మన భారతీయ ఇతిహాసాలు, పురాణాలలోని అద్భుతమైన గాథల సమాహారం. తరతరాలనాటి ధర్మ సూత్రాలను, దైవలీలలను నేటి తరానికి అందించే ఒక నిరంతర కథా ప్రవాహం.
3, జులై 2025, గురువారం
26, జూన్ 2025, గురువారం
:: ఊర్ణనాభుడు ::
మనం ఉండే ఈ లోకాన్నీ, దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన
లోకాల్నీ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చెయ్యటంలో తన నేర్పంతా చూపి ఎంతో
అందంగా చేశాడు గనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. కాని, ఊర్ణనాభుడనే వాడు మాత్రం మెచ్చుకోలేదు.
ఊర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ ఎవరంటే, దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలు కట్టియిచ్చేవాడు. తోటలు, ఉద్యానవనాలు, వాటిలో చిన్నచిన్న సరస్సులు ఇలాంటివన్నీతయారుచేసి యిచ్చి, దేవతలకు ఆనందం కలుగజేసేవాడు. అతని కొడుకు ఊర్ణనాభుడు తండ్రికన్నా నేర్పు కలవాడు. చూసినదల్లా చేసెయ్యగలడు అతడు.
బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవడం విని, “ ఓస్, బ్రహ్మ గొప్ప ఏమిటి? ఇలాంటి లోకాలూ, వింతలూ నేనూ చెయ్యగలను
“ అంటూ బ్రహ్మకు మల్లేనే ప్రతీదీ చెయ్యటం మొదలెట్టేడు ఊర్ణనాభుడు.
ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియడంతోనే
బ్రహ్మకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. అతణ్ణి పిలిపించి “ ఏమోయ్! నువ్వేదో తెలివైన వాడినన్న
గర్వంతో నన్నేధిక్కరిస్తున్నావే. ‘ తగుదునమ్మ ‘అని నాతో పోటీకి వస్తున్నావు.
నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా? నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది. ‘ ఊర్ణనాభం ‘ అంటే ‘ సాలెపురుగు ‘. నీ పని సాలెపురుగు
కట్టిన గూడుకుమల్లే పైకి డాబే కాని, ‘ఉఫ్’ మని ఊదితే నిలువదు. అంచేత నాతో పోటీకి రాక, బుద్ధి తెచ్చుకుని
మసలుకో “ అని కూకలేశాడు.
కాని, ఊర్ణనాభుడు ఊరుకోలేదు. “ ఏమయ్యోయ్, నీ డబాయింపు నా దగ్గర పనిచెయ్యదు. నన్ను మానుకోమనటానికి నువ్వెవరవు? “ అని ఎదిరించాడు.
ఎంత మంచి దేవుడైనప్పటికీ
ఎదిరిస్తే ఊరుకుంటాడా? బ్రహ్మదేవునికి
పట్టరాని కోపం వచ్చి, “ ఒరేయ్, ఊర్ణనాభా!
ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు కనుక నీవు పోయి, భూలోకంలో ఒక ఊర్ణనాభానివై
( సాలెపురుగు ) పుట్టి, ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు
“ అని శపించేశాడు.
ఇంకేముంది? శాపం తగలటంతోనే ఊర్ణనాభుడు గజగజా వణుకుతో బ్రహ్మదేవుని
కాళ్ళమీద పడి “ దేవా! క్షమించు. నన్ను కాపాడు. సాలెపురుగు జన్మలోంచి
తప్పించు “ అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు.
బ్రహ్మదేవునికి జాలివేసింది.
“ నా శాపానికి తిరుగు లేదు. నీవు సాలెపురుగువై పుట్టకతప్పదు. ఎటొచ్చీ, ఆ జన్మలోనే నీకు మోక్షం వచ్చే ఉపాయం ఒకటి చెపుతాను
విను. నువ్వు ఒక అడవిలో ఒక బిల్వ వృక్షం మీద పుట్టబోతున్నావు. ఆ అడవిలోనే ఒక చోట శివుడు
లింగమై వెలిశాడు. ఆ శివుడికి పూజ చెయ్యటానికి భక్తుడొకడు బిల్వ పత్రాలకోసం నీవున్న
చెట్టువద్దకు వస్తాడు. ఆ పత్రితో పాటు నువ్వు శివుని సాన్నిధ్యానికి చేరుకుని ఆ దేవుణ్ణి
సేవించి మోక్షం పొందు “ అని చెప్పేడు.
ఊర్ణనాభుడు శాపం ప్రకారం
ఆ అడవిలో బిల్వవృక్షం మీద సాలెపురుగై పుట్టాడు. సాలెపురుగై ఉన్నా, అతనికి పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకముంది.
ఆ శివభక్తుడు ఎప్పుడు వస్తాడా. తన్ను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకుపోతాడా అని సాలెపురుగు
ఆ చెట్టుమీదే కనిపెట్టుకుని ఉంది.
అలా కొంతకాల మయాక, బ్రహ్మ చెప్పిన శివభక్తుడా చెట్టు దగ్గరకొచ్చి
ఆకులు కొయ్యటం మొదలెట్టాడు. సాలెపురుగు అతను ఆకులు కోస్తున్న కొమ్మమీదకెళ్ళి, ఒక ఆకులో దూరి, ఆకుతోపాటు తాను కూడా అతని బుట్టలోకి చేరుకుంది.
అతడా పత్రి అంతా తీసుకెళ్ళి, ఆ అడవిలోనే వెలసి ఉన్న శివలింగానికి
పూజ చేయసాగాడు. ఒక్కొక్క దళమే తీసి లింగంమీద వేస్తూంటే సాలెపురుగు దాక్కొనిఉన్న ఆకుగూడా
అతని చేతికివచ్చి ఆ పురుగుకు శివదర్శనమయింది. పురుగు ఆకుతోబాటు తనుకూడా లింగం మీద పడిపోకుండా
తప్పించుకుని, భక్తుడు వెళ్ళొపోయాక శివలింగాన్ని తనివితీరా చూడటం
మొదలెట్టింది. “ ఈ మహాదేవుణ్ణి నిత్యం సేవించి, మోక్షం సంపాదించుకుంటాను
“ అని నిశ్చయించుకుంది.
కాని ఆ సాలెపురుగుకు
పట్టుకున్న ఆలోచన ఏమిటంటే, “నేనుత్తి
సాలెపురుగును. ఆ దేవుడికి పూజ చెయ్యాలీ అంటే పువ్వులు, పత్రి
మొదలైనవెన్నో కావాలి.నేను వీటిని తేలేను కదా! మరి, ఈ దేవుడికి
సేవ చెయ్యటం ఎలాగా?” అని.
ఇలా ఆలోచిస్తూ పోగా
చటుక్కున దానికో ఆలోచన తోచింది. “ సేవించాలీ అంటే, పువ్వులూ, పత్రీ తెచ్చే పూజించనక్కరలేదు. నేను ఎంచక్కా అందంగా గూళ్ళు కట్టగలను. ఈ దేవుడికి ఏ భక్తుడూ ఇంకా గుడి కట్టించలేదు.
నేను నా శక్తి అంతా ఉపయోగించి, ఈ దేవుడికి గుడీ, గోపురం అన్నీ కడతాను “ అనుకుంది. అనుకున్న వెంటనే పని ప్రారంభించింది. సాయంకాలం
అయ్యేటప్పటికి, లింగానికి గుడి, గోపురం, ప్రాకారం అన్నీ కట్టేసింది. వేటితో కట్టిందో తెలుసా? ఇటుకలు, రాళ్ళు, సున్నంతోనూ కాదు.
సాలెపురుగు అవన్నీఎక్కడ తేగలదు? సాలెపురుగుకు తన బొడ్డులోనే ఒకరకం
జిగురు ఉంటుంది. ఆ జిగురుతోనే జలతారు పోగులకు మల్లే తళతళ మెరిసిపోయే పోగులు చేసి వాటితో
గూళ్ళు కడుతుంది. మన సాలెపురుగు కూడా ఆ పోగులతోటే శివుడికి గుడి, గోపురం, ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టేసింది. అవన్నీ
ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు! , మర్నాడు పొద్దునే లేచి చూచేటప్పటికి, మంచు బిందువులు వాటి మీద పడి, ఆ గుడి, గోపురం, ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్టు
కనపడినై. క్రమంగాఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికి, అవన్నీ రంగురంగులుగా మెరిసి, నవరత్నాలతో కట్టినట్లు
కనపడ్డాయి.
కాని ఒక చిక్కొచ్చింది.
సాలెపురుగు పోగులతో కట్టిన గుడీ, గోపురం, ప్రాకారం అందంగా ఉన్నాయన్నమాటేగాని వాటిల్లో గట్టి ఎక్కడుంది? కాస్త గాలి వేసేటప్పటికి ఆ పోగులు అక్కడక్కడా తెగిపోతూండేవి. ఆ తెగిపోయిన
వాటికి అతుకు పెట్టడంతో ఆ సాలెపురుగుకు ప్రొద్దస్తమానం సరిపోయేది. ఐతేం? విసుగూ, విరామం లేకుండా అది అలా అతుకులు పెడుతూనే ఉండేది.
శివుడంటే దానికున్న భక్తి, శ్రద్ధ అటువంటివన్న మాట.
ఇలా కొంతకాలమయాక శివుడికి
దాని భక్తిని పరిక్షిద్దామని బుద్ధి పుట్టింది.
సాలెపురుగును పత్రితోబాటు
శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడొకనాడు మామూలు ప్రకారం శివుడికి పూజచేసి, దీపం పెట్టి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళేక శివుడు
తన ప్రభావంచేత ఆ దీపాన్ని పెద్దదయేటట్లు చేశాడు. మొదట ముత్యంలా ఉన్న దీపం సాలెపురుగు
చూస్తుండగానే దివిటీలాగైపోయి, మరో నిమిషానికి తాటిచెట్టంతై, సాలెపురుగు ఎన్ని సంవత్సరాలనుంచో శ్రమపడి కట్టిన గుడినీ, గోపురాన్నీ, ప్రాకారంతో సహా తగులబెట్టి నాశనం చేసింది.
సాలెపురుగుకు దీపం
మీద పట్టరాని కోపం వచ్చింది. “ నేను పరమేశ్వరుని కోసం చేసిన ఈపని అంతా ఈవిధంగా వృధా
అయిపోయాక ఇంక నా బ్రతుకెందుకు? నాకూ, పరమేశ్వరుడికీ అకారణంగా ఇలా అపచారం చేసిన ఈ దీపం పని పడతాను. ఛస్తే ఛస్తాను
దీన్ని మింగేసి, నా కసి తీర్చుకుంటాను “ అని నిశ్చయించుకుని, దీపాన్ని మింగటానికి గబగబా లింగం వద్దకు పరుగెత్తికొచ్చింది.
శివుడాశ్చర్యపోయాడు.
“ అబ్బా, ఈ సాలెపురుగుకి ఎంత భక్తి “ అనుకున్నాడు. తక్షణమే
శివుడు లింగంలోకి ప్రత్యక్షమై, “ ఆగు, ఆగు, దీపాన్ని మింగకు. నీ భక్తిని పరిక్షిద్దామని నేనే చేయించాను ఈ పని. నీ భక్తికి
మెచ్చుకున్నాను. నీకేం కావాలో వరం కోరుకో ఇస్తాను “ అన్నాడు.
ఈశ్వరుడల్లా ప్రత్యక్షమయ్యేటప్పటికి
ఆ సాలెపురుగుకు కలిగిన సంతోషానికి అంతు లేకపోయింది. దానికి శివుణ్ణి స్తోత్రం చెయ్యటానికి
శ్లోకాలూ, మంత్రాలూ రావు కదా! అంచేత భక్తి పొంగివస్తూంటే, అదేపనిగా స్వామికి మ్రొక్కటం మొదలెట్టింది.
వరం కోరుకొమ్మన్నారు
గనుక, సాలెపురుగు జన్మపోయి, మంచి
జన్మ ఏదైనా కోరుకోవచ్చు. డబ్బు, దస్కం ఇమ్మని కోరుకోవచ్చు. కాని, ఆ సాలెపురుగు అలాంటి స్వల్ప కోరికలేమీ కోరలేదు.
“ ఎంత గొప్ప పుట్టుక
పుట్టినా బాధలు తప్పవు. ఏ బాధా లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి. కనుక నన్ను నీలో
చేర్చుకో స్వామీ! “ అని మనసారా కోరింది.
ఈశ్వరుడు దాని తెలివికి, జ్ఞానానికి మెచ్చుకుని, తనలో ఐక్యం చేసుకుని మోక్షమిచ్చాడు. ఈ విధముగా కీటకముగా మారినప్పటికీ, ఊర్ణనాభుడు తరించాడు.
25, జూన్ 2025, బుధవారం
:: తుమ్మెదల
మెట్ట ::
పూర్వం అనగా సుమారు రెండు వందలసంవత్సరముల క్రిందట సింహాచలం
దేవాలయంలో ఒక చిత్రం జరిగింది. అది ఏమిటంటే –
సింహాద్రి నారసింహస్వామికి కృష్ణమాచార్యులు అనే ఆంతరంగిక
భక్తుడు ఒకాయన ఉండేవాడు. ఆ వైష్ణవోత్తముడు భక్తిపూర్వకంగా మధురగానం చేసేసరికి
స్వామి మెచ్చుకుని అతని ఎదుట ప్రత్యక్షమై ఆచార్యులు పాడే పాటకు అనుగుణంగా నృత్యం
చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆచారిలో ఒక విధమైన గర్వం బయలుదేరింది. “
సింహాద్రినాథుడికి నేనే ప్రియమైన భక్తుణ్ణి. స్వామికి నేనుఎంత చెబితే అంత “ అని
మనసులో అనుకునేవాడు.
ఇదే సమయంలో విశిష్టాద్వైత మతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీరామానుజ
స్వామివారు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ ఈ దేవాలయానికి విజయం చేశారు. మహానుభావుడైన రామానుజస్వామిని
అవతార పురుషునిగా ఎంచి అందరూ అనేక విధాల గౌరవిస్తూ ఉండగా కృష్ణమాచార్యులు మాత్రం
నమస్కారమైనా చేయక నా అంతటి వాడను నేను అనే అహంభావంతో ఆయనవైపే చూడటం మానివేశాడు.
సర్వజ్ఞుడైన రామానుజాచార్యులు ఈపాటి గ్రహించలేరా? అతనిమనసుకి పుట్టిన గర్వాన్ని ఇట్టే
తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా కృష్ణమాచారిని పలుకరించి, వినయపూర్వకంగా “ స్వామీ! కృష్ణమాచార్యోత్తమా!
మీరు నాకొక్క ఉపకారం చేసి, తరుణోపాయం
చెప్పాలి. ఈ రాత్రి సింహాద్రినాథుని సన్నిధానమందు దేవరవారు గానమొనర్చి, ఆ దేవదేవుని ప్రసన్నునిగా చేసికొన్న తరువాత
దాసునికిముక్తి ఉన్నదా లేదా? అని అడగండి.
వారు ఏమి సెలవిస్తారో వినండి. తరువాత, మీకు
మోక్షంఉన్నదా లేదా? అనికూడా
ప్రశ్నించండి. స్వామి చెప్పే ప్రత్యుత్తరం జాగ్రత్తగా తెలుసుకుని రేపు ఉదయాన ఈ
దాసునికి తెల్పండి “ అన్నారు.
ఈ మాటకు కృష్ణమాచారి చాలా సంతోషించాడు.ఏమి అంటే- అవతారమూర్తి
అని ఎవరికైతే లోకమంతా జోహారు చేస్తున్నదో, ఆ రామానుజుడే
తనను ఈ విధంగా ఆశ్రయించడంకంటే కావలసినదేముంటుంది?
అందుచేత ఆ రాత్రే తన దివ్యగానం చేత స్వామిని మెప్పించి, ప్రత్యక్షం చేసుకుని “ దేవాదిదేవా!
దక్షిణదేశాన్నుంచి రామానుజాచార్యుడనే యతీశ్వరుడు ఒకాయన వచ్చి ఉన్నారు. ఆయనకు
ముక్తి ఉన్నదా లేదా? ఈ విషయం దేవరను
అడిగి జవాబును చెప్పమన్నాడు. ఏమిటి ఆజ్ఞ ?” అని అడిగాడు.
అప్పుడు సింహాద్రినాథుడు “ ఓయీ! భక్తవరేణ్యా! ఆ రామానుజుడు
కేవలమూ మునీంద్రుడాయెనే. ఆయన యిచ్చిన వారికే ముక్తి కలుగు తూండగా ఆయనకు
ముక్తి ఉన్నదా లేదా? అనేది ఒక
ప్రశ్నా? అది సందేహమేనా? “ అని బదులు
చెప్పాడు.
అయితే, “ స్వామీ! నాకు
మోక్షం కలదా? “ అంటూ మళ్ళీప్రశ్న వేశాడు కృష్ణమాచారి.
అందుకు స్వామి, “ ఓయీ! కృష్ణమాచార్యా! నీవు నాకు ప్రియమైన
భక్తుడివే. నిజమే, కాని, నీకు మోక్షమివ్వటానికి మాత్రం నాకు అధికారం
లేదు. ఏమంటే, ‘
విభూతిద్వయాధికారం ‘ ఇదివరకే
రామానుజాచార్యునికి ఇచ్చివేశాను,. ఎవరికి
మోక్షమివ్వటానికైనా ఆయనే సర్వాధికారి. కనుక, నీకు
మోక్షంకావలెనంటే నీవు వెళ్ళిఆయననే ఆశ్రయించాల్సి ఉంటుంది “ అని చెప్పాడు.
భగవంతుని వాక్యాలు వినగానే అంతులేని అహంకారం చెలరేగి, కృష్ణమాచార్యుడు ఉగ్రుడయ్యాడు. “ ఇంతకాలమై నిన్ను
ఆశ్రయించిన ఫలమిదేనా? పరమపదం కోసం
పరులను ప్రార్థించమంటావా? అమితమైన
భక్తితాత్పర్యాలతో అన్నేళ్ళుగా నిన్ను కీర్తించి భజించానే? చివరకు నన్ను ఇలా మోసగిస్తావా? “ అని నోటికి వచ్చినట్లల్లా నిష్టూరంగా
మాట్లాడ జొచ్చాడు.
ఈ నిష్టురాలకు సహించలేకపోయాడు సింహాద్రినాథుడు. “
కృష్ణమాచార్యా! నీవు రాజసుడివి, తామసుడివి.
భక్తితో పాడానని ఏదో మహా ఉపకారంగా చెబుతున్నావే? నీవు పాడావు.
నేను ఆడాను. నీ పాటకూ, నా ఆటకూ
సరిపోయింది. మరేమీ బాకీ మిగలలేదు. ఇప్పుడు అనాలోచితంగా ఉద్రేకం తెచ్చుకుని నీవు నా
పట్ల కఠినంగా మాట్లాడావు. కాబట్టి నీవు రచించిన కీర్తనలన్నీ నీచులపాలై పోవుగాక! “
అంటూ శపించి వేశాడు.
దేముడిలా శపించే సరికి ఆయన భక్తుడైన కృష్ణమాచార్యునికి కూడా
తీవ్రమైన కోపం వచ్చేసింది. “ ఓయీ! అప్పన్నా! సమస్తమూ నీవేనని నమ్ముకుని ఉన్న నన్ను
మోసగించావు. నా జీవితమంతా నాశనం చేశావు. ఇదిగో నేనే నిజమైన భక్తుణ్ణయితే, నీ ఆలయమంతా ఒక్క రీతిగా ఏడు రోజులు మండి, గోపురాలూ, మంటపాదులూ అన్నీ
కళా కాంతీ లేక పాడిబడి పోవుగాక! “ అంటూ సింహాద్రినాథుడికి ప్రతిశాపం యిచ్చాడు.
సింహాద్రినాథుని శాపంవల్ల కృష్ణమాచార్యుల కీర్తనలన్నీ నీచుల
పాలైనాయి. కృష్ణమాచార్యుని శాప ప్రయోగంవల్ల మరికొద్ది కాలానికే “ మలికనేబు “ డనే మ్లేచ్ఛనాయకుడు
బ్రహ్మాండమైన తన దండుతో సహావచ్చి సింహాచలక్షేత్రాన్ని ధ్వంసం చేయబూనాడు. క్రూరుడైన
ఆ యవనుడు ఆలయాన్ని ముట్టడించి ఆక్రమించబోతాడనే వర్తమానం మహాభక్తుడు, మహాకవి అయినటువంటి గోగులపాటి కూర్మనాథునికి
ముందుగానే తెలిసింది.
ఎవరికీ తెలియకుండా ఆయన తక్షణమే దేవాలయ అంతర్భాగంలోకి పోయి
కూర్చొని మహాభక్తితాత్పర్యాలతో సింహాద్రి దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు
ఫలితంగా అతనికి కవితా ప్రభావం కలిగి “ వైరి హరరంహ! సింహాద్రి నారసింహ “ అనే
మకుటంతో సీస పద్యాలు చెప్ప నారంభించాడు. ఈ పద్యాలలో కూర్మనాథకవి, ఆ యవనుడొనర్చే ఘోరాలను శాంతింప జేయమనీ, శత్రుక్షయము చేయుమనీ కోరాడు. సింహాద్రి దేవుని
దుర్బలత్వాన్ని హెచ్చరిస్తూ అరవై పద్యాలవరకూ ముందు నిష్ఠురంగా వర్ణించాడు.
కూర్మనాథుడు అరవై ఎనిమిదో పద్యం చెప్పిన వెంటనే కవిచంద్రుని
భక్తికి సంతసించి, స్వామి గండు
తుమ్మెదలను సృష్టించాడు. ఆ తుమ్మెదల దండు యవనుల సేనను మర్ధిస్తూ, వాడి అయిన తొండాలతో పొడుస్తూ, చీల్చి చెండాడుతూ సుమారు పదిమైళ్ళ దూరం వరకూ
శత్రు దండును పారద్రీలినై.
ఈ దెబ్బకు తట్టుకోలేక యవనుల దండు వాల్తేరుకు అరమైలు దూరాన ఉండే
ఒక మెట్ట వరకు పారిపోయింది. నాటినుంచి ఆ మెట్టకు “ తుమ్మెద మెట్ట “ అనే పేరు
వచ్చింది. తుమ్మెదల మెట్ట ఇప్పటికీ ఉన్నది. విశాఖపట్టణానికి అది శ్మశాన వాటికగా
ఉపయోగపడుచున్నది. ఈ విధంగా కూర్మనాథకవి సూక్తుల వల్లనే సింహాచలక్షేత్రానికి క్షేమం
కలిగింది. తరువాత కూర్మనాథ కవి తన నరసింహ శతకంలోనే స్వామి మహిమను కొనియాడుతూ
కొన్ని క్షమాపణా పద్యాలు చక్కగా వర్ణించి చెప్పాడు.
:: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట :: శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...
-
:: రామనవమి :: లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...
-
:: మహాగణపతి :: పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి, తల తెగిపడి ఉన్న బాలుణ్ణిచూసి, శివుణ్ణి చురచుర చూస్తూ " ఎంతపని చేశావు. మన ప...
-
:: కుమారస్వామి జననం :: " విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూం...