5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

 :: చిత్రగణపతి ::

    దేవతలూ, రాక్షసులూ కలిసికట్టుగా క్షీరసాగరమథనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహినీ రూపంలో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతలపాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరుగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసి తీర్చుకోవడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సుచేసి, బ్రహ్మను మెప్పించి చావులేని వరం కోరాడు. 

    " పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పనిది. మరోవరం కోరు " అన్నాడు బ్రహ్మ. 

    తారకాసురుడు బాగా ఆలోచించి శివుడి కుమారుడి వల్లనే తప్ప మరేవిధంగానూ తనకు చావులేని వరాన్ని బ్రహ్మనుంచి పొందాడు. 

    అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నితో తనువు చాలించింది. సంతానం లేకుండానే సతీవియోగం పొందిన శివుడు ఉన్మత్తుడిలాగ తిరిగి తిరిగి, హిమాలయ పర్వతాల్లో ఒకచోట విరాగిగా కఠోరదీక్షతో తపస్సుచేస్తూ ఉన్నాడు. 

    తారకాసురుడు రాక్షసులందర్నీ కూడగట్టుకొని విజృంభించాడు. ముల్లోకాలనూ ఆక్రమించుకొని, కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు తమ దీనావస్థను బ్రహ్మతో మొరబెట్టుకున్నారు. 

    " శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి " అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి. ఇంకెవరివల్లా తారకాసురుడికి ఎటువంటి హాని జరుగదు. మరోవిధంగా అతడికి చావూలేదు " అని బ్రహ్మచెప్పి దేవతలను వెంటబెట్టుకొని తరుణోపాయానికి విష్ణువు దగ్గరకు దారితీశాడు. 

    " సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికి, పార్వతికి పెళ్ళి జరిగేలా చూడండి " అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుడి దగ్గరకు పంపించారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుని దగ్గరకు వెళ్ళి, పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తూండడానికి అనుమతించ వలసిందని వినయపూర్వకంగా కోరాడు. 

    శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయడానికి పురమాయించాడు. 

    చిన్నతనంనుంచి పార్వతికి శివుడంటే చాలా యిష్టం. బాలపార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెబుతూండేవాడు. శివుడి కథలనూ, గుణగణాలనూ, మహిమలనూ పదేపదే వినడానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్ళాడితే శివుణ్ణే పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయడం తరుణప్రాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది. 

    తెల్లవారుతూండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా నెమలిపింఛపు కట్టతో తుడిచి, హిమానీ జలాల్లో మంచి గంధం కలిపి కల్లాపు జల్లి, ముత్యాలముగ్గులు తీర్చేది. బంగారు తీగెలతో అల్లి, రత్నాలు కెంపులు పొదిగిన తట్టలో శివుడికి యిష్టమైన ఫలపుష్పాలను, మారేడు పత్రిని, తెల్లకలువను తీసుకెళ్ళి పక్కనుంచేది. బంగారు కమండలువు నిండా హిమశిఖరాల నుండి జారే స్ఫటిక జలాలను నింపి, జపమాలతో కలిపి అమర్చి పెట్టేది. శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా అలంకరించుకొని వెళ్ళేది. కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, కేదార, శివరంజని మొదలైన రాగాల్ని ఆలపించేది. శివుడి చూపులు తనపై పడాలని పదేపదే ప్రయత్నిస్తూండేది. 

    తపోదీక్షలో నిమగ్నుడై శివుడు ఒక్కసారైనా తనను పరికించగలడేమోనని, అతని చల్లని చూపులు తనపై వాలాలని పార్వతి శివుడి ముఖాన్ని అలాచూస్తూ ఉండిపోయేది. శివుడు పొరపాటుగానైనా తనవంక చూడడేమో అని నిరాశా, నిస్పృహలతో ఊగిసలాడేది. 

    శివుడి మనస్సు చలించడానికి మన్మధుడి అవసరం తప్పనిసరి అని గుర్తించి, దేవేంద్రుడు మన్మధుణ్ణి పిలిచాడు. సకలమర్యాదలు చేసి తన సింహాసనంమీద కూర్చోబెట్టి ఎన్నోవిధాలుగా పొగిడి పొంగ వేశాడు. శివుడికి పార్వతిపై అనురాగం కలిగేలా చేయమని అర్థించాడు. 

    వసంతుడు సారథ్యం చేస్తూండగా మన్మధుడు చెరకు వింటినీ, పూలబాణాలనూ ధరించి రతీదేవితో చిలుకరథాన్నెక్కి, ఈశ్వరుడు తపస్సు చేస్తూన్న హిమాలయ శిఖరాల నడుమనున్న లోయను ప్రవేశించాడు. ఒక్కసారిగా ఆ లోయనంతటా వసంతఋతువు వెల్లివిరిసింది. రమణీయంగా మారింది. కోయిలల సంగీతంతో, తుమ్మెదల ఝంకారంతో అంతా రసమయంగా వెలిగిపోయింది. తానున్న పరిసరమంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి, శివుడు కళ్ళు తెరచి చూశాడు. అకాల వసంతాగమనానికి ఆశ్చర్యపోతే, తపోభంగ మైనందుకు నొచ్చుకుంటూండగా అతని చేతినుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాలను తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మధుడు విరియబూచిన నల్ల ఉమ్మెత్తపూల పొదచాటునుంచి నీలోత్పల బాణాన్ని శివుడి గుండెకు గురిపెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు తృళ్ళిపడి తేరిపారజూచాడు. అతని మ్రోల మోకరిల్లి రెప్పవాల్చకుండా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది. 

    తన తపోభంగానికి శివుడు నివ్వెరపడుతూ రుద్రుడై తన మూడవ కంటిని తెరచి మన్మధుణ్ణి చూశాడు. మరుక్షణంలో శివుడి ఫాలనేత్రంనుంచి వెలువడిన జ్వాలల్లో మన్మధుడు కాలి బూడిదయ్యాడు. శివుడు దిగ్గున లేచి చరచరా తన కైలాస శిఖరాగ్రం మీదికి వెళ్ళిపోయాడు. 

    మన్మధుడి వెన్వంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్పమీద కూలిపోయి భోరుమన్నది. శివతపోభంగానికి మన్మధుణ్ణి పంపిన దేవేంద్రాది దేవతలను శాపాలు పెట్టబోయేసరికి, బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీ శివుల కళ్యాణం జరిగినప్పుడు మన్మధుడు తిరిగి బతికివస్తాడని నచ్చజెప్పి, ఓదార్చి సహగమనం మాన్పించారు. రతీదేవి మన్మధుడి బూడిదకుప్పనే కనిపెట్టుకొని అలా దివారాత్రాలు గడపసాగింది. 

    పార్వతికి తన సౌందర్యంపట్ల నమ్మకం పోయింది. శరీర లావణ్యంమీద మమకారం పోయింది. శివుణ్ణి రంజింప చేయలేని తన తనువు నిరర్థకంగా తలచి శివరంజనిగ తపస్సు చేయడానికి పూనుకొన్నది. తల్లి మేనక ఎంత వద్దన్నా వినలేదు. కేవలం కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృశింపజేసుకొని తపస్సు మొదలుపెట్టింది. జయ, విజయ అనే యిద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనకా, హిమవంతులకు తెలియజేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత పార్వతి పర్ణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ, అపర్ణ అని పేరుపొందింది. 

    శివుడు మన్మధుణ్ణి భస్మం చేశాడే గాని, మన్మధుడి బాణ ప్రభావం ఊరికే పోలేదు. పార్వతి తపస్సుకూడా ఫలితం సాధించింది. శివుడు మారువేషంతో పార్వతి దగ్గరకు వెళ్ళి, పార్వతి మనస్సును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చుకొని పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్తఋషులను హిమవంతుడి దగ్గరకు పెళ్ళిపెద్దలుగా పంపించాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ఋషులు ముహూర్తం పెట్టి వెళ్ళారు. 

    ప్రమథగణాలు ముందు నడవగా శివుడు పెళ్ళికుమారుడై హిమవంతుడింటికి తరలి వెళ్ళాడు. హిమాలయ శిఖరాలు పెళ్ళిపందిరికి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగాగల దేవతలు, సప్తర్షుల వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడకు చేరుకున్నారు. 

    పెద్ద ముత్తయిదువు అరుంధతి శివుడి ఫాలనేత్రం రెప్పమీదుగా కల్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్ళి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి - సుందరేశ్వరుడు అని అన్నారు. 

    సర్వాలంకార శోభితయై విద్యుల్లతలాగా మెరిసిపోతూన్న పార్వతిని పెళ్ళికూతురుగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో " నీవు సుందరేశ్వరుడివి అయితే, నా చెల్లెలు పార్వతి మీనాక్షీదేవి " అని అంటూ పార్వతి కుడిచేతిని శివుడి కుడిచేతిలో పెట్టి యిద్దర్నీ పెళ్ళిపీటలమీద కూర్చోబెట్టాడు. 

    శివపార్వతుల వివాహం ఎంతవైభవంగా జరగాలో అంతవైభవంగా జరిగింది. 

    హిమాలయ లోయలో శివుడు, పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం దివ్యమైన అంత:పుర మందిరాన్ని నిర్మించాడు. 

    మంగళతూర్య నాదాలు మిన్నంటుతూండగా చేతులు కలుపుకొని శివుడు, పార్వతి అందరి మధ్య నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మధుడి భస్మరాశి ఉన్నది. ఆ బూడిదకుప్పను అంటిపెట్టుకొని రతీదేవి కన్నీళ్ళతో మోకరిల్లి దోసిలిపట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగ ఉన్నది.

    శివపార్వతులు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తలపై చేతులుంచి దీర్ఘ సుమంగళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడవ కంటినే తెరచి ఈసారి చల్లని వెన్నెల కాంతితో చూడగానే భస్మరాశి మాయమై మన్మధుడు నిజరూపంలో లేచి అందరికీ కనిపించి, చెరకు వింటి నారిని ఝమ్మనిపించి అదృశ్యమైపోయాడు. 

    అప్పుడు శివుడు రతీదేవితో " అమ్మా! నీ భర్త తిరిగి జీవించాడు. నీకు ఎప్పటిలాగే సదా కనబడుతూ ఉంటాడు. నీ రెండు కళ్ళకు తప్ప మరే మూడోకంటికి కనిపించడు. ఎవ్వరూ అతణ్ణి చూడలేరు కనుక అతణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అతని బాణాల బారి నుంచి తప్పించుకోలేరు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని యిష్టం పైన ఉంటుంది. అలాంటి వరాన్ని అతనికి యిస్తున్నాను " అని చెప్పాడు. 

    పార్వతీ శివులు గృహప్రవేశం చేశారు. కనిపించని మన్మధుడు కూడా కనిపించని పూల బాణాలతో రతీదేవితో మందిరంలోకి వెళ్ళాడు. అరుంధతి నూతన దంపతులకు ఎర్రనీటితో దిష్టితీసి, కర్పూరహారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడి ఉన్న ఒక నిలువెత్తు పలకను పార్వతీ శివుల ఎదురుగా నిలబెట్టి " ఇది ఒక గొప్ప అపురూప చిత్రపటము. ఈ చిత్రంలో యిద్దరూ చిత్రింపబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ గొప్పదో మాబోటి వారికి ఎవరికీ చెప్ప శక్యం కాలేదు. అది చెప్పగలవారు మీరిద్దరే నన్న నమ్మకంతో మీముందు పెడుతున్నాను, చెప్పండి " అని తెరను తొలగించాడు. 

    అది ఒక నిలువుటద్దం. అద్దంలో శివుడు, పార్వతి తమను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. 

    " ముసిముసి నవ్వులు సమాధానాలు కావు. చెప్పితీరాలి " అన్నాడు నారదుడు. పార్వతిని క్రీగంట చూస్తూ, " ధగధగా శుక్రునిలాగా మెరుస్తున్న ముక్కరగల చిత్రాంగి సౌందర్యమే గొప్పది " అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్ళతో " ఆ  ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది " అని వీణ మీటినట్లు పలికింది.

    అందరూ శివపార్వతులపై పుష్పాక్షతలు చల్లి వెళ్ళిన తర్వాత కొత్త దంపతులిద్దరూ పట్టు దిళ్ళు అమర్చిన తూగుటుయ్యాలపై కూర్చున్నారు. 

    వారి కెదురుగా విశాలపు గోడమీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. చిత్రం మధ్యలో అందమైన ఓ ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందరి కాళ్ళు ఎత్తి ఎదురెదుగా ఎత్తిన తొండాలను పెనవేసుకొని ఉన్నవి. తోరణం కట్టినట్టు ఉన్న ఆ రెండు ఏనుగుల మధ్యనుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మాలు వికసిస్తూ ఉన్నవి. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రమున్నచోట వెన్నెల వంటి జ్యోతి వెలిగింది. ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలుగులో శశివర్ణంతో మెరిసిపోతూన్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు. 

    విఘ్నేశ్వరుడి ముఖము ఏనుగు ముఖమే. అయినప్పటికీ, ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉన్నది. ప్రసన్నత వెల్లి విరిస్తూన్నది. అతని చూపులు శాంతంగా మేథస్సునూ, శక్తిని చాటుతున్నాయి. అతని దోరపుబొజ్జ నిండుగా తళతళ లాడుతున్నది. అభయ హస్తంతో నిల్చొని ఉన్న విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలాగ కనిపించాడు. 

    విఘ్నేశ్వరుని చూస్తూంటే శివుడికీ, పార్వతికీ ఎన్నడు ఎరుగని అనిర్వచనీయమైన ఆనందమేదో తమలో ఉప్పొంగుతూన్నట్లు అనిపించింది. ఆ ఆనంద పారవశ్యంలో నోట మాటరాక విఘ్నేశ్వరుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎడమ పక్కకు సొంపుగా వంపుపెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకొని ఊపుతూ, ముద్దుముద్దు మాటలతో " నేను విఘ్నేశ్వరుణ్ణి! విఘ్నాలను అరికట్టే వినాయకుడిని. పంచభూత గణాలకు అధిపతిని. గణపతిని. చిత్ర విచిత్రమైన రూపంగల చిత్రగణపతిని. మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివుడి తేజస్సుతో కుమారస్వామి పుట్టి తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు. కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడుగా ఉంటాను. పుత్ర గణపతినై అవతరించ బోతున్నాను " అని చెపుతూంటే పార్వతి అతణ్ణి అందుకొని ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్థానమయ్యాడు. 

    అంతవరకూ తమకు కనిపించినదంతా కలా నిజమా అని పార్వతీ, శివులు ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో అంతా మరచిపోయారు. వారికి కనిపించిన అద్భుతమంతా మరుపుకొచ్చింది. 

    శివుడు, పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ సమయంలోనే జగత్తుకు కనీవినీ ఎరుగని ఉపద్రవం ముంచుకొచ్చింది. అదేమిటో వచ్చేవారం తెలుసుకుందాం. ఇప్పటికైతే సశేషం. 


    


28, ఆగస్టు 2025, గురువారం

:: వటపత్ర బాలగణపతి ::  

    సత్యలోకంలో కమలాసనంమీద కూర్చుని, పగలంతా సృష్టిచేసి చేసి అలసిన బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవులించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి, అగ్నులను వెదజల్లాయి. నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయమేఘాలు మెరుపులతో భయంకరంగా ఘర్జిస్తూ, ఏనుగుతొండాలవంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలముకున్నది. 

    ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభం ప్రారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తుమీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తూండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. 

    ఆయన పద్మాసనంవేసి కూర్చొని, నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులూ కలయజూశాడు. 

    కింద ఉన్న జగత్తు అంతా నీటిమయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాలమధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లుకొలిపే తెల్లని కాంతిరేఖ కనిపించింది. 

    ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రిఆకు, దానిపై చందమామలాంటి పసివాడు పడుకొని కుడికాలు బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు. 

    బ్రహ్మ చేతులు జోడించి, కన్నులుమూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింతదృశ్యం కనిపించింది. 

    ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. కాని ఇప్పుడా పిల్లవాని తల ఏనుగుతలను పోలి, చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుతూన్నట్టుగా కనిపించింది. 

    ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరునిముషంలో, ఆకుతోసహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టిదిబ్బ ఒకటి కనిపించింది. 

    క్రమక్రమంగా నీటినుండి సువిశాలమైన భూభాగాలూ, సముద్రగర్భాలూ ఏర్పడ్డాయి. 

    బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలూ, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరుతీసి జగత్తుమీద చల్లాడు. తరువాత వృక్షాలనూ, సస్యాలనూ, ఖనిజాలనూ సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని - మొదట సముద్రంలో చేపలనూ, భూమ్మీద జంతుజాలాన్నీ, క్రిమికీటకాదుల్ని, పక్షుల్నీ సృజించాడు. తరువాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. 

    బ్రహ్మ సృష్టిచేస్తున్నంతసేపూ సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది. ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతి నివ్వెరపడుతూ కిందకు చూసి మరింత నివ్వెరపడింది. బ్రహ్మ అర్థాంగి నివ్వెరపాటు అర్థంగాక కమలాసనంనుంచి వంగి కిందకు చూశాడు. 

    పర్వతాలు బోర్లపడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూన్నవి. 

    నదులు సాగరంనుంచి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నవి. వృక్షాలు తలకిందులుగా, వేళ్ళు ఆకాశానికి తన్నుతున్నవి. 

    జంతువులూ చాలా అనర్థాలతో పుట్టాయి. తలలులేకుండా కొన్ని, వెనుకకాళ్ళు లేకుండా కొన్ని, ఒంటికాలువి, మూడుకాళ్ళవీ, కళ్ళూ, చెవులూ అన్నీఉండి నోరు అనేది లేనివీ, తోకలకు తలలున్నవీ, తలలకు తోకలున్నవీ కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే కాళ్ళు లేక నేలమీద దొర్లుకుంటున్నవి. 

    ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు. 

    మనుషులలో కొందరికి రెండుతలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది.  

    పురుషులు జానెడు, బెత్తెడుగా ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటిచెట్లలాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్నవాళ్ళు, నాలుగు, మూడు, ఒంటికాళ్ళవాళ్ళూ, పొట్టకే పెద్దనోళ్ళున్న కబంధులూ ఆక్రందనలుచేస్తూ కనిపించారు. 

    జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి. మూగగా చూస్తున్నవి. బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నవి, కదనుతొక్కుతున్నవి. 

    ఒక జానెడు మగవాడు తాటిచెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ " ఓ బ్రహ్మదేవుడా! ఇలాంటి స్త్రీతో నేనెలా సంసార సాగరం ఈదేది? " అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. 

    " నాలుగుతలలంటూ ఉన్నా, అసలు తల అంటూలేని ఓయీ బ్రహ్మదేవుడా! మమ్మల్నెందుకిలాగ పుట్టించావు? " అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనలు మిన్నుముట్టుతున్నవి. 

    బ్రహ్మ నాలుగుతలలూ గిర్రున తిరిగిపోయాయి. ఎనిమిది కళ్ళూ బైర్లుకమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతివంక అయోమయంగా చూశాడు. అతని నాలుగు తెల్లమొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకున్నది. 

    " ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా! నేను సృష్టికి పూనుకున్నాను. ఇలాగ ఎందుకు జరిగింది? " అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలుపైకెత్తి అరిచాడు బ్రహ్మ. అతని ప్రశ్న దశదిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగుతల ఉన్నది. నాలుగు చేతులలో పాశము, అంకుశము, కలశము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడివలె ప్రకాశిస్తున్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతున్నది. అప్పుడు సరస్వతివీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ, మాయామాళగౌరవ రాగానికి మారుతూ, హంసధ్వనిరాగాన్ని అందుకొన్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతనిచుట్టూరా శరత్కాల పూర్ణిమనాటి వెన్నెలవంటి వెలుగు ఆవరించి ఉన్నది. 

    బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, " మహానుభావా! అద్భుతమూర్తివైన నీవెవ్వడవు? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని. అనుగ్రహించు " అని అడిగాడు. 

    " నాయనా! బ్రహ్మదేవా! సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూంటుంది. అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్నీ నిండుకలశంలాగ జయప్రదంచేసే విఘ్ననాయకుడిని. పంచభూతములనబడే పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని. ఆహారధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనంచేసే మదించిన ఏనుగులవంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడని పిలువు " అని గంభీరస్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు. 

    అప్పుడు బ్రహ్మ " దేవా! విఘ్నేశ్వరా! నా సృజన శక్తికి ఎందుకిలాగ ఘోరమైన విఘ్నం జరిగింది. ఇన్ని వంకరలెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు " అన్నాడు. 

    " విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రిఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించ లేకపోయావు.  నా గురించి  ఆలోచించడమంటే విఘ్నం గురించి ముందుజాగ్రత్తపడే జ్ఞానాన్ని కలిగి ఉండడమే! ఆ జ్ఞానస్వరూపుణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతిజీవీ కార్యరంగానికి దిగేముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తనూ, జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసేముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తూన్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్నీ అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్రశాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో! వాటిని తిరిగి గ్రహించి సృష్టి నిర్వర్తించు " అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలనిచ్చాడు. 

    బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ " విఘ్నేశ్వరా! నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి, మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలాగా చెయ్యి " అని కోరాడు. 

    విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకూ జరిగిన వంకరటింకరుల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో " ఓ బ్రహ్మదేవుడా! వక్రతను తుండతుండములుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండుడు అనేపేరు సార్ధకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూంటాను. వక్రతుండుణ్ణి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పనికూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు. సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకరటింకరులు పోకుండా జగత్తు నీవు మలచిన కళానిలయంగా భాసిస్తుంది. నీకుమల్లే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలిపూజలందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాలనుంచి కాపాడుతూ, సంకల్పసిద్ధిని కలిగించే సిద్ధివినాయకుడిగా, సకల గణాలకూ అధిపతిగా గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను " అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్థానమయ్యాడు.  

    సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందోళ, శ్రీరాగాలతో మంగళస్వరాల్ని మహాకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది. 

    బ్రహ్మ " విఘ్నేశ్వరాయనమ: " అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులూ, అమృత జలాలతో నదులూ,  సుందర వనాలూ, రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలమూ, శారీరకంగానూ, మానసికంగానూ ఉన్నతులూ, బలవంతులూ అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. 


21, ఆగస్టు 2025, గురువారం

:: ప్రాణంపొందిన ప్రతిమ ::  

    దేవతల శిల్పి విశ్వకర్మ. రాక్షస శిల్పి మయుడు. ఇద్దరూ గొప్ప శిల్పులే. కానీ, యిద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే, అతను రాక్షస శిల్పి కావటంచేత అతణ్ణి దేవతలు ఎన్నడూ మెచ్చేవారు కాదు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునే వారు.  

    మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడే వాడు కాడు. కాని, మిగిలిన రాక్షసులు, మయుడి దగ్గరకెళ్ళి " నీకామాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలి గోరికైనా సమం కాడుగదా! అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకొంటావా? " అన్నారు. 

    మయుడు నవ్వి " నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సౌభకనగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారుగదా? " అన్నాడు. 

    " విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబట్టి, అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసిపెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడా పాతవిషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకూ, విశ్వకర్మకూ పోటీని ఏర్పాటుచేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు " అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు. 

    " సరే, పోటీ ఏర్పాటుచెయ్యండి " అన్నాడు మయుడు. 

    రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి " మీ విశ్వకర్మకూ, మా మయుడికీ పోటీ ఏర్పాటు చెయ్యండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయిందీ తేలిపోతుంది. మాటలతో పని ఏమిటి? " అని అడిగారు. 

    దేవతలు తమలో తాము గుసగుసలాడుకుని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. 

    " బృహస్పతికి బావమరిదిని. సూర్యుడికి పిల్లనిచ్చిన మామను. ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా? " అన్నాడు విశ్వకర్మ. 

    దేవతలు మయుణ్ణి పిలిపించి " నీకూ, విశ్వకర్మకూ పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఎటువంటి మహత్తుగల వస్తువు నిర్మిస్తావో చెప్పు. అటువంటిదే విశ్వకర్మను గూడా నిర్మించమంటాం " అన్నారు. 

    " మహిమలకేమిటి? అందరి మహిమలూ అందరెరిగినవే. నేను మూడు లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారుచేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వెయ్యటానికి వారూ వీరెందుకు? సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చెయ్యండి " అన్నాడు మయుడు. 

    దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు. 

    త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణంగల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. 

    విశ్వకర్మకు కాలూ, చెయ్యీ ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి " తాతా! ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. మూడు లోకాలలోనూ ఎక్కడాలేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని ఋజువు చెయ్యటానికే అతను ఈ పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంతకాలమూ మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలమూ నీకూ, నాకూ కూడా అపకీర్తి తప్పదు " అన్నాడు. 

    మిగిలిన దేవతలుకూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి " తాతగారూ! మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి. లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి, అపజయమూ తప్పవు " అని వేడుకున్నారు. 

    మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయీక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. 

    ఆయన మయుడితో " నాయనా! నీవు కుర్రవాడివయినా ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కాని, నాకు ఒక్కటే విచారంగా ఉన్నది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించినవాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే, దీనికి ప్రాణం ఉంటే యింకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి వనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృథా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది.అంతకన్నా కావలసిందేమిటి? " అన్నాడు. 

    మయుడు కొంచెంసేపు ఆలోచించి " దేవా! అలాగే చెయ్యండి. నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను " అన్నాడు. 

    దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణంపోసి, మనిషిని చేసి, ఆమెకు 'హేమ' అని నామకరణం చేశాడు. అప్పటికప్పుడే మయుడికీ, హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడూ, మిగిలిన దేవతలూ వెళ్ళిపోయారు. 

    " ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు చేస్తాయి, ముసలితనం వస్తుంది, చివరకు చచ్చిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది " అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. 

    ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి, మండోదరీ, మాయావీ, దుందుభీ అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయసుతో ముడతలుకూడా పడ నారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు. 

    ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. " హేమ మా ఆడపడుచు. మా లోకంలో ఉన్నట్లయితే, శరీర ధర్మాలకు అతీతంగా ఉండి, నిత్య యౌవనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది, చూడు! " అంటూ వారామెను తీసుకొని వెళ్ళిపోయారు. 

    మయుడు విరక్తిచెంది తన పిల్లలను వెంటవేసుకొని దేశాటనచేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కుమార్తె మండోదరిని యిచ్చి పెళ్ళిచేశాడు.  ఆ కథ అంతా మీకు తెలిసినదే! 

    అయితే, ఈ కథలో అందరకూ మయుడు సాటిలేని శిల్పి అయిఉండి కూడా, విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వతకీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మా మారుస్తానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలుననా? అనే సందేహాలు తప్పక కలుగుతాయి. వాటికి ఇలా సమాధానాలు చెప్పుకోవచ్చు. " బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే, మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వంగాని, ఆ తరువాతగాని బ్రహ్మదేవుడు ప్రాణం పొయ్యటం జరుగలేదు. అదీగాక, శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవటం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలూ, మయుడు నిర్మించిన నగరాలూ ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కాని, సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి, బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటారా? హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను గూడా త్రిలోకసుందరి అన్నారు. ఈనాటికీ కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉంది. ప్రపంచం ఉన్నంతకాలమూ అది నశించదు. ఇది తెలుసు కనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. 

17, ఆగస్టు 2025, ఆదివారం

:: రామనవమి ::  

    లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు. 

    కొడుకు, కోడలూ వచ్చేవేళకి పులస్త్యులవారు పురాణం చదువుకుంటున్నారు. అది చూచి రావణుడు " ఏమిటండి, ఈ గాథ? " అని ఆయనను అడిగాడు. 

    " ఇది రామాయణం. దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రమేమిటంటే, ఇందులో చెప్పబడిన కథ అంతా యిదివరలో జరిగినదికాక, ఇకముందు జరుగబోతున్నది " అన్నారు పులస్త్యులవారు. 

    " ఆ జరుగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా? " అని ఆయనను కోరినాడు రావణుడు. 

    " శ్రీమహావిష్ణువు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి, యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తారట " అన్నారు పులస్త్యులవారు. 

    యాధాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి, ఎంతో ఆదుర్దాగా " రావణుడంటున్నారు, ఆ రావణుడు మీరు కాదుగదా, కొంపతీసి? " అన్నది భర్తతో. 

    అందుకు పులస్త్యులవారు, " లోకంలో ఇద్దరు రావణులు లేరుసుమా! రావణుడంటే మనవాడేను " అన్నారు. 

    ఈమాట వినడంతోనే మండోదరీదేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దు:ఖించటం మెదలుపెట్టింది. 
    
    రావణుడు నవ్వుతూ, " దశరథుడంటే ఎవడో మనుష్యుడై ఉంటాడు. మనుష్యులను జంతికలకుమల్లే కరకర నమిలి మ్రింగే రాక్షసకులానికంతటికీ రాజును నేను. నన్నా! ఆ దశరథకుమారుడు చంపటం? ఈ పుక్కిటి పురాణం నమ్మకు " అన్నాడు. ఈ మాటకు పులస్త్యులవారు, " అలాగ తోసిపారెయ్యకు. ఇది పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు " అన్నారు. 

    " అటైతే, ఒక పని చేస్తాను " అన్నాడు రావణుడు. " ఏమిటి " అన్నది మండోదరి. 

    " ఆ దశరథుడనే వాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాణ్ణి పట్టుకు చంపివేస్తే, ఇంక వాడికి కొడుకు పుట్టడం, ఆ కొడుకు నన్ను చంపటం అనేది ఉండదు కదా! " అన్నాడు రావణుడు. అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. చారులను రప్పించి, " దశరథుడనే వాడెవడో, వానికి పెళ్ళి అయినట్టయితే ఆ భార్య ఎవరో, వెంటనే తెలుసుకురండి " అని చెప్పి పంపాడు. 

    కొంతకాలమయేసరికి ఆ చారులు తిరిగివచ్చి, " ప్రభూ! హేమ పట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోసల దేశపు రాజునూ, కేకయ దేశపు రాజునూ ఓడించాడు. కోసలదేశపు రాజునకు కౌసల్య అనీ, కేకయ దేశపు రాజునకు కైకేయీ అని కుమార్తెలు ఉన్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్టణానికి తెచ్చి భార్య కిచ్చి " ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతోబాటు పెంచు. ఈ ముగ్గురికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేద్దాం " అన్నాడు అని చెప్పారు. 

    అప్పుడు రావణుడు " నేను దశరథుని సంగతి కనుక్కు రండర్రా అని పంపిస్తే మీరు హేమ పట్టణం సొద చెప్పుకొస్తున్నారేమిటి? " అని విసుక్కున్నాడు. 

    అందుకు చారులు, " ప్రభూ! చిత్తగించండి. ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదటి పెళ్ళికుమారుణ్ణి వెతికి తెచ్చారు. అతడే దశరథుడు " అన్నారు. " అయితే, ఎప్పుడు పెండ్లి? అన్నాడు రావణుడు. 

     అందుకు వాళ్ళు,  "  జైమిని అనే మహర్షి వచ్చి  ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభూ! అదీగాక మరొక్క చిత్రం కూడా విన్నాము " అన్నారు. " ఏమిటది ? " అన్నాడు రావణుడు. 

    " సుమిత్రకు, కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ, మేము ముగ్గురం కలసి మెలసి పెరిగాము. మమ్మల్నికూడా ఆ దశరథుడికే యిచ్చి పెళ్ళిచేస్తే ముగ్గురం ఒకచోటనే ఉంటాం అన్నారట. అందువల్ల సుమిత్రను, కైకేయినీ కూడా ఆ దశరథునికే యిచ్చి పెళ్ళి చేస్తారట " అని చెప్పారు. 

    " ఈ పెళ్ళి కాకుండా చూడాలి " అంటూ రావణుడు కొలువు చాలించి లేచి, వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనుని పైకి దండెత్తి వెళ్ళాడు.

    ఆ రాజుని యుద్ధంలో ఓడించి పారద్రోలి, రావణుడు విజయగర్వంతో అంత:పురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురునీ తెచ్చి రథంమీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంక ఆ దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్యానగరం వేపు పోనిచ్చాడు. దారిలో గంగానది అడ్డువచ్చింది. ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది. " ఎవరిదీ ఓడ? " అని అడిగేసరికి ఆ ఓడవాళ్ళు " హరసేన మహారాజులంగారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్ళికి తరలివచ్చినపుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారండి " అన్నారు. 

    ఈమాట వినేసరికి రావణునకు ఒక ఆలోచన తోచింది. " ఈ మానవుణ్ణి చంపటం కోసం నేను పనికట్టుకుని ఆ అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయటానికి నా సేవకులే చాలు " అని అనుకొని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్ళతో " మీరు ఈ ఓడవాళ్ళ నందరినీ చంపి భక్షించండి. నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకుమల్లే నటిస్తూ, దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచివెయ్యండి " అని ఆజ్ఞాపించాడు. 

    రావణుడు రాజకుమార్తెలతో లంకా పట్టణం చేరుకోవడంతోనే మండోదరి వాళ్ళను చూసి " ఎవరీ పిల్లలు ? " అంది. రావణుడు సంగతంతా చెప్పి " దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగానది మధ్యలో పెద్ద పెళ్ళి అయిపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్ళి చేసుకుంటాను " అన్నాడు. 

    మండోదరి నెత్తి నోరూ బాదుకుంటూ " నీకూ నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలనా పెండ్లి చేసుకుంటానంటున్నావు? కొరివితో తలగోక్కోవడమా? " అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్ళి ప్రయత్నం మానివేశాడు. 

    తరువాత పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఆ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి, మూసివెయ్యమన్నాడు. అయితే, ఆ పెట్టెను దాచటం ఎలాగా అని సమస్య రాగా, రావణునికి వికర్ణుడనే మాయరాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడంటే, వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకన్నమాట. ఈ సోమకాసురుణ్ణి చంపటానికే శ్రీమహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చిందికూడా! 

    వికర్ణుడు రావటంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి " దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు. నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చి యిద్దువుగాని " అన్నాడు. 

    వికర్ణుడు " చిత్తం ప్రభూ! అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తుండగానే దానిని తన కడుపులో దాచేసి,  ఇంక దీని సంగతి ఎవరికీ తెలియదుగా " అంటూ ఒకమారు వెకిలిగా నవ్వి, తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. 

    అంతలో అక్కడ దశరథుడు పెండ్లికొడుకై తరలి రావడం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయారాక్షసులు నట్టేట ఓడను ముంచి వెయ్యటం జరిగింది. 

    కాని, ఆయుర్దాయం ఉన్న వాళ్ళు నట్టేట మునిగినా చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి, కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటబడ్డాడు. 

    ఏదో పనిమీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి, కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి, తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బ్రతికి బయటపడి, పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్కచూసి, " జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక్క అర ఘడియలో ఆసన్నమౌతుంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయే తీరుతుంది " అన్నాడు. 

    ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికొక పెట్టె కొట్టుకు వచ్చింది. ఆ పెట్టెను తెరచి చూసేసరికి దశరథుని పెండ్లికుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలూ కనబడ్డారు. " చూశావా, నా జ్యోతిషం ఎలా నిజమైందో మరి, " అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునకూ, ఆ రాజకుమార్తెలకూ మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి, తను కైలాసం చేరుకున్నాడు. 

    సముద్రమధ్యలో జరిగిన ఆ వివాహాన్ని రెండు తిమింగలాలు చూసినై. మగ తిమింగలం ఆడ తిమింగలంతో " రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్ళి ఆపలేకపోయాడు, చూశావా? బ్రహ్మ రాతకు తిరుగు లేదు " అంది. 

    " అయితే, ఈ మానుపెట్టె ఎక్కడిది? " అన్నది ఆడ తిమింగలం. 

    " అది వికర్ణుని పొట్టలోంచి వచ్చింది. రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు. ఇందుకే దారుణమైన శూలపోటు బయలుదేరి, పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు. తరువాత వాడికి కునుకు పట్టింది. వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టె ఇలా కొట్టుకొచ్చింది " అన్నది మగ తిమింగలం. 

    " అయ్యో పాపం, రావణునకీసంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా! " అంది మళ్ళీ ఆడ తిమింగలం. 

    వికర్ణుడు చస్తే సముద్రానికే పీడ వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జాలి పడనక్కరలేదు. కానీ, రావణునకీసంగతి తెలవనే తెలవదు. దశరథుడు చనిపోయాడనీ, రాకుమార్తెలు యింకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకొని, కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబుసే పూర్తిగా మరచి పోతాడు. 

    ఈ రాకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి, లోకకంటకుడైన రావణున్ని వధించబోతాడు " అని చెప్పింది మగ తిమింగలం. 

    ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమినాడు భూలోకమందు అవతరించడం, రావణాసురుణ్ణి వధించడమూ కథలో వ్రాసిన ప్రకారం జరిగింది. 


    

11, ఆగస్టు 2025, సోమవారం

:: శివరాత్రి వ్రత మహిమ - గుహునికథ ::

    చాలానాళ్ళకు పూర్వం గుహుడనే కిరాతకుడొకడుండేవాడు. వేటతో జీవించే వాడు. వేట దొరకకపోతే దారి దోపిడీలకు తలపడేవాడు. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. ఆ రోజు శివరాత్రి అనిగాని, అది పర్వదినం అనిగాని ఆ గుహుడనేవాడికి తెలియదు. 

    కుటుంబ పోషణార్థం యధావిధిగా ఆ రోజున కూడా విల్లమ్ములు తీసుకుని వేటకు బయలుదేరాడు. సాయంత్రమయింది గాని, జంతువు దొరకలేదు. వేట లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెఱువు దగ్గర చేరాడు. 

    సంధ్యవేళ అయింది గనుక నీటికోసం జంతువులక్కడకు వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు. తనవద్ద నున్న నీటి పాత్రతో నీళ్ళు పట్టుకుని, చెరువు గట్టుననే ఉన్న మారేడు చెట్టు నెక్కి కూర్చున్నాడు. 

    మొదటి ఝాము ముగియకుండానే ఒక లేడి వచ్చింది. దానిని చంపదలచి విల్లునెక్కు పెట్టబోయాడు. ఆ సందట్లో - అతని వద్ద నీటికుండ తొణికింది. అది మారేడు చెట్టు కావడం వలన - కొమ్మలు కదిలి కాసిన్ని బిల్వపత్రాలు కుండలోంచి తొణికిన జలయుతంగా చెట్టు క్రిందనున్న శివలింగంమీద పడ్డాయి. 

    పగటి ఉపవాసం, శివరాత్రినాటి నిశి - ప్రథమయామంలో శివపూజ చేసిన ఫలం కలగలసి సంక్రమించాయి ఆ బోయవాడికి. కాని, ఈ లోపల ఆ లేడి వేటగాణ్ణి పసిగట్టింది. " ఓ కిరాతకా! నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు. కాని, నాకు పసి కూనలున్నాయి. వాటిని నా భర్తకూ, సవతికీ అప్పగించి వస్తాను. నన్ను నమ్ము " అని ప్రార్థించింది. అప్పటికే పాపాలు తొలగి పోసాగాయి బోయవాడివి. అందువల్ల కాబోలు - " సరే, చూద్దాం వెళ్ళి రా! " అన్నాడు. ఆ లేడి గృహోన్ముఖి అయ్యింది. దానికోసం ఎదురు చూస్తూ తొలిఝామంతా నిద్ర లేకుండా గడిపాడు బోయవాడు. 

    రెండవఝాము కూడా వచ్చేసింది. ఆ సమయాన మొదటి లేడి యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది. దానిని చూసి గుహుడు మళ్ళా విల్లూ బాణం తీశాడు. ఈ సారి కూడా కుండ తొణికి నీళ్ళూ కొమ్మా వణకి బిల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి. శివరాత్రి నాటి రేయి రెండవ ఝామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమపడిపోయింది. ఈ గలగలకా లేడికూడా బోయవాణ్ణి గుర్తించింది. అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తాననీ మాట తప్పననీ మరీమరీ చెప్పి వెళ్ళింది. ఈ లేడి కోసం ఎదురు తెన్నులు చూడటంతో గుహుడికి ఆ రెండవ ఝాము కూడా నిద్రలేకుండా పోయింది. 

    ఈ రెండు లేళ్ళూ కూడా మోసం చేసాయని అనుకున్నాడా బోయ. ఇంతలోనే మూడవ ఝాము సమీపించింది. ఆ సమయానికి - గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరిణాల భర్త - తన భార్యలను వెదుకుతూ - అక్కడికి వచ్చాడు. దీన్ని వదలకూడదని గుహుడు మళ్ళా బాణం పుల్ల తీసే సరికి యధాప్రకారం కొమ్మనుంచి బిల్వ పత్రాలూ, కుండనుంచి నీళ్ళు శివలింగంపై ఒలికాయి. 

    ఇంతలో మూడవ ఝాములో శివార్చన చేసిన పుణ్యంకూడా గుహుడికి సంక్రమించింది. ఇంతలో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది. తాను భార్యాన్వేషణలో వచ్చాననీ, ఇంటి దగ్గర పిల్లలు తల్లులకోసం అల్లాడిపోతున్నారనీ వాళ్ళని వాళ్ళకు వప్పగించి వస్తాననీ నమ్మబలికి వెళ్ళిపోయింది. ఈ ఎదురు చూపులో మూడవ ఝాము కూడా నిద్రలేకుండా గడిపాడు బోయవాడు. 

    ఒకళ్ళోదారీ, మరొకళ్ళు మరొకదారిగా గృహం చేరిన దంపతులు కలిశారు. జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. పిల్లలను ఓదార్చారు. భార్యలూ, భర్త కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయల్దేరారు. తల్లిదండ్రులు అల్లా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరుగదుగదా! అందువల్ల లేడిపిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి. 

    నాలుగో ఝాము అయ్యేసరికి బందుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి - పున: ధనుర్బాణాలు సంధించబోయాడు బోయవాడు. మళ్ళా శివార్చన జరిగిపోయింది. శివరాత్రి నాటి జాగరణ, నాలుగు ఝాములూ శివార్చనా ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు. తన గత జీవిత పాపాలు తలుచుకుని దు:ఖించాడు. సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలేశాడు. 

    తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళముందు తోచాడు శివుడు. అతణ్ణి అనుగ్రహించాడు. శివుడతనికి గుహుడనే పేరు పెట్టాడు. శృంగబేరిపురం రాజధానిగా నిషాదరాజ్యం పాలించుకోమన్నాడు. విష్ణ్వవతారుడైన రాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు. ఆడితప్పని లేడికుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు. అద్భుతాచలమనే ఆ గిరిమీద ఆ భక్తునిపేర వ్యాథేశ్వరుడనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇంత మాహాత్మ్యం ఉంది శివరాత్రికి కాబట్టి - మానవుడు  శివరాత్రి వ్రతం తప్పక ఆచరించి తీరాలి. 

 

21, జులై 2025, సోమవారం

:: వింతభక్తులు ::  

    పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా యిష్టం. ' భక్తులూ ' అంటే మనుష్యులే కాదు. జంతువులు, పక్షులు. పురుగులు - వీటిలో ఏవి కాస్త భక్తి కనబరచినా సరే ఆయన సంతోషించి, వాటిని అనుగ్రహిస్తాడు. 

    ఒకమాటు ఆయన తాను అంతకు మున్ను గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లనగ్రోవిని ఊదుకుందామని బుద్ధిపుట్టి, మురళి తెచ్చి హాయిగా వాయించటం మొదలెట్టేడు. ఆ గానం వినేటప్పటికి చుట్టుప్రక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపుకు వచ్చాయి. ఎవరూ పితక్కుండానే అవి ధారలు కట్టి కురిసాయి. అంతలో ఒక పెద్ద గాలివేసి, ఆ పాల నురగలో రవంత తుంపరపోయి పాండురంగస్వామి శిరస్సుపైన పడింది. 

    ఆ ఆవు భక్తి పారవశ్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాలచుక్క తన శిరస్సుపై పడ్డంతోనే అదే ఒక గొప్ప సేవగా తలచి, ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదాన్నిగా చేర్చుకున్నాడు. 

    పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావిచెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగస్వామి కోసం అత్తెసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికిమల్లే వేగంగా వచ్చి స్వామి ముందు వ్రాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్ము అంతా ఎగిరిపోయి తుడిచినట్లై, పాండురంగనికి సంతోషం కలిగింది. 

    " నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకుని చిమ్మినట్లు పోగెట్టేవు కనుక నిన్ను నా భక్తులలో ఒకణ్ణిగా చేసుకుంటా " నని కాకిని గూడా తన భక్తులలో చేర్చుకున్నాడు. 

    ఇంతలో అక్కడకు ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడినుంచి వచ్చిందో కాని, వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తితీరా ఈత లాడింది. తర్వాత స్వామి వద్దకు వచ్చి, రెక్కలు తపతపా కొట్టుకుంది. ఆ నీళ్ళన్నీ అక్కడ నేలమీద పడి నేల శుభ్రంగా పాచి చేసినట్లై పోయింది. " కాకి తుడిచేసింది. నీవు నీళ్ళు జల్లేవు గనుక నిన్ను కూడా కాకితోబాటే నా భక్తుల్లో చేర్చుకుంటా " నన్నాడు పాండురంగస్వామి.

    " కాకి తుడిచింది. హంస నీళ్ళు చల్లింది. ఇంక ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును " అని పాండురంగస్వామి అనుకుంటుంటే ఒక చిలుక ఎగిరివచ్చి స్వామి ప్రక్కన వ్రేలాడే ఒక దండెం మీద వ్రాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూండేది. ఆనాడేం బుద్ధి పుట్టిందో కాని ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకొచ్చింది. ఆ హారాన్ని దండేం మీద కాళ్ళక్రింద నొక్కిపట్టి తన కరుకు ముక్కుతో పుటుకూ పుటుకూ నాలుగు పోట్లు పొడిచేటప్పటికి హారం తెగపోయి ముత్యాలు స్వామి సన్నిధిని చిందర వందరగా పడ్డాయి. 

    " సెబాష్ చిలుకా! ఉత్తుత్తి మ్రుగ్గుకాక నాయింట ముత్యాలతో మ్రుగ్గులు పెట్టేవు. కనుక కాకి, హంసలకు మల్లేనే నిన్నుకూడా అనుగ్రహిస్తున్నాను " అన్నాడు విఠలుడు. 

    ఆ తరువాత అక్కడికి ఒక ఎలుకపిల్ల పరుగెత్తుకు వచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకొచ్చింది. స్వామిని చూచేటప్పటికి ఆ పాము ఎలుక మాట మరచిపోయింది. పాండురంగడంటే ఆ పాముకు అమిత భక్తి.

    " స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్ళు జల్లి ముగ్గులుపెట్టేరు. కానీ, దీపం పెట్టేరుకారు " అనుకుంది. 

    పాము నెత్తిమీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారుకదూ? ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికి, దీపంకన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యంమూలాన్ని అక్కడ చీకట్లన్నీపోయి వెలుగొచ్చింది. 

    " సెబాష్ సర్పరాజా! నువ్వుకూడా నా భక్తులలో చేరేవు " అన్నాడు స్వామి. 

    మరికాసేపటికి ఆ దారినే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరి పోతున్నాయి. వాటిల్లో ఒక్క ఈగ మటుకు ఆగి స్వామి పాద సన్నిధిని ఉన్న ఒక పువ్వుమీద వ్రాలి అందులో స్వామియొక్క పాద తీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని త్రాగింది. మహాభక్తులూ, మునులూ పాద తీర్థంతో కలిసి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ త్రాగింది కనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈవిధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ పాండురంగని భక్తులైనై. భక్తులై ఏమి లాభం పొందాయో వినండి. 

    ఆ ఆవు చాలాకాలం బ్రతికి, ముసలి పండై, అఖరికి ప్రాణాలు విడిచేసింది. తర్వాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయవల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయిపుట్టింది. ఆ విష్ణు భక్తుడా అమ్మాయికి 'సుశీల' అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది. 

    సుశీల పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేశారు. ఆ అమ్మాయి ఎంతమంచిదో, దాని మగడు అంత చెడ్డవాడు. ఉత్త నీచుడు. డబ్బుకోసం ఎలాంటి కక్కుర్తి అయినా సరే పడేవాడు. తినటానికి సరిపోయేది ఉన్నా, ఎరగని వాళ్ళ దగ్గరకెళ్ళి " అయ్యా! బీద బ్రాహ్మణ్ణి. పిల్లకి పెళ్ళి చేసుకోవడానికి డబ్బులేదు " అని యాచించే వాడు. పోనీ, ఆ యాచించి తెచ్చిందైనా కడుపునిండా తినేవాడా? ఉహూ! , పాతరేసి, దాచుక్కూచునేవాడు. అంత లోభి. పైగా ఏదో వంక పెట్టుకుని సుశీలను కొడుతూండేవాడు. కాని, సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు. మహా పతివ్రత గనుక ఓర్చుకునేది. 

    వాని సంగతి తెలిసిన చుట్టం ఎవరూ వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్ళు కాదు. ఒకవేళ తెలియని వాడెవడైనా వస్తే సుశీల మొగుడు " అయ్యా! మాకు మైల వచ్చింది " అని చెప్పి పంపేవాడు. కాని సుశీలకు మాత్రం అది కష్టంగా ఉండేది. ఏమంటే, ఆవిడకు అతిథులంటే చాలా గౌరవమూ, భక్తీని. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం ఆ విష్ణుమూర్తితో సమానమని ఆమె నమ్మకం. కాని, తన భర్త ఒప్పుకోనప్పుడేం చేస్తుంది? 

    తన దయవల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చినా, భర్త దుర్మార్గుడవటంవల్ల సుఖపడలేక పోతున్నదన్న సంగతి పాండురంగస్వామికి తెలిసి సుశీలను కటాక్షించటం కోసం, ఒకనాడు ఒక వడుగు రూపంలో వచ్చాడు. 

    అప్పుడామె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరిక్షించడానికి యిదే సమయం అని ఆలోచించి, ఆ బ్రహ్మచారి, ఇంటి లోపలున్న సుశీలను పిలిచి " అమ్మా! ఆకలి వేస్తోంది. పట్టెడన్నం ఉంటే పెట్టు " అని అడిగేడు. 

    ఆమె, " ఉండు నాయనా! ఒక్క నిముషంలో వండి వడ్డిస్తాను " అంది. 

    " అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడాగగలను? చద్దికుండలో చద్ది అన్నమైనా సరే, ఉంటే పెట్టు .  పెట్టి పెట్టి చద్ది అన్నం పెట్టడమేమిటి? పెడితే, నాకు పాపం. తింటే నీకు పాపం " అంటావేమో! నువ్వేమీ సందేహించకు. నా ఆకలి తీరిస్తివా, మూడు లోకాలనూ తృప్తి పరచినట్లే. ఇంక నాకు వచ్చే పాపం మాటన్నావ్? జపంచేసి పోగొట్టుకుంటాను " అని ఆమెను తొందరపెట్టేడు. సుశీల ఏం చేస్తుందింక? పీటవేసి, అరిటాకు పరచి, చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూచేటప్పటికి, ఆ కపట బ్రాహ్మణ వడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకుని ఆకులో ఒక్క మెతుకైనా మిగల్చకుండా అన్నమంతా తినేశాడు. " అమ్మా! ఇంకా ఆకలి తీరలేదు. ఆ కుండలో, అడుగునా పక్కల్నీ అంటిబెట్టుకుని ఏమైనా మెతుకులు ఉన్నాయేమో చూడు " అన్నాడు. 

    ఆమె వెతికి చూచింది కాని, కుండలో ఒక్క మెతుకుగూడా మిగలలేదు. మూడు రోజుల్నుంచి ఏ పూట కాపూట వండుకోవడం, భర్త ఊళ్ళో లేడు గనుక, పతివ్రతయైన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవడం, అదంతా ఆ తరవాణి కుండలో వెయ్యటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటుగా ఆ పొట్టివాడు తినేశాడూ అంటే, ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రమేమంటే అదంతా తిన్నాకూడా అతని ఆకలి తీరలేదు. 

    నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తెసరు అన్నం తెచ్చి వడ్డించింది. తినేశాడు. పొయ్యిమీద కాగుతున్న చిక్కటి పాలు తెచ్చి త్రాగమంది. తాగేశాడు. కాని, ఆకలి తీరలేదు. " ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు " అన్నాడు. 

    అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చక్కిలాలూ, చేగోడీలూ మొదలైన పిండివంటలు కొన్ని మొగుడు ఊరికెళ్ళక పూర్వమే చేసి యిచ్చింది. ఆ లోభి మగడు, ఆ వంటలు ఒక్కమాటుగా తినేస్తే అయిపోతాయేమోనన్న భయంకొద్దీ కొంచెమే తిని, సుశీలకేనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండలలో దాచి అటకమీద పెట్టుకుని వెళ్ళేడు. అవి తెచ్చిపెడితే యీ పిల్లవాని ఆకలి తీరుతుందేమో! 

    భర్తవచ్చి, ఆ మినపసున్నీ అవీ లేకపోవడం చూస్తే మండిపడి తనని చావకొడతాడని తెలిసుండికూడా సుశీల ఆ అతిథిని అర్థాకలితో పంపటం ఇష్టంలేక పిండివంటల్ని క్రిందికి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించటం తడవుగా విస్తరి ఖాళీచేసేసాడు ఆ దొంగ అతిథి. పోనీ అప్పుడైనా విస్తరిముందు నుంచి లేవచ్చా? ఉహు, " ఇంకా ఏమైనా ఉంటే తే " అన్నాడు. 

    అప్పుడు సుశీలకంతా అర్థమైంది. " ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనబడుతున్నాడే గాని, నిజంగా ఇతడు పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించటానికి వచ్చిన ఆ పాండురంగస్వామియే అయి ఉండాలి కాని, ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను? " అనుకుంది. 

    సుశీల ఇలా ఆలోచించుకుంటూంటే ఆమెకో ఉపాయం తట్టింది. " స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రిలాంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని. ఆమె తక్షణమే  అగ్ని దేవుణ్ణి ప్రార్థించింది. అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నిరకాల భోజన పదార్ధాలతోటి, పిండివంటలతోటి నింపేశాడు. 

    అప్పుడు పాండురంగస్వామి తన వామనరూపం వదిలేసి నిజరూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. " సుశీలా! నువ్వు మహా పతివ్రతవు. అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి, అతిథి భక్తికి మెచ్చుకున్నాను. వరం కోరుకో! " అన్నాడు. 

   "  స్వామీ!నాకు మోక్షం యియ్యి " అని కోరుకుంది సుశీల. 

    అది విని పాండురంగస్వామి " మోక్షమా! మోక్షమెలాగా యిస్తాను. ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి, కొడుకులూ, మనుమలూ, మునిమనుమలూ ఎత్తేక మోక్షం సంపాదించుదువు గాని " అన్నాడు. 

    " స్వామీ! నాకింతవరకూ ఒక్క కుమారుడైనా కలుగలేదు. మనుమలూ, మునిమనమలూ అంటావేమిటి? " అంది సుశీల. 

    " ఒక్కడే కాదు. నీకు అయిదుగురు కుమారులు పుడతారు. ఆ అయిదుగురూ కూడా పూర్వజన్మలో నా భక్తులే. అన్నట్లు చెప్పటం మరచిపోయాను. నీ పూర్వ జన్మలో నువ్వో ఆవువి. నాకు భక్తురాలివి కావటంవల్ల నీకీ జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకీ, హంసా, చిలుకా, పామూ, తేనెటీగ నాకు భక్తులయాయి. ఆ అయిదుగురూ నీకు కొడుకులై పుడతారు " అని చెప్పి అంతర్ధానమయిపోయాడు. 

    పాండురంగడు పోతూ పోతూ సుశీలకు మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఉత్తి పిసినారి, నీచుడు, దుర్మార్గుడు అనికదూ చెప్పేను. పాండురంగవిఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండటంకోసమని, ఆమె మగని స్వభావమే మార్చివేశాడు. 

    ఊరినుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పటికే, ఆ లోభి అల్లా గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీలదే ఇప్పుడు. కొట్టడం, తిట్టడం మచ్చుకైనా లేదు. అప్పట్నుంచీ వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. 

    క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిదుగురు కొడుకులూ పుట్టేరు. ఆ కొడుకులకు కొడుకులు ఆ కొడుకులకు గూడా కొడుకులు పుట్టేదాకా ముత్తయిదువై బ్రతికుండి ఆఖరుకు సుశీల భర్తతో పాండురంగస్వామి వద్ద మోక్షాన్ని పొందింది. 

    

    

    

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...