24, ఏప్రిల్ 2026, శుక్రవారం

 

:: భూదేవి ఆవేదన- శ్రీకృష్ణావతార ప్రకటన :: 

     

     శ్రోతలందరకూ నమస్కారం. ఈరోజు నుండి  ప్రతి  సోమ, బుధ శుక్రవారాలలో  శ్రీమద్భాగవతం లోని  దశమస్కంధంలో వివరించిన శ్రీకృష్ణలీలలను సీరియలుగా వరుసగా చెబుతాను. మీరు దయచేసి వింటూ వుంటే  మీకు భాగవతం చదువుతున్నామన్న తృప్తి కలుగుతుంది. కాబట్టి మీరు ఛానలును వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. 

      భాగవత పురాణం కేవలం ఒక కథ కాదు, అది మానవ జన్మ తరింపజేసే ఒక అమృత ధార. ద్వాపర యుగం అంత్య దశకు చేరుకుంటున్న సమయం అది. లోకంలో ధర్మం క్షీణించి, అధర్మం అడుగుజాడలు పెరిగిపోయాయి. బలవంతులే లోకానికి రాజులయ్యారు. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు వంటి రాక్షస ప్రవృత్తి గల రాజులు తమ అహంకారంతో భూమిని పీడించసాగారు.

     ఆనాటి రాజులు ధర్మాన్ని విస్మరించారు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. ప్రజల ఆక్రందనలతో దిక్కులు పిక్కటిల్లాయి. ముఖ్యంగా కోట్లాది అక్షౌహిణీల సైన్యంతో, మదగజాలతో నడయాడే ఆ రాజుల పాదాల భారానికి భూమాత వణికిపోయింది. పర్వతాల బరువు, సముద్రాల హోరు ఆమెకు భారం అనిపించలేదు కానీ, ఈ పాపాత్ముల భారమే మిన్నగా తోచింది. ఆ దుర్భర స్థితిని భరించలేక, భూదేవి కన్నీరు మున్నీరుగా విలపించింది.

     తల్లి మనసు ఎంతటి కష్టాన్ని అనుభవిస్తుందో ఆ విధాతకే తెలుసు. అందుకే భూదేవి ఒక ఆవు రూపం ధరించి, కన్నుల వెంట అశ్రువులు కారుస్తూ బ్రహ్మదేవుని సత్యలోకానికి వెళ్ళింది. దీనంగా 'అంబా' అని అరుస్తూ పితామహుని పాదాలపై పడింది. "ఓ పితామహా! ధర్మం నశించిపోతోంది. ఈ రాక్షస రాజుల అరాచకాలు భరించలేకపోతున్నాను. నా భారమును తగ్గించు, లోకాలను రక్షించు" అని వేడుకుంది.భూదేవి ఆవేదన చూసి బ్రహ్మదేవుడు చలించిపోయాడు. వెంటనే ఆయన పరమశివుడిని, ఇతర దేవతలను కలుపుకుని ఆపద్బాంధవుడైన శ్రీమన్నారాయణుడిని వేడుకోవడానికి పాలసముద్ర తీరానికి పయనమయ్యారు.

     శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న ఆ జగన్నాథుని చేరుకున్న దేవతలందరూ ఏకాగ్రచిత్తంతో స్తుతించారు. ఆ సమయంలో వారు చేసిన స్తుతి భాగవతంలో అత్యంత శక్తివంతమైనది. స్వామి పూర్వ అవతారాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత ఆపదను తొలగించమని వారు ఇలా ప్రార్థించారు:

గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకే

       సరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతాభర్తవై 

       ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ 

       పరిరక్షించిన నీకు మ్రొక్కెద, మిలాభారంబు వారింపవే! 


    "ఓ లక్ష్మీపతీ! నీవు గతంలో మత్స్య రూపానివై వేదాలను రక్షించావు, కూర్మ రూపానివై మందర పర్వతాన్ని మోశావు, వరాహ రూపానివై నన్ను (భూదేవిని) ఉద్ధరించావు, నరసింహ రూపానివై హిరణ్యకశిపుని సంహరించావు. ఇలా ప్రతి యుగంలోనూ శత్రువులను క్షయము చేసి, ధర్మాన్ని నిలబెట్టిన ఓ దేవదేవా! ఇప్పుడు కూడా మా వ్యధలు తీర్చడానికి ఆ మధురా నగరంలో అవతరించవయ్యా!" అని వేడుకున్నారు.

     దేవతల నిష్కల్మషమైన ప్రార్థనకు ఆ పరమాత్మ మనసు కరిగింది. బ్రహ్మదేవుని అంతఃకరణంలో భగవంతుని వాణి ప్రతిధ్వనించింది. ఆ దివ్య సందేశాన్ని బ్రహ్మదేవుడు అందరికీ వివరించాడు:"దేవతలారా! భయపడకండి. లోకకల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు త్వరలోనే మధురానగరంలో యదువంశపు పుణ్యదంపతులైన దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా అవతరించబోతున్నాడు. ఆ స్వామి కంటే ముందే ఆయనకు సేవ చేయడానికి ఆదిశేషుడు బలరాముడిగా జన్మిస్తాడు. మీరు కూడా భూలోకంలో యాదవులుగా, గోపికలుగా జన్మించి ఆ కృష్ణపరమాత్మ లీలల్లో పాలుపంచుకోండి. భగవంతుని మాయాశక్తి అయిన యోగమాయ కూడా నందగోకులంలో జన్మించి స్వామి కార్యానికి సహకరిస్తుంది."

    ఈ మాటలు వినగానే భూదేవి మనసు తేలికపడింది. తన కష్టాలు తీరే రోజు దగ్గరపడిందని ఆమె పరమానందభరితురాలైంది. దేవతలందరూ భగవంతుని రాక కోసం నిరీక్షిస్తూ భూలోకంలో జన్మించడానికి సిద్ధమయ్యారు. ఇలా లోక రక్షకుడైన శ్రీకృష్ణుని ఆగమనానికి నాంది పడింది.

సర్వేజనా సుఖినోభవంతు - స్వస్తి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: పూతన సంహారం – శ్రీకృష్ణుని తొలి లీల ::      శ్రీకృష్ణుని బాల్య లీలలు ఎంతో మధురమైనవి, మహిమాన్వితమైనవి. గోకులంలో నందుని ఇంట జన్మించిన శ్ర...