31, జనవరి 2026, శనివారం

 31-01-2026 - శనివారం 


:: భాగవతసుధ - 3 :: 


    పరీక్షిన్మహారాజు వృత్తాంతము కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు. అది మనకందరికీ ఒక జీవన పాఠం. మరణం ఖాయమని తెలిసినప్పుడు మనిషి క్రుంగిపోకుండా, ఆ మరణాన్ని ఒక పండుగలాగా ఎలా మార్చుకోవచ్చో ఆయన నిరూపించారు. 

    సాధారణంగా మనసును నియంత్రించడం చాలా కష్టం. కానీ, పరీక్షిత్తుకు రెండు బలమైన ఆయుధాలు తోడయ్యాయి. ఒకటి వైరాగ్యం. శమీకమహర్షి కుమారుడు శృంగి శాపంవల్ల తక్షకుడి వల్ల తన మరణం ఏడో రోజున అని తెలిసిన వెంటనే, ఆయన తన రాజ్యాన్ని, సుఖాలను ఒక చిరిగిన వస్త్రంలా వదిలేశాడు. " నాది " అనే మమకారం పోయినప్పుడే మనసు భగవంతుని వైపు వేగంగా వెడుతుంది. రెండవది శ్రవణం. సాక్షాత్తు శుకమహర్షి బోధిస్తుంటే, పరీక్షిత్తు కనీసం మంచినీరు కూడా ముట్టుకోకుండా ఏకాగ్రతతో విన్నాడు. ఆ తీవ్రత వల్ల ఏడురోజులు ఏడు జన్మల సాధనతో సమానమయ్యాయి. 

    శుకమహర్షి భాగవత ప్రోక్తం చేస్తూ ప్రధానంగా వివరించిన విషయాలలో మొదటిది విశ్వరూపం. ఈ సృష్టి అంతా భగవంతుని శరీరమే. నదులు ఆయన నాడులు. పర్వతాలు ఆయన ఎముకలు అని చెప్పడం ద్వారా ప్రకృతిలో దైవత్వాన్ని చూడటం నేర్పారు. రెండవది మాయాశక్తి.  భగవంతుడు తన మాయద్వారా ఎలా సృష్టిని చేస్తాడు? ఎలా స్థితిని కాపాడతాడు? మరల ఎలా ఉపసంహరించుకుంటాడొ వివరించారు. చివరగా మూడవది తత్త్వవిచారణ. దేహం నాశనమవుతుంది. కానీ, లోపల ఉన్న " ఆత్మ " కు చావులేదు. సృష్టిలోని ప్రతి అణువులోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడనే అద్వైత సత్యాన్ని బోధించారు. 

    తక్షకుడు కరచినప్పుడు పరీక్షిత్తు ఎందుకు నవ్వాడు? ఇక్కడే పరీక్షిత్తు ఒక విజేతగా నిలిచాడు. శుకమహర్షి బోధనల వల్ల పరీక్షిత్తు " దేహభావన " నుండి బయటపడి ఆత్మస్థితికి చేరుకున్నాడు. తక్షకుడు కరిచే సమయానికి పరీక్షిత్తు ధ్యానసమాధిలో ఉన్నాడు. ఆయన దృష్టిలో తక్షకుడు ఒక పాము కాదు, అదికూడా భగవంతుని రూపమే. " చచ్చేది శరీరం మాత్రమే, నేను కాదు " అనే జ్ఞానం కలిగినప్పుడు మరణం భయం కలిగించదు. అందుకే, మరణాన్ని ఆహ్వానిస్తూ ఆయన నవ్వుతూ ప్రాణాలు వదిలాడు. 

    మరణాన్ని పండుగలా ఎలా మార్చుకోవాలి? పరీక్షిత్తు చరిత్ర మనకు ఇచ్చే సందేశం ఇదే. మరణం అనివార్యం అని ముందే గుర్తించడం. చివరి క్షణంలో వస్తువుల మీద, బంధువుల మీద మమకారం వదిలేయడం. మనసును ఉన్నతమైన శక్తిపై దైవం లేదా జ్ఞానం మీద లగ్నం చేయడం. మరణం అంటే అంతం కాదు. అది ఒక మార్పు మాత్రమే అని గ్రహించడం. 

    మరణం అనేది దేహానికి వచ్చే విరామం మాత్రమే. ఆత్మకు అది క్రొత్త ప్రయాణం. 

    పరీక్షిత్తులాగా మనం కూడా జీవించి ఉన్నప్పుడే ఈ సత్యాన్ని తెలుసుకుంటే, మరణం భయపెట్టే భూతంలా కాక, పరమాత్మలో కలిసే ఒక పండుగలా కనిపిస్తుంది. 

    పరీక్షిత్తు మరణించాక, ఆయన కుమారుడు జనమేజయుడు ఏం చేశాడు? తన తండ్రిని చంపిన పాముజాతి మీద ఆయన పెంచుకున్న పగ, ఆ పగ తీర్చుకోవడానికి ఆయన చేసిన దేమిటి? వచ్చే బుధవారం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఛానల్ ను తప్పక అనుసరించండి. జై శ్రీకృష్ణ! 

    

30, జనవరి 2026, శుక్రవారం

 30-01-2026 - శుక్రవారం

:: భాగవతసుధ-2 ::


    నమస్తే!  వ్యాసమహర్షి రచించిన శ్రీమద్భాగవతం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు, అది మోక్ష మార్గాన్ని చూపే ఒక దివ్యౌషధం. పరీక్షిన్మహారాజుకు, భాగవతానికి మధ్య ఉన్న ఆ అసక్తికరమైన నేపథ్యం వెనుక ఒక పెద్ద కథే ఉంది. 

    పాండవుల వారసుడైన పరీక్షిన్మహారాజు ఒకసారి వేటకై అడవికి వెళ్ళాడు. తీవ్రమైన దప్పికతో శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహర్షి గాఢమైన ధ్యానంలో ఉన్నారు. రాజు ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో, ఆకలిదప్పుల వల్ల విచక్షణ కోల్పోయిన పరీక్షిత్తు, ప్రక్కనే పడి ఉన్న ఒక చనిపోయిన పామును తన ధనస్సుతో తీసి మహర్షి మెడలో వేశాడు. 

    శమీక మహర్షి కుమారుడు శృంగికి ఈ విషయం తెలిసింది. తన తండ్రిని అవమానించినందుకు కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు " నా తండ్రి మెడలో మృతసర్పమును వేసిన ఆ వ్యక్తి, సరిగ్గా ఈరోజునుండి ఏడవ రోజున తక్షకుడు అనే పాముకాటుకు గురై మరణించుగాక! " అని శపించాడు. 

    శమీక మహర్షి తన ధ్యానం ముగిసాక జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడ్డారు. పరీక్షిత్తువంటి ధర్మాత్ముడైన రాజుకు ఇలాంటి శిక్ష పడకూడదని భావించినా, బ్రాహ్మణ వాక్కు అమోఘం కాబట్టి, ఆ విషయాన్ని శిష్యుల ద్వారా రాజుకు వర్తమానం పంపారు. 

    తనకు ఇంకా ఏడురోజులే ఆయుష్షు ఉందని తెలుసుకున్న పరీక్షిత్తు భయపడలేదు. తన తప్పును తెలుసుకొని, రాజ్యాన్ని తన కుమారుడైన జనమేజయుడికి అప్పగించి, గంగానదీ తీరానికి చేరుకున్నాడు. మరణం ఆసన్నమైన వ్యక్తి ఏం చేయాలి? దేనిని వినాలి? అని అక్కడ ఉన్న మహర్షులను అడిగాడు. సరిగ్గా అదే సమయంలో వ్యాసమహర్షి కుమారుడైన శుకబ్రహ్మ అక్కడకు వచ్చారు. 

    అత్యంత పవిత్రమైన భక్తిరసంతో కూడిన శ్రీమద్భాగవతాన్ని శుకమహర్షి ఆ ఏడు రోజుల్లో పరీక్షిత్తుకు వినిపించారు. ఇది వినడం వల్ల మరణం పట్ల భయం పోయి, పరీక్షిత్తు చివరకు మోక్షాన్ని పొందాడు. 

    శ్రీమద్భాగవతం వినడం అంటే భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోవడమే కాదు, అది మృత్యు భయాన్ని సైతం పోగొడుతుంది. 

    పరీక్షిన్మహారాజు రాజ్యత్యాగం చేసి, కొడుకును రాజును చేసి అడవికి వెళ్ళిపోయారు సరే, కానీ ఒక చక్రవర్తిగా ఉన్న వ్యక్తి, కేవలం ఏడు రోజుల్లో తన మనసును పూర్తిగా భగవంతునిపై ఎలా లగ్నం చేయగలిగారు? ఆ ఏడు రోజుల్లో శుకమహర్షి ఆయనకు చెప్పిన సృష్టి రహస్యాలు ఏమిటి? తక్షకుడు వచ్చి కరచినప్పుడు పరీక్షిత్తు ఎందుకు ఏడవలేదు? పైగా, ఎందుకు నవ్వుతూ ప్రాణాలు వదిలాడు? మరణాన్ని ఒక పండుగలాగా ఎలా మార్చుకోవచ్చో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. జై శ్రీకృష్ణ! 


29, జనవరి 2026, గురువారం

29-01-2026 - గురువారం 


:: భాగవతసుధ - 1 ::  


    అందరకూ నమస్సులు! ఈ రోజునుండి మన షార్ట్స్ విభాగంలో " భాగవతసుధ " సీరియల్ ప్రారంభమవుతోంది. పవిత్రమైన భాగవత కథలనుండి ప్రతిరోజూ ఒక చిన్న స్ఫూర్తిదాయకమైన ఘట్టాన్ని మీ ముందుకు తీసుకువస్తాను. దైవత్వం, ధర్మం, ప్రేమ మరియు భక్తితో నిండిన ఆ సుధను ఆస్వాదించండి. ఈ అధ్యాత్మిక ప్రయాణంలో నాతో కలిసి సాగండి. శ్రీమద్భాగవత ఆవిర్భావానికి దారితీసిన ఆసక్తికరమైన మొదటి కథ యిప్పుడు. ఇది వ్యాస మహర్షికి కలిగిన అలౌకిక అనుభవం. 

    మహాభారతం వంటి కావ్యాన్ని, అష్టాదశ పురాణాలను రచించి, వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన పరమజ్ఞాని వేదవ్యాస మహర్షి. అంతటి మహత్కార్యాలు చేసినా, ఆయన మనసులో ఏదో తెలియని వెలితి, తీవ్రమైన అశాంతి కలిగింది. 

    ఒకరోజు సరస్వతీ నదీ తీరాన కూర్చొని చింతిస్తున్న వ్యాసుని వద్దకు దేవర్షి నారదుడు విచ్చేశాడు. వ్యాసుని అశాంతిని గమనించిన నారదుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు " వ్యాసా! నీవు ధర్మం గురించి, సమాజ నీతి గురించి, యుద్ధాల గురించి ఎంతో అద్భుతంగా వ్రాసావు. కానీ, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలలను, ఆయన భక్తుల గొప్పతనాన్ని పరిపూర్ణంగా వర్ణించలేదు. భగవంతుని గుణగానం చేయని ఏ జ్ఞానమైనా పరిపూర్ణం కాదు. అదే నీ అశాంతికి కారణ " మన్నాడు. 

    నారదుడి బోధనతో వ్యాసుడికి జ్ఞానోదయం కలిగింది. ఆయన ధ్యాన సమాధిలోకి వెళ్ళి, తన యోగశక్తితో శ్రీకృష్ణుని లీలలు దర్శించాడు. ఆ దివ్య దర్శనానికి అక్షర రూపమే శ్రీమద్భాగవతం. తరువాత వ్యాసుడు ఈ భాగవతాన్ని తన కుమారుడైన శుక మహర్షికి నేర్పించాడు. ఆ శుకమహర్షి ద్వారానే ఈ జ్ఞానం పరీక్షిన్మహరాజుకు, తద్వారా లోకమంతటకూ అందింది. 

    మనం ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా, భగవంతుని స్మరణ లేనిదే మనసుకు సంపూర్ణమైన శాంతి లభించదు. 

    వ్యాసమహర్షి తన దివ్యదృష్టితో రచించిన ఈ భాగవతాన్ని, మరణానికి సిద్ధంగా ఉన్న పరీక్షిన్మహారాజు ఎందుకు వినాల్సి వచ్చింది? ఆయనకు ఏడురోజులే సమయం ఉందని ఎవరు చెప్పారు? ఈ ఆసక్తికరమైన విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాము. మరిన్ని భాగవత విశేషాలకోసం ఇప్పుడే ఫాలో అవండి. జై శ్రీకృష్ణ!


25, జనవరి 2026, ఆదివారం

:: అత్తాకోడళ్ళ పరివర్తన ::  


    శ్రోతక మహాశయులకు క్రొవ్విడి వెంకట రాజారావు అనేక నమస్కారములు. విఘ్నేశ్వర వైభవ లీలలకు సంబంధించిన కథలలో భాగంగా ఈ వారం అత్తాకోడళ్ళను బాధించిన " పిశాచాల భరతం పట్టిన ఏనుగు "  నకు సంబంధించిన వృత్తాంతం విందాం. విన్న తరువాత బాగుంటే  లైక్ చెయ్యండి. తప్పకుండా ఛానల్ ను ఫాలో అవండి. 

    పావనమిశ్రుడు సాయంత్రం వేళల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలోని గోడలపై చిత్రితమై ఉన్న విఘ్నేశ్వరుని గాథలు పిల్లలకు చెబుతూండేవాడన్న విషయం మనకు తెలిసిందే కదా! మరొక సాయంత్రం ఒక బాలిక మంటపం గోడలపైగల ఒక చిత్రాన్ని చూపించి అడిగిన కథను ఆయన ప్రారంభించి ఇలా చెప్పసాగాడు. 

    కళ్యాణి నగరంలో కలహకంఠి అనే ధనికురాలు, కోడలు పుట్టింటినుంచి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెటి పెట్టి, చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది. 

    కలకంఠి అని నామకరణం చేయబడినప్పటికీ, కలహకంఠి గా పేరుపొందిన ఆ ధనిక అత్త కోడలు సౌదామిని, పుట్టెడు దు:ఖంతో పుట్టింటికి బయలుదేరి దారితప్పి అరణ్యంలో పడి, ఆకలితో అటమటించి పోతూ ఒక వెలగచెట్టు దగ్గర పడిపోయింది. 

    తను పుట్టింటికెళ్ళి కూడా ప్రయోజనంలేదు. తన పెళ్ళికి చేయించిన నగలకే  తండ్రి అప్పుల పాలయ్యాడు. మరి నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటూండగా చెట్టునుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్లుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకుని సౌదామిని లేచి కూర్చుంటుండగా  భూమి అదిరేలాగ ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది. 

    సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై భక్తివిశ్వాసాలు కలది. విఘ్నేశ్వరుణ్ణి తలచుకొని ఏనుగు పాదాల క్రింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు ఠక్కున ఆగిపోయింది. 

    ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండుని తొండంతో తీసుకొని నోటవేసుకొని, దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామని తల నిమిరి తొండంతో చేయి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకువెళ్ళింది. 

    గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి, గజరాజు లోపలికెళ్ళి కొంతసేపయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకువచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాల్ని, కంఠాభరణాల్ని ఆమె మెడనిండా వేసి, తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి, మిగతా నగలను ధరించినన్ని ధరించి, తక్కినవి మూటకట్టుకొని  తీసుకెళ్ళమని సైగచేసి చెప్పింది. 

    సౌదామిని అలాగే చేశాక, ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. 

    బంగారు విగ్రహంలాగా నగలుతో తళుక్కు తళుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి, సంబాళించుకొని, మెల్లమెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచ్చాయో చెప్పేవరకు వేధించి, సౌదామిని చెప్పినదంతా విని, " ఏనుగుకు వెలగపళ్ళు అంత ఇష్టమన్నమాట " అని తల పంకించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా  వెలగపళ్ళు కొనుక్కు వచ్చింది. 

    నగలు నింపుకుని రావడానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకొని , వెలగపళ్ళ సంచితో కలహకంఠి బయలుదేరింది. 

    అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగచెట్టు కనబడక విసిగి, ఒక చింతచెట్టు క్రింద చతికిలపడి, తినాలని వెలగపండు తీసింది. 

    తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని, వెలగపండు చేత్తో ఎత్తిపట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగును రమ్మంటూ గట్టిగా భజన పాట మొదలెట్టింది. పాట సాగుతున్నది. ఏనుగు రాలేదు కాని, అడవి దద్దరిల్లేలాగా గాండ్రు మనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారము కాబోలు అనుకొని కలహకంఠి సంతోషపడుతూ మెడచాచి చూడగా పెద్దపులి దూకుతూ రావడం కనిపించింది. 

    భుజంమీది గోతాన్ని వదలకుండా కలహకంఠి తిరిగి చూడకుండా పరుగెత్తి, పరుగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం సరిగా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంఠి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది. 

    గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూచి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగ నగలన్నీ వేసుకొని, గోతంనిండా నగలు కుక్కి మూతికట్టి, ఎత్తలేక ఎత్తి, మోయలేక మోస్తూ, నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో, తెల్లగా మెరుస్తున్న కోరపళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగ కనిపించింది. 

    ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగ " ఓహో కలహకంఠీ! నువ్వు కోడల్ని కాల్చుకుతినే అత్తవైతే, అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని. నా చరిత్ర విను " అంటూ చెప్పడం ప్రారంభించింది. 

    వెనుకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మ, నాన్న పెట్టినపేరు కలహంసి. కాపురానికి వెళ్ళాక, నా నోటి ప్రతాపానికి ఆ పేటంతటికీ నేను సంపాదించుకొని సార్థకపరుచుకున్న పేరు కలహదుందుభి. 

    నువ్వెంత చెడ్డ అత్తవో, కలహంఠీ! నా అత్త అంత ఉత్తమురాలు. పరమ సాధువు. 

    నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే, నేనెంత ఉత్తమ ఇల్లాలునో ఊహించుకో! నాకు నగల పిచ్చి అంతా ఇంతా కాదు. బంగారు పంటలు పండే భూములు పుట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కుపుల్ల నుంచి అన్నీ నాకే యిచ్చేసింది. 

    అటువంటి అమాయకురాలైన అత్తను, ఒకపూటైనా సరిగా తిననిచ్చేదానను కాను. చిక్కి శల్యమైన వృద్ధురాలిచేత ఇంటి చాకిరీ అంతా చేయించేదాన్ని.

    చివరికి నా అత్తమామలు విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్నుమూద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా లాక్కోవటంతో, ఆవిడ తూలిపడిపోయి, ఆయాసంతో రొప్పుతూ కనుమూసింది. 

    అంతవరకూ ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ  పల్లెత్తు మాట అనని నా మామగారు, ఆపలేని దు:ఖంతో, పైకుబికిన కోపంతో " పాపిష్ఠిదానా! నువ్వు మా కోడలివయిపోయినావు. లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా, మా ఒక్కగాని ఒక్క కొడుకు తిరిగివస్తాడనీ, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను. వాడొస్తే సరిగా చూడు " అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు. తపశ్శాలి. 

    అదేసమయంలో ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు. నా అత్తమామల మృతదేహాలపై రోదిస్తూ, నేను లాక్కోబోయేటప్పుడు  క్రిందపడిన మూటను తీసి విప్పాడు. అందులో రెండు చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు. 

    ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తూ, " నువ్వు బ్రహ్మరాక్షసివిగా పుట్టవలసిన దానవు " అని అన్నాడు. అంతే, తరువాత వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి వెళ్ళిపోయాడు. 

    ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే " అని బ్రహ్మరాక్షసి చెప్పి, కాసేపాగి, మరల చెప్పసాగింది. 

    నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకూ ఈడ్చుకు వచ్చాయంటే, నేను కొంతమంది గజదొంగలను చేరదీసాను. దొంగల రాణిని అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు పోస్తూండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విష భోజనం పెట్టాను.  వాళ్ళు చచ్చేముందు ఛావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. 

    కలహకంఠీ! ఇదే గుహలో ఆ నగల్నీ, ధనరాసుల్నీ చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్నుమూసి, ఇలాగ భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే, నా పిశాచజన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. 

    ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవీ, అత్యాశకొద్దీ పోగుచేసి గోతాం నిండా కట్టుకున్నవీ ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. 

    కలహకంఠి భుజానికెత్తుకున్న గోతం కట్టువిడి దాంట్లోంచి పాములు, జెర్రులు, కొండతేళ్ళు, ఊడిపడుతూ జరజరా గుహ నలుమూలలకూ ప్రాకాయి. 

    ఒంటిమీద పాములూ, తేళ్ళు ప్రాకుతూంటే బెంబేలు పడిపోతున్న కలహకంఠిని చూసి గుహ మారుమ్రోగుతుండగా బ్రహ్మరాక్షసి వికవికా నవ్వుతూ " నువ్వు కోడల్ని కాల్చుకుతినే కలహకంఠివి. నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహదుందుభిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరేసరి, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసివై పడిఉండటం ఇక నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంఠీ! " అని చెప్పింది. 

    కలహకంఠి లెంపలు వేసుకొని, రాక్షసికి దండం పెట్టి  " బుద్ధి వచ్చింది. కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను. గుహనుండి నన్ను బయటకు పడనిచ్చి అరణ్యం దాటించు అని మొర పెట్టింది. 

    బ్రహ్మరాక్షసి కలహకంఠిని అడవి దాటించి, కళ్యాణి నగర పొలిమేరకు చేర్చి, " మాట తప్పావో, బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు. జాగ్రత్త " అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైంది. 

    కలహకంఠి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి, సౌదామిని ముందు మోకరిల్లి , మోకాళ్ళు పట్టుకుని " అమ్మా! సౌదామినీ! నన్ను మన్నించు. కొడుకు,  కోడలు  చిలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించడం కంటే నాకు కావలసిందేమీ లేదు " అన్నది. 

    అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహకంఠి తిరిగి కలకంఠి అనిపించుకున్నది. 

    పావనమిశ్రుడు కథను ముగించి " ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం " అన్నాడు. 

    పిల్లలే కాకుండా పెద్దలుకూడా ఆనందోత్సాహాలతో గొంతెత్తి " విఘ్నేశ్వరుడు , మన విఘ్నేశ్వరుడే " అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళ్ళారు. సశేషం. 

    వచ్చేవారం మరొక ఆసక్తికరమైన కథ విందాం. సర్వేజనా సుఖినోభవన్తు! స్వస్తి!! 

18, జనవరి 2026, ఆదివారం

:: విఘ్నేశ్వరుడి తొండం ఎంతపనిచేసింది? :: 


    శ్రోతలందరకూ క్రొవ్విడి వెంకట రాజారావు నమస్సులు. మనం సీరీస్ గా  ప్రతిరోజూ షార్ట్సులో మహాభారత రహస్యాలను, ప్రతిసోమవారం స్పెషల్ వీడియోలుగా విఘ్నేశ్వర వైభవ లీలలను చెప్పుకుంటున్నాం. ఆయా కథలనుండి మనకు తెలియని చాలా విషయాలను గ్రహిస్తున్నాం. సరే, ఈ సోమవారం నుండి విఘ్నేశ్వర వినోద గాథలను కొన్ని చెప్పుకొని త్వరలో కొన్నివారాల్లో ఈ సీరియల్ ను ముగింపు చేసుకుని మరొక సీరీస్ ను ప్రారంభించుకుందాం.  మిమ్ములను నే కోరుకునేది ఒక్కటే.  ఛానలును సబ్ స్క్రైబ్ చేసుకొని విన్న కథలు బాగుంటే లైక్ చెయ్యమని. చేస్తారుకదూ! సరే, ఇప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఎంతపని చేసిందో ఓ కథ ద్వారా విందాం. 

    వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడూ, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరాల్లో పేరుమ్రోగుతున్న కాలంలో, పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెబుతూండేవాడు. 

    మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్తరువుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. 

    పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు. 

    ఒక నగరంలో సత్యశర్మ, లోభగుప్త ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలుపేరు లాభగుప్త. కానీ, అతని లోభితనానికీ, అత్యాశకూ  ఊరిలోని వారంతా లోభగుప్త అనే స్థిరపరిచారు. 

    సత్యశర్మ, లోభగుప్త రోజూ శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భగుడిలోనికి వెళ్ళేదారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు. 

    లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు. 

    ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకొని వెడుతూండగా, లోభగుప్తుడు వస్తూన్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో " విఘ్నేశ్వరా! నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు. అతడిని ఆదుకోవలసిన అవసరం లేదా? " అన్నాడు. 

    " ఔనోయి నందీ! ఈ సాయంకాలానికి అతనికి వెయ్యి వరహాలు అందిస్తున్నాను " అని విఘ్నేశ్వరుడు అన్నాడు. 

    రాతివిగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని, క్షణం ఆలశ్యం చేయకుండా  సత్యశర్మ ఇంటికి వెళ్ళి " శర్మా! నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది. అయిదువందల వరహాలు ఇస్తాను. తీసుకో! " అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. 

    సత్యశర్మ " అయ్యా! గుప్తాగారూ! నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన ఋణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. ఈ అయిదువందలు ఎలాగ తీర్చగలను? " అన్నాడు. 

    లోభగుప్తుడు, " అదా! నీ సందేహం? ఈ అయిదు వందలు తీసుకొని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంత అయితే అంత నాకు ఇస్తే చాలు " అన్నాడు. 

    సత్యశర్మ తటపటాయిస్తుంటే, అతని భార్య " ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి. అవతల పెళ్ళివారు చాలాసేపై కూర్చొని ఉన్నారు " అని ప్రోత్సహించింది. 

    సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్ళి కుదిరింది. వరుడి తల్లి, దండ్రి అయిదువందల వరహాల విలువచేసే నగలు పిల్లవానికి పెట్టాలని పట్టుబట్టారు 

    సత్యశర్మ లోభగుప్తుడితో " అయ్యా! సాయంకాలానికి నాకు లబించింది యివ్వటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు కాని, అలా లభించే ఆస్కారం ఏదీ లేదు..." అంటూ నసుగుతుంటే, లోభగుప్తుడు " అదంతా వదిలెయ్యి. మనం ఇరుగు పొరుగు వారం. ఇప్పుడు నేనిస్తే తరువాత నువ్విస్తావు. యీ మాత్రం దానికి మొహమాటపడకు " అంటూ అయిదు వందల వరహాలమూట సత్యశర్మ చేత పెట్టాడు. 

    సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి బాగా తెలుసు. 

    సాయంత్రం అవుతున్నది కాని, సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు. లోభగుప్తుడు కంగారుపడుతూ దేవాలయానికి పరుగెత్తి, విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకుని లాగుతూ, " ఏమయ్యా విఘ్నేశ్వరా! సత్యశర్మకు వెయ్యివరహాలు త్వరగా యిప్పించు మరి .." అని అంటూండగా అతని అరచేయి తొండం సందున యిరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కిపట్టింది. 

    నొప్పితో లోభగుప్తుడు కిరకిరలాడి పోతుంటే, " సత్యశర్మకు వెయ్యివరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే, అంత త్వరగా నీకు విడుదల " అని విగ్రహం నుండి వినిపించింది. 

    లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తీనోరూ బాదుకొంటూ " అన్యాయం దేవుడా, అన్యాయం . అయిదువందలు ముందే యిస్తినిగదా! " అని పెడబొబ్బలు పెట్టాడు. 

    " అదా సంగతి అయిదు వందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా అయిదు వందల వరహాలు కాజేద్దామని ఎత్తువేసావన్నమాట. ఆశపాతకుడా! నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా అయిదువందలు యివ్వడమే కాకుండా, అతడికిచ్చిన ఋణాన్ని చెల్లుపెట్టి, అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్ళిలాగా జరిపించు " అని విఘ్నేశ్వరుడి విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. 

    లోభగుప్తుడు క్షణాలమీద తనవారిని పిలిపించి, సత్యశర్మకు మిగతా అయిదువందల వరహాలు ఇప్పించి, అతని ఋణానికి చెల్లుపెట్టించి, అతని కూతురు పెళ్ళి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేసాకనే అతని చెయ్యి ఇవతలికి వచ్చింది. 

    లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరుఊరంతా చెప్పుకొన్నారు. 

    లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురి వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పటినుండి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి, అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించి, విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై, గొప్ప ధార్మికుడనిపించుకున్నాడు. 

     కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్ళకు పరిగెత్తారు. 

    వచ్చే సోమవారం మరొక ఆసక్తికరమైన కథ. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! 

16, జనవరి 2026, శుక్రవారం

:: మహాభారత రహస్యాలు-7 :: 


    మహాభారతంలో  భీష్మపితామహుడి మరణానికి పునాదివేసిన ఆ స్త్రీ అంబ. ఒక చిన్న పొరపాటు, ఒకరి మొండితనం చివరకు భీష్ముడి పతనానికి ఎలా దారితీసింది? ఆ చిన్న పొరపాటు ఏమిటి? తన తమ్ముడైన విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువస్తాడు. అయితే, అంబ అప్పటికే సాల్వరాజుని ప్రేమిస్తున్నానని చెప్పడంతో, భీష్ముడు ఆమెను గౌరవించి పంపేస్తాడు. కానీ, మరొకరు తీసుకువెళ్ళిన స్త్రీని తాను స్వీకరించనని సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు. తిరిగి భీష్ముడి వద్దకు వస్తే, విచిత్రవీర్యుడు కూడా ఆమెను వద్దంటాడు. భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞ బ్రహ్మచర్యం వల్ల ఆమెను పెళ్ళిచేసుకోలేనని చెబుతాడు. ఇరువైపుల న్యాయం జరగక, తన జీవితం నాశనమవడానికి భీష్ముడే కారణమని అంబ రగిలిపోతుంది. భీష్ముడిని చంపటమే లక్ష్యంగా శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు " వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణ మవుతావు " అని వరం ఇస్తాడు. ఆ వరంతో అంబ మరుజన్మలో ద్రుపద మహారాజుకు శిఖండిగా జన్మిస్తుంది. పుట్టుకతో స్త్రీ అయినప్పటికీ, తరువాత పురుషుడిగా మారుతుంది. అయితే, భీష్ముడి అంతం ఎలా జరిగింది? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఓడించటం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు కృష్ణుడు శిఖండిని అర్జునుడి రథం ముందు నిలబెడతాడు. భీష్ముడికి  ఆడవారిపై గానీ, పూర్వం ఆడదిగా పుట్టిన వారిపై గానీ ఆయుధం పట్టనన్న ధర్మ నియమం ఉంది. శిఖండి పూర్వజన్మలో అంబ అని భీష్ముడికి తెలుసు. అందుకే శిఖండిని చూడగానే భీష్ముడు తన విల్లును క్రింద పడేశాడు. అదే సమయంకోసం ఎదురుచూస్తున్న అర్జునుడు శిఖండి చాటునుండి భీష్ముడిపై బాణాలవర్షం కురిపించి అతడిని అంపశయ్యపై పడేశాడు. అంబ పగ శిఖండి రూపంలో భీష్ముడి నైతిక ధర్మాన్నే ఆయుధంగా మార్చుకుని ఆయన మరణానికి కారణమయింది. 

    భీష్ముడు అంపశయ్యపైకి చేరాక, కౌరవ సైన్యం బాధ్యత ద్రోణాచార్యుడి చేతికి వచ్చింది. కానీ, తనను ఎవరూ ఓడించలేరని తెసిన ద్రోణుడు యుద్ధభూమిలో అకస్మాత్తుగా ఆయుధం ఎందుకు క్రిందపడేశాడు? ధర్మరాజు చెప్పిన ఒక్క అబద్ధం ద్రోణుడి మరణానికి ఎలా కారణమయింది? వచ్చే భాగంలో తెలుసుకుందాం. 

15, జనవరి 2026, గురువారం

:: మహాభారత రహస్యాలు - 6

భీష్ముని 'భీషణ' ప్రతిజ్ఞ హస్తినాపుర చరిత్రను, కురువంశ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. దీని వల్ల జరిగిన ప్రధాన మార్పులు నాలుగు. మొదటిది వారసత్వ సంక్షోభం. భీష్ముడు రాజ్యత్యాగం చేసి, పెళ్ళి చేసుకోనని శపథం చేయడంతో, సమర్థుడైన పాలకుడు ఉన్నప్పటికీ సింహాసనం బలహీనపడింది. తదుపరి వారసులైన చిత్రాంగద, విచిత్రవీర్యులు అల్పాయుష్కులు కావడం వలన రాజ్యం అస్థిరతకు లోనయింది. రెండవది ధర్మ సంకటం పైపెచ్చు అశక్తత. భీష్ముడు కేవలం హస్తినాపుర సింహాసనానికి కట్టుబడతానని ప్రతిజ్ఞ చేశాడు. దీనివల్ల ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి అధర్మాలు జరుగుతున్నా, తను చక్రవర్తి కానందున కేవలం చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆయన మౌనం కురువంశ నాశనానికి ఒక కారణమయింది. మూడవది కురుక్షేత్ర యుద్ధానికి పునాది పడటం. భీష్ముడు సింహాసనం అదిష్టించి ఉంటే, ధృతరాష్ట్రుడు లేదా పాండురాజు మధ్య వారసత్వ పోరు వచ్చేది కాదు. ఆయన తప్పుకోవడం వల్లే కౌరవ పాండవుల మధ్య విభేదాలు తలెత్తి, చివరకు అది ప్రపంచాన్నే మార్చిన కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారి తీసింది. ఇంకొక ముఖ్యమైనది నాలుగవది వంశవృక్షం మార్పు అనేది. భీష్ముడి ప్రతిజ్ఞ కారణంగానే కురువంశాన్ని నిలబెట్టడానికి ' నియోగ పద్ధతి ' ద్వారా వ్యాస మహర్షిని పిలవాల్సి వచ్చింది. దీనివల్ల కురువంశ రక్తసంబంధం తీరు మారిపోయింది. 

భీష్ముడి ప్రతిజ్ఞ ఆయన పితృభక్తికి నిదర్శనం అయినప్పటికీ, అది హస్తినాపురానికి రక్షణ కవచంలా కాకుండా, ఆ వంశం అంతరించి పోవడానికి ఒక పరోక్ష కారణంగా మిగిలిపోయింది. అందుకే అంటారు - కొన్ని త్యాగాలు చరిత్రను కాపాడితే, మరికొన్ని చరిత్రను మార్చి వేస్తాయని. 

సరే! భీష్ముడి త్యాగం హస్తినాపురాన్ని అనాథను చేస్తే , అదే భీష్ముడు చేసిన ఒక చిన్నపొరపాటు , ఒక స్త్రీ ఆగ్రహానికి కారణమయింది. ఆ ఆగ్రహమే భీష్ముడి మరణానికి ఎలా దారితీసింది? భీష్ముడిని అంతం చెయ్యడానికి పుట్టిన ఆ శక్తి ఎవరు? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మహాభారత రహస్యాలకోసం లైక్ చేయండి మరియు సబ్ స్క్రైబ్ చేసుకోండి. 
  

11, జనవరి 2026, ఆదివారం

::  వాతాపి బాదామిగా ఎలా మారింది ::


    శత్రుంజయుడు  ఎలుకతో  చళుకవర్మను దూరంగా చిన్న యింటికి తరిమి, " నువ్వు మామధ్య ఉండవలసిన వాడవు కావు. నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు, ఆ వాహనం జాతిదే నీకు దగ్గ యిల్లాలు. నీ యిల్లాలు అసూర్యం పశ్యగా ఎవరికీ కనపడకుండా ఉండే అంత:పుర కాంతగా ఉండడానికి ఇంటినిండా ఎలుక బిలాలు ఉన్నవిలే " అంటూ ఎకసెక్కెం చేశాడు. 

    చళుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా, " తండ్రి, కుమారులందరికీ పెళ్ళి చేయడమనేది చాలా గొప్ప విషయం. ఎవరి కెవ్వరో అది ఏనాడో రాసిపెట్టిందే అంటారు. మన చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్ఛ కదా! " అన్నాడు. 

    చళుకుడు ఉత్తమ గ్రంథాలను చదువు తున్నప్పుడు చుళుక ప్రక్కనే చేరి వింటూ ఉండేది. చళుకుడు విఘ్నేశ్వరుని అర్చిస్తూన్నప్పుడు నోటితో పువ్వులు అందించేది. చళుకుడు తిన్న తరువాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూండగా వినాయక చవితి దగ్గరకొచ్చింది.  

    అందరూ ఇళ్ళకు వెల్లవేసి ధాన్యాలు దంచుకొంటున్నారు. చుళుక రాత్రికి రాత్రి ఎలుకలన్నింటిని పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి. పళ్ళతో పైపొట్టు ఒలిచి ధాన్యాన్ని మెరికల్లా బియ్యం చేశాయి. 

    వినాయక చవితి ఉదయాన చళుకుని వదినలు స్వయంగా బంగారు బిందెలతో నదీ జలాన్ని నెత్తి నెత్తుకొని వస్తున్నారు. అది చూచి చళుకుడు కొద్ది విచారం కనబరిచాడు. 

    చుళుక వెంటనే బిందెలో దూరి దొర్లించుకుంటూ నదీ తీరాన్ని చేరుకుని యివతలకు వచ్చి కొండంత బిందెనూ, పొంగి పొర్లి ప్రవహిస్తున్న నదినీ చూసి హతాశురాలై " బిందెనైతే దొర్లించుకొచ్చాను గాని నీళ్ళెలా ముంచగలను? బిందెతో ఎలా మోసుకెళ్ళగలను? అవివేకురాలిని. పనికిమాలిన దానిని. నేనెందుకు బ్రతికి? " అని అనుకుంటూ, తలను అక్కడున్న రాతికేసి కొట్టుకుంటూండగా విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, ఎలుకను చేతితో ముద్దుగా నిమిరాడు. శాపవిమోచనమై, ఎలుకరూపు మాయమై దేవకాంత కళ్యాణ కింకిణి నిజరూపంతో విఘ్నేశ్వరుడి పాదాలమీద ప్రణమిల్లి, అనేక విధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు కళ్యాణ కింకిణిని ఆశీర్వదించి  అంతర్ధానమయ్యాడు. 

    కళ్యాణ కింకిణి నీళ్ళబిందెను తలకెత్తుకొని నడిచి వెడుతూంటే, దారిపొడవునా ప్రజలు బొమ్మలవలె నిల్చుని చూస్తూ " ఎవరీ దేవసుందరి? ఎవరింటికి వెడుతున్నది " అని విస్తుపోయారు.   

    చళుకవర్మ వదినలు కళ్యాణ కింకిణి తమ చిన్న మరది యింటిలోకి వెళ్ళడం చూసి, ముఖాలు వేలాడ దీసుకున్నారు. 

    శత్రుంజయుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి, చళుకవర్మను సతీసమేతంగా రాజమందిరానికి తోడ్కొని వచ్చాడు. 

    చళుకుని అన్నలు తండ్రితో " మాకూ అలాంటి ఎలుకలతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చెయ్యలేదు అలా చేసి ఉంటే మాకూ అప్సరసలే తయారై వచ్చి ఉండేవారు కదా! " అని గద్దించి అడిగారు. 

    ఇటువంటి తెలివిమాలిన కొడుకుల కోసమా నేను సామ్రాజ్యాన్ని ఆర్జించి పెట్టింది అని శత్రుంజయుడు  విరక్తి చెంది తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు పోయాడు. 

    చళుకవర్మ అన్నలు అసంతృప్తి, పరస్పర ద్వేషాలతో కలహించి యుద్ధాలు చేసి కొట్టుకు చచ్చారు. ఎంత వద్దంటున్నా వినక, ప్రజలు చళుకవర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చళుకవర్మ పాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవించారు. 

    చళుకవర్మ కళ్యాణి కింకిణి పేరున కళ్యాణి అనే మరో గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణి కింకిణి వలన నలుగురు పుత్రులు కలిగారు. వారు చాళుక్యులుగా పిలువబడ్డారు. ఆ విధంగా చాళుక్య రాజవంశాలకు మూలపురుషుడైన చళుకవర్మ కాలంలో వాతాపి నగరం అనేక దేవాలయాలతో, ప్రాకారాలతో శోభిల్లింది. కళలకు కాణాచిగా, విద్వాంసులుకు, పండితులకు ఆటపట్టుగా, భూతల స్వర్గం అనిపించుకుంది. నగరాధిదేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. ఉత్కృష్ట శిల్పానికి ప్రామాణికమైన ఆలయ మంటప శిల్పాన్ని చూడడానికి దేశం నలుమూలలనుంచి రాజులు మొదలుకొని సామాన్య యాత్రీకుల వరకూ ఎల్లప్పుడూ వస్తూండేవారు. 

    చాళుక్యులు నాలుగు దిక్కులా రాజ్యాలు ఏర్పరచుకొని పాలించారు. చాళుక్యవంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు చేశారు. వాతాపి నేలిన వారు వాతాపి చాళుక్యులని, కళ్యాణి నగరాన్ని పాలించిన వారు కళ్యాణి చాళుక్యులని, వేంగి నేలినవారు వేంగీ చాళుక్యులని, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, సౌరాష్ట్ర చాళుక్యులుగా పేరొందారు. కాలక్రమాన వాతాపిని బాదామి అనిగూడా వ్యవహరించారు. 
 
( సశేషం! వచ్చేవారం మరొక విఘ్నేశ్వర వినోద గాథ! అంతవరకూ శలవు! సర్వేజనా సుఖినోభవన్తు! స్వస్తి!! ) 

9, జనవరి 2026, శుక్రవారం

:: మహాభారత రహస్యాలు -1 :: 


    కురుక్షేత్ర మహాసంగ్రామానికి, అసలు కురువంశం భూమిపై జన్మించడానికి పునాది ఎక్కడ పడిందో మీకు తెలుసా? ఇది ఏ ఒక్కరో చేసిన తప్పుకాదు. బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక భయంకరమైన శాపం. 

    పూర్వజన్మలో మహాభిషుడు అనే ఒక శక్తివంతుడైన రాజు తన పుణ్యఫలంతో బ్రహ్మలోకానికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన గంగాదేవిని చూసి, ఆమె సౌందర్యానికి ముగ్ధుడై మోహానికి లోనవుతాడు. దేవలోకంలో ఉండి కూడా, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేక మర్త్యలోకపు ఆలోచనలు చేసినందుకు బ్రహ్మదేవుడు ఉగ్రుడవుతాడు. 

    " దేవతలకు ఉండాల్సిన అర్హతను మీరు కోల్పోయారు. కాబట్టి మీరిద్దరూ మనుషులుగా భూలోకంలో జన్మించి, మృత్యువు ఉన్న ఆ లోకంలో కష్టసుఖాలు అనుభవించండి " అని శపిస్తాడు. ఆ శాపం వల్లే గంగాదేవి భూమిపైకి రావడం, శంతన మహారాజును వివాహం చేసుకోవడం జరిగింది. 

    కానీ, గంగాదేవి తన బిడ్డల విషయంలో చేసిన ఒక భయంకరమైన పని శంతనుడిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అదేమిటో పార్ట్-2లో విందాం!

    తప్పకుండా సబ్ స్క్రైబ్ చేసుకోండి!

8, జనవరి 2026, గురువారం

:: తెలివైన ముని - ధర్మసంకటం ::  


    భాగవతంలో మనకు తెలియని ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. అందులో ఇదొకటి. 

    ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక ముని తన ఆశ్రమంలో నివసించేవాడు. ఆయన చాలా తపస్సుచేసి ఎన్నో శక్తులు పొందాడు. ఒక రోజు ఆ ముని ధ్యానంలో ఉండగా, ఒక చిన్న పక్షి వచ్చి ఆయన ఒడిలో వాలింది. ఆ పక్షి చాలా భయపడి ఉంది. ఎందుకంటే దాన్ని ఒక వేటగాడు తరుముతున్నాడు. ముని ఆ పక్షిని చూసి జాలిపడి, దానిని కాపాడాలని అనుకున్నాడు. 

    కొద్ది సేపటికి,  ఆ వేటగాడు ముని దగ్గరకు వచ్చి, తనపక్షిని చూశారా అని అడిగాడు. ముని ధర్మ సంకటంలో పడ్డాడు. పక్షిని చూపించకపోతే అబద్ధం చెప్పినట్లవుతుంది. చూపిస్తే పక్షి ప్రాణాలకు ప్రమాదం. అప్పుడు ముని ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన వేటగాడితో " నా కళ్ళముందు ఏ ప్రాణీ లేదు " అన్నాడు. నిజానికి, పక్షి ఆయన ఒడిలో ఉంది. కానీ, ఆయన కళ్ళముందు కాదు., కింద ఉంది. 

    ఈ విధంగా ముని అబద్ధం చెప్పకుండానే పక్షిని కాపాడాడు. ఈ కథ ధర్మం, తెలివితేటలు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ధర్మం అంటే కేవలం నిజం చెప్పడమే కాదు, ఒక ప్రాణాన్ని కాపాడటం గూడా! 

7, జనవరి 2026, బుధవారం

:: నిమి చక్రవర్తి - దేహంలేని రాజు ::  


    మనం ప్రతిరోజూ వాడే " నిమిషం " అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? దీని వెనుక భాగవతంలో ఒక వింత కథ ఉంది. 

    ఇక్ష్వాకు వంశానికి చెందిన నిమి చక్రవర్తి ఒక యజ్ఞం చెయ్యాలనుకుంటాడు. కానీ కులగురువు వశిష్ఠుడు వేరే యజ్ఞంలో బిజీగా ఉండడంతో, నిమి మరో ఋషితో యజ్ఞం మొదలుపెడతాడు. దీనికి కోపించిన వశిష్ఠుడు " నీ దేహం పడిపోవుగాక " అని శపిస్తాడు. నిమి కూడా ప్రతిశాపం ఇస్తాడు. 

    యజ్ఞం పూర్తయ్యాక, దేవతలు ప్రత్యక్షమై నిమి చక్రవర్తిని బ్రతికించాలనుకుంటాడు. కానీ, నిమి  " దేవతలారా! ఈ శరీరం రోగాలకు, దు:ఖాలకు నిలయం. నాకు మరలా దేహబంధం వద్దు. నేను దేహం లేకుండానే ఉండాలను కుంటున్నాను " అని అంటాడు.

    దేవతలు ఆశ్చర్యపోయి, సరే అంటూ ఆయనను అందరి ప్రాణికోటి కళ్ళల్లో కనురెప్పగా ఉండమని   ఒక వింత వరాన్ని ఇచ్చి దీవించారు.

    మన కనురెప్పలు కొట్టుకోవడాన్ని సంస్కృతంలో " నిమేషము " అంటారు. నిమి చక్రవర్తి మన కనురెప్పలమీద ఉండటంవల్లే ఆ పేరు వచ్చిందని భాగవతం చెబుతున్నది. మనం కనురెప్ప వేసే కాలాన్ని ' నిమిషం ' అనడానికి మూలం ఆయనే. 

    మనం కనురెప్ప వేసే సమయాన్ని అందుకే ' నిమిషం ' అంటాం. అంటే, మన ప్రతి కనురెప్పపాటులోనూ ఆ నిమి చక్రవర్తి ఉన్నాడన్నమాట!   

4, జనవరి 2026, ఆదివారం

 :: వాతాపినగరగాథ ::


    విఘ్నేశ్వర శిల్పంలోని దేవతావిగ్రహాల గానానికి తన్మయుడైన అగస్త్యుడు " వాతాపి గణపతీ! నీ అద్భుతశిల్పాన్ని నీవే మలచుకొన్నావు. ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరితరం? " అన్నాడు. 

    అప్పుడు విగ్రహంలోనుంచి " అగస్త్యమహర్షీ! నాకోసమని శిల్పం మలచుకోలేదు. నీ తృప్తికోసం నీ కోరిక నెరవేర్చాను. అంతే! అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అటుపిమ్మట అదృశ్యమవుతుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధయాగ సందర్భంలో, ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది " అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి - అని ధౌమ్యుడు అర్జునిడితో చెప్పి, " అర్జునా! ఆ మహాశిల్పాన్నే మనం చూస్తున్నాం " అని ఆగాడు. 

    అర్జునుడు మహాశిల్పం చుట్టూరా పలుమార్లు ప్రదక్షిణలు చేసి, భక్తి శ్రద్ధలతో పరిశీలించాడు. మహాశిల్పం విఘ్నేశ్వరుడే! ఆ విఘ్నేశ్వరుడిని అంటిపెట్టుకొని త్రిమూర్తులు, జగదంబ, లక్ష్మీపార్వతీసరస్వతులు, నవగ్రహాలు మొదలుకొని అనేకమంది దేవతలు మనోహర శిల్పాలుగా మలచబడ్డారు. విఘ్నేశ్వరుని రెండు పాదాల ఇరుకున విఘ్నం బంధింపబడి ఉన్నది. ఎలుకరాజు తోక విగ్రహం చుట్టూరా వలయంచుట్టి ఉన్నది. శిల్పశోభ తిలకించడానికి వెయ్యి కళ్ళున్నా చాలవు అనిపిస్తున్నది. తనివితీరా చూశాక అర్జునుడు, ధౌమ్యుడుతో " ఆచార్యదేవా! ఇంతటి మహనీయ శిల్పం చుట్టూరా నెలకొన్న వాతాపినగరం మహోన్నతదశ అనుభవించి యిప్పుడెందుకిలా ఉంది? వాతాపినగర గాథ వినాలని కుతూహలపడుతున్నాను " అన్నాడు. 

    ధౌమ్యుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. 

    అగస్త్యుడు లోపాముద్ర ఆదేశానుసారం ఏమీ మిగుల్చుకోకుండా, ఉంచిన ధనాన్ని అందరికీ పంచేసి, ప్రజారాజ్య పాలనాబాధ్యతలను, పౌరధర్మాలను అనుసరిస్తూ సుఖజీవనం గడపండని ప్రజలకు చెప్పి, కట్టుబట్టలతో లోపాముద్రతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. 

    విఘ్నేశ్వర మహాశిల్పమే ప్రజారాజ్య మకుటంగా ఆరాధిస్తూ వాతాపినగర ప్రజలు చిరకాలం క్రమబద్ధంగా సుఖజీవనం చేశారు. తరాలు మారాయి. ఆదర్శరాజ్యంగా, ప్రజారాజ్య మార్గదర్శకంగా దినదిన ప్రవర్థమానమై విస్తరించిన వాతాపినగరం దేశదేశాంతరాల్లో పేరుపొందింది. 

    అగస్త్యుడు తనను కూడా హతమారుస్తాడనే ఛావు భయంతో పారిపోయి, వింధ్యాటవుల్లో ఊరూపేరూ లేని చీకటి బ్రతుకు బ్రతుకుతున్న ఇల్వలుడు వాతాపినగరం పేరు ప్రఖ్యాతులు విని, అగస్త్యుడు అక్కడ లేడని తెలుసుకున్న మీదట, నయవంచనతో సాధించాలనే తలంపుతో, ప్రజాసేవనే జీవిత పరమార్థంగా పెట్టుకొన్న వాడిలాగ రూపుమార్చుకొని, వాతాపినగర ప్రజలమధ్యకు చేరాడు. అప్పటి పరిస్థితి కూడా ఇల్వలుడికి అనుకూలంగా ఉంది. 

    క్రమక్రమంగా కాలమహిమవల్ల, వాతాపినగర ప్రజల్లో స్వార్థచింత అంకురించి పెరగసాగింది. కలిమిలేములు ప్రారంభమయ్యాయి. ప్రజల్లో భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలు తలదాల్చాయి. తెలివితేటలు తెలివితక్కువ వారిని వంచించడానికి పనికివచ్చాయి. 

    అలాంటి పతనదశ ప్రారంభంలో, ఇల్వలుడు ఒక ప్రజానాయకుడిగా తయారై, ఇంద్రజాల విద్యలతో ఒక మహాపురుషుడుగా ప్రజలను ఆకట్టుకొన్నాడు. 

    నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పంమీద ప్రజలకు గురి ఉన్నంతకాలం అగస్త్యుణ్ణి, అగస్త్యుడు చెప్పిన నైతిక సూత్రాలను మరచిపోరనే విషయం గుర్తించాడు. తాంత్రికవిద్యలు, మద్యపానీయాలు ప్రజలకు రుచి చూపించాడు. అగస్త్యుడు నాటించిన ప్రజారాజ్య సూత్రాల శిలాఫలకాలను ఊడబెరికించి, క్రొత్త క్రొత్త సూత్రాలు నూరిపోశాడు. ఒకరినొకరు దోచుకోవడంలో ఉన్న ఆనంద విశేషాన్ని ప్రచారం చేశాడు. గిరిగీసుకుని కూర్చోవడం మనిషి లక్షణం కాదనీ, క్రొత్తక్రొత్త సుఖాలు తెలుసుకోవడానికే బ్రతకడం అనే సిద్ధాంతానికి ప్రజలను మళ్ళించాడు. ప్రచ్ఛన్న వేషాలతో చాలామంది రాక్షసులు ఇల్వలుడికి తోడైనారు. ప్రజాసేవకుడిగా అవతరించి, ప్రజానాయకుడిగా తయారైన ఇల్వలుడు మహానాయకుడై, ప్రజలపై అంకుశంగా మారాడు. అంత:కలహాలను రేపాడు. వాతాపినగరం కొట్లాటలతో నిండిపోయింది. దుర్మార్గులు అమాయకులను వేటాడుతున్నారు. నగరం అల్లకల్లోలమై పోయింది. చాలామంది ప్రజలు నగరం విడిచి వెళ్ళిపోయారు. 

    ఇల్వలుడు నగరమధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని నేలమట్టం  చేయాలని ప్రయత్నాలు ఆరంభించాడు. శతఘ్నులు చుట్టూరా గురిపెట్టించాడు. శిల్పంఅడుగు నేలలో ప్రేలుడుమందు దట్టింపించి, అగ్గిముట్టించటమే తరువాయిగా ఉన్న సమయంలో, అతివిచిత్రంగా అద్భుతం జరిగింది. నిప్పు తగిలించకుండానే మందుగుండు ప్రేలింది. శతఘ్ని శకటాలు అటునుంచి ఇటు వెనక్కు తిరిగి ప్రేలి గుండ్ల వర్షం  కురిపించాయి. ఆ అగ్ని వర్షంలో దుర్మార్గులంతా మరణించారు. చాలామంది వికలాంగులయ్యారు.  వారిలో ఇల్వలుడు కూడా ఒకడు. ఇల్వలుడి ఒక కాలు, ఒక చేయి పోయింది. రక్తసిక్తమైన దేహంతో నేలదొర్లుతూన్న సమయంలో, ఇల్వలుడికి విగ్రహంనుంచి మాటలు వినిపించాయి. 

    " ఓరీ! ఇల్వలా! అంగవైకల్యంతో, ముసలితనంతో చివికి చివికి కుళ్ళుతూ చిరకాలం జీవించు. నీకు అదే సరియైన శిక్ష " అని విఘ్నేశ్వరుడు శపించాడు. 

    వాతాపినగరం క్రమంగా తన పూర్వవైభవాన్ని కోల్పోయి, కొద్దిమంది మనుష్యులతో మాత్రమే  ఇప్పుడిలా బీడుపడిపోయింది " అని ధౌమ్యుడు చెప్పడం ముగించాడు. 

    అర్జునుడు అంతావిని అటుతిరిగి చూసి, ఆశ్చర్యంతో నోట మాటరాక అలా ఉండిపోయాడు. విఘ్నేశ్వర మహాశిల్పం కనిపించలేదు. 

    " అర్జునా! ఆశ్చర్యపడకు. మహాశిల్పం అదృశ్యమై పోతుందని యిదివరకే వింటివి కదా! " అని ధౌమ్యుడు అంటూండగా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఒక ముళ్ళపొదలో, ఒక పండుముసలి వికృతరూపుడు ఒకచేయి, ఒక కాలుతో శరీరాన్ని యీడ్చుకొనివస్తూ కెవ్వున అరచి మహాశిల్పం ఉండినవేపు చేతులుచాచి జోడించి గిలగిల లాడుతూ చనిపోయాడు. 

    అర్జునుడు అదిచూసి ఆశ్చర్యపోతూ, " గురుదేవా! వాడేకదా ఇల్వలుడు " అన్నాడు. 

    ధౌమ్యుడు " ఔను. ఎప్పటికైనా దుర్మార్గులు అలాగే నశిస్తారు " అన్నాడు. 

    వార్తాహరులచేత వాతాపినగరానికి బయలుదేరి రమ్మని అర్జునుడు ధర్మరాజుకు కబురు పంపాడు. 

    హస్తినాపురం నుండి ధర్మరాజు భీమ, నకుల, సహదేవులతో వాతాపి నగరానికి వచ్చాడు. 

    ఆరాత్రి ధర్మరాజు విఘ్నేశ్వర మహాశిల్పం అంతర్థానమైన ప్రదేశానికి ఎదురుగా కూర్చొని " నా తమ్ముడు నీ మహాశిల్పం దర్శించాడు. దేవా! నాకూ ఆ భాగ్యం కలిగించవా? నీ మహనీయ శిల్పాన్ని ఎవరు చెక్కుతారు? సత్వరమే నీ విగ్రహ ప్రతిష్ఠ జరిపించే మహాభాగ్యాన్ని నాకు కల్పించు " అని కన్నులుమూసి విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ వేడుకొన్నాడు. 

    అప్పుడు అతని చెవుల్లో " ధర్మజా! దేవశిల్పి విశ్వకర్మ, దానవశిల్పి మయుడు కలసి శిల్పులుగా వచ్చి విగ్రహాన్ని చెక్కుతారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే యాగాశ్వం కదలి వెడుతుంది. నీ అశ్వమేధయాగం జయప్రదంగా జరుగుతుంది. వాతాపి నగరాన్ని పునరుద్ధరణ చెయ్యి. మీ పాండవ సంతతివారైన చంద్రవంశరాజులు చిరకాలం ఈ నగరాన్ని పాలిస్తారు " అనే వాక్కులు వినిపించాయి. 

    ధర్మరాజు కళ్ళు తెరచేసరికి ఎదురుగా మహోన్నతంగా విఘ్నేశ్వర మహాశిల్పం దేదీప్యమానంగా కనిపించి అంతర్థానమయింది. 

    మరునాటి ఉదయం ఒక తెల్లనివాడు, ఒక నల్లనివాడు ఆ దరిదాపుల్లో పొదలమధ్య ఉన్న పెద్ద స్ఫటికశిలను పరిక్షిస్తూ కనిపించారు. వారెవరైనదీ గ్రహించి ధర్మరాజు వారికి మ్రొక్కి మర్యాదలు జరిపాడు. 

    ఆ శిలను పెకలించడానికి తవ్వుతున్నప్పుడు, అక్కడ గొప్ప నిధి దొరికింది. ఆ బంగారాన్ని ఇల్వలుడు నిక్షిప్తపరిచాడు. ఆచోటు వదల్లేక చివికి చివికి వాడు చివరకు మరణం పాలయింది కూడా అక్కడే. 

    ధర్మరాజు ఆ నిధిని వాతాపినగర అభివృద్ధికి వినియోగించాడు. 

    ఇద్దరు మహాశిల్పుల చేతులమీదుగా విఘ్నేశ్వరుని విగ్రహం,  మహాశిల్పం అదృశ్యమైన చోటనే గొప్ప ఆలయం, పెద్ద మంటపం తయారయినాయి. విశ్వకర్మ మయుల శిల్పరీతుల అద్భుత సమ్మెళనంతో ఒక గొప్ప శిల్ప సాంప్రదాయానికి నాంది అయింది. భరతవంశం వారిచే నెలకొల్పబడి నందువల్ల అది భారతీయ శిల్పంగా పేరొంది, కాలాల తరబడి గొప్ప ప్రఖ్యాతి పొంది చిరస్థాయిగా వర్ద్ధిల్లింది. 

    ఆ విధంగా, విఘ్నేశ్వరశిల్పం పూర్తిచేసి శిల్పులిద్దరూ ఎలాగ వచ్చారో అలాగే మాయమయ్యారు. 

    ఆలయంలో ధర్మరాజుచే విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే గుర్రం దౌడుతీసి పరుగెత్తింది. అర్జునుడు, భీముడు సైన్య సమేతంగా దాని వెనుక బయలుదేరారు. 

    ధర్మరాజు అగస్త్యుడు ఏర్పరచిన ప్రజారాజ్య పద్ధతులతో వాతాపినగర పాలన సాగేలా పాలనా దక్షత ఏర్పాటుచేసి, తరువాత నకుల సహదేవులతో హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. 

    ప్రజారాజ్య పర్యాయపదంగా ఆ ప్రాంతం అగస్త్యరాజ్యమనీ, నగరం అగస్త్యనగరమనీ కొంతకాలం పేర్కొనబడినవి. కాలక్రమేణా, వాతాపినగరమనే పేరే స్థిరంగా నిలిచిపోయింది. 

    అర్జునుడు దిగ్విజయాన్ని ముగించుకొని గుర్రంతో హస్తినాపురం చేరాడు. అశ్వమేధయాగం జరిగింది. ధర్మరాజు యాగభాగాలను విశ్వకర్మకు, మయుడికి ప్రత్యేకంగా అర్పించాడు. శిల్పులకు, శిల్పానికి గౌరవ ప్రపత్తులు చేకూర్చాడు. 

    ధర్మరాజు తరువాత పరీక్షిత్తు, పరీక్షిత్తు తరువాత జనమేజయుడు పాలించారు. జనమేజయుని సంతతివారైన రాజులు వాతాపి నగరాన్ని పాలించసాగారు. 

    వాతాపి నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజులలో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్యపిపాసి. వాతాపినగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సైన్యాలను పెంచడానికి ప్రజలమీద విపరీతంగా పన్నులు వేశాడు. నిరంకుశపాలన సాగిస్తూ, ఇల్వలుడు మళ్ళీపుట్టాడు అని అనిపించుకున్నాడు. 

    అతని కుమారుల్లో కడపటి వాడైన చళుకవర్మ చాలా మంచివాడు. అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురికలవాడు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ, విద్యపట్ల, కళలపట్ల ఆసక్తితో ఉండేవాడు. అగస్త్యుడి అంశ అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడు.  

    సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు కుమారులను ఆయత్తం కమ్మన్నాడు. చళకుడు తండ్రితో " జనహింస, పరపీడనతో కూడిన సామ్రాజ్య విస్తరణ, కసాయి వృత్తికంటే ఏం గొప్ప? " అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళడం మానేసాడు. 

    శత్రుంజయుడు మండిపడుతూ " ఔరా! సింహం కడుపున ఎలుక పుట్టినట్లు రాజవంశంలో తప్పపుట్టావు. నీకు తగిన శాస్తి జరగాలి " అని అంటూ ఒక ఎలుకను పట్టి తెప్పించి, దానికి చుళుక అని పేరుపెట్టి దానితో చళుకవర్మకు పెళ్ళి అని చాటించాడు. 

    చుళుక అసలుపేరు కళ్యాణకింకిణి. ఒక అప్సరస. ఇంద్రుడి శాపంవల్ల ఎలుకగా భూమిమీద పడింది. 

    కళ్యాణ వేదికపై ఉన్న పెళ్ళిపీటలపై, రాకుమారుణ్ణి ఎలుకను చూసి, వచ్చేవారు చేసే కోలాహల పరిహాసానికి చళుకుడు సిగ్గుతో క్రుంగిపోవాలని శత్రుంజయుడు, ఆ విచిత్ర వివాహానికి రాజులనూ, ప్రజలను ఆహ్వానించాడు. కాని చళుకవర్మ మందహాసంతో " ఎలుకను మహారాజు కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు, ఎలుకను చిలుకల కొలికిగా చేసినా చేయవచ్చు - అని మీరంతా నమ్మకపోవచ్చును గాని, నేను నమ్మగలను అన్నాడు. 

( సశేషం. ఆసక్తికరమైన ఈ కథాభాగం వచ్చే వారం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! ) 

    

    

    

 

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...