22, ఫిబ్రవరి 2026, ఆదివారం

:: తపస్సు మానేసి 50మందిని పెళ్ళిచేసుకున్న మహర్షి ::  


    మహాభాగవతంలో ఎంతోమంది మహర్షులను  గురించి విన్నాం. కానీ, వేల సంవత్సరాల తపస్సును ఒక్క క్షణంలో వదిలేసి, ఒకేసారి 50మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్న విచిత్రమైన మహర్షి గురించి మీకు తెలుసా? ఆయనే సౌభరి మహర్షి. ఆయన జీవితంలో జరిగిన ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. 

    సౌభరి మహర్షి యమునా నదీజలాల్లో ఉండి ఘోరమైన తపస్సు చేసేవారు. కొన్ని వందల ఏళ్ళు గడిచాయి. ఒక రోజు ఆయన నీటి లోపల ధ్యానంలో ఉండగా, ఒక పెద్ద చేప తన పిల్లలు, మనవళ్ళతో ఎంతో సంతోషంగా ఆడుకోవడం చూశారు. ఆ దృశ్యం చూసిన మహర్షి మనసులో విచిత్రమైన  మార్పు వచ్చింది. " ఒక చిన్న చేపే ఇంత ఆనందంగా సంసారం చేస్తుంటే, నేను ఎందుకు ఒంటరిగా ఉండాలి? " అన్న ఆలోచన ఆయన తపస్సును ప్రక్కకు నెట్టింది. 

    వెంటనే ఆయన నీటిలో నుండి బయటకు వచ్చి, మాంధాత చక్రవర్తి వద్దకు వెళ్ళారు. " రాజా! నీ కుమార్తెను నాకు యిచ్చి వివాహం చేయి" అని కోరారు. ముసలివాడు, జడలుకట్టిన జుట్టుతో ఉన్న మహర్షిని చూసి రాజు భయపడ్డాడు. కాదనలేక ఒక ఉపాయం ఆలోచించాడు. " మహర్షీ! నాకు 50మంది కుమార్తెలు ఉన్నారు. స్వయంవరంలో నిన్ను చూసి ఎవరైతే యిష్టపడతారో, వారినే నువ్వు పెళ్ళిచేసుకో " అన్నాడు. 

    మహర్షి తన తపశ్శక్తితో అత్యంత సుందరమైన మన్మథుడి లాంటి రూపాన్ని దాల్చారు. ఆశ్చర్యకరంగా, ఆ 50మంది రాజకుమార్తెలు ఆయననే కోరుకున్నారు. వారందరికోసం మహర్షి 50 అద్భుతమైన భవనాలను సృష్టించి, కొన్ని వందల యేళ్ళు భోగభాగ్యాలతో గడిపారు. కానీ, ఎన్ని ఏళ్ళు గడిచినా ఆయన కోరిక తీరలేదు. 

    చివరకు ఒక రోజు ఆయనకు జ్ఞానోదయం కలిగింది. " అయ్యో! ఒక్క చేపను చూసి మోహంలో పడి నా తపస్సును పోగొట్టుకున్నాను. కోరికలు అనేవి అగ్నిలో పోసే నెయ్యిలాంటివి. అవి పెరిగే కొద్దీ ఇంకా రగులుతాయి తప్ప ఆరవు " అని గ్రహించారు. భగవంతుడి భక్తి తప్ప మరేదీ శాశ్వతం కాదని తెలుసుకున్నారు. 

    భాగవతసుధ మనకు నేర్పేది ఇదే! మనసును అదుపులో ఉంచుకోకపోతే, ఎంతటి వారైనా దారి తప్పుతారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: పూతన సంహారం – శ్రీకృష్ణుని తొలి లీల ::      శ్రీకృష్ణుని బాల్య లీలలు ఎంతో మధురమైనవి, మహిమాన్వితమైనవి. గోకులంలో నందుని ఇంట జన్మించిన శ్ర...