30, జనవరి 2026, శుక్రవారం

 30-01-2026 - శుక్రవారం

:: భాగవతసుధ-2 ::


    నమస్తే!  వ్యాసమహర్షి రచించిన శ్రీమద్భాగవతం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు, అది మోక్ష మార్గాన్ని చూపే ఒక దివ్యౌషధం. పరీక్షిన్మహారాజుకు, భాగవతానికి మధ్య ఉన్న ఆ అసక్తికరమైన నేపథ్యం వెనుక ఒక పెద్ద కథే ఉంది. 

    పాండవుల వారసుడైన పరీక్షిన్మహారాజు ఒకసారి వేటకై అడవికి వెళ్ళాడు. తీవ్రమైన దప్పికతో శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహర్షి గాఢమైన ధ్యానంలో ఉన్నారు. రాజు ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో, ఆకలిదప్పుల వల్ల విచక్షణ కోల్పోయిన పరీక్షిత్తు, ప్రక్కనే పడి ఉన్న ఒక చనిపోయిన పామును తన ధనస్సుతో తీసి మహర్షి మెడలో వేశాడు. 

    శమీక మహర్షి కుమారుడు శృంగికి ఈ విషయం తెలిసింది. తన తండ్రిని అవమానించినందుకు కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు " నా తండ్రి మెడలో మృతసర్పమును వేసిన ఆ వ్యక్తి, సరిగ్గా ఈరోజునుండి ఏడవ రోజున తక్షకుడు అనే పాముకాటుకు గురై మరణించుగాక! " అని శపించాడు. 

    శమీక మహర్షి తన ధ్యానం ముగిసాక జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడ్డారు. పరీక్షిత్తువంటి ధర్మాత్ముడైన రాజుకు ఇలాంటి శిక్ష పడకూడదని భావించినా, బ్రాహ్మణ వాక్కు అమోఘం కాబట్టి, ఆ విషయాన్ని శిష్యుల ద్వారా రాజుకు వర్తమానం పంపారు. 

    తనకు ఇంకా ఏడురోజులే ఆయుష్షు ఉందని తెలుసుకున్న పరీక్షిత్తు భయపడలేదు. తన తప్పును తెలుసుకొని, రాజ్యాన్ని తన కుమారుడైన జనమేజయుడికి అప్పగించి, గంగానదీ తీరానికి చేరుకున్నాడు. మరణం ఆసన్నమైన వ్యక్తి ఏం చేయాలి? దేనిని వినాలి? అని అక్కడ ఉన్న మహర్షులను అడిగాడు. సరిగ్గా అదే సమయంలో వ్యాసమహర్షి కుమారుడైన శుకబ్రహ్మ అక్కడకు వచ్చారు. 

    అత్యంత పవిత్రమైన భక్తిరసంతో కూడిన శ్రీమద్భాగవతాన్ని శుకమహర్షి ఆ ఏడు రోజుల్లో పరీక్షిత్తుకు వినిపించారు. ఇది వినడం వల్ల మరణం పట్ల భయం పోయి, పరీక్షిత్తు చివరకు మోక్షాన్ని పొందాడు. 

    శ్రీమద్భాగవతం వినడం అంటే భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోవడమే కాదు, అది మృత్యు భయాన్ని సైతం పోగొడుతుంది. 

    పరీక్షిన్మహారాజు రాజ్యత్యాగం చేసి, కొడుకును రాజును చేసి అడవికి వెళ్ళిపోయారు సరే, కానీ ఒక చక్రవర్తిగా ఉన్న వ్యక్తి, కేవలం ఏడు రోజుల్లో తన మనసును పూర్తిగా భగవంతునిపై ఎలా లగ్నం చేయగలిగారు? ఆ ఏడు రోజుల్లో శుకమహర్షి ఆయనకు చెప్పిన సృష్టి రహస్యాలు ఏమిటి? తక్షకుడు వచ్చి కరచినప్పుడు పరీక్షిత్తు ఎందుకు ఏడవలేదు? పైగా, ఎందుకు నవ్వుతూ ప్రాణాలు వదిలాడు? మరణాన్ని ఒక పండుగలాగా ఎలా మార్చుకోవచ్చో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. జై శ్రీకృష్ణ! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: పూతన సంహారం – శ్రీకృష్ణుని తొలి లీల ::      శ్రీకృష్ణుని బాల్య లీలలు ఎంతో మధురమైనవి, మహిమాన్వితమైనవి. గోకులంలో నందుని ఇంట జన్మించిన శ్ర...