శలవు తీసుకొని కాళింది మడుగుజేరి కాళియుడుగా దాక్కుంది. 

    విఘ్నం వెనుకనే మూషికాసురుడు మూషికరూపంతో వచ్చి ప్రచ్ఛన్నంగా దాగి, విఘ్నానికి పట్టిన గతిచూసి పటపట పళ్ళుకొరికి, నిజరూపంతో బోరవిరుచుకొని విఘ్నేశ్వరుడి ముందు నిలబడి సింహనాదం చేశాడు.

    విఘ్నేశ్వరుడు బలిష్ఠమైన అతని శరీరాన్ని సంతృప్తిగా చూశాడు. మూషికాసురుడు నిర్లక్ష్యంగా విషపు నవ్వు నవ్వుతూ, " విఘ్నం నీ బానిస గనుక ఏం చేసినా చేశావుగాని, నేను నీ జన్మ విరోధిని. సింహస్వప్నం అనే మాట వినే ఉంటావు. సింహాన్నై నీ కుంభస్తలాన్ని చీలుస్తాను " అని అంటూ సింహంగా మారి పెద్దగా గర్జించాడు. 

    విఘ్నేశ్వరుడు " సింహమా! నువ్వు జగజ్జనని వాహనానివి. నిన్ను గౌరవిస్తున్నాను " అన్నాడు. 

    సింహం మళ్ళీ గర్జించి ఉరకబోతూంటే, విఘ్నేశుడు " శివా, శరభా! " అని స్మరించాడు. 

    సింహానికెదురుగా శివుని శరభావతారం ఘీంకార గర్జనలు చేస్తూ నిలిచింది. శరభానికి సింహ శరీరము, కేసరాలు, కోరలు ఉంటూ ఏనుగు తొండము, దంతాలు ఉన్నాయి. మహాసర్పంలాంటి తోక, చివర జ్వాలలు కక్కే మఖరముఖము ఉంది. శరభం జూలు అగ్నిశిఖల్లాగా ఎగురుతోంది. శరభం తొండంతో సింహం ముఖం వాచేలా కొట్టింది. సింహం తోకముడిచి పరుగుతీసింది. శరభావతారం మాయమయింది. 

    విఘ్నేశ్వరుడు తొండాన్ని యోజనం పొడవున సాగదీసి సింహం నడుము చుట్టుపట్టి ఎత్తాడు. సింహం కిరకిర లాడింది. ఆ సమయంలో ఆకాశ గమనం చేస్తున్న నారదుడు ' సా' అని గొంతు సాగదీస్తూ " సామజవరవదనా " అంటూ హిందోళ రాగాన్ని ఆలాపించాడు. 

    దేవతలు గుమిగూడి ఆకాశంనుండి వింత చూస్తున్నారు. విష్ణువు " విజయవిఘ్నేశ్వరా! నువ్వు పట్టిన సింహాన్ని పెంచుకుంటాను. యివ్వవూ? " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నవ్వి " పెంచినట్టే పెంచి తలా, గోళ్ళు తీసుకొని నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి చీలుద్దామనా? అదేం కుదరదు. ఈ మృగరాజు అవసరం నాకు ఉంది. నీ నరసింహావతారం నీవు చూసుకోవలసిందే " అన్నాడు. 

    తొండం మూషికాసుర సింహాన్ని తిన్నగా తీసుకెళ్ళి మహాశ్వేతముందు విడిచి అదృశ్యమయింది. మహాశ్వేత భర్తకు హితవు చెప్పినా వినకుండా నిజరూపంతో విఘ్నేశ్వరుడితో ఢీకొనడానికి పరుగుతీశాడు. మహాశ్వేత దేవిని ప్రార్థించింది. దేవి కనిపించి " నీ భర్త విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనంగా చిరంజీవిగా ఉంటాడు. అలా రాసిపెట్టి ఉంది. నీవు కూడా శ్వేత ఛత్రానివై నీ భర్తతో పాటు కలకాలం విఘ్నేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటావు " అనిచెప్పి అంతర్థానమయింది. 

    వజ్రదంతుడు కామరూపి గనుక, ఈసారి ఏనుగుల్ని తన్నుకుపోగల గండభేరుండ పక్షి రూపంతో, దారిలో కనుపించిన రెండు ఏనుగుల్ని గోళ్ళతో పట్టుకొని ఎగిరి వెడుతూండగా చెలరేగిన అలజడికి, చిన్న గ్రద్ద రూపంతో ఒక చెట్టుమీద హరిని ధ్యానిస్తూ ఉన్న గరుత్మంతుడికి ధ్యాన భంగమయింది. కోపంతో గ్రద్ద గండభేరుండాన్ని ముక్కుతో పొడిచింది. ఆ పోటుకు వజ్రదంతుడు నిజరూపంతో నేలకూలాడు. 

    గరుత్మంతుడు " ఇంతకంటే రుచికరమైన ములుకుపోట్లు తినబోతున్నావు. వెళ్ళు " అంటూ ఎగిరిపోయాడు. 

    మూషికాసురుడు వెళ్ళి విఘ్నేశ్వరుడితో " నీకూ ఉన్నాయి పెద్ద దంతాలు. వెలక్కాయలు నొక్కి తినడానికి తప్ప మరెందుకూ పనికి రావు. నా దంష్ట్రలతో వజ్రాల్ని పిండి చేస్తాను. కైలాసాన్ని గుల్ల చేస్తాను. తెలుసునా? " అన్నాడు. 

    వినాయకుడు దిక్కులు చూస్తూ, తనలో తాను గొణుక్కుంటూన్నట్లుగా " ఔనౌను. ఎందుకూ కొరగాని దంతాలు ఉండి ఎందుకూ? " అంటూ ఒక దంతాన్ని పటుక్కున సగానికి విరచి, పారేసినట్టుగా విసిరేశాడు. 

    ఆ దంతం గాలిలో గిర్రున తిరుగుతూ ఇంద్రజాలం ప్రదర్శించి వెళ్ళి వజ్రదంతుణ్ణి గుచ్చి గుచ్చి పొడవడం ప్రారంభించింది. రక్తం ధారలుకట్టి కారసాగింది. మహాశ్వేత అది చూడలేక మూర్ఛ పోయింది. వజ్రదంతుడు చిన్న ఎలుకగా మారి తుర్రున పారిపోయి రాళ్ళ మధ్య కలుగు చేసుకొని దూరాడు. ఒక దంతాన్ని విరుచుకొని విఘ్నేశ్వరుడు ఏకదంతు డనిపించు కొన్నాడు. 

    దంతంకూడా కలుగులో దూరి ఎలుకను అలా పొడుస్తూనే వెంబడించింది. 

    తోకవెంట రక్తం జాడకడుతూంటే ఎలుక సొరంగం దొల్చుకొంటూ పాతాళానికి, పాతాళం నుంచి భూమ్మీదకు వచ్చి పరుగులుతీసి లోకమంతా చుట్టి చివరకు విఘ్నేశ్వరుడి శరణుజొచ్చి " నాకా చావు రాదు. నీ దంతం గుచ్చి గుచ్చి చంపుతున్నది. బాధతప్పించు దేవా! " అని వేడుకున్న మూషికాసురుడికి విఘ్నేశ్వరుడు అభయం యిచ్చాడు. దంతం వచ్చి అతని హస్తం అలంకరించింది. 

    విఘ్నేశ్వరుడు " మూషికా! చూట్టానికి చిట్టెలుకవే కాని, మహాబలుడివి. మహాకూర్మావతారంతో మంధరపర్వతాన్ని, ఆదివరాహావతారంతో భూమిని ఎత్తిన విష్ణువుకంటే బలశాలివి. తగిన వాహనం కుదరక నేను నా లంబోదరంతో నడవలేక అవస్థ పడుతున్నాను. నీలాంటి...." అంటూ చెప్పటానికి సందేహిస్తున్నట్టు నసిగాడు. 

    విఘ్నేశ్వరుని పొగడ్తకు మూషికాసురుడు పొంగిపోయి " స్వామీ! నీ దంతం నాలోని అజ్ఞానాన్ని పారదోలి గుచ్చి గుచ్చి జ్ఞానాన్ని నింపింది. నీకు వాహనం కావడం నా భాగ్యంగా భావిస్తున్నాను " అంటూ ఏనుగంత ఎలుకగా పెరిగాడు. 

    విఘ్నేశ్వరుడు దానిపై కాలుమోపి కూర్చోబోగా మహామూషికం కీచుకీచుమంటూ అణుక్కుపోయింది. 

    విఘ్నేశ్వరుడు " నాయనా! మూషికా! నీవు చిట్టెలుకగా ఉంటేనే నన్ను సునాయాసంగా మోయగలవు. నా ఆకారానికి చిట్టెలుక వాహనమే అన్ని విధాలా అమరుతుంది " అన్నాడు. 

    మూషికాసురుడు యధాప్రకారంగా చిట్టెలుకగా తగ్గిపోయాడు. విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకొని చకచకా చుట్టూరా తిరుగుతూ " ఔను స్వామీ! ఇప్పుడు నిన్ను మోస్తున్నట్టే లేదు " అన్నాడు. 

    మూర్ఛనుండి తేరుకున్న ధవళ విఘ్నేశ్వరుడికి నమస్కరించి " దేవా! నా భర్త నీకు చిట్టెలుక వాహనంగా ఉంటాడు. నేనుకూడా నీకు శ్వేత ఛత్రమై ఉంటాను. ఈ వరం అనుగ్రహించు " అన్నది. 

    విఘ్నేశ్వరుడు " అమ్మా! నీ తెల్లని గొడుగు చల్లని నీడ నాకు రక్ష. నా భాగ్యంకొద్దీ దొరికింది " అంటూ ఎలుకను చూసి, వజ్రదంతా! దేవి అనుగ్రహం పొందిన సాధ్వి ధవళ మాటకు తిరుగులేదు. నా వాహనంగా ఉండు. నాతోబాటే నాకు పెట్టేవన్నీ నువూ తిను. అందరూ మొట్టికాయలు పెట్టుకొని, మూడు గుంజీలు తీసి లెంపలేసుకుంటూంటే తృప్తిగా ఉంటుంది.  నాముందు నీముందు కూడా అలాగే అంతా చేస్తూంటారు " అన్నాడు.

    " ఔను దేవా! నేనూ అలానే కోరదామనుకున్నాను. నేను వజ్రదంతుడిగా నా ముందర దేవతల చేత అలాగే చేయిస్తూండేవాణ్ణి. నీ వాహనాన్నై కృతార్థుడనయ్యాను " అని మూషికుడన్నాడు. 

    ధవళ తెల్లని గొడుగుగా విఘ్నేశ్వరుడిపై నిలిచింది. ఆ దంపతులు చిరంజీవులై వినాయకుణ్ణి అలాగే సేవిస్తూంటారు. విఘ్నేశ్వరుడు మూషికవాహనుడయ్యాడు. 

    విష్ణువు విఘ్నేశ్వరుడితో " ఏకదంతా! మూషికోత్తమవాహనా! నీ వాహనం చూస్తే నాకు అసూయగా ఉందోయి. ఎంత మంచి వాహనాన్ని సంపాదించావు! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " నీ కల్కి అవతారంలో నా వాహనం నీకు తెల్లని గుర్రమై అంతరిక్షాన్ని దాటి గ్రహాంతరాలకు తీసుకు వెళ్తుందిలే. మానవులకు క్రొత్త వలస రాజ్యాలు సమకూర్చు " అన్నాడు. 

    విష్ణువు " ఆహాహా! నీ నోటి చలవ వల్ల అలాగే జరగాలి " అని ఆనందించాడు. 

    నారదుడు " విజయవిఘ్నేశ్వరా! ఇప్పటికి నీతోబాటే విష్ణువు తొమ్మిది అవతారాలు తెలిశాయి. ఒక్కటి మిగిలింది " అన్నాడు. 

    విష్ణువు నారదుణ్ణి చూసి కన్నుగీటి, " త్వరలోనే  ఆ కళ్యాణ ఘడియ వచ్చినపుడు అదీ తెలుస్తుందిలే. తొందరెందుకు " అన్నాడు. 

    " ఎవరి కళ్యాణం దేవా? " అని అడిగాడు నారదుడు. 

    " మన కళ్యాణ చక్రవర్తి విజయవిఘ్నేశ్వరుడిదే " అన్నాడు విష్ణువు. 

    విఘ్నేశ్వరుడు చిరుకోపంగా చూశాడు. 

    " వెయ్యి విఘ్నాలు కల్పించుకోక తప్పదు " అని గట్టిగా అనుకున్నాడు. 

    " నాయన్నాయన! అంతటితో సరిపెట్టు. వెయ్యి విఘ్నాలు పూర్తయ్యాక అర విఘ్నం అయినా కల్పించుకోడానికి చెల్లేదు లేదు సుమా! " అని విష్ణువు హెచ్చరించాడు.

    నారదుడు " వెయ్యి విఘ్నాలనగా ఏ మాత్రం? వెయ్యి విఘ్నాల తర్వాత విఘ్నేశ్వరుడి పెళ్ళి తప్పదు-తప్పదు" సరిసరిమాగరి అని పాడుతూ ముల్లోకాలూ తిరిగాడు. 

    శివుడికి పార్వతిపై గల మోహానురాగం తేజస్సుగా మారింది. అగ్నిదేవుడు దాన్ని తీసుకెళ్ళి శరవణ సరస్సు చేరేలాగా చేశాడు. ఆరు ముఖాలతో కుమారస్వామి అవతరించాడు. ఆరుగురు ఋషిభార్యలు అతణ్ణిపెంచి పార్వతీ పరమేశ్వరులకు అప్పగించారు. కుమారస్వామి పెరిగి పెద్దవాడయ్యాడు. గరుత్మంతుడు అతడికి నెమలి వాహనం యిచ్చాడు. ఇంద్రుడు అతడికి ఎన్నో ఆయుధాలు ఇచ్చాడు. పార్వతి శక్తిబళ్ళాణ్ణి యిచ్చింది. కుమారస్వామి పెరిగి పెద్ద అవుతూంటే తారకాసురుడు తల్లడిల్లిపోతూ భయంతో పీడకలలు కనసాగాడు. 

    కుమారస్వామి గొప్ప తపస్సుచేసి బ్రహ్మజ్ఞానాన్ని విడమర్చి చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అనిపించుకున్నాడు. ఓంకారం గురించిన నిగూఢరహస్యాన్ని శివుడంతటి వాడికే గురువై ఉపదేశించాడు. అన్నదమ్ములైన విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కైలాసంలో పార్వతీశివుల కనులపండుగగా  ఎంతో సఖ్యంగా ఆటపాటలతో విహరిస్తున్నారు. 



    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: కుమారస్వామి జననం ::        " విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూం...