25, అక్టోబర్ 2023, బుధవారం

 :: సూక్తిముక్తావళి :: 


శ్లో. శత్రో రపి గుణా వాచ్యా, దోషా వాచ్యా గురో రపి,

        సర్వదా సర్వయత్నేన, పుత్రే శిష్యవ దాచరేత్.   

భావము: శత్రువులందున్నను సుగుణములు ప్రశంసించవలెను. గురువులయందున్నను దోషములు చూపవలసినదే. కుమారుని యెప్పుడును, సర్వవిధములలోను శిష్యునివలెనే చూడవలెను.

పద్యము:

చకోర ( భభ భభ భభ భ గల – 13 )

    వైరులలో గల మంచి గుణమ్ముల పట్లను గౌరవముంచి చరించు,

    తీరుగ దేశికులందు వసించుచు దిర్గెడి లోటులు వారికి దెల్పు,

    ఔరసుడైనను సర్వవిధమ్ముల నాదృతితోగొను శిష్యుని రీతి

    క్రూరమనస్కుల దుష్టుల చేరువ కూడకు వారల చేరగనీకు.

10. శ్లో. లభ్యతే ఖలు పాపీయాన్, నరో సుప్రియవాగిహ,

          అప్రియస్య చ పథ్యస్య, వక్తా శ్రోతా చ దుర్లభ:.

భావము: తీయని మాటలచే మోసపుచ్చు పాపులు యీ లోకంలో సర్వత్రా ఉన్నారు. కాని, కటువైననూ పథ్యముగా నుండే మాటలు చెప్పువారూ, వినువారూ కూడ లోకమున అరుదుగనే ఉంటారు గదా!

పద్యము:

హీరకహారధరం ( భభ భభ భభ – 13 )

     తీయని మాటలు గొప్పగ జెప్పుచు దిర్గెడి మ్రుచ్చులు

     మాయల చేయగ నుండిరి హెచ్చుగ, మంచిని దెల్పుచు

     శ్రేయమొసంగెడు మేలగు పల్కులు చిక్కనివైనను

     హాయిగ జెప్పెడివారు గ్రహించెడు నార్యులు లేరిల.

 

11, అక్టోబర్ 2023, బుధవారం

 శ్రీమహాభారతంలోని సభాపర్వం నుండి శబ్దగుణ మాధుర్యం గల ఓ చక్కని పద్యం:

“ ఇచ్చకు వచ్చు పూజనల నెంతయు సంతసమంది తొల్లి నా

కిచ్చె మునీశ్వరుండు దయ నిత్తనయున్; మఱి యిప్డు నెమ్మితో

నిచ్చితివీవు రాక్షసివె! యిక్కుల మెల్లను నుద్ధరింపగా

వచ్చిన పుణ్యదేవతవు వారిరుహాయత చారులోచనా! “

    ఈ పద్యానికి భావం ఏమిటంటే, పద్మాలవంటి విశాలమైన అందమైన కళ్ళుకలదానా! పూర్వం చండకౌశిక మహర్షిని పూజిస్తే ఈ పుత్రుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ప్రేమతో నీవిచ్చావు. నీవు రాక్షసివా?నా వంశాన్ని ఉద్ధరించటానికి వచ్చిన పుణ్యదేవతవు.

    మనం ఇక్కడి కథను పూర్తిగా తెలుసుకుంటేగాని, మనకు ఈ పద్య సందర్భం అర్థం కాదు. ఎవరు ఎవరితో ఇలా పలికారో గ్రహిద్దాం.

    ఇది ‘ జరాసంధుని ‘ జననక్రమం కు సంబంధించింది.

    మహాసమర్థుడైన మగధరాజు బృహద్రథుడు కాశీరాజుకు గల అందమైన ఇద్దరి కుమార్తెలను వివాహమాడాడు. అమిత ప్రీతితో ఆ ఇద్దరితో అనేక సంభోగ సుఖాలు అనుభవించాడు. సంతాన కాంక్షతో దేవ బ్రాహ్మణ ముని పూజలు చేశాడు. శాస్త్ర నియమానుసారం పుత్రకామేష్టి యాగాలు, పెక్కు పుణ్యకార్యాలు చేశాడు. అయినా పుత్రుల్ని పొందలేక జీవితంలో విసిగిపోయాడు.

    పుత్రులు లేని సంపదలు ఎందుకని నిరాశచెంది, భార్యలిద్దరితో కలిసి బృహద్రథుడు అడవికి వెళ్ళి, అక్కడ మహా తేజస్సుతో ఎడతెగని తపస్సు చేస్తున్న చండకౌశిక మహర్షిని చూచి నియమ నిష్ఠలతో, ఎనలేని భక్తితో సేవించాడు. అతని సేవలకు మెచ్చిన ఆ మహర్షి ‘ నీకేమి కావాలో కోరుకో ’మనగా బృహద్రథుడు శిరసు వంచి ఇలా అన్నాడు. ‘ ఓ

    మునిశ్రేష్ఠా! నాకు అంతులేని సుఖసంపదలున్నాయి. కాని, అందుకు తగ్గట్లు సంతానం లేదు. అందుచేత ఆ భోగభాగ్యాలన్నిటినీ వదలి నిశ్చింతగా స్థిరబుద్ధితో తపస్సు చెయ్యాలని వచ్చాను. మీ అనుగ్రహం చేత నాకు పుత్రోదయమైతే నా కోరిక తీరుతుం ‘దని అతడు అనగానే, దయతో ఆ మునిశ్రేష్ఠుడైన చండకౌశికుడు ఒక మామిడిపండును మంత్రించి బృహద్రథ మహారాజుకిచ్చి దీనివల్ల నీకొక కొడుకు జన్మిస్తాడని చెప్పాడు. బృహద్రథుని కోరిక తీరింది. ఆయన తన రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ పండును భార్య లిద్దరకీ సమానంగా పంచి యిచ్చాడు. ఆ పండుతిన్న భార్య లిద్దరూ గర్భవతులయ్యారు. పదినెలల తర్వాత ఒకనాటి రాత్రి యిద్దరికి, ఒక కన్ను, ఒక చెవి, ఒక చెంప, ఒక చన్ను, సగం బొడ్డు, ఒక భుజం, ఒక చెయ్యి, ఒక ప్రక్క భాగం, ఒక తొడ, ఒక కాలు ఉన్న మానవ శరీరపు సగభాగం ముక్కలు ఆశ్చర్యకరంగా ఆ యిద్దరికీ జన్మించాయి. ఆ మానవాకారపు ముక్కల్ని చూసి, బృహద్రథుని భార్య లిద్దరుభయపడ్డారు. ఈ ముక్కలుగా పుట్టిన వాణ్ణి ప్రియమార పుత్రుడని మహారాజుకి ఎలా చూపించాలా? అని సిగ్గు పడ్డారు. ఎవరికీ తెలియకుండా ఈ ముక్కల్ని బయట పారేసిరండనిబృహద్రథుని భార్యలుపనికత్తెల్ని పంపారు. పనికత్తెలు ఆ రెండు ముక్కల్నితీసుకుపోయి రాజభవనం వెలుపలి వాకిలి సమీపంలోనాలుగు త్రోవలు కలిసేచోట ఒకవైపు వేసి వచ్చారు.అక్కడ ఉండేజర అనే రాక్షసి ఆ ముక్కలను చూసి, బలి యిచ్చిన ప్రాణి శరీరపు ముక్కలని అనుకొని పరుగెత్తి వచ్చింది.ఆ రాక్షసి తానెత్తుకు వెళ్ళటానికి అనుకూలంగా, కదులుతున్న ఆ రెండు ముక్కల్నికలిపి గట్టిగా పట్టుకున్నది. అవి ఒకదానిలో ఒకటిచక్కగా అతుక్కొని రెండూకలిసి ఒక వ్యక్తిగా రూపొందాయి. ఆ రాక్షసి ఎత్తుకోవటానికి బరువై, వజ్రం లాంటి కఠినమైన శరీరంతోప్రకాశిస్తున్న ఆ బాలుడు పెద్దశబ్దంతో ఏడ్చాడు. ఆ ఏడ్పు విన్న జరకు అతణ్ణి ఎత్తుకుపోవటానికిచేతులాడలేదు.

    ఆ బాలుడి ఏడుపు శబ్దం విని అంత:పురంలో ఉండే వృద్ధ స్త్రీలందరూ పరుగెత్తుకొని వచ్చారు. మహదానంతో ఆ బాలకుణ్ణి ఎత్తుకున్నారు. వాళ్ళ వేగిరపాటునిచూచి బృహద్రథుడుకూడా వచ్చాడు.ఎంతో కాంతితో ప్రకాశిస్తూ,రాగివలెఎర్రగా ఉండేలేత పిడికిలినితన పద్మంవంటి ముఖంపై పెట్టుకొని దిక్కులు పిక్కటిల్లేటట్లు ఏడుస్తున్న తన పుత్రుణ్ణి చూచి మహదానంద భరితుడయ్యాడు. ఆ రాక్షసి కోరుకున్న రూపాన్ని ధరించే శక్తి ఉంది కనుక అప్పుడు మానవకాంత రూపం ధరించి ఆ మగధరాజైన బృహద్రథునితో ఇలా అన్నది. ' నీ భార్య లిద్దరికీ పుట్టిన ఈ మానవ దేహపు ముక్కలు రెండింటిని నీ పనికత్తెలు తెచ్చి ఈ నాలుగుత్రోవల కూడలిలో పారేసి వెళ్ళారు.నేను ఆ ముక్కల్ని కలిపి పట్టుకోగా వజ్రంలా కఠినమైన దేహంతో ఈ బాలుడు రూపొందాడు. మేరుపర్వత శిఖరం వలె ఎత్తుకొనటానికి సాధ్యంకాని వాడయ్యాడు. ఈ బాలుణ్ణి ప్రేమతోనీవు అంగీకరించు ‘ అని ఆ రాక్షసి అనగానే బృహద్రథుడు సంతోషంతో అనిన మాటలనే నన్నయ్య గారు పైపద్యంలో ఉటంకించారు.

( బృహద్రథుడు ఆ బాలుడికి జరచేత ఒకటిగా కలుపబడినవాడు కనుక ‘ జరాసంధుడు ‘ అని పేరు పెట్టాడు. రాక్షసియైన జరకు ప్రతి సంవత్సరం పండుగ జరిపిస్తూ పుత్రుణ్ణి ఎంతో ప్రేమతోపెంచాడు)

10, అక్టోబర్ 2023, మంగళవారం

:: చాటువు :: 

సరసిజనేత్ర! నీ విభుని చారుతరంబగు పేరు చెప్పుమా;

అరయగ నీవునన్నడుగు నాతని పేరిదే చిత్తగింపుమా: 

కరియును వారిరాశి హరుకార్ముకమున్ శరమద్దమున్ శుకం 

బరుదుగా వ్రాయగా నడిమి యక్కరముల్ గణుతింప బేరగున్ 

- కొడిగట్టిన చాటుపద్య దీపాలనెన్నింటినో తమ కవితా సౌహార్దస్నేహంతో తిరిగి వెలిగించిన ఆ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారి సంపాదకత్వాన వెలువడిన ' చాటుపద్య రత్నాకరము ' లోనిదీ పద్యం. 

    ఈరోజుల్లో పత్రికల్లో వచ్చే నుడికట్టులు వెనుకటి కాలాన లేవు. అయినా నిఘంటువులను చూసే అలవాటును పాఠకుల్లో పెంపొందించే ప్రయత్నం ఆనాటి కవులు చేసేవారు. మహాకావ్యాలలో పదాలకు అర్థాలు చూసుకోవడానికేగాక నానార్థాలనూ, పరిమితాక్షరాల పదాలను, తెలుసుకునే ఉతకంఠ పఠితృలోకంలో కలగాలె. కొంత పరిశ్రమ చేస్తేగాని అంతుపట్టని పద్యాలు వ్రాస్తే పాఠకులకు బాధ కలుగదా! పురాణకథలు తెలిసి ఉండవలె. రకరకాల నిఘంటువుల సాయంతో అర్థం రాబట్టుకోవలె. ఈ ప్రయత్నంవల్ల పదజాలంతో పరిచయం ఏర్పడుతుంది. పెద్దపెద్ద కావ్యాలు చదివే పద్ధతికి దారి ఏర్పడుతుంది. 

    మహాకావ్యాలలో ఇలాంటి పద్యాలు అరుదుగా ఉంటాయి. చాటువుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

" పద్మాక్షీ! నీ భర్త అందమైన పేరు చెప్పవా?" 

" తెలుసుకోవడానికి నన్ను నీ వడుగు, ఆయన పేరిదే చిత్తగించు " 

కరి = సారంగం (ఏనుగు); వారిరాశి = సాగరం; హరకార్ముకము = పినాకం, సాయకం, ముకురం, చిలుక. ఈ ఆరు పదాలలోని నడిమి అక్కరములను కలిపితే " రంగనాయకులు " అవుతుంది. ఆ సుందరాంగి భర్తపేరు " రంగనాయకులు " అని ఎంత సుందరంగా చెప్పింది? 

    తన భర్త పేరున్న అక్షరాలు కల పదాలు మూడక్షరాల్లోనే ఉండాలె. సరిగ్గా ఆమె భర్తకు సరిపోయే అక్షరం ఒక్కొక్కటి ప్రతి పదం నడుమ వరుసగా రావలె. ఇన్ని నియమాలను దృష్టిలో పెట్టుకుని ఈ పద్యాన్ని విశ్లేషించాలె. అందుకే అన్నదామె ' అరయగ నీవు నన్నడుగుమ ' ని. ' అరయు ' అనే క్రియాపదంలో ఉంది చమత్కారం. ' అరయుట ' అంటే తెలిసికొనుట, పరిశీలించుట అనే అర్థాలున్నాయి. 

5, అక్టోబర్ 2023, గురువారం

 

కోనసీమ కబుర్లు

అమలాపురంలో ఉన్న ఓ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకల్లా అక్కడకు దగ్గరలో గల "పేరూరు " అగ్రహారం వెడదామని బయలుదేరాను. ఆ రోజు అక్కడకు వెడదామనుకోవడానికి రెండు కారణాలు. అక్కడ ఉన్న పురాతన నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి, ఆ స్వామి కిష్టమైన శనగలను, బెల్లం ను ఆరగింపు చేసి పూజ జరిపించుకొని మొక్కు తీర్చుకోవడం ప్రధాన కారణమైతే, రెండోది అదేదో సినిమా - పేరు గుర్తు లేదు (అసలే సినిమాలు చూడడం తక్కువ ) కానీ, కలర్స్ స్వాతి అన్న అమ్మాయి నటించిన ఆ సినిమాలో చూపించిన , నా మనసును హత్తుకున్న "పేరూరు" వీధులను, మండువా యిళ్ళను చూడాలన్న ఉబలాటం మరొకటి. ముందు రోజే, అంటే.,శనివారం రాత్రే నరసింహస్వామి వారికి ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవడం వల్ల ఆ విషయమై కాలయాపన లేకుండా బయలుదేరి, మార్గం కొత్త కాబట్టి ( నేను అక్కడకు వెడుతున్నానని లేశ మాత్రం ఉప్పందినా మా ఉద్యోగ మిత్ర మండలి పెక్కురు నన్ను వెంటాడే వారు ) వీధిలో ఆ దారి తెలిసిన వారి నడిగి నా స్కూటరు పై బోడసకుర్రు మార్గం పట్టాను. ఎడమవైపు అల్లవరం వెళ్లే కూడలి దాటి కొంతదూరం ముందుకు వెళ్లి అక్కడినుండి కుడివైపు బాట పట్టాను. మొత్తం మీద అరగంటలో పేరూరు అగ్రహారానికి చేరుకొని నరసింహస్వామి వారి ఆలయ మార్గం వాకబుచేసి గుడికి చేరాను. ఆలయం పురాతనంగా ఉన్నా- గుడిలోకి అడుగు పెట్టగానే ఏవో అనిర్వచనీయ ఆధ్యాత్మిక భావనలు బలీయంగా తట్టాయి. మానసిక ప్రమోదాన్ని సంపుష్టిగా అనుభవించాను. జీర్ణ స్థాయిలో ఉన్న ఆ గుడిలో స్వామివారికి ఏలోటూ లేకుండా రానీయకుండా సశాస్త్రీయమైన పూజాదికాలు జరుగుతున్నాయి. గుడి పూజారి గారి ఇల్లు గూడా గుడి ఆవరణలో స్వామి వారికి ఎడమవైపున ఉంది. ప్రభాత సమయంలో నిర్వర్తించవలసిన దైవ అనుష్టాల నన్నింటినీ పూర్తిచేసి, కారణం తెలియదుకానీ ఆయన అప్పుడే అర్జంటుగా యింటి లోనికి వెళ్లారుట యిప్పుడే వస్తానంటూ. సరే! నేనైతే గుడికి చుట్టూ ప్రదక్షిణాలు మొదలెట్టాను. ఆలయ ఆవరణ ప్రాంతమంతా చిక్కగా పూసిన చక్కని పూల మొక్కలతో సువాసనలు వెదజల్లుతూ ఉంది. గుడి లోపల స్వామివారి కిచ్చే ధూప హారతుల నుండి వచ్చే పరిమళంతో కలసి ఆ వాసనలు మనోల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు దాదాపు కనబడకుండా అక్కడక్కడా మాత్రమే గోచరమవుతున్న రేకా మందారాలు, శంఖు పూలు, తుమ్మి పూలు, గన్నేరు పూలు యింకా ఎఱుపు తెలుపు మందారాలు, తెల్లటి గరుడవర్ధనాలూ కళ్ళకు సంతసాన్ని, రాభస్యాన్ని కలుగ జేసాయి. భక్తి తన్మయత్వంతో నేను అయిదు ప్రదక్షిణాలు పూర్తిచేసి గర్భగుడిలోనికి వచ్చేసమయానికి పూజారి గారు పూజ నిర్వర్తించడానికి రెడీ అయిపోయారు. పండు ముదుసలిగా ఉన్న వారు అనూచానంగా వారి తాత ముత్తాతలనుండి ఈ గుడిలోనే ఉంటూ వంశపారంపర్యంగా అర్చకత్వం వహిస్తున్నారట. స్వామివారికి పూజలర్పించి, ప్రసాద సమర్పణ గావించి, తీర్థప్రసాదాలను, శఠారులను పొంది, జ్ఞానులైన వారి ఆశీస్సులందుకుని ఆపై వారితో కొద్దిసేపు ముచ్చటించి బయటకు వచ్చాను.

గుడికి ఎదురుగా ఉన్న వీధిలోని వసారాలతో గూడిన యిళ్ళను చూస్తే మా పూర్వీకుల యిండ్లన్నీ కళ్ళకు గట్టినట్లయ్యాయి. వసారాలలో నులక/నవ్వారు మంచాలు, మడతమంచాలు, వాటి క్రింద మంచి నీటితో నిండి ఉన్న యిత్తడి మరచెంబులు, మంచాల ప్రక్కన మడత పడక కుర్చీలు, తాటాకు విసనకర్రలు చిన్నతనంలో ప్రత్యక్షంగా నేనాడిన మా తాత గారింటిని జ్ఞప్తికి తెచ్చాయి. మండువా లోగిలి గలిగిన ఒకరింటికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని వారి అనుమతితో వారి యింటిని పరిశీలిస్తూ కలయ తిరిగి చూశాను. ఎన్నో గదులు, ద్వారాలు, కిటికీలతో ముస్తాబై సూర్యకాంతి ప్రసరణ నట్టింట విరజిమ్మేలా నిర్మితమై, ఉమ్మడి కుటుంబానికి చిహ్నంగా, రాజసానికి దర్పణంగా నిలిచిన ఆ యిల్లు కేవలం మండువా లోగిలిగా గాక మమతల కోవెలగా అనుభూతి నిచ్చింది. ఇప్పుడంతా వేరు కాపురాల సంస్కృతి పెరుగుతూండడం వల్ల మండువా లోగిళ్ళు ఉనికిని కోల్పోతున్నాయి. మండువాలో నిలుచుని ఉదయం పైకప్పు నుంచి పలుకరించే భానుడిని, రాత్రి వేళ వెన్నెలను కురిపించే చంద్రుడిని చూస్తూ రోజంతా పడే కష్టాన్ని మరచి పోయేవారు ఆ ఆవాసాలలో నివాసముండే వారు. ఇప్పుడు నేను గమనిస్తున్న యింటి వారి ఉవాచ ప్రకారం వారిల్లు కాలానికి అనుగుణమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందట. అందుకై వారు రెండడుగుల మందంతో సున్నం, బంకమట్టి మిశ్రమంతో దృఢంగా తాపీ, వడ్రంగి పనివారి చేతి నైపుణ్యానికి పోటీ పెట్టి మరీ ఆ యింటిని నిర్మింప జేసారుట. దానివల్ల వేసవిలో లోగిలంతా ఎయిర్ కండిషన్ చేయించినట్లు గానూ, శీతాకాలంలో దుప్పటి అవసరం లేకుండా నిదురించే సౌలభ్యాన్ని కలిగి ఉండేదిట. మొత్తం మీద వారిల్లు చాలా అందంగా ఉంది. నాకెన్నో మధుర స్మృతులను మతింప జేసింది. ఆ యింటి పెద్ద ఎంతో అభిమానంతో, ఆదరణతో, ఆత్మీయంగా చేసిన మర్యాద లందుకొని బయటకు వచ్చి స్కూటరుపై యింటికి తిరుగుముఖం పట్టాను. మనసంతా మండువా లోగిళ్ళ గురించి నాకు తెలిసిన విషయాలను నెమరువేసుకొనడంలో నిమగ్నమైపోయింది. చావడిలో పడక కుర్చీలో పడుకొని గొడుగు కర్రతో తగవులు తీర్చే పెద్దరికం తాతయ్యలు, కోడళ్ళకు యింటి పనులు అప్పగించి దర్పం ప్రదర్శించే అత్తమ్మలు, వడివడిగా తమ యింటిపనులు చక్కదిద్దుకునే చలాకీ కోడళ్ళు, నట్టింట్లో ఆటపాటలతో మారాం చేసే మనవళ్ళతో, మనవరాండ్రతో కళకళలాడే లోగిళ్ళు జ్ఞాపకానికి వచ్చాయి. పండగొచ్చినా, వేసవిశలవలొచ్చినా, పెళ్ళిళ్ళవంటి శుభకార్యాలు జరిగినా మండువా లోగిళ్ళలో సందడి అంతాయింతా గాదు. జీవితకాలం నిలిచిపోయే స్మృతుల అనుస్మరణతో ఉత్సాహంగా యింటికి జేరాను.

 

4, అక్టోబర్ 2023, బుధవారం

 

సముచితాలోచన

                                  - క్రొవ్విడి వెంకట రాజారావు

 మంచి చెడ్డలను తెలుసుకోగల బుద్ధి, జ్ఞానం సృష్టిలో మనిషికి మాత్రమే ప్రసాదించ బడినాయి. విశాల దృక్పథంతో యితరుల పట్ల సదుద్దేశాలను పెంచుకుంటూ, సహాయ సహకారాలను అందించుకుంటూ సేవాభావంతో ఈ జీవితాన్ని పరిమళ భరితం చేసుకోవాలి.  అందుకు ఉదాత్తమైన ఆలోచనలు కావాలి.  సద్బుద్ధి కావాలి. చక్కటి ఆలోచనలే మనిషికి జీవిత గమ్యాన్ని ఏర్పాటు చేస్తాయి.  బాగా ఆలోచించి ఉచితమైన బుద్ధితో వేసే అడుగులు సర్వత్రా విజయాలను వరించి పెడతాయి. సత్కీర్తిని ప్రసరింప చేస్తాయి.

మానసికమైన శక్తులన్నింటిలో చింతనాసక్తి సాత్త్వికమైనది, బలీయమైనది.  ఏ మనిషైనా తన మస్తిష్కంలో మెదిలే ఆలోచనల ప్రభావంతో చైతన్య తేజుడౌతాడు. మనస్సులోని మాలిన్యాలను కడిగి వేసి చిత్తశుద్ధిని సంపాదించి తద్వారా మనసుకు ఏకాగ్రతను కల్పించి ఆలోచనలను కార్యరూపంలో పెట్టినపుడు అనంతమైన ప్రయోజనాలను పొందగలం.  జీవితంలో విజయాలను సాధించడానికి సరియైన ఆలోచనలే ఆలంబనగా ఉంటాయి.  అయితే, ఆ ఆలోచనలకు పట్టుదల, ప్రయత్నం, కార్యదీక్షల ఒద్దిక కావాలి. మంచిని, చెడ్డను తెలియజెప్పి చేయదగిన, చేయదగని చేష్టలను వివరించే ఆలోచనలు మనిషికి చక్కని నడవడికను అలవరింపజేస్తూ, వివేకశీలిగా రూపొందింప చేస్తాయి. తద్వారా ఆ వ్యక్తి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలతో బాటు అందరి అభిమానాలను ప్రోది చేసుకుంటాడు. స్పష్టమైన విధానం, ఉదారత కలిగిన సరియైన మార్గంలో దృఢంగా నిలబడిన ఆలోచన సువిశాలభావాన్ని ఏర్పరచి శోభిల్ల చేస్తుంది. మనిషి కేవలం ఆలోచించడానికే పరిమితం కాకుండా అందుకనుగుణమైన కర్తవ్య నిర్వహణకు పూనుకోవాలి.  అప్పుడే అతడు అంతర్ముఖుడు కాకుండా ఉంటాడు.

మెదడులో ఉద్భవించిన ఆలోచనలకు పదును పెట్టిన వారగుట వల్లనే విమానాలను కనిపెట్టిన రైటు సోదరులు, గురుత్వాకర్షణ సిద్ధాంతకర్త ఐన్ స్టీన్ మొదలైనవారు ఈనాటికీ తలపుకొస్తున్నారు. చికాగో సర్వమత సభలో మానవాళికి సోదర భావాన్ని ఉద్భోదించిన వివేకానందుని ఆలోచనా సరళి, స్వాతంత్ర్య సమరంలో పంచాక్షరీ మంత్రంలాగా పనిచేసిన వందేమాతరం ఆలోచనా నినాదం – యివన్నీ భావనాశక్తికున్న సామర్ధ్యాన్ని ప్రకటిస్తున్నాయి.

జీవితంలోని అనుమోద ప్రమోదాలను, ఆనందాతిశయాలను ఆస్వాదించ గలిగే భావనలు కలగాలి. దు:ఖాన్ని, స్వార్ధాన్ని, అహాన్ని, గర్వాన్ని విస్మరించే చింతనలు చేయాలి. అప్పుడే సమదర్శనంతో కూడిన సంస్కారవంతమైన జీవితాన్ననుభవించగలం.

బ్రతికి ఉన్నంతకాలం సముచితాలోచనలు చేయవలసినదేనని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.  నహికశ్చిత్ క్షణమపి – అంటే., ఏ ఒక్కరూ ఏ ఒక్క క్షణాన్నీవృధా చెయ్యకుండా సద్భావంతో మెలగాలి. ఒక్కడూ అందరికోసం – అందరూ ఒక్కడి కోస మన్న సహకారాలోచనతో చరించాలి.  భారతీయ సిద్ధాంతాలలో మన గ్రంథాలను పరిశీలించినపుడు జీవితం చివరి క్షణం వరకు చైతన్య పూరితమైన ఆలోచనలతో కర్తవ్య నిర్వహణ చేసిన శక్తిమంతులే కనిపిస్తారు.  విచక్షణతో కూడిన ఆలోచనలు చేసిన జ్ఞానవంతులు దర్శనమిస్తారు.

సత్యం, ధర్మం,దయ, ప్రేమ, సదాచారం, సుహృద్భావాలకు ప్రతీకగా వర్తించిన ఆ మహానుభావుల ఆలోచనాక్రమాన్ని గ్రహించి కలిగే ఆలోచనలను సన్మార్గంలో మళ్ళించి అందరూ ప్రశంసించే విధంగా స్థిరపడాలి.

    అమృతమయమగు చింతన నరయుచుండి

                    పరిమళభరిత బుద్ధితో వఱలు నీకు

                    సతతము విజయమే గూడి సాతమమరు

                    కనుక మంచిని యోచించ కదులు మోయి “

 

                   

 

   

 

3, అక్టోబర్ 2023, మంగళవారం

 :: సూక్తిముక్తావళి ::

శ్లో. ఆరోప్యతే శిలా శైలే, యత్నేన మహతా యథా,

     నిపాత్యతే క్షణేనాధ:, తథాత్మా గుణదోషయో:.

భావము: పర్వతముమీది కొక గండశిలను యెక్కించుట కెంతయో ప్రయత్న మవసరము. దానినే అచ్చటినుంచి క్రిందికి త్రోసివేయుట ఎంతో సుకరము. అట్లే మానవునియందు గుణములను జొప్పించుట బహుళ కష్టతరమున్ను, చెడును అలవరచుట మిక్కిలి సుకరమున్ను అయి వుంటూంది.

పద్యము:

అరసాత ( భభ భభ భభ భర – 13 )

    రాయిని కొండకు జేర్చుట కెంతయు లాతగు యత్నము కావలె, నట్టిదే

    రాయిని శైలము నుండియు త్రోసి మరల్చుట తేలికయేనగు, నట్టులే

    శ్రేయము గూర్చు గుణమ్ముల నన్నియు జేర్చుట కష్టమునై, చెడు నెంచుచున్

    శ్రేయముగాని నికారము లెల్లను జేర్చుట మానవులందున తేలికౌ.

2, అక్టోబర్ 2023, సోమవారం

 :: ఆకలికవిత్వం :: 

    కవిత్వమంటే చెవికోసుకునే భోజరాజు పరిపాలనలో కవిపండితులకు తప్ప మరెవరికీ రాజాదరణ లభించేది కాదు. వేదవేదాంగాలు వల్లెవేసినవారికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. అందుచేత కొందరు వేదాధ్యయనపరులైన ఛాందసబ్రాహ్మణులు, ఎలాగైనా ఒక శ్లోకం అల్లి, భోజరాజుకు నివేదించి, కొంత బహుమానం సంపాదించి పొట్టపోసుకుందామని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే భోజరాజు దగ్గరికి యాచనకు వెళ్ళినా కవిత్వంతోనే యాచించాలి. 

    ఒకరోజున ఆబ్రాహ్మణులు ధారానగరంలోని భువనేశ్వరీ ఆలయానికి వెళ్ళి శ్లోకం అల్లటానికి కూచున్నారు. పంక్తికి ఎనిమిదేసి అక్షరాల చొప్పున నాలుగు పంక్తులు అల్లగలిగితే ఒక శ్లోకమవుతుంది. ఆ సంగతి వాళ్ళకు తెలుసు. కాని విషయం ఎంత ఆలోచించినా తట్టలేదు. వాళ్ళను బాధిస్తున్నదల్లా ఒకటే సమస్య. అది భోజనం సమస్య. 

    " భోజనం దేహి రాజేంద్ర " అని అడుగుదామనుకున్నాడు ఒక బ్రాహ్మణుడు. " భేష్, బాగుంది " అన్నారు మిగిలినవాళ్ళు. శ్లోకంలో ఒకపాదం పూర్తి అయింది కూడానూ. 

    ఇంకా మూడు పాదాలు పూర్తికావాలి. 

    " రాజుగార్ని భోజనం పెట్టమని అడిగేటప్పుడు, నెయ్యి, పప్పు వేసి పెట్టమనటం ఉచితంగా ఉంటుందికదా! ' ఘృతసూప సమన్వితం ' అని చేర్చుదాం, " అన్నాడు యింకో బ్రాహ్మణుడు. 

    " భేష్! చాలా బాగుంది, " అన్నారు మిగతావాళ్ళు. 

" భోజనం దేహి రాజేంద్ర 
  ఘృత సూప సమన్వితం " 

    సగం శ్లోకం అయిపోయింది. ఇంకా సగం ఉంది. కాని, పాపం, బ్రాహ్మణులకు ఇంకేమడగాలో తెలియలేదు. వాళ్ళు రాజుగారిని అడగదలచిన పప్పుకూడు రెండు పాదాల్లోనే అడిగేశారు. ఇంకా మిగిలివున్న రెండుపాదాలు ఎలా పూర్తి చెయ్యాలి? అందులో రాజుని ఏమడిగేట్టు? 

    ఈ సమస్య తేలక బ్రాహ్మణులు తికమక పడుతున్న సమయంలో మహాకవి కాళిదాసు అక్కడికి వచ్చాడు. శ్లోక పాదాలు రెండు కుదిరి మరి రెండు కుదరక నానా అగచాట్లూ పడే బ్రాహ్మణులను చూశాడు. కాళిదాసుకు వాళ్ళను చూస్తే జాలివేసింది. వాళ్ళు అల్లిన కవిత్వానికి భోజుడు కానీ కూడా యివ్వడు. 

    " అయ్యా! మీకభ్యంతరం లేకపోతే మిగిలిన శ్లోక పాదాలు నేను పూర్తిచేస్తాను. పూర్తి శ్లోకం భోజరాజుకి సమర్పించి ఏమైనా దొరికితే పుచ్చుకోండి, " అన్నాడు కాళిదాసు. 

    " అంతకంటేనా, బాబూ! సమయానికి నీవు దేవుడల్లే యిక్కడికి వచ్చావు. మిగిలిన రెండు పాదాలూ రాసిపెట్టు. నీ మేలు చెప్పుకుంటాం, " అన్నారు బ్రాహ్మణులు. 

    " భోజరాజును మీరు నెయ్యి పప్పులతో సహా భోజనం అడగనే అడిగారు. శరత్కాలపు చంద్రుని వెన్నెలవలె తెల్లనైన గేదె పెరుగుతోకూడా భోజనం పెట్టమని అడగండి, " అన్నాడు కాళిదాసు. 

    బ్రాహ్మణులు గేదెపెరుగు మాట చెవిని పడగానే పరమానందభరితులై, " ఏదీ? ఎలా? " అన్నారు ఆత్రంగా. 

" మాహిషంచ శరచ్చంద్ర
     చంద్రికా ధవళం దధి " 

- అని కాళిదాసు వారి శ్లోకాన్ని పూర్తిచేశాడు. అందులోగల కవిత్వం వారికి అర్థం కాకపోయినా, శ్లోకం పూర్తయి, తమ పని ముగిసిందన్న సంతోషంలో ఆబ్రాహ్మణులు కాళిదాసుకు ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి వెళ్ళిపోయారు. 

    వారు మర్నాడు రాజసభకు వెళ్ళారు. అతికష్టంమీద రాజదర్శనం లభించింది. ఆ సమయంలో భోజరాజు కవిపండితులమధ్య సుఖాశీనుడై ఉన్నాడు. మంత్రిసామంతులతో, ప్రజలతో సభ కిక్కిరిసివున్నది. 

    పండితులు భోజరాజుకు ఎదురుగా నిలబడి కంఠస్థం చేసిన శ్లోకం - 

" భోజనం దేహి రాజేంద్ర 
   ఘృతసూప సమన్వితం
  మాహిషంచ శరచ్చంద్ర
చంద్రికాధవళం దధి "

- అని చదివారు. 

    ఈ శ్లోకం వింటూనే భోజరాజు, " యీ శ్లోకం మొదటి రెండు పాదాలు రాసిన వారికి కవిత్వం రాదు. అయితే, మిగిలిన రెండు పాదాలూ రాసినది కాళిదాసు తప్ప మరొకరై ఉండరు! ఆ రెండు పాదాలకు అక్షరలక్షలిచ్చి ఈ ఛాందసపు బ్రాహ్మణులను పంపివేయండి " అన్నాడు. 

    బ్రాహ్మణులు నిర్ఘాంతపోయి సభచుట్టూ కలయచూసేసరికి వారికి కాళిదాసు కనిపించాడు. ఆయనే తమకు భిక్ష పెట్టాడని తెలుసుకుని, దొరికిన సొమ్ము తీసుకుని తమ దారిన వెళ్ళిపోయారు. 
    







:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...