20, డిసెంబర్ 2025, శనివారం

:: వాతాపిగణపతి ::  


    పాండవులు నారదుడు చెప్పిన విధంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ, ధౌమ్యుడు పురోహితుడుగా గణేశవ్రతాన్ని చేసి, మారు వేషాలతో విరాటురాజు కొలువులో అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించారు. 

    కృష్ణుని అండతో పాండవులు కౌరవులతో యుద్ధంచేసి విజయం పొందారు. హస్తినాపురంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ, అశ్వమేధ యాగాన్ని చేయడానికి తలపెట్టాడు. 

    యాగాశ్వం వెంట సైన్యసమేతంగా అర్జునుడు బయలుదేరాడు. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు కూడా అతనితో ఉన్నాడు. 

    యాగాశ్వం అనేక రాజ్యాల మీదుగా వెళ్ళింది. రాజులనేకులు ధర్మరాజు పాలనకు వినయ విధేయతలు ప్రకటించారు. గుర్రం వెడుతూ వెడుతూ ఓ ప్రాంతంలో ఆగిపోయి మరి ముందడుగు వేయలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయి ధౌమ్యుణ్ణి ఎందుకిలా జరిగిందని అడిగాడు. ధౌమ్యుడు 'చెబుతా పద'  అన్నట్లు చూసి దారితీశాడు. కొంచెం దూరం వెళ్ళగా  ఒక మహానగరం కనిపించింది. ఆ నగరం మధ్యలో బ్రహ్మాండమైన విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్నది. ఒక పెద్ద కొండరాతిని మలచిన శిల్పం అది. అత్యంత కళాశోభితమై విరాజిల్లుతున్నది. 

    " అర్జునా! విఘ్నేశ్వర దేవుణ్ణి అర్చించి ప్రణామములు అర్పించు. తరువాత వాతాపి గణపతిగా పేరుపొందిన ఈ దేవుని గురించి, వాతాపి నగరం గురించి సవిస్తరంగా చెబుతాను " అని అన్నాడు ధౌమ్యుడు. 

    అర్జునుడు పూజాక్రమం జరిపి, వాతాపి గణపతిని భక్తి ప్రపత్తులతో ఆరాధించాక, ధౌమ్యుడు వాతాపి నగరంలోకి దారితీశాడు. అతని వెనుక అర్జునుడు వెళ్ళి నగరాన్ని చూశాడు. ఒకప్పుడు ఆ నగరం మహా వైభవంతో వెలిగిన ఛాయలు గోచరించాయి. కాని, ఇప్పుడు నగరం ఆలనా పాలనా లేక బీడుపడి ఉన్నది. లెక్కకురాని కొద్దిమంది పౌరులు కనిపించారు. అర్జునుడి రాకకు వారు సంతోషంతో స్వాగతం పలికి, పాలనా వ్యవస్థ ఏర్పరచి నగరాన్ని పునరుద్ధరణ చేయమని ప్రార్థించారు. 

    " అర్జునా! ఇది వాతాపి నగరం. నగరం మధ్యలో విఘ్నేశ్వరుడు అగస్త్యమహామునిచే నెలకొల్పబడిన అద్భుత శిల్పం. ఇది వాతాపి గణపతి క్షేత్రంగా పిలువబడుతున్నది. విశేషాలు చెబుతాను, విను " అంటూ ధౌమ్యుడు చెప్పడం ప్రారంభించాడు. 

    గంగ, కవేరుడు అనే రాజర్షి కమండలువులో పడి కావేరిగా రూపుధరించి, అతని కుమార్తెగా ఆశ్రమంలో పెరిగింది. అగస్త్యుడు ఆ కన్యను చూసి వివాహం చేసుకుంటానని కవేరుడితో చెప్పాడు. 

    కవేరుడు తన సమ్మతిని తెలిపి, " అగస్త్యా! కావేరి అభిమతం కూడా తెలుసుకుంటే మంచిదికదా! " అన్నాడు. 

    అగస్త్యుడు ఆశ్రమంలో కావేరితో చనువుగా ఉంటూ ఉండగా ఒకనాడు కావేరి అతనితో సహ్యపర్వతం మీద వనవిహారం చేయాలని ఉందని చెప్పింది. అగస్త్యుడు కావేరిని తీసుకువెళ్ళాడు. 

    వనవిహారం చేస్తూ ఒక చిన్న మడుగులో తామరపువ్వును చూసి ముచ్చటపడుతూ, కావేరి చరచరా వెళ్ళి, దానిని తీసుకోవడానికి మడుగులో అడుగు పెట్టింది. నీటి తాకిడితో ఆమె అమాంతంగా జలరాశిగా మారిపోయి, వరదలా పొంగి సహ్యపర్వత శిఖరాలనుండి జలజలా జారుతూ కావేరి నదిగా పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించింది. 

    అగస్త్యుడు కావేరినే తలచుకుంటూ చాలాకాలం బ్రహ్మచారిగానే ఉండిపోయి, గొప్ప తపస్సు చేసి ఋషిశ్రేష్ఠుడు అనిపించుకున్నాడు. ఒకనాడతడు అరణ్యంలో చెట్టుకొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతున్న పితృదేవతలను చూసి, ఎవరు మీరు? ఎందుకిలా ఉన్నారని అడిగాడు. 

    వారు నిట్టూర్పులు విడుస్తూ " మా వంశీకుడు అగస్త్యుడు ఒక ఇంటివాడై సంతానం కనేవరకూ ఇలాగే ఉంటాము " అని చెప్పారు. 

    అగస్త్యుడు తన దివ్యదృష్టితో విదర్భరాజుకు కావేరి అంశతో కుమార్తె పుట్టి, లోపాముద్ర పేరుతో పెరిగి యుక్తవయస్కురాలై ఉన్నట్లు తెలుసుకుని వెళ్ళి, ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందని విదర్భరాజుని కోరాడు. 

    కందమూలాలు తింటూ నారకట్టుకు తిరిగే మునికి సుకుమారి రాకుమారిని ఎలా యివ్వడం? యివ్వకపోతే, శపిస్తాడేమో అని రాజు సంశయపడుతూ వ్యాకులచిత్తుడై ఉండగా, లోపాముద్ర అగస్త్యుడితో నిరభ్యంతరంగా వెంటనే తన వివాహం జరిపించమని చెప్పింది. 

    విదర్భరాజు ఆవిధంగానే లోపాముద్రను అగస్త్యమహర్షికిచ్చి అతనితో పంపాడు. 

    అగస్త్యుడు లోపాముద్రతో తన ఆశ్రమానికి వచ్చాక ఒకనాడు " నా పితృ దేవతలను పున్నామ నరకం నుండి తరింపజేయడానికి నీవలన సంతానం కనాలని నిన్ను వివాహం చేసుకున్నాను " అని లోపాముద్రతో అన్నాడు. 

    అప్పుడామె తన ముతక చీర చూసుకొని విచారిస్తూ " వివాహం చేసుకోగానే సరా? నేను రాజపుత్రికగా పుట్టి పెరిగిన దానను. నాకు తగ్గ మంచి బట్టలు, రత్నాభరణాలు సమకూర్చడం నీ విధి. అందుకు కావలసినంత ధనం సంపాదించుకు రావడం నీ కర్తవ్యం " అన్నది. 

    అగస్త్యుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి, ధనసేకరణకు బయలుదేరాడు. అతడు చాలామంది రాజుల వద్దకు వెళ్ళి , రాజ్యపాలనకు సరిపడగా మిగిలిన ధనాన్ని తనకిమ్మన్నాడు. ఏ రాజూ కూడా మిగులు చెప్పలేదు సరికదా, ఎంతో లోటు పడుతూన్నట్లుగా చెబుతూ, తమకుకూడా ఏమైనా ధనలాభం కలిగే మార్గం చూపమని వేడుకున్నారు. 

    అగస్త్యుడు హతాశుడై అరణ్యమార్గంలో వెడుతూ, ఒకచోట ఉన్నతమైన ఒక మహాశిలను చూశాడు. ఆ రాయి లంబోదరుడైన విఘ్నేశ్వరుని పోలినట్టుగా కనిపించింది. ఆ మహాశిలనే విఘ్నేశ్వరుడిగా భావిస్తూ, అగస్త్యుడు నమస్కరించి " గణపతీ! తపస్సు తప్పితే రెండో ధ్యాస లేనివాడను. ధనసంపాదనకు విద్యలేవీ నాకు తెలియవు. ధనం నాకు ఎలాగ లభిస్తుంది? నీవైనా నాకు ఒకదారి చూపవా? " అంటూ వేడుకొన్నాడు. 

    అప్పుడు, " ఏమిటి మహర్షీ! శిలతో మంతనాలాడుతున్నావు? " అంటూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. 

    అగస్త్యుడు ప్రణమిల్లి, మ్రొక్కి తన మొర వినిపించాడు. 

    విఘ్నేశ్వరుడు " అగస్త్యా! రావలసిన చోటుకే వచ్చావు. రావలసిన వాడివే వచ్చావు. కొంచెం సేపట్లో ఇల్వలుడు నిన్ను భోజనానికి పిలుస్తాడు. వెళ్ళు. ఇల్వలుడి దగ్గర అంతులేని ధనరాశి మూలుగుతూ ఉంది. నీవలన కాగల కార్యంకూడా ఉంది " అన్నాడు. 

    అగస్త్యుడు, " గణపతీ! ఈ మహాశిలలో నీ పోలికలు నాకు కనిపించాయి. అందుచేత ఈ శిల అపూర్వ గణపతి విగ్రహంగా రూపొందాలనే నా కోరికగూడా సఫలం చెయ్యి " అని కోరాడు. 

    విఘ్నేశ్వరుడు " అలాగే అవుతుందిలే " అని చెప్పి అంతర్ధానమయ్యాడు. 

    అగస్త్యుడు చాలా అలసి ఉన్నాడు. ఆకలిగా కూడా ఉంది. ఆయాసంగా మహాశిలను ఆనుకొని కూర్చొని అలా చూస్తూండగా, అతిథులను వెంటబెట్టుకొని వస్తున్న ఇల్వలుడు కనిపించాడు. అగస్త్యుడికి విషయమంతా తృటిలో తెలిసిపోయింది. 

    ఆ అరణ్యంలో వాతాపి, ఇల్వలుడు అనే గొప్ప మాయావులైన రాక్షసులు ఋషులను, యాత్రికులను, బాటసారులను చంపి, ధనాన్ని దోచుకొని, పెద్ద రాతిదుర్గంలో పోగుచేస్తున్నారు. ధర్మం మూర్తీభవించిన మహారాజు వేషంలో ఇల్వలుడు ఆతిథ్యానికి తీసుకువచ్చిన వారికి వినయ విధేయతలతో మర్యాదలు, కుశల ప్రశ్నలు జరుపుతున్న సమయంలో, వాతాపి బాగా కొవ్వుపట్టిన మేకపోతుగా మారతాడు. ఇల్వలుడు ఆ మేకను తెచ్చి చంపి, వండించి  మేకమాంసంతో భోజనం పెడతాడు. అతిధులు భుక్తాయాసంతో విశ్రమిస్తున్న సమయంలో ఇల్వలుడు గొంతెత్తి, " వాతాపీ! " అని పిలుస్తాడు. వాతాపి అతిథుల పొట్టలను చీల్చుకొని వస్తాడు. ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి అగస్త్యుడి ఒళ్ళు మండిపోయింది. 

    ఇల్వలుడు అగస్త్యుణ్ణి సమీపించి, వీడెవడో గొప్ప ఋషిలాగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను ఎంతమందిని హతమార్చితే అంతమంచిది అని అనుకుంటూ సవినయంగా భోజనానికి ఆహ్వానించాడు. 

    అగస్త్యుడు ఆకలితో అలమటించి పోతున్న వాడిలాగా పరమానందం కనబరచి, " ఓ ధర్మదాతా! నీలాంటి వాళ్ళుండబట్టే ఈ భూమండలం  అనంతాకాశంలో యిలా నిలిచి ఉంది. పద " అంటూ ఇల్వలుడి వెంట రాతిదుర్గానికి వెళ్ళి, " ఓ అన్నదాతా! చాలారోజులుగా తిండి లేదు. ఆకలి దహించేస్తున్నది. వెయ్యి యజ్ఞాలను జరిపించిన వాడిని కావటం వల్ల, మేకమాంసం తప్పితే మరేదీ అరగని రోగం ఒకటి పట్టుకొన్నది. అంచేత, ముందు నాకు ఆ మాంస భోజనం పెట్టి నన్ను పంపించు " అన్నాడు. 

    ఇల్వలుడు " స్వామీ! మీకోసమే రాసిపెట్టి ఉన్నది కాబోలు, మా యింట చిరకాలం నుంచీ ఒక మేకపోతు పెరుగుతూ బాగా కొవ్వుపట్టి ఉన్నది " అని చెబుతూ వెంటనే మేకరూపంలో ఉన్న వాతాపిని చూపించాడు. 

     అగస్త్యుడు మేకను చూసి " ఆహా! ఏం మేక, ఏంమేక! వెయ్యి యాగాలు చేయించానన్నమాటే గానీ, ఇలాంటి మేకను రుచి చూడలేదు. నాయనా! ముందు దీని గుండెకాయ మొదలైన మేలు ముక్కలన్నీ నాకు పెట్టి, ఆ తర్వాత మిగతాది అతిథులకు పెట్టు. ముందే చెబుతున్నాను, మరేం అనుకోకు. మాంసం తప్ప మరేదీ నేను తినలేనుసుమా! నేను తినగలిగినదంతా నాకు వడ్డించాలి. మర్చిపోకు " అన్నాడు. 

        ఇల్వలుడు అగ్నిలో మేకను  కాల్చి, మాంసం వండించి అగస్త్యుడికి పెట్టాడు. ఎంత వడ్డించినా తినేస్తూ అగస్త్యుడు పూర్తి మేకపోతు మాంసం ఆరగించి త్రేన్చాడు. ఇల్వలుడు ఆశ్చర్యంతోబాటు కొంచెం భీతికూడా పడుతూ, " స్వామీ! తమరు మంచి ఘనాపాఠీల్లాగున్నారే? " అన్నాడు. 

    అగస్త్యుడు చిరునవ్వు నవ్వి " ఘనాపాఠీల్లో ఘనాపాఠీగా మనపేరు ముల్లోకాలకూ తెలుసునోయీ! ఏదీ, కాస్త మద్యం తెప్పించు. ఒక గుండెడు చాల్లే " అన్నాడు. 

    ఇల్వలుడు మరింత నివ్వెరపోతూ, " గుండెడు మద్యం తాగుతారా స్వామీ! " అన్నాడు. 

    అగస్త్యుడు " మనపొట్టకు సముద్రాలే చాలవు " అన్నాడు. 

    ఇల్వలుడు " అలాగే తాగుదురుగాని, మావాడు వాతాపి తెప్పిస్తాడు " అని చెబుతూ, "వాతాపీ! " అంటూ గొంతెత్తి కేకవేశాడు. 

    అగస్త్యుడు నెమ్మదిగా, " ఇంకెక్కడి వాతాపి. వాతాపి మరిరాడు. జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం " అంటూ కడుపు నిమురుకుంటూ, " వాతాపి హరించిపోయాడు " అన్నాడు. 

    ఇల్వలుడు ప్రాణభీతితో గజగజ వణికిపోతూ, జాడలేకుండా పారిపోయాడు. ఆ విధంగా వాతాపి ఇల్వలుల దారుణ హత్యాకాండల మాయా నాటకం అంతమయింది. 

    ఆ తరువాత అగస్త్యుడు మిగతా అతిథులకు జరిగిందంతా చెప్పి, రాతిదుర్గంలో కుప్పతెప్పలుగా పడిఉన్న అస్తిపంజరాల్నీ, కపాల రాసులనూ చూపించాడు. వారంతా గుండెలు బాదుకొంటూ బ్రతికి బయట పడ్డందుకు అగస్త్యుడికి ప్రణమిల్లి మ్రొక్కారు. 

    ఆ దుర్గంలో పదిలంగా భద్రపరచి ఉన్న ధనరాసుల్ని అగస్త్యుడు చూశాడు. తనకు కావలసినది పోగా, మిగిలిన ధనంతో ఒక మహానగరం నిర్మించవచ్చు. వేలాదిమంది సుఖంగా జీవించవచ్చని ఆయనకు తోచింది. 

    వెంటనే అగస్త్యుడు అందరికీ ధనాన్ని పంచటం మొదలుపెట్టాడు. ఆ సంగతి విని, సమీప రాజ్యాలనుండి ఎంతోమంది ప్రజలు అక్కడకు చేరుకొని, అగస్త్యు డిచ్చిన ధనంతో ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు. 

    అగస్త్యుడికి విఘ్నేశ్వరుడి ఆకారంలాగ కనిపించిన మహాశిల కేంద్రంగా చుట్టూరా ఒక మహానగరం తయారయింది. వాతాపి జీర్ణంతో ఏర్పడిన ఆ నగరం వాతాపి నగరంగా పేరుపొందింది. అగస్త్యుడు స్వపరిపాలనా సూత్రాలను శిలాఫలకాలమీద చెక్కించి నగరంలో పెట్టించాడు. ప్రజలే పాలకులుగా ఆదర్శప్రాయమైన ప్రజారాజ్యం ఏర్పడింది. 

    ( సశేషం. మిగిలిన కథాభాగం వచ్చే వారం. అంతవరకూ శలవు. సర్వేజనా సుఖినోభవంతు!! స్వస్తి!!) 


17, డిసెంబర్ 2025, బుధవారం

:: ఖాండవవన దహనం :: 

    ఒకప్పుడు గ్రీష్మకాలంలో కృష్ణార్జునులిద్దరూ వనవిహారం బయలుదేరారు. పోయిపోయి, ఖాండవవనం సమీపానికి చేరుకున్నారు. అక్కడ వారు సుఖావిష్టులై ఉండగా, ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి " మీరెవరో మహానుభావులలాగా ఉన్నారు. నేను చాలా ఆకలిబాధతో వచ్చాను. ' తీరుస్తాను ' అని మీరు మాట ఇస్తే, నా కథ చెబుతాను అన్నాడు. 

    వెంటనే అర్జునుడు " చెప్పవయ్యా, బ్రాహ్మడా! నేనుండగా నీకేం భయం? " అన్నాడు ధీమాగా. ఈ మాట చెవిని పడగానే వృద్ధుని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఇలా చెప్పాడు. 

    " నేనే అగ్నిని. లోగడ శ్వేతకి అనే రాజు లెక్కలేనన్ని యాగాలు చేశాడు. ఆయన చేసిన యాగాలు ఎన్ని అని లెక్క చెప్పాలంటే వినండి. వాటిలో పాల్గొన్న బ్రాహ్మణులకు పొగవల్ల నేత్రరోగాలు వచ్చినై. హోమం చేసిన నెయ్యి తాగితాగి నాకు కడుపునొప్పి పట్టుకొన్నది. ఈబాధ వదుల్చుకోవటం ఎలాగా? అని బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తే, " ఖాండవవనాన్ని దహించవయ్యా, నీరోగం ఇట్టే నయమవుతుంది " అని అన్నాడు. నేను ఎన్నోసారులు ప్రయత్నం చేశాను కాని,  ఆ వనానికి అధిపతి అయిన దేవేంద్రుడు వర్షం కురిపించడంవల్ల ఆటంకం కలిగి, నాకోరిక నెరవేర్చుకోలేకపోయాను. 

    ఈ సంగతి మళ్ళీపోయి బ్రహ్మతో చెప్పుకొనేసరికి, ఆయన " త్వరలోనే కృష్ణార్జునులు ఆ వనానికి రాబోతున్నారు. అప్పుడు వారికి నీ సంగతి వినిపించి, సహాయం కోరుకో. వారు తప్పక నెరవేరుస్తారు " అని సలహా చెప్పాడు. అలానే మీరు దయచేశారు. నాకోరిక తీర్చాలి " అని ప్రార్థించాడు. 

    మాట తప్పటానికి మనస్కరించక అర్జునుడు " బాగానే ఉంది. మరిప్పుడు మావద్ద ఆయుధాలు లేవే? " అన్నాడు. అప్పుడు అగ్ని వరుణదేవుని వేడుకోగా, వరుణుడు వచ్చి అర్జునునకు గాండీవము, అక్షయతూణీరమూ, దివ్యరథమున్నూ, కృష్ణునికి చక్రము, కౌమోదకి అనే గద సమర్పించాడు. ఈ పరికరాలతో కృష్ణార్జునులు ఒక పక్షం రోజులు కాపలాకాస్తూ ఉండగా, అగ్నిదేవుడు ఖాండవవనం దహించి, తన కోరిక సఫలం చేసుసుకున్నాడు. 

15, డిసెంబర్ 2025, సోమవారం

:: గంగావతరణము ::  

    పూర్వం ఇక్ష్వాకువంశంలో సగరుడనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒకామెకు ఒక్కగానొక్క కొడుకు ' అసమంజసు' డనేవాడు. వీడి దుర్మార్గం సహించలేక తండ్రి వీడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. రెండవ భార్యకు అరవైవేలమంది పుత్రులు. వాళ్ళు చాలా గర్విష్ఠులు. 

    సగరచక్రవర్తి ఒకప్పుడు అశ్వమేథయాగం తలపెట్టాడు. యజ్ఞాశ్వం మాయమయింది. దానిని వెతికి పట్టటానికి ఈ అరవైవేలమంది బయలుదేరి పాతాళలోకం చేరుకున్నారు. అక్కడ కపిలమహర్షి వద్ద ఈ అశ్వం కనపడగా, ఆయనే దొంగిలించాడని వీళ్ళు గోలచేశారు. మహర్షి ఉగ్రుడై, వారిని శపించేసరికి, వారంతా ఉన్నపాటున భస్మమైపోయారు. 

    చివరకు సగరచక్రవర్తికి ' అంశుమంతుడు ' అనే ఒక్క మనుమడు మిగిలాడు. వానికి పట్టం కట్టి చక్రవర్తి తపస్సు చేసుకోబోయాడు. ఈ అంశుమంతుని మనుమడె భగీరథుడు. కపిలమహర్షి వల్ల భస్మమైపోయిన తన ముత్తాతలకు గతులు కల్పించాలని భగీరథుడు సంకల్పించాడు. 

    వారికి గతులు కలుగవలెనంటే, పవిత్రమైన గంగాజలం వారిమీదనుంచి ప్రవహించాలి. అయితే, ఆ కాలమందు గంగ భూలోకమందు ఇంకా అవతరించలేదు. అప్పుడు భగీరథుడు అనేకవేల సంవత్సరాలు ఘోర తపస్సుచేసి గంగాదేవిని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై " నాయనా! నేను దిగివస్తే, నన్ను భూదేవి భరించలేదు. కనుక పరమేశ్వరుణ్ణి గూర్చి తపస్సుచేసి, మొట్టమొదట నా శక్తిని ఆయన భరించేటట్టు వరం పొందు " అని చెప్పి అదృశ్యమయింది. 

    భగీరథుడు శివుని గురించి తపస్సుచేసి వరం పొందాడు. తరువాత గంగ దిగివచ్చి పరమేశ్వరుని తలపైనపడి, ఆయన జటాజూటం లోపలినుండి దారిచేసుకొని, భగీరథుని వెంబడే భూమిమీద ప్రవహించింది. 

    ఇలా గొప్ప ప్రయత్నం చేసి, గంగను పాతాళానికి కొనిపోయి, అరవైవేల సగర పుత్రులకూ గతులు కల్పించాడు భగీరథుడు. దీనినిబట్టే, " భగీరథప్రయత్నం " అనే జాతీయం ఏర్పడింది. గంగకు భాగీరథీ అనే పేరు వచ్చింది. శివుడు గంగాధరుడయ్యాడు. 

14, డిసెంబర్ 2025, ఆదివారం

:: మెప్పు ::

    సుగ్రీవుడి నాయకత్వంలో వానర సేన లంకకు బయలు దేరింది. అడ్డం వచ్చిన సముద్రం మీద వారధి నిర్మాణం జరుగుతోంది.  వానరులంతా ఉత్సాహంగా రామ నామాన్ని జపిస్తూ రాళ్ళు ఎత్తుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు.  ఒడ్డున ఉన్న శ్రీరాముడు తనకోసం శ్రమిస్తున్న వానరులను సంతోషంగా చూస్తున్నాడు.  తమ శ్రమను శ్రీరామచంద్ర ప్రభువు కళ్ళారా చూస్తున్నాడన్న విషయం వానరులను మైమరపింపజేస్తోంది.  వారు రెట్టించిన ఉత్సాహంతో పని చేయసాగారు.  ఎండలో నిలబడిఉన్న శ్రీరాముడు, లక్ష్మణుడి కోరికమేరకు  కాసేపు సమీపంలోని వటవృక్షం క్రింద విశ్రమించాడు.  రాళ్ళు మోస్తున్న వానరులు యధాలాపంగా అటు చూసారు.  శ్రీరాముడు కన్పించలేదు.  తాము ఎవరి మెప్పు కోసం ఈ శ్రమ పడుతున్నామో ఆయనే గుర్తించనప్పుడు ఈ శ్రమ దేనికని బాధ పడ్డారు.  అసలే వానరులు.  వెంటనే సముద్రంలో వేసిన రాళ్ళను తెచ్చి ఒడ్డున పడవేయసాగారు.  వారి చర్యను తెలుసుకున్న శ్రీరాముడు చిరునవ్వు నవ్వి తిరిగి వచ్చి యధాస్థానంలో కూర్చున్నాడు.  శ్రీరాముడు కనిపించగానే వానరులు తిరిగి రాళ్ళను సముద్రంలో పడవేసి వారధి కట్టసాగారు.  " చూసేవాడు లేనప్పుడు చేసేవాడికి పనిలో ఉత్సాహం ఉండదు. "

12, డిసెంబర్ 2025, శుక్రవారం

:: ఒకే ఒక్క అరగంట ::  

( " మనం గెలిచే ప్రతి నిముషం , మనల్ని కోల్పోయే నిముషమే ")

    సాఫ్ట్ వేర్ ఇంజనీయర్ అయిన రవి, రోజు మొత్తం తన ల్యాప్ టాప్. ఆఫీస్ కాల్స్, యింకా - పని ఒత్తిడిలోనే గడుపుతాడు. అతని పక్కనే ఉంటున్న అతని వృద్ధ తల్లిదండ్రులు అతనితో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూంటారు. కాని, రవి " ఒక అరగంటలో వస్తాను " అన్నట్టు, ఇది అర్జంట్ కాల్ అంటూ వారిని నిరాకరిస్తూంటాడు. ఇది ప్రతిరోజూ జరుగుతూంటుంది. 

    ఒక సాయంకాలం, తను అత్యంత ముఖ్యమైన క్లయింట్ కాల్ మాట్లాడడానికి సిద్ధమవుతున్నప్పుడు, తన తండ్రి బలవంతంగా వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. రవి కోపంగా " నాకు ఇంకా అరగంట టైమ్ ఇవ్వు నాన్నా! లైఫ్ సెటిల్ అవ్వాలి కదా! " అని అరుస్తాడు. తండ్రి నిరాశగా వెనుదిరుగుతారు. 

    కాల్ ముగిసిన వెంటనే, రవి గిల్టీగా ఫీలయ్యి, తన తల్లిదండ్రుల గదికి వెళతాడు. అక్కడ తండ్రి మంచంపై నిశ్శబ్దంగా పడుకొని ఉంటారు. డాక్టర్ వచ్చి " ఆయన ఇప్పుడే కన్నుమూశారు. ఆయన మీకు ఏదో చెప్పాలని చివరి అరగంటగా ప్రయత్నించారు " అని చెబుతారు. 

    రవి నిర్ఘాంత పోతాడు తండ్రి తనకోసం వ్రాసిన చివరి లెటర్ ను చదువుతాడు. అందులో, " బాబూ! మాకు కావలసినది ఆస్థిపాస్థులు కాదు. నీ సమయం. నువ్వు బిజీగా ఉన్నావని తెలుసు. అందుకే, ఈ లోకంలో నాకు మిగిలి ఉన్న అరగంట నీతో మాట్లాడాలని ఆశపడ్డాను " అని ఉంటుంది. 

    రవి కన్నీళ్ళతో, తాను ఏ నిముషం కోసం తన తల్లిదండ్రులను దూరంచేశాడొ, ఆ నిముషమే తన జీవితంలో అత్యంత విలువైనదని గ్రహిస్తాడు.

( బాగుంటే లైక్ చెయ్యండి ) 

4, డిసెంబర్ 2025, గురువారం

 :: అర్జునుడు శ్యమంతకమణిని భూమిలో ఎందుకు నిక్షిప్తం చేశాడు? :: 


    మణిని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు, అరణ్యంలో ఒకచోట చచ్చిపడి ఉన్న ప్రసేనుడినీ, సింహాన్నీ, జాంబవంతుడి అడుగుజాడలనూ చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు. 

    గుహలో నవ యవ్వనవతి, సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగ ఎగరవేసి పట్టుకొంటూ ఆడుకొంటున్నది. జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబవంతుడికి దొరికిన అనాధ రాజపుత్రిక. అతడామెను తన ముద్దుల కూతురిగా పెంచుకొచ్చాడు. 

    మణిని తీసుకొనడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకొన్నాడు. జాంబవతి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా తలవాల్చి సిగ్గు దొంతరలతో క్రీగంట కృష్ణుణ్ణి చూస్తున్న సమయంలో జాంబవంతుడు గుహకు వచ్చి, కృష్ణుడిపై లంఘించాడు. ఇద్దరికీ పన్నెండు రోజులు గొప్ప యుద్ధం జరిగింది. కృష్ణుడు పిడికిటితో జాంబవంతుడి గుండెమీద బలంగా పొడిచాడు. ఆ పోటుతో రాముడే కృష్ణుడిగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు. 

    జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి, " కృష్ణా! జాంబవతి చేతిని పట్టనే పట్టావు, జాంబవతి నీదే! " అంటూ శ్యమంతకమణినీ, జాంబవతినీ కృష్ణుడికి సమర్పించాడు. 

    జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా, కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి, సత్రాజిత్తుకు మణిని అందజేశాడు. జాంబవంతుడు సత్రాజిత్తుకు జరిగినదంతా చెప్పాడు. 

    సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో " కృష్ణా! సొమ్ము పోయినవాడు పాపాత్ముడు అనే విధంగా నేను మహాపరాథం చేశాను. నన్ను నీ యిష్టమొచ్చినట్లు దండించు " అన్నాడు. 

    కృష్ణుడు సత్రాజిత్తుతో " నీ పశ్ఛాత్తాపమే నీకు దండన " అన్నాడు. 

    అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా, మన్ననగా శ్యమంతకమణినీ, సత్యభామనూ కృష్ణుడి ఎదుట ఉంచి స్వీకరించమని వేడుకొన్నాడు. 

    కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ, శ్యమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకోమని తిరిగి యిచ్చి వేశాడు. సత్యభామ, కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందం పొంగిపొర్లుతుండగా, " చూశావా నాన్నా! నేను గొప్పదాన్నో, మణి గొప్పదో ఇప్పుడు తెలిసిందా! " అన్నట్లు సగర్వంగా సత్రాజిత్తుని చూసి, " నాన్నా! ఒకప్పుడు విఘ్నేశ్వరుడి మహత్తును గుర్తించలేని వాడవై ఏమో అన్నావు. నేను విఘ్నేశ్వరుణ్ణే నమ్ముకున్నదాన్ని. నా అబీష్టం నెరవేరింది " అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి చేతులెత్తి మ్రొక్కింది. 

    అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనుపించి " భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన సత్యానికి ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడు. సత్యమే అతని సొత్తు " అనే అర్థం స్ఫురించేలాగ " సత్యభామా పరిణయంతో కృష్ణుడు సత్యాపతిగా పేరుపడతాడు " అని చెప్పాడు. 

    సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మ్రొక్కి " నా అపచారాన్ని మన్నించు దేవా! " అంటూ లెంపలు వేసుకున్నాడు. 

    కృష్ణుడు " విఘ్నేశా! అంతా నీ లీల. నీ దయవలన అపవాదు తొలగించుకొని మణికంటే అమూల్యమైన సత్యభామా మణిని సంపాదించాను " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " శ్యమంతకమణి కథ విన్నవారికి అపనిందలు అంటవు " అని చెబుతూ అంతర్థానమయ్యాడు. 

    సత్రాజిత్తు కృష్ణుడి కాళ్ళు కడిగి కన్యాదానంచేసే తన అదృష్టానికి పొంగిపోతూ, కృష్ణుడితో సత్యభామ వివాహాన్ని మహా వైభవోపేతంగా జరిపించాడు. తరువాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకొన్నాడు. జాంబవంతుడు కృష్ణుడితో " కృష్ణా! నీవు రామావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చేయాలని అభిలాషను వ్యక్తం చేశాను. నీవంటి అల్లుడిని పొందిన జనకమహారాజు అదృష్టానికి అసూయపడుతున్నాననికూడా అన్నాను. ఆ రెండు కోరికలు ఇప్పుడు తీర్చావు. నేను ధన్యుణ్ణి. జీవన్ముక్తుణ్ణి " అని చెప్పి తపస్సు చేసి తరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. 

    కొంతకాలం తరువాత శతధన్వుడు కసితో సత్రాజిత్తుని చంపి మణిని తీసుకొని కృతవర్మ, అక్రూరులు తోడుగా పారిపోయాడు. కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధన్వుడిని యుద్ధంలో సంహరించాడు. అక్రూర కృతవర్మలు మణితో పారిపోయారు. వారిని వెదకిపట్టి కృష్ణుడు మణిని తీసుకొచ్చి, తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు యిచ్చాడు.

   కృష్ణుడు మిత్రవింద, కాళింది, భద్ర, నాగ్నజితి, లక్ష్మణ అనేవారిని కూడా వివాహం చేసుకొన్నాడు. ఎనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తులతూగుతూ ప్రతియేటా వినాయకచవితిని భక్తిశ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు. 

    శ్యమంతకమణి ప్రభావంవల్ల సత్యభామ అంత:పురం అంతులేని బంగారంతో నిండిపోయింది. ఆ బంగారంతో సత్యభామ రత్నరాసులనూ, అమూల్యాభరణాలనూ, చీనిచీనాంబరాలనూ కోకొల్లలుగా తనయింట నింపుకొంది. అష్టమహిషులలో తానే ఐశ్వర్యవంతురాలననే సంపద్గర్వంతోబాటు, తానే అధికురాలననీ, కృష్ణుడికిష్ట భార్యననే అహంభావం క్రమక్రమంగా పెరిగింది. 

    కృష్ణుని అష్టమహిషులలో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు. నారదుడు తన మహతి వీణను వాయించుతూ గగనమార్గంలో పయనిస్తూండగా పరిహాసం చేస్తున్నట్లుగా పకపకా నవ్వు వినిపించింది. 

    నారదుడు నివ్వెరపోయి, " ఎవరా నవ్వేది? ఎందుకు నవ్వుతున్నావు? " అంటూ నలుదెసలా చూశాడు. 

    " నారదా! యింకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది. నీ వీణానాదానికి నీవు నీలో పొంగిపోతూంటే నవ్వు వచ్చింది " అని అశరీరవాణి పలికింది. 

    నారదుడు, " ఎవరివద్ద ఇంకా నేర్చుకోవాలి? " అని అనుకుంటూండగా, విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి " జాంబవతివద్ద వీణావాద్యంలోని మెళకువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో! " అని చెప్పాడు.

    ఆవిధంగా నారదుడు కృష్ణుడి అనుగ్రహంతో జాంబవతి వల్ల వీణావాదంలోని మెళకువలన్నీ తెలుసుకొన్నాడు. 

    ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంత:పురంలో ఉండగా నారదుడు పారిజాతపుష్పాన్ని అతనికిచ్చాడు. కృష్ణుడు దానిని రుక్మిణికిచ్చాడు. అదివిని సత్యభామ అలిగింది. కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడవాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి, నందనవనంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే తీసుకువచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు. అయినప్పటికీ, కృష్ణుడికి తనపై గురి తగ్గిపోతూన్నదేమోనని దిగులు పట్టుకొన్నది సత్యభామకు. కృష్ణుణ్ణి తన చెప్పుచేతల్లో తన మందిరంలో ఉండిపోయేలాగా చేసుకోవాలన్న తాపత్రయం పెంచుకొన్నది. 

    నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి, పుణ్యకవ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె అధీనంలోనే ఉంటాడని చెప్పాడు. సత్యభామ వ్రత నియమం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది. నారదుడు కృష్ణుణ్ణి ఎత్తుకెత్తు బంగారమిచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు.  సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగారాన్ని కృష్ణ తులాభారంలో పెట్టింది. శ్యమంతకమణిని కూడా వేసింది. కానీ, కృష్ణుడు కొంచెమైనా తూగలేదు. అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి, రుక్మిణిని కృష్ణుణ్ణి విడిపించుకునే మార్గం చెప్పమని వేడింది. 

    రుక్మిణి, " చెల్లీ! కృష్ణుడితో సరితూగగల సంపద భక్తి ఒక్కటే! భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసీదళం చాలును! " అనిచెప్పి సత్యభామకు చిన్న తులసి ఆకు యిచ్చింది. 

    సత్యభామ ఆ తులసీదళాన్ని కన్నుల కద్దుకొని, భక్తిపూర్వకంగా తక్కెడలో వేసింది. కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది. అప్పుడు నారదుడు తులసీదళాన్ని మాత్రమే తీసుకొని కళ్ళకు అద్దుకొని, కృష్ణుణ్ణి సత్యభామపరం చేసి వెళ్ళిపోయాడు. 

    కృష్ణ తులాభారంతో సత్యభామకు జ్ఞానోదయం అయింది. ఐశ్వర్యంమీద, మణి మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తిభావం కలిగింది. 

    మణి వలన లభించిన బంగారాన్ని అంతటినీ కృష్ణుడు చెప్పినట్లుగా యాత్రికులకూ, బాటసారులకూ భోజన వసతి సౌకర్యాలుగల ధర్మశాలలనేకం, దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది. ఆ ధర్మశాలలు సత్రాజిత్తుపేరు స్ఫురించేలాగా సత్రములు అని పిలువబడ్డాయి. 

    అటుపిమ్మట కొంతకాలానికి కృష్ణబలరాముల చెల్లెలైన సుభద్రకు అర్జునిడితో వివాహం జరిగినప్పుడు, సత్యభామ శ్యమంతకమణిని సుభద్రకు అరణంగా పెట్టింది.  ఆవిధంగా మణి పాండవులను చేరింది. 

    మణిగూర్చిన బంగారం ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి బాగా ఉపయోగపడింది. తరువాత ధర్మరాజు జూదమాడి తనతోబాటు తమ్ములనూ, ద్రౌపదినీ, రాజ్యాన్ని ఓడిపోయాడు. రాజసూయయాగం చూసి దుర్యోధనుడికి కన్నుకుట్టింది. ద్రౌపదిని పరాభవించాలనే దుశ్చింత రేపింది. 

    పాండవుల పురోహితుడైన థౌమ్యుడు తొలినుండి అనేక అనర్థాలకు కారణమవుతూ వచ్చిన శ్యమంతకమణిని విసర్జించమని చెప్పగా, అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమికేసి కొట్టాడు. మణి భూగర్భంలో నిక్షిప్తపడిపోయింది. 

    పాండవులు జూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూండగా, ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి, రాజ్యప్రాప్తికి భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశవ్రతాన్ని చేసి, తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు. 

( మరొక గాథ వచ్చేవారం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! ) 

    

    

    

    

3, డిసెంబర్ 2025, బుధవారం

:: రుక్మిణి వేదాంతం :: 


    సత్యభామకు విఘ్నేశ్వరుడిపై ఎనలేని భక్తివిశ్వాసములున్నవి. ఆమె ప్రతి వినాయకచవితికి విఘ్నేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి కృష్ణుణ్ణి తన అధీనుడుగా చేయవలెనని కోరుకుంటూండేది. కృష్ణుడు ఆ దారిని వచ్చినప్పుడల్లా సౌధాగ్రంమీద నిల్చొని చూసి చూసి, ఒకసారైనా అతడు తలపైకెత్తి తనను చూడలేదు కదా అని నిరాశతో విఘ్నేశ్వరుడి మ్రోల మోకరిల్లి తన ఆశ ఫలింపచేయమని మరీమరీ ధ్యానిస్తూండేది. 

    సత్రాజిత్తుకు కుమార్తె మనసు తెలిసినా తెలియనట్టే ఉండేవాడు. ఒకనాడు సత్య విఘ్నేశ్వరుడి ముందు మోకరిల్లి ఉండగా చూసి " ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని అనుగ్రహం మనపై ఉండగా, ఇలాంటి మ్రొక్కుబడులు దేనికమ్మా? " అన్నాడు. 

    సత్యభామ చివాలున లేచి " అలా అనకూడదు నాన్నా! మనోవాంఛితాన్ని సఫలం చేయగల దేవుడు విఘ్నేశ్వరుడు ఒక్కడే " అన్నది. 

    " ఏమిటి నీ మనోవాంఛితం? రుక్మిణితో పాలు పంచుకోవడమేనా? " అన్నాడు సత్రాజిత్తు. 

    " పాలు పంచుకోవడమేమిటి? కృష్ణుణ్ణి నా అధీనంలో పెట్టుకుంటాను " అన్నది సత్యభామ. 

    సత్యభామ పట్టుదల ఎలాంటిదో సత్రాజిత్తుకు తెలియనిదికాదు. అయినా, వట్టి బేల అని తనకు తాను సర్దిబెట్టుకుంటూ వెళ్ళాడు. 

    మరునాడే కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరకు వచ్చాడు. రాకరాక వచ్చిన కృష్ణుడి కళ్ళపడాలని సత్య సంబరపడుతూ  ముస్తాబు సవరించుకొని సభామందిరానికి వెళ్ళేసరికి కృష్ణుడు అప్పుడే వెళ్ళిపోయాడు. సత్రాజిత్తు శ్యమంతకమణిని గుప్పెట్లో భద్రంగా పట్టుకొని ఉగ్రంగా కృష్ణుడు వెళ్ళిన వేపే చూస్తూ ఎంతో దిగులుగా నిలుచున్నాడు. 

    సత్యభామ తండ్రితో " ఏమిటి నాన్నా! అలాగ ఉన్నారు? వచ్చినవాడు నన్ను తనకు యిమ్మని అడగలేదుగద? " అన్నది. 

    " అలా అడిగినా నేనంతగా పట్టించుకోను కాని, ఏమడిగాడో తెలుసా? శ్యమంతకమణిని యిమ్మన్నాడు. తనలాంటి వాడి దగ్గర ఉంటే, ప్రజలందరి శ్రేయస్సుకు ఎన్నోవిధాల ఉపయోగపడుతుందని కూడా అన్నాడు " అని సత్రాజిత్తు చెప్పాడు. 

    సత్యభామ చిరుకోపంతో " ఇంతకూ నాకంటే శ్యమంతకమణే నీకు ఎక్కువైనదికదూ? " అంటూ చరచర వెళ్ళబోతూంటే, సత్రాజిత్తు బుజ్జగింపుగా " అలా అనుకోవద్దమ్మా! ఆ కృష్ణుడి పేరాసకు విస్తుబోతున్నాను, అంతే! " అంటూ నసిగాడు. 

    " అతడు మణి ఇచ్చే బంగారాన్ని దాచుకుంటానని అనలేదుకదా! అతనిది పేరాస ఎలా అవుతుంది నాన్నా? కృష్ణుడంతటివాడు అడిగినప్పుడు సంతోషంతో యిచ్చివేస్తే  ఎంతో బాగుండేది నాన్నా! " అన్నది సత్యభామ. 

    సత్రాజిత్తు కంపించిపోతూ " ఇవ్వను. ప్రాణాలతో ఉండగా నా దగ్గరనుంచి మణిని ఎవరూ తీసుకోలేరు. మణి నా ప్రాణం. నా సర్వస్వం " అంటూ గట్టిగా అరిచాడు. 

    సత్యభామ ముఖం జేవురించుకొని " ఔను! మణి నీకు అంత గొప్పది. నాకంటే గొప్పది. ఆ శ్యమంతకమణి గొప్పదో, నేను గొప్పో ఆ కృష్ణుడే రుజువు చెయ్యాలి " అంటూ చరచరా వెళ్ళింది. 

    కొద్దిరోజుల తరువాత వినాయకచవితి వచ్చింది. సత్యభామ యధావిధిగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించి, ఆ సాయంత్రం పల్లకిలో ద్వారకానగరానికి బయలుదేరి వెళ్ళింది.

    ఆ సాయంత్రం ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది. చీకటి అవుతున్నది. కృష్ణుడు ఆవు పాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా మబ్బు విడిపోయి చవితి చంద్రవంక పాలల్లో తళుక్కున ప్రతిబింబించి కృష్ణుడికి కనిపించి క్షణంలో మబ్బు క్రమ్మి మాయమైంది. 

    వినాయకచవితినాడు చంద్రుడి కంటపడినందుకు కృష్ణుడు నొచ్చుకుంటూ, పూజామందిరంలోకి వెళ్ళి అక్షతలు తలమీద చల్లుకొని, విఘ్నేశ్వరుని ముందు నిల్చొని కన్నులుమూసి  " దేవా! ప్రతిబింబమే అయినా చూశాను. అంతా నీ దయ " అని ధ్యానించాడు. అతడు అలా ధ్యానిస్తున్నప్పుడు " కృష్ణా! నీవు చూడాలని చూడలేదుగా! నీలాపనింద పడినా మబ్బు విడిపోయినట్లే విడిపోతుంది. ఇదీ ఒక లాభానికే అనుకోవయ్యా! " అంటూ విఘ్నేశ్వర ప్రతిమలోంచి వెలువడినట్లుగా మాటలు వినిపించాయి.  

    కృష్ణుడు కన్నులు తెరచి  " స్వామీ! అంతా నీ లీల " అన్నాడు. 

    అదే సమయంలో రుక్మిణి పూజామందిరం ప్రవేశిస్తూ విఘ్నేశ్వరునిముందు నిల్చుని ఏదో జపిస్తున్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూసి " శ్రీవారు విఘ్నేశ్వరుల వారితో ఏవో మంతనాలు జరుపుతున్నట్లున్నదే! " అన్నది. 

    కృష్ణుడు " ఇదేవేళ ఒకానొక వినాయకచవితినాడు నన్ను పెంచిన యశోదమ్మతో నేను అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంతే " అన్నాడు. 

    " ఆ ముద్దుమాటలేమిటో నాకు కూడా వినిపించవా స్వామీ! " అన్నది రుక్మిణి. 

    కృష్ణుడు " యశోదమ్మ పితుకుతున్న పాలలో చవితి చంద్రుడి బింబం చూసి కేరింతలు కొట్టాను. ఎన్ని నిందలు పడతావోకదా! అని యశోదమ్మ నొచ్చుకున్నది. పెద్దయ్యాక అయినా నింద తప్పదన్నది. దానికి నేను అమ్మా! అప్పుడు మళ్ళీ చూడాలికదు! అని అన్నాను " అని చెప్పాడు. 

    రుక్మిణి " మరి అప్పుడు నీలాపనింద సంగతి ఏమైంది? " అని అడిగింది. 

    " మన్ను తింటున్నానని అన్నయ్య చెప్పనే చెప్పాడు " అన్నాడు కృష్ణుడు. 

    రుక్మిణి " మళ్ళీ ఇప్పుడు చంద్రుణ్ణి చూడలేదుకదు. చూడాలన్నా కనిపించడులెండి. బాగా మబ్బుపట్టి ఉంది " అని అంటూ ఏదో చెప్పబోతున్నట్లు చూసింది. 

    " రుక్మిణీ! ఏదో చెప్ప వచ్చినట్లున్నావే, ఏమిటి విశేషం? " అని అడిగాడు కృష్ణుడు. 

    " విశేషమే! సత్రాజిత్తులవారి ఇంటిమణి మన యింటికి విచ్చేసింది " అన్నది రుక్మిణి. 

    కృష్ణుడు " శ్యమంతకమణి మన యింటికి రావడమేమిటి? " అన్నాడు ఆశ్చర్యంగా

    " ఆ మణి కాదు. సత్రాజిత్తులవారి కన్యకామణి, సత్యభామామణి వచ్చింది.  చాలాసేపుగా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాము. చూసిచూసి ఇప్పుడే పల్లకిలో వెళ్ళింది. ఆమెను సాగనంపి యిలా వచ్చాను. మీరు కనిపించారు " అన్నది రుక్మిణి. 

    కృష్ణుడు తలపంకించి " అలాగా! మన ఇంటి విఘ్నేశ్వరదేవుణ్ణి కూడా చూడాలని వచ్చి ఉంటుంది. చూసిందికదా! " అన్నాడు. 

    రుక్మిణి " విఘ్నేశ్వరదేవుణ్ణి చూడాలని వచ్చిందో, మీ కనుసన్నల్లో పడాలని వచ్చిందో మరి! ఉన్నంతసేపూ ఆమె చూపులు మిమ్మల్నే తెగ వెతికి వెతికి వేసారాయని మాత్రం నాకు రూఢిగా తెలుసు " అన్నది. 

    " ఏమిటీ వింత? మాటలు రావనుకున్న రుక్మిణీదేవి, ఈరోజు చతురంగా మాట్లాడుతున్నదే! " అని కృష్ణుడు అన్నాడు. 

    కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో " ఔను నాథా! ఈరోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్యకామణికి మీమీద ఎంత ఆశ! అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాలన్నంత మమత నాకు కనిపించింది " అన్నది.
 " మరి, నీ సంగతి చెప్పలేదు " అన్నాడు కృష్ణుడు.

    " మీలోపల ఒక అణువునై ఇమిడి ఊండిపోవడమే నాకు కావలసినదల్లా! మీరు ఎవరి గుప్పిటలో ఉన్నా, నేను మీలోనే ఉంటానుగదా! " అన్నది రుక్మిణి.

    " రుక్మిణీ! ఎంత గొప్ప భావాల్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు, అందుకే, నిన్ను కోరికోరి ఎత్తుకు వచ్చాను " అన్నాడు కృష్ణుడు. 

    " నాకు నిజమని తోచింది చెబుతున్నాను, నాకంటే సత్యభామదే గొప్ప మమత. బలమైనది. ఆ మమతలో, అనంతమైన ప్రకృతిశక్తి  అంతా ఉంది. స్వామీ! నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే! " అని చెబుతున్న రుక్మిణిని వారించి, కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ " రుక్మిణీ! వేదాంతం మాట్లాడకు " అన్నాడు. 

    కొద్దిదినాలు గడిచాయో లేదో " కృష్ణుడు శ్యమంతకమణిని అపహరించాడు " అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆవిధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దు:ఖంతో పిచ్చివాడై వీధి వీధులా తిరిగి అరుస్తూ విశేషప్రచారం చేశాడు. 

    తనమీద పడ్డ అభాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు దిటవు తెచ్చుకొని, " విఘ్నేశ్వరా! ఇదంతా నీ లీల, తరువాత నీ దయ " అని ధ్యానించి, మణిని అన్వేషించడానికి అరణ్యాల్లోకి వెళ్ళాడు. 

    జరిగిన దేమంటే సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధన్వుడు అనే రాజుకిచ్చి వివాహంచేసే నిర్ణయానికొచ్చి, తన తమ్ముడు ప్రసేనజిత్తును, శతధన్వుడితో మాటామంతీ చేసి రమ్మని పంపాడు. ప్రసేనుడు శ్యమంతకమణిని ధరించి అరణ్యమార్గంలో వెడుతూండగా, ఒక సింహం మణిచేత ఆకర్షింపబడి అతణ్ణి చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి, మణిని తీసుకుపోయి, తన కుమార్తె జాంబవతికిచ్చాడు. 

    మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో, ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడని సత్రాజిత్తు చాటాడు. సత్యభామను పెళ్ళాడటానికి ఉవ్విళ్ళూరుతున్న శతధన్వుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరచి పగతీర్చుకోవడానికి సాయపడతామంటూ కబురుపెట్టారు. 

( ఇప్పటికి సశేషం. తరువాతి వృత్తాంతము వచ్చే వారం. అంతవరకు శలవు. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! )  
    


  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...