28, జూన్ 2026, ఆదివారం

 

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను అంతర్థానంబు సేయుట

    అందరకూ నమస్కారం. ఈ వారం మనము బ్రహ్మదేవుడు గోవత్సములను, గోపబాలకులను అంతర్థానం చేసి చివరకు కృష్ణుని చేతిలో ఎలా భంగపడ్డాడో తెలుసుకుందాం. వినండి. 

    శ్రీమద్భాగవత మహాపురాణంలో దశమ స్కంధంలోని బ్రహ్మమోహన ఘట్టం భగవంతుని లీలావిలాసానికి, ఆయన సర్వవ్యాపకత్వానికి ఒక అద్భుత నిదర్శనం. అఘాసురుడనే భయంకర రాక్షసుడిని సంహరించి, తన ప్రాణ స్నేహితులైన గోపబాలకులను, దూడలను రక్షించిన శ్రీకృష్ణుడు, వారందరితో కలిసి యమునా నది తీరాన చల్దులు (భోజనం) తినడానికి కూర్చుంటాడు. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ, కృష్ణుడి చుట్టూ వలయాకారంగా కూర్చుని, ఆ పరమాత్మకు తమ చల్ది అన్నం ముద్దలను తినిపిస్తూ ఆనందిస్తుంటారు. ఆ సమయంలో పచ్చిక మేస్తూ ఉన్న లేగదూడలు కాస్త దూరంగా అడవిలోకి వెళ్ళిపోతాయి. దూడలు కనిపించకపోవడంతో గోపబాలకులు కంగారు పడతారు. అప్పుడు కృష్ణుడు "మిత్రులారా! మీరు భోజనం కానివ్వండి, నేనే వెళ్ళి దూడలను వెదకి తీసుకువస్తాను" అని ఒంటరిగా బయలుదేరుతాడు.

    కృష్ణుడు చేతిలో చల్ది అన్నం ముద్దను అలాగే పట్టుకుని, దూడలను వెతుకుతూ అడవి మార్గంలో వెళ్తున్న ఆ రమణీయ రూపాన్ని పోతనగారు అత్యంత మనోహరంగా వర్ణించారు. ఆ సమయంలో కృష్ణుని దివ్యమంగళ స్వరూపం ఎలా ఉందో ఈ పద్యం ద్వారా తెలుస్తుంది:

కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయ హారాళితో 

స్వర్ణభ్రాజిత వేత్రదండకముతో సత్పింఛ దామంబుతో 

బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో 

దూర్ణత్వంబున నేగె లేగలకునై దూరాటవీ వీథికిన్

     చెవుల వరకు వ్రేలాడుతున్న ముంగురులతో (కాకపక్షములు), మెడలోని రత్నహారాలతో, బంగారు వన్నెతో ప్రకాశించే చల్ది బెత్తముతో (వేత్రదండము), తలపై నయగారంగా అమరిన నెమలి పింఛాల దండతో, నిండు ఉత్సాహంతో, చేతిలో పట్టుకున్న చల్ది అన్నపు ముద్దతో (అన్న కబళము) అలరారుతున్న పద్మం వంటి హస్తము కలవాడై... ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేగంగా లేగదూడల కోసం అడవి దారుల్లోకి వెళ్ళాడు.

    ఒక సామాన్య మానవ బాలుడిలా నటిస్తున్న ఈ కృష్ణుని సత్యం ఏమిటో, ఆయన శక్తేమిటో పరీక్షించాలనే కుతూహలం బ్రహ్మదేవునికి కలిగింది. అఘాసుర సంహార లీలను చూసిన బ్రహ్మ, కృష్ణుని మాయను పరీక్షించాలనుకున్నాడు. కృష్ణుడు అడవిలో దూడలను వెతుకుతుండగా, ఇటువైపు యమునా తీరంలో ఉన్న గోపబాలకులను, అటు అడవిలో ఉన్న దూడలను బ్రహ్మదేవుడు తన సత్యలోకపు మాయతో అంతర్థానం చేసి (దాచిపెట్టి), ఒక రహస్య గుహలో నిద్రావస్థలో ఉంచుతాడు. కృష్ణుడు అడవి అంతా వెతికినా దూడలు కనిపించవు. సరే, తిరిగి మిత్రుల వద్దకు వెళ్దామని వచ్చేసరికి అక్కడ గోపబాలకులు కూడా లేరు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునికి ఇది బ్రహ్మదేవుని పనే అని క్షణంలో అర్థమైపోయింది.

    సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే తనతో మాయాజూదం ఆడాలని చూస్తున్నాడని గ్రహించిన శ్రీకృష్ణుడు ఆగ్రహించలేదు. పైగా ఆయన ముఖంపై ఒక మందహాసం వికసించింది. లోకాలను రక్షించే పరమాత్మను మోహింపజేయాలని చూస్తున్న బ్రహ్మ అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నాడు.

వంచింపంబనిలేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులన్ బాలురన్ 

వంచించెం గనుబ్రామి, తన్ను మరలన్ వంచించుటాశ్చర్యమే? 

వంచింపన్ మనకేల ! తెచ్చుటకునై వల్దంచు బ్రహ్మాండముల్ 

వంచింపన్ మరలింప నేర్చు హరిలీలన్ మందహాసాస్సుడై

     బ్రహ్మదేవుడు ఇక్కడ నన్ను వంచించాల్సిన (మోసం చేయాల్సిన) అవసరం లేదు. కానీ ఆయన కళ్ళు గప్పి దూడలను, బాలురను దొంగిలించి నన్ను వంచించాలనుకున్నాడు. సమస్త బ్రహ్మాండాలను సృష్టించి, లయం చేయగల నన్ను, తిరిగి వంచించాలనుకోవడం ఆశ్చర్యం కదా! అయినా ఆయనను మనం తిరిగి వంచించడం ఎందుకు? పోయిన బాలురను, దూడలను వెతకడం ఎందుకు? సమస్త విశ్వాలను క్షణంలో సృష్టించగల, లయించగల హరి లీలతో ఆయన చిరునవ్వు చిందించాడు.

    ఇంటికి వెళితే గోపబాలకుల తల్లులు, దూడల ఆవులు బాధపడతాయి. పైగా బ్రహ్మగారికి తగిన పాఠం చెప్పాలి. అందుకే కృష్ణుడు ఒక అద్భుతమైన లీలకు శ్రీకారం చుట్టాడు. బ్రహ్మ దొంగిలించిన ప్రతి ఒక్క గోపబాలుని రూపంలోనూ, ప్రతి ఒక్క లేగదూడ రూపంలోనూ తానే స్వయంగా మారిపోయాడు. కేవలం రూపాలే కాదు... వారి అలవాట్లు, వయసు, వేషధారణ, మాట్లాడే భాష, చేతిలో ఉన్న కర్రలు, ఊదే కొమ్ములు (విషాణములు) అన్నీ తానే అయ్యాడు.

కరముల్ పాదములున్ శిరంబు లవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాం 

తరముల్ ముక్కులు గన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాం 

బరస్రగ్వేణు విషాణభూషణ వయోభాషా గుణాఖ్యాన త 

త్పరతన్ వీడ్వడకుండ దాల్చె విభుడావత్సార్భకాకారముల్

     ఆ సర్వేశ్వరుడు అపహరించబడిన గోపబాలకుల, దూడల యొక్క చేతులు, కాళ్ళు, శిరస్సులు, నడుములు, ముఖములు, రొమ్ములు, ముక్కులు, కన్నులు, చెవులు, దంతములు... చివరకు వారు ధరించిన దండములు, వస్త్రములు, పూలదండలు, మురళీలు, కొమ్ములు, భూషణములు, వారి వారి వయస్సులు, భాషలు, గుణములు ఏ మాత్రం తేడా లేకుండా, అచ్చం వారిలాగే తానే ఆయా రూపాలను ధరించాడు.

    ఇలా కృష్ణుడు తానే దూడలుగా, బాలురుగా మారి రేపల్లెకు చేరుకున్నాడు. ఆ ఏడాది పొడవునా తల్లులకు తమ పిల్లలపై, ఆవులకు తమ దూడలపై మునుపటికంటే అనంతమైన ప్రేమానురాగాలు పెరిగాయి. ఎందుకంటే, అక్కడ ఉన్నది వారి పిల్లలు కారు... సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే!

    ఒక సంవత్సరం గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు తాను దాచిన బాలురు ఏమయ్యారో చూద్దామని తిరిగి భూలోకానికి వచ్చాడు. గుహలో చూస్తే బాలురు, దూడలు నిద్రిస్తూనే ఉన్నారు. కానీ బృందావనంలో చూస్తే, అదే బాలురు, అదే దూడలు కృష్ణునితో కలిసి యథావిధిగా ఆడుకుంటున్నారు. ఇది చూసి బ్రహ్మదేవుడు తీవ్రమైన భ్రమకు, ఆశ్చర్యానికి లోనయ్యాడు.

మందంగల్గిన వత్సబాలకులు నామాయాగుహాసుప్తులై 

యెందుంబోవరు, లేవరిప్పుడును వేఱేచేయనాకన్యులొం 

దెందున్ లేరు, విధాతులుంబరులు, వీరెవ్వార లెట్లైరొకో! 

యెందేతెంచి కృష్ణుతో మెలగువారేడెయ్యెడిన్ నేటికిన్

     " గోకులమునకు చెందిన దూడలు, గోపబాలకులు నా మాయా గుహలో నిద్రిస్తూనే ఉన్నారు. వారు ఎక్కడికీ వెళ్ళలేదు, లేవలేదు. మరి ఇక్కడ కృష్ణునితో కలిసి తిరుగుతున్న వీరెవరు? నాలంటి బ్రహ్మలు కానీ, ఇతరులు కానీ వేరే బాలురను సృష్టించలేదు కదా! వీరందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఎలా వచ్చారు? కృష్ణుడితో కలిసి ఆడుకుంటున్న వీరంతా ఎవరు?" అని బ్రహ్మదేవుడు విస్తుపోయాడు.

    ఆ సమయంలోనే కృష్ణుడు ఒక అద్భుతం చేశాడు. అక్కడ ఉన్న ప్రతి దూడ, ప్రతి బాలుడు చతుర్భుజములతో, శంఖ చక్ర గదా పద్మములతో సాక్షాత్ మహావిష్ణు రూపాలుగా బ్రహ్మకు దర్శనమిచ్చారు. సమస్త సృష్టి కృష్ణునిలోనే ఉందనే సత్యం బ్రహ్మకు బోధపడింది.

    జగత్తునంతా తన మాయతో మోహింపజేసే బ్రహ్మదేవుడు, ఆ మాయకే అధిపతి అయిన విష్ణువును (కృష్ణుని) మోహింపజేయాలని చూసి, తానే మోహంలో పడిపోయాడు. పోతనగారు ఈ విషయాన్ని ఎంతో చమత్కారంగా చెప్పారు:

మోహములేక జగంబుల

మోహింపగ జేయనేర్చి మొనసిన విష్ణున్  

మోహింపించెద ననియెడు 

మోహమున విధాత దాన మోహితుడయ్యెన్

     తాను ఏ విధమైన మోహము లేనివాడై, సమస్త జగత్తులను తన మాయతో మోహింపజేయగల సమర్థుడైన ఆ విష్ణుమూర్తిని... నేను మోహింపజేస్తాను (మాయ చేస్తాను) అనే అజ్ఞానపు మోహముతో ప్రవర్తించిన బ్రహ్మదేవుడు, ఆ హరి మాయలో చిక్కుకుని తానే మోహితుడైపోయాడు.

    ఆ పరమేశ్వరుని అనంత కోటి సూర్య సమప్రభావ దివ్య తేజస్సును చూడలేక బ్రహ్మదేవుని ఇంద్రియాలన్నీ స్తంభించిపోయాయి. గర్వం పూర్తిగా నశించి, పరమాత్మ లీలకు దాసోహమన్నాడు.

  ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోక ము 

          ద్దీపితమయ్యె నట్టి విభుతేజము గన్నుల జక్కజూడగా 

          నోపక పారవశ్యమును నొందుచు సంస్తిమితాఖిలేంద్రియుం 

          డై  పరమేష్ఠి మైమఱచె నప్పుడు చిత్రపు రూపు కైవడిన్

    ఏ పరమేశ్వరుని యొక్క దివ్య తేజస్సు చేత ఈ చరాచర జగత్తు అంతా ప్రకాశిస్తోందో, అట్టి సర్వేశ్వరుని అనంత తేజస్సును కన్నులారా తిలకించలేక, బ్రహ్మదేవుడు పరవశుడైపోయాడు. ఆయన సమస్త ఇంద్రియాలు నిశ్చలమైపోగా, ఒళ్ళు తెలియని స్థితిలో ఒక చిత్రపటం (బొమ్మ) లాగా నిలిచిపోయాడు.

    చివరకు బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకుని, హంస వాహనం దిగి, శ్రీకృష్ణుని పాదాలపై పడి క్షమాపణలు వేడుకున్నాడు. కృష్ణుడు తన మాయను ఉపసంహరించుకోగా, గుహలో ఉన్న అసలైన బాలురు, దూడలు తిరిగి యథాస్థానానికి వచ్చారు. కృష్ణుని లీలా వైభవాన్ని, సర్వవ్యాపకత్వాన్ని చాటిచెప్పే ఈ ఘట్టం భక్తులకు ఎంతో జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.

    విన్నారుకదా! కథనం బాగుంటే లైక్ చెయ్యండి. మరిన్ని కృష్ణలీలలకు సంబంధించిన కథలకై మన ఛానల్ ను ఇప్పుడే సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. 

    సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" ప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ ను...