27, సెప్టెంబర్ 2025, శనివారం

 :: విజయవిఘ్నేశ్వరుడు :: 

    పార్వతి క్షణంలో తన దు:ఖమంతా మరచిపోయి, పిల్లవాణ్ణి ఎత్తుకొని దిష్టి తీసింది. శివుడు చేతులుచాచి పిలిచాడు. శివుడు మళ్ళీ ఏంచేసి పోతాడో అని భయంభయంగా తప్పటడుగులు వేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దుచేష్టకు అంతా ముచ్చట పడ్డారు.

    " నాయనా! విఘ్నేశ్వరా! నిన్ను పుత్రుడుగా పొంది ధన్యులం అయ్యాం. చిరంజీవ! " అని శివుడు ఎత్తి ముద్దాడుతూంటే విఘ్నేశ్వరుడు క్రిందకు దూకి " తండ్రీ! ఎంతమాట. నేను మీ కొడుకును. ధన్యుణ్ణి నేను " అంటూ పార్వతీ శివుల పాదాలను చిరుతొండంతో చుట్టి, కళ్ళకద్దుకొని ప్రణామాలు చేశాడు. తరువాత విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు. 

    విష్ణువు " రావోయీ ముద్దుల మేనల్లుడా! " అని దగ్గరకు తీసుకొని " కల్యాణమస్తు " అని దీవించాడు. 

    అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు. విష్ణువుకీ, విఘ్నేశ్వరుడికీ ఏవో పోలికలున్నట్లు అందరికీ తోచింది. అదే, మేనమామ పోలిక అంటే! అని అనుకున్నారు. 

    వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మ " తొలిపూజలందుకోవయ్యా బొజ్జగణపయ్యా! " అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిదిమి చిటికె వేశాడు. 

    తరువాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి, సరస్వతికి మ్రొక్కాడు. వాళ్ళిద్దరూ కలిసి అతణ్ణి ఎత్తుకొని చెరో చెంపా ముద్దాడి " మేము విఘ్నేశ్వరుడి ఇరుప్రక్కలా అత్తాకోడళ్ళ పొరపొచ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము " అని పార్వతిని చూసి " ముగ్గురమూ ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుండి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు. తర్వాత మళ్ళీ విడివిడిగా క్షీరసాగరం నుంచి లక్ష్మి, బ్రహ్మ నాలుక నుండి సరస్వతిగా వాణి, మొదట దక్షుని కుమార్తె సతీదేవిగాను, ఇప్పుడు హిమవంతుని పుత్రి పార్వతిగా ఉమ అవతరించాము. జయలక్ష్మి అనే సిద్ధి, విద్యావతి అనే బుద్ధి వినాయకునకు తగిన వధువులు. ఇహ విఘ్నేశ్వరుని పెళ్ళి ముచ్చటే చూడాలి " అని అన్నారు. 

    లక్ష్మి " లక్ష్మీకరుడైన విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన వారిని స్థిరంగా అంటిపెట్టుకొని ఉంటాను. సిద్ధిస్వరూపిణి జయలక్ష్మి నా అంశ. వినాయకుడికి కానున్న భార్య " అని చెప్పింది. 

    సరస్వతి " విఘ్నేశ్వరుడు జ్ఞాన ప్రదాత. విజ్ఞానదాయకుడు. అక్షరాభ్యాసానికి ముందు పిల్లలచేత పసుపుముద్ద విఘ్నేశ్వరుడి పూజ జరిపించి, విఘ్నేశ్వర పరిపూర్ణ స్వరూపంగా గుండ్రంగా చుట్టించి మరీ ఓనమాలు దిద్దించాలి. నా అంశగల విద్యావతి బుద్ధి రూపిణి. వినాయకుని నాయకి " అని చెప్పింది. 

    అప్పుడు విఘ్నేశ్వరుడు బేలముఖం పెట్టి, అందరినీ కలయజూసి, " చూశారా! పెద్దలతీరు ఎలా ఉందో! పెళ్ళిచేసుకొని, వారు పడ్డ అవస్థలే పిల్లలుకూడా పడాలని పెళ్ళి తొందర పెడతారేగాని, హాయిగా ఉండనివ్వరు. అందునా అమ్మకు మరీ ఆరాటం " అన్నాడు. 

    అప్పుడు విష్ణుమూర్తి " లేదురా బాబూ! అణిమాది సిద్ధులకు, అష్టైశ్వర్యాలకూ మూలమైన సిద్ధులు ఎనమండుగురు, చక్కని చుక్కలై నిన్ను పూర్ణచంద్రుణ్ణి కొలిచినట్లు సేవిస్తూంటే చూడాలని తొందరగానే ఉంది సుమా! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " ఓహో! అలాగా, నువ్వు కృష్ణావతారంలో అష్టమహిషులతో వేగుతూ ఆనందిద్దువుగానిలే " అన్నాడు. విష్ణువు మందహాసం చేసి " నీమాటకు తిరుగులేదు కాని, నీకుమాత్రం పదిమంది వధువుల పెళ్ళి తప్పదు " అన్నాడు. 

    " అలాగయితే విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్న సామెతగా, నేనే విఘ్నాలు కల్పించుకోక తప్పదు " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    " వెయ్యికాదు, కోటి విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడి పెళ్ళి ఆగదు " అని బ్రహ్మతో గొంతులు కలిపి అందరూ అన్నారు. 

    అప్పుడు నారదుడు ముందుకు వచ్చి " విజ్ఞానేశ్వరా! వాచాలతలో నన్ను మించావు కాని, పెళ్ళి తప్పించుకోవడం ఎవరి తరం? నేను సంసార సాగరం ఈదడం చేతగాకనే గదా మునినై తిరుగుతున్నాను. జ్ఞానేశ్వరా! కళ్యాణం, ఉద్యోగం పురుష లక్షణం అని పురుషోత్తములూ ఆదిదేవుళ్ళూ అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్ళిళ్ళు చేసుకొని సృష్టి, స్థితి, లయాది ఉద్యోగాలు చేస్తున్నారు. నీవూ, నేనూ అనగా ఎంత? " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నవ్వి " ఓహో! నీకూ పెళ్ళిపిచ్చి తగిలేలాగుందే! స్వయంవరానికి కూడా వెళ్ళేవులాగుంది " అన్నాడు. 

    నారదుడు " త్రికాలవేదిని నేనే ననుకుంటే అనంతకాల వేదివి నీవు. నీతో వాదించటం నా తరమా? మాటకారితనంలో నీ తర్వాతనే నేను. అందరి జాతకాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నిన్ను విస్మరించిన ఎలాంటి ఉద్ధండ జ్యోతిష పాండిత్యమూ ఫలించదు. మనం యిద్దరం మేలురకం వాగుడుకాయలం. మాటలకు దిగితే అనంతకాలం చాలదు కాని, నీవు పూర్ణజ్ఞానివి. మాలాంటి అర్థజ్ఞానులు, ఎలాంటి పిచ్చిలో పడ్డా నీలాంటి వాళ్ళు తామరాకుమీద నీటిబొట్టులాగ దేనికీ లొంగిపోరు. నీవు మాయకు అతీతుడవు. కాబట్టి సిద్ధి బుద్ధులు, అష్ట సిద్ధులు నిన్ను వరించుతాయని, నన్నుకూడా శ్రీరస్తు, శుభమస్తు, శీఘ్రకల్యాణసిద్ధిరస్తు అని పలికించనియ్యి " అని అంటూ మహతి వీణపై కళ్యాణిరాగం మొదలుపెట్టి సామరాగం అందుకొని సౌరాష్ట్ర రాగంతో మంగళగీతాన్ని పలికించాడు. 

    దేవతలంతా ఎవరి తావులకు వారు వెళ్ళారు. విఘ్నేశ్వరుణ్ణి, పార్వతిని వెంటబెట్టుకొని శివుడు తన నిజ నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. నారదుడు తిన్నగా వజ్రదంతుడి దగ్గరకు బయలుదేరాడు. 

    ఆనాడు పుత్రగణపతి తోకపట్టి గిరగిరా త్రిప్పి విసిరితే పడ్డ పాటుకు వజ్రదంతుడి ఒళ్ళు నొప్పులు యింకా తీరనేలేదు. ధవళ, భర్తకు పరిచర్యలు చేస్తున్నది. వచ్చిన నారదుణ్ణి చూసి, మళ్ళీ ఏం గొడవ తెచ్చిపెడతాడో అని అనుకుంటూనే లోనికి వెళ్ళింది. 

    నారదుడు మూషికాసురుడుతో " నిన్ను పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడిగా వర్థిల్లుతున్నాడు. మరి...." అంటూ ఆగాడు. 

    పరాభవాగ్ని రగిలి, వజ్రదంతుడు " ఇప్పుడేం చేయమంటావు నారదా! " అని బిక్కమొహం పెట్టాడు. 

    నారదుడు " వరాల దేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడు గదా! వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ప్రతీకారం సాధించు. గణపతి విఘ్నేశ్వర నామం ధరించాడు. గజముఖుడు. గుర్తుంచుకో! " అని చెప్పి చల్లగా వెళ్ళాడు. 

    మహాశ్వేత అనే నామాంతరంగల ధవళ ఎంతచెప్పినా వినకుండా, వజ్రదంతుడు " మహాశ్వేతా! నీ పసుపుకుంకాల పుణ్యమా అని నాకెలాగూ చావు భయం లేదుకదా! ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందనివ్వు " అని చెప్పి, ఘోరమైన తపస్సుచేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. 

    " ఏం కావాలి యింకా? " అని బ్రహ్మ అడిగాడు. 

    " విఘ్నానికి రూపం కల్పించి, నా అజ్ఞానువర్తిగా చెయ్యి " అని మూషికాసురుడు కోరాడు. 

    బ్రహ్మ విఘ్నాన్ని ఆవాహనచేసి వజ్రదంతుడి ముందుంచాడు. అతడికేమీ కనిపించలేదు. బ్రహ్మ అతనికి సూక్ష్మదర్శిని దృష్టి యిచ్చాడు. విఘ్నం మామూలు కంటికి కనిపించని కారునల్లని సూక్ష్మక్రిమి రూపంలో అతడికి కనిపించింది. 

    మూషికాసురుడు ఆశ్చర్యంతో " ఇదేమిటి? ఈ నలుసును ఏం చేసుకోను? " అన్నాడు. 

    బ్రహ్మ నవ్వి " విఘ్నం పెనుభూతంలాగా ఉంటుందనుకున్నావు కాని, విఘ్నబీజం కంటికి కనిపించని సూక్ష్మాణువు. సూక్ష్మక్రిమి వల్ల భయంకర వ్యాధి వ్యాపించినట్లే, అనర్ధదాయకమైన విఘ్న కారణం ఎంత చిన్నదయినా, ఎంతటి భీషణాకృతినైనా ధరించి సర్వనాశనం చేయగలదు. కామరూపి. ఏ రూపాన్నైనా ధరించి, అనర్థాలు కలిగించటమే దాని పని. ఏం చేసుకుంటావో చేసుకో " అని చెప్పి అంతర్థానమయ్యాడు. 

    మూషికాసురుడు విఘ్నంతో " నువ్వు వెంటనే మహాగజాసుర రూపంలో వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి నాశనం చెయ్యి " అని అజ్ఞాపించాడు. 

    విఘ్నం ఏనుగు శరీరమూ, ఏనుగు కాళ్ళూ, భయంకరమైన చిన్న తలా, పెద్ద కోరలూ, నిప్పుల్లాంటి కళ్ళుగల గజాసుర రూపం పొంది మహాపర్వతంలాగ కత్తి ఝళిపిస్తూ ఆకాశానికి ఎగిసి ఎగురుతూ వెళ్ళాడు. 

    కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారుముద్దుగా పెరిగి, తల్లిదండ్రుల అనుమతితో తాను పుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు. ఎదురుగా వస్తూ మన్మథుడు రూపంతో కనిపించాడు. విఘ్నేశ్వరుడు ఆశ్చర్యంగా " కనిపించని వాడివి కనిపించావు. ఏమిటి విశేషం? నామీద నీ విలువిద్య చూపకుమీ! అర్భకుణ్ణి " అన్నాడు. 

    మన్మథుడు వినయంగా తలవంచి " గజేంద్రాననా! నీవు నా బాణాలకు అతీతుడవు. నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం శివుడు యిచ్చినదేగదా! దగ్గరి పోలికలున్న దగ్గరి వాళ్ళం గనుక కనిపించాను అంతే! నీవు ఎద్దునెక్కిన శివుడి కొడుకువైతే, నేను గ్రద్దనెక్కిన విష్ణువు కుమారుణ్ణి. నన్ను శివుడు దహించి బ్రతికించాడు. నిన్ను ఖండించి బ్రతికించాడు. నా వాహనం చిలుక. నీ వాహనం ఎలుక. మనస్సును చలింపజేసే పూలమ్ములు నా ఆయుధాలైతే, మనోనిగ్రహాన్నిచ్చే పాశాంకుశాలు నీ ఆయుధాలు. మరి, నీకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలిగదా! పార్వతీ పరమేశ్వరుల పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి. తారకాసుర నిర్మూలన జరగాలి. అందుకేగదా! నన్ను దేవతలు బూడిదగూడా చేయించింది. కైలాసం చేరబోతున్నాను. అనుజ్ఞ యివ్వు " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " మన్మథా! అందుకే నేనూ కైలాసం దిగి వెళ్తున్నదీను. నీపని నిర్విఘ్నంగా నెఱవేర్చు. జయప్రదమవుతుంది " అన్నాడు. 

    మన్మథుడు అదృశ్యుడై పార్వతీ శివులున్న కైలాస మంటపాన్ని చేరుకున్నాడు. విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకొని, సింహద్వారానికి చేరువగా చంద్రశిలావేదికపై సుఖంగా కూర్చొని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు. మెరుగుపెట్టిన వెండి హిమగిరి శిఖరాలు సంధ్యకాంతుల్ని తళతళ ప్రతిఫలిస్తున్నాయి. హిమానీజలపాతాలు మంద్రగంభీరంగా సరిగమలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రశాంత సమయంలో " విఘ్నేశ్వరుడనేవాడు ఎక్కడ? " అనే భీకర గర్జన దిక్కుల మారుమోగుతూ వినిపించింది. 

    మహాగజాసుర రూపం ధరించిన విఘ్నం, విఘ్నేశ్వరుడి ఎదురుగా వాలింది. భూమి కంపించింది. గజాసురుడు " నేను మహాగజాసురుణ్ణి. నువ్వు గజముఖుడివైతే, నేను గజకాయుణ్ణి. నిన్ను హతమార్చ వచ్చాను " అంటూ రంకె వేశాడు. 

    విఘ్నేశ్వరుడు చెవిటి వాడిలాగ అమాయకంగా చూస్తూ " అబ్బీ! ముక్కలు నరుక్కొని చెరుకుగడ తినాలని ఉంది. గొడ్డలి కాస్త పదునుపెట్టి యిస్తివా, నీకు కుడుములు పెడతాను " అని అంటూ పరశువును వాటంగా విసిరాడు. గజాసురుడి కాళ్ళుతెగి పర్వతంలా కూలాడు. విఘ్నేశ్వరుడు ఎక్కి తాండవం చేస్తూ మర్దిస్తూంటే " మహాప్రభో! నేను విఘ్నాన్ని. బ్రహ్మ యిచ్చిన వరం మేరకు మహాగజాసుర రూపంలో వచ్చాను.  శాస్తి అయింది " అని విఘ్నం అరిచింది. 

    విఘ్నేశ్వరుడు " నేను విఘ్న వినాశకుణ్ణి. అదీగాక నువ్వు ఇప్పుడు మాయదారి గజాసురుడివి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను, నిన్ను ఏమర్చిన వాళ్ళను మాత్రమే పట్టి పీడిస్తాయి. నువ్వు కాళీయ నాగుడువై కాళింది మడుగున దాగి ఉండు. బాలకృష్ణుడు నిన్ను మర్దిస్తాడు. అతని పాదాలు నీ తలలమీద పడి నీ పాపపరిహారం అవుతుంది. జాతిసర్పాల పడగలపై విష్ణుపాద ముద్రలు అది మొదలు అలంకారంగా శోభిస్తాయి " అని చెప్పి పరశువును పట్టి విఘ్నాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆ రేణువులు అంతటా వ్యాపించి అదృశ్యమయ్యాయి. విఘ్నం అణురూపంలో మిగిలింది. దేవతలు విఘ్నేశ్వరుడిపై పూలజల్లు కురిపించారు. 

    

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 :: విజయవిఘ్నేశ్వరుడు ::       పార్వతి క్షణంలో తన దు:ఖమంతా మరచిపోయి, పిల్లవాణ్ణి ఎత్తుకొని దిష్టి తీసింది. శివుడు చేతులుచాచి పిలిచాడు. శివుడ...