31-01-2026 - శనివారం
:: భాగవతసుధ - 3 ::
పరీక్షిన్మహారాజు వృత్తాంతము కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు. అది మనకందరికీ ఒక జీవన పాఠం. మరణం ఖాయమని తెలిసినప్పుడు మనిషి క్రుంగిపోకుండా, ఆ మరణాన్ని ఒక పండుగలాగా ఎలా మార్చుకోవచ్చో ఆయన నిరూపించారు.
సాధారణంగా మనసును నియంత్రించడం చాలా కష్టం. కానీ, పరీక్షిత్తుకు రెండు బలమైన ఆయుధాలు తోడయ్యాయి. ఒకటి వైరాగ్యం. శమీకమహర్షి కుమారుడు శృంగి శాపంవల్ల తక్షకుడి వల్ల తన మరణం ఏడో రోజున అని తెలిసిన వెంటనే, ఆయన తన రాజ్యాన్ని, సుఖాలను ఒక చిరిగిన వస్త్రంలా వదిలేశాడు. " నాది " అనే మమకారం పోయినప్పుడే మనసు భగవంతుని వైపు వేగంగా వెడుతుంది. రెండవది శ్రవణం. సాక్షాత్తు శుకమహర్షి బోధిస్తుంటే, పరీక్షిత్తు కనీసం మంచినీరు కూడా ముట్టుకోకుండా ఏకాగ్రతతో విన్నాడు. ఆ తీవ్రత వల్ల ఏడురోజులు ఏడు జన్మల సాధనతో సమానమయ్యాయి.
శుకమహర్షి భాగవత ప్రోక్తం చేస్తూ ప్రధానంగా వివరించిన విషయాలలో మొదటిది విశ్వరూపం. ఈ సృష్టి అంతా భగవంతుని శరీరమే. నదులు ఆయన నాడులు. పర్వతాలు ఆయన ఎముకలు అని చెప్పడం ద్వారా ప్రకృతిలో దైవత్వాన్ని చూడటం నేర్పారు. రెండవది మాయాశక్తి. భగవంతుడు తన మాయద్వారా ఎలా సృష్టిని చేస్తాడు? ఎలా స్థితిని కాపాడతాడు? మరల ఎలా ఉపసంహరించుకుంటాడొ వివరించారు. చివరగా మూడవది తత్త్వవిచారణ. దేహం నాశనమవుతుంది. కానీ, లోపల ఉన్న " ఆత్మ " కు చావులేదు. సృష్టిలోని ప్రతి అణువులోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడనే అద్వైత సత్యాన్ని బోధించారు.
తక్షకుడు కరచినప్పుడు పరీక్షిత్తు ఎందుకు నవ్వాడు? ఇక్కడే పరీక్షిత్తు ఒక విజేతగా నిలిచాడు. శుకమహర్షి బోధనల వల్ల పరీక్షిత్తు " దేహభావన " నుండి బయటపడి ఆత్మస్థితికి చేరుకున్నాడు. తక్షకుడు కరిచే సమయానికి పరీక్షిత్తు ధ్యానసమాధిలో ఉన్నాడు. ఆయన దృష్టిలో తక్షకుడు ఒక పాము కాదు, అదికూడా భగవంతుని రూపమే. " చచ్చేది శరీరం మాత్రమే, నేను కాదు " అనే జ్ఞానం కలిగినప్పుడు మరణం భయం కలిగించదు. అందుకే, మరణాన్ని ఆహ్వానిస్తూ ఆయన నవ్వుతూ ప్రాణాలు వదిలాడు.
మరణాన్ని పండుగలా ఎలా మార్చుకోవాలి? పరీక్షిత్తు చరిత్ర మనకు ఇచ్చే సందేశం ఇదే. మరణం అనివార్యం అని ముందే గుర్తించడం. చివరి క్షణంలో వస్తువుల మీద, బంధువుల మీద మమకారం వదిలేయడం. మనసును ఉన్నతమైన శక్తిపై దైవం లేదా జ్ఞానం మీద లగ్నం చేయడం. మరణం అంటే అంతం కాదు. అది ఒక మార్పు మాత్రమే అని గ్రహించడం.
మరణం అనేది దేహానికి వచ్చే విరామం మాత్రమే. ఆత్మకు అది క్రొత్త ప్రయాణం.
పరీక్షిత్తులాగా మనం కూడా జీవించి ఉన్నప్పుడే ఈ సత్యాన్ని తెలుసుకుంటే, మరణం భయపెట్టే భూతంలా కాక, పరమాత్మలో కలిసే ఒక పండుగలా కనిపిస్తుంది.
పరీక్షిత్తు మరణించాక, ఆయన కుమారుడు జనమేజయుడు ఏం చేశాడు? తన తండ్రిని చంపిన పాముజాతి మీద ఆయన పెంచుకున్న పగ, ఆ పగ తీర్చుకోవడానికి ఆయన చేసిన దేమిటి? వచ్చే బుధవారం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఛానల్ ను తప్పక అనుసరించండి. జై శ్రీకృష్ణ!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి