3, డిసెంబర్ 2025, బుధవారం

:: రుక్మిణి వేదాంతం :: 


    సత్యభామకు విఘ్నేశ్వరుడిపై ఎనలేని భక్తివిశ్వాసములున్నవి. ఆమె ప్రతి వినాయకచవితికి విఘ్నేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి కృష్ణుణ్ణి తన అధీనుడుగా చేయవలెనని కోరుకుంటూండేది. కృష్ణుడు ఆ దారిని వచ్చినప్పుడల్లా సౌధాగ్రంమీద నిల్చొని చూసి చూసి, ఒకసారైనా అతడు తలపైకెత్తి తనను చూడలేదు కదా అని నిరాశతో విఘ్నేశ్వరుడి మ్రోల మోకరిల్లి తన ఆశ ఫలింపచేయమని మరీమరీ ధ్యానిస్తూండేది. 

    సత్రాజిత్తుకు కుమార్తె మనసు తెలిసినా తెలియనట్టే ఉండేవాడు. ఒకనాడు సత్య విఘ్నేశ్వరుడి ముందు మోకరిల్లి ఉండగా చూసి " ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని అనుగ్రహం మనపై ఉండగా, ఇలాంటి మ్రొక్కుబడులు దేనికమ్మా? " అన్నాడు. 

    సత్యభామ చివాలున లేచి " అలా అనకూడదు నాన్నా! మనోవాంఛితాన్ని సఫలం చేయగల దేవుడు విఘ్నేశ్వరుడు ఒక్కడే " అన్నది. 

    " ఏమిటి నీ మనోవాంఛితం? రుక్మిణితో పాలు పంచుకోవడమేనా? " అన్నాడు సత్రాజిత్తు. 

    " పాలు పంచుకోవడమేమిటి? కృష్ణుణ్ణి నా అధీనంలో పెట్టుకుంటాను " అన్నది సత్యభామ. 

    సత్యభామ పట్టుదల ఎలాంటిదో సత్రాజిత్తుకు తెలియనిదికాదు. అయినా, వట్టి బేల అని తనకు తాను సర్దిబెట్టుకుంటూ వెళ్ళాడు. 

    మరునాడే కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరకు వచ్చాడు. రాకరాక వచ్చిన కృష్ణుడి కళ్ళపడాలని సత్య సంబరపడుతూ  ముస్తాబు సవరించుకొని సభామందిరానికి వెళ్ళేసరికి కృష్ణుడు అప్పుడే వెళ్ళిపోయాడు. సత్రాజిత్తు శ్యమంతకమణిని గుప్పెట్లో భద్రంగా పట్టుకొని ఉగ్రంగా కృష్ణుడు వెళ్ళిన వేపే చూస్తూ ఎంతో దిగులుగా నిలుచున్నాడు. 

    సత్యభామ తండ్రితో " ఏమిటి నాన్నా! అలాగ ఉన్నారు? వచ్చినవాడు నన్ను తనకు యిమ్మని అడగలేదుగద? " అన్నది. 

    " అలా అడిగినా నేనంతగా పట్టించుకోను కాని, ఏమడిగాడో తెలుసా? శ్యమంతకమణిని యిమ్మన్నాడు. తనలాంటి వాడి దగ్గర ఉంటే, ప్రజలందరి శ్రేయస్సుకు ఎన్నోవిధాల ఉపయోగపడుతుందని కూడా అన్నాడు " అని సత్రాజిత్తు చెప్పాడు. 

    సత్యభామ చిరుకోపంతో " ఇంతకూ నాకంటే శ్యమంతకమణే నీకు ఎక్కువైనదికదూ? " అంటూ చరచర వెళ్ళబోతూంటే, సత్రాజిత్తు బుజ్జగింపుగా " అలా అనుకోవద్దమ్మా! ఆ కృష్ణుడి పేరాసకు విస్తుబోతున్నాను, అంతే! " అంటూ నసిగాడు. 

    " అతడు మణి ఇచ్చే బంగారాన్ని దాచుకుంటానని అనలేదుకదా! అతనిది పేరాస ఎలా అవుతుంది నాన్నా? కృష్ణుడంతటివాడు అడిగినప్పుడు సంతోషంతో యిచ్చివేస్తే  ఎంతో బాగుండేది నాన్నా! " అన్నది సత్యభామ. 

    సత్రాజిత్తు కంపించిపోతూ " ఇవ్వను. ప్రాణాలతో ఉండగా నా దగ్గరనుంచి మణిని ఎవరూ తీసుకోలేరు. మణి నా ప్రాణం. నా సర్వస్వం " అంటూ గట్టిగా అరిచాడు. 

    సత్యభామ ముఖం జేవురించుకొని " ఔను! మణి నీకు అంత గొప్పది. నాకంటే గొప్పది. ఆ శ్యమంతకమణి గొప్పదో, నేను గొప్పో ఆ కృష్ణుడే రుజువు చెయ్యాలి " అంటూ చరచరా వెళ్ళింది. 

    కొద్దిరోజుల తరువాత వినాయకచవితి వచ్చింది. సత్యభామ యధావిధిగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించి, ఆ సాయంత్రం పల్లకిలో ద్వారకానగరానికి బయలుదేరి వెళ్ళింది.

    ఆ సాయంత్రం ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది. చీకటి అవుతున్నది. కృష్ణుడు ఆవు పాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా మబ్బు విడిపోయి చవితి చంద్రవంక పాలల్లో తళుక్కున ప్రతిబింబించి కృష్ణుడికి కనిపించి క్షణంలో మబ్బు క్రమ్మి మాయమైంది. 

    వినాయకచవితినాడు చంద్రుడి కంటపడినందుకు కృష్ణుడు నొచ్చుకుంటూ, పూజామందిరంలోకి వెళ్ళి అక్షతలు తలమీద చల్లుకొని, విఘ్నేశ్వరుని ముందు నిల్చొని కన్నులుమూసి  " దేవా! ప్రతిబింబమే అయినా చూశాను. అంతా నీ దయ " అని ధ్యానించాడు. అతడు అలా ధ్యానిస్తున్నప్పుడు " కృష్ణా! నీవు చూడాలని చూడలేదుగా! నీలాపనింద పడినా మబ్బు విడిపోయినట్లే విడిపోతుంది. ఇదీ ఒక లాభానికే అనుకోవయ్యా! " అంటూ విఘ్నేశ్వర ప్రతిమలోంచి వెలువడినట్లుగా మాటలు వినిపించాయి.  

    కృష్ణుడు కన్నులు తెరచి  " స్వామీ! అంతా నీ లీల " అన్నాడు. 

    అదే సమయంలో రుక్మిణి పూజామందిరం ప్రవేశిస్తూ విఘ్నేశ్వరునిముందు నిల్చుని ఏదో జపిస్తున్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూసి " శ్రీవారు విఘ్నేశ్వరుల వారితో ఏవో మంతనాలు జరుపుతున్నట్లున్నదే! " అన్నది. 

    కృష్ణుడు " ఇదేవేళ ఒకానొక వినాయకచవితినాడు నన్ను పెంచిన యశోదమ్మతో నేను అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంతే " అన్నాడు. 

    " ఆ ముద్దుమాటలేమిటో నాకు కూడా వినిపించవా స్వామీ! " అన్నది రుక్మిణి. 

    కృష్ణుడు " యశోదమ్మ పితుకుతున్న పాలలో చవితి చంద్రుడి బింబం చూసి కేరింతలు కొట్టాను. ఎన్ని నిందలు పడతావోకదా! అని యశోదమ్మ నొచ్చుకున్నది. పెద్దయ్యాక అయినా నింద తప్పదన్నది. దానికి నేను అమ్మా! అప్పుడు మళ్ళీ చూడాలికదు! అని అన్నాను " అని చెప్పాడు. 

    రుక్మిణి " మరి అప్పుడు నీలాపనింద సంగతి ఏమైంది? " అని అడిగింది. 

    " మన్ను తింటున్నానని అన్నయ్య చెప్పనే చెప్పాడు " అన్నాడు కృష్ణుడు. 

    రుక్మిణి " మళ్ళీ ఇప్పుడు చంద్రుణ్ణి చూడలేదుకదు. చూడాలన్నా కనిపించడులెండి. బాగా మబ్బుపట్టి ఉంది " అని అంటూ ఏదో చెప్పబోతున్నట్లు చూసింది. 

    " రుక్మిణీ! ఏదో చెప్ప వచ్చినట్లున్నావే, ఏమిటి విశేషం? " అని అడిగాడు కృష్ణుడు. 

    " విశేషమే! సత్రాజిత్తులవారి ఇంటిమణి మన యింటికి విచ్చేసింది " అన్నది రుక్మిణి. 

    కృష్ణుడు " శ్యమంతకమణి మన యింటికి రావడమేమిటి? " అన్నాడు ఆశ్చర్యంగా

    " ఆ మణి కాదు. సత్రాజిత్తులవారి కన్యకామణి, సత్యభామామణి వచ్చింది.  చాలాసేపుగా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాము. చూసిచూసి ఇప్పుడే పల్లకిలో వెళ్ళింది. ఆమెను సాగనంపి యిలా వచ్చాను. మీరు కనిపించారు " అన్నది రుక్మిణి. 

    కృష్ణుడు తలపంకించి " అలాగా! మన ఇంటి విఘ్నేశ్వరదేవుణ్ణి కూడా చూడాలని వచ్చి ఉంటుంది. చూసిందికదా! " అన్నాడు. 

    రుక్మిణి " విఘ్నేశ్వరదేవుణ్ణి చూడాలని వచ్చిందో, మీ కనుసన్నల్లో పడాలని వచ్చిందో మరి! ఉన్నంతసేపూ ఆమె చూపులు మిమ్మల్నే తెగ వెతికి వెతికి వేసారాయని మాత్రం నాకు రూఢిగా తెలుసు " అన్నది. 

    " ఏమిటీ వింత? మాటలు రావనుకున్న రుక్మిణీదేవి, ఈరోజు చతురంగా మాట్లాడుతున్నదే! " అని కృష్ణుడు అన్నాడు. 

    కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో " ఔను నాథా! ఈరోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్యకామణికి మీమీద ఎంత ఆశ! అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాలన్నంత మమత నాకు కనిపించింది " అన్నది.
 " మరి, నీ సంగతి చెప్పలేదు " అన్నాడు కృష్ణుడు.

    " మీలోపల ఒక అణువునై ఇమిడి ఊండిపోవడమే నాకు కావలసినదల్లా! మీరు ఎవరి గుప్పిటలో ఉన్నా, నేను మీలోనే ఉంటానుగదా! " అన్నది రుక్మిణి.

    " రుక్మిణీ! ఎంత గొప్ప భావాల్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు, అందుకే, నిన్ను కోరికోరి ఎత్తుకు వచ్చాను " అన్నాడు కృష్ణుడు. 

    " నాకు నిజమని తోచింది చెబుతున్నాను, నాకంటే సత్యభామదే గొప్ప మమత. బలమైనది. ఆ మమతలో, అనంతమైన ప్రకృతిశక్తి  అంతా ఉంది. స్వామీ! నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే! " అని చెబుతున్న రుక్మిణిని వారించి, కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ " రుక్మిణీ! వేదాంతం మాట్లాడకు " అన్నాడు. 

    కొద్దిదినాలు గడిచాయో లేదో " కృష్ణుడు శ్యమంతకమణిని అపహరించాడు " అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆవిధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దు:ఖంతో పిచ్చివాడై వీధి వీధులా తిరిగి అరుస్తూ విశేషప్రచారం చేశాడు. 

    తనమీద పడ్డ అభాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు దిటవు తెచ్చుకొని, " విఘ్నేశ్వరా! ఇదంతా నీ లీల, తరువాత నీ దయ " అని ధ్యానించి, మణిని అన్వేషించడానికి అరణ్యాల్లోకి వెళ్ళాడు. 

    జరిగిన దేమంటే సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధన్వుడు అనే రాజుకిచ్చి వివాహంచేసే నిర్ణయానికొచ్చి, తన తమ్ముడు ప్రసేనజిత్తును, శతధన్వుడితో మాటామంతీ చేసి రమ్మని పంపాడు. ప్రసేనుడు శ్యమంతకమణిని ధరించి అరణ్యమార్గంలో వెడుతూండగా, ఒక సింహం మణిచేత ఆకర్షింపబడి అతణ్ణి చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి, మణిని తీసుకుపోయి, తన కుమార్తె జాంబవతికిచ్చాడు. 

    మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో, ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడని సత్రాజిత్తు చాటాడు. సత్యభామను పెళ్ళాడటానికి ఉవ్విళ్ళూరుతున్న శతధన్వుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరచి పగతీర్చుకోవడానికి సాయపడతామంటూ కబురుపెట్టారు. 

( ఇప్పటికి సశేషం. తరువాతి వృత్తాంతము వచ్చే వారం. అంతవరకు శలవు. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! )  
    


26, నవంబర్ 2025, బుధవారం

:: కృష్ణవినాయకీయం ::  


    కృష్ణుడు బాగా ఎదిగాడు. గోవర్థనగిరిని ఎత్తి ప్రళయభీకరమైన జడివాన నుండి గోవులను, గోపబాలకులను కాపాడి ఇంద్రుడికి  గర్వభంగం చేశాడు. 

    గోవర్థన ప్రాంతంలో ఒకనాడు కృష్ణుడు ఆవులను కాస్తూండగా, చంకను పెద్ద మద్దెల పెట్టుకొని వస్తున్న ఒక పెద్దమనిషి " అబ్బాయీ! ఇక్కడ కృష్ణుడు అనే అబ్బాయి ఉన్నాడట. మురళి చాలా గొప్పగా వాయిస్తాడని చెప్పుకొంటున్నారు. ఆ మురళీగానం ఏ పాటిదో చూద్దామని వచ్చాను. అతడి ఉనికి చెప్పగలవా? " అన్నాడు కృష్ణుడితో. 

    " స్వామీ! ఆ కృష్ణ పరమాణువును నేనే! తమరెవరో చాలా గొప్ప మృదంగ విద్వాంసుల్లాగా ఉన్నారు. తమరెవరో తెలియని వాణ్ణి. కాస్త సెలవియ్యండి స్వామీ! " అని కృష్ణుడు చేతులు జోడిస్తూ అన్నాడు. 

    " నన్ను మృదంగకేసరి  అని పిలుస్తారు. మాది దక్షిణదేశం. మధురానగరానికి వెడుతున్నాను.. కంసుడు ధనుర్యాగం చేస్తాడుట. అప్పుడు నా మద్దెల విద్వత్తును ప్రదర్శిద్దామని వెడుతున్నాను " అన్నాడు మృదంగకేసరినని చెప్పుకొన్న పెద్దమనిషి. 

    అతని కాలికి రత్నఖచితమైన గండపెండెరం, చేతులకు కెంపులు తాపిన సింహతలాటాలు, మెడలో బంగారు నిమ్మకాయల దండ, చెవులకు పెద్ద కుండలాలు ధగధగా మెరుస్తున్నవి. మద్దెలనిండా నవరత్న స్వర్ణపతకాలు తాపి ఉన్నవి. 

    కృష్ణుడు వాటిని చూసి అబ్బురపడుతూ, " స్వామీ! నేను ఆవుల్నికాసే సామాన్య గోపకుణ్ణి. నా పిల్లనగ్రోవి సాదా వెదురు బొంగుముక్క. మీ దక్షిణదేశ విద్వాంసులు తాళానికి ప్రసిద్ధులు. ఇహ నేను ఏదో ఒక రాగాన్ని ఊది, ఆవుల్ని పాలించుకోవడం తప్పితే, మరేది తెలియని గాలి పాటగాణ్ణి మాత్రమే " అన్నాడు. 

    కృష్ణుడి మాటలకు నవ్వి, మృదంగకేసరి " అలాగని తప్పించుకుపోబోతున్నావా? వీల్లేదు. నీ మురళీగానం గొప్పదో, నా మృదంగ వాయిద్యం గొప్పదో ఇప్పుడే తేలిపోవాలి " అన్నాడు.

    కృష్ణుడు గడగడలాడుతూ, ఊదడానికి మురళి తీసాడు. మృదంగకేసరి మఠం వేసి మద్దెల వాయించ మొదలుపెట్టాడు. కృష్ణుడు యమునాకళ్యాణి రాగాన్ని వాయిస్తూ మృదంగకేసరిని తికమకపెట్టి ఠక్కున హంసధ్వని రాగాన్ని అందుకొని అద్భుతంగా వాయిస్తూంటే, మృదంగకేసరి పరవశించి మైమరచి మద్దెల విడిచి నృత్యం చెయ్యడం మొదలుపెట్టాడు. 

    కృష్ణుడు హంసధ్వని రాగాన్ని చిత్ర విచిత్ర గతులతో స్వరాలు మరింత దురితంలో పలికిస్తూంటే, మృదంగకేసరి రూపువిడిచి విఘ్నేశ్వరుడై  తొండమెత్తి, బొజ్జ ఊపుకుంటూ తాండవం చేశాడు  మద్దెల మాయమై ఎలుక గంతులు వేసింది. 

    విఘ్నేశ్వరుడు తనకు ప్రియతమమైన హంసధ్వని రాగానికి పులకరించిపోతూ, తాండవం చేస్తూ అలసిపోతూంటే కృష్ణుడు ఠక్కున మురళి వాయించడం ఆపి, విఘ్నేశ్వరుడు పడిపోకుండా ఒడిసి పట్టుకొని " పార్వతీనందనా! మళ్ళీ బోర్లాపడ్డావంటే, మీ అమ్మ మురళీగానాన్ని వినకూడదని శపించి పోతుందేమోనన్న భయంతో, నిన్ను క్రింద పడిపోకుండా పట్టుకున్నాను. మరేం అనుకోకు లంబోదరా! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " కృష్ణా! నీ మురళీ గానాన్ని వినాలనే ఇలా వచ్చాను. మన కృష్ణ వినాయకీయం నిజంగా సుందరకాండే " అన్నాడు. 

    కృష్ణుడు " విఘ్నేశా! పాపం, నీ వాహనం మద్దెల దరువులు బాగా తిన్నదే " అని అంటూ ఎలుకను ముద్దుగా నిమిరాడు. 

    విఘ్నేశ్వరుడు  " కృష్ణా! కంసుడికి అంత్యకాలం సమీపించింది. ధనుర్యాగం సాకుతో నిన్ను తీసుకురమ్మని అక్రూరుణ్ణి పంపుతాడు. వెళ్ళు. విజయోస్తు " అని చెప్పాడు. 

    కృష్ణుడు " అంతా నీదయ స్వామీ! " అని చేతులు మోడ్చి మ్రొక్కాడు. 

    విఘ్నేశ్వరుడు " అవతార మూర్తివి. నా దయకాదు. నీ లీల. అన్నట్టు, అర్క కుబ్జ రూపంతో నీకోసం ఎదురు చూస్తూంటుంది, అనుగ్రహించు " అని చెప్పి ఎలుక వాహనం ఎక్కి, ఆకాశానికి రివ్వున వెళ్ళి అంతర్థానమయ్యాడు. 

    అక్రూరుడు కృష్ణ బలరాములను మధురాపురానికి రథం మీద తీసుకువెళ్ళాడు. అష్ట వంకరులతో ఉన్న కుబ్జ, కృష్ణుడికి ఎదురొచ్చి, పాదాలకు మ్రొక్కి, చందనం పూసింది. కృష్ణ బలరాములకు పూల మాలలు వేసింది. 

    కృష్ణుడు ఆప్యాయంగా కుబ్జను రెండు చేతులతో లేవనెత్తాడు. కుబ్జ రూపం పోయి అప్సరస రూపంతో అర్క దేవలోకం చేరుకుంది. 

    కంసుడు తనని చంపాలని చేసిన కపటోపాయాలన్నిటినీ చిత్తుచేసి, కృష్ణుడు కంసుణ్ణి పట్టుకొని సింహాసనం నుంచి ఈడ్చి లాగాడు. కంసుడు మరణించాడు. 

    దేవకీ వసుదేవులను కారాగార విముక్తులను చేసి, కృష్ణుడు ఉగ్రసేనుడిని కూడా కారాగారం నుండి విడిపించి, అతని సింహాసనం అతని పరం చేశాడు. కృష్ణ బలరాములు పెద్దవాళ్ళయ్యారు. కృష్ణుడు అనేకమంది దుర్మార్గులను, రాక్షసులను నిర్మూలించాడు. సముద్రంలోనికి చొచ్చుకొని దుర్భేధ్యంలాగా ఉండేలాగా ద్వారకా నగరాన్ని నిర్మాణం చేయించి, అన్న బలరాముణ్ణి యాదవులకు పెద్దగా చేసి రాజరికాన్ని నెలకొల్పాడు. 

    కృష్ణుడు రుక్మిణిని తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు. 

    సర్వసంపదలతో తులతూగుతున్నా, కృష్ణుడు ఎప్పటివలెనే ఆవులను కాస్తూ, పాలు పితుకుతూ గోపాలకృష్ణుడుగానే ద్వారకలో ఉంటున్నాడు. 

    ద్వారకా నగరం ప్రక్కనే సత్రాజిత్తు అనే ప్రముఖుడు రాజువలె సంస్థానం ఏర్పరచుకొని భోగభాగ్యాలతో తులతూగుతున్నాడు. తాను సూర్యవంశ క్షత్రియుడనని సగర్వంగా చెప్పుకుంటూ, సూర్యోపాసకుడై గొప్ప తపస్సు చేశాడు. సూర్యుడు ప్రసన్నుడై శమంతకమణి అనే పెద్ద వజ్రాన్ని అతనికి ప్రసాదించాడు. శమంతకమణి నుండి వెలువడే కాంతికిరణాలు బంగారు కణికలై ప్రతిరోజూ అతనికి అంతులేని బంగారం సమకూరుతూండేది. 

    సత్రాజిత్తు ప్రముఖులనిపించుకుంటున్న వారికి ఆహ్వానాలు పంపి మరీ వచ్చిన వారందరికీ మణిని చూపించి, మణి ప్రభావాన్ని వర్ణిస్తూ మురిసిపోతూండేవాడు. కృష్ణుడికి గూడా ఆహ్వానం పంపించాడు. కానీ, కృష్ణుడు రాలేదు. ఎప్పుడో వీలుచూసుకొని వస్తానని తిరుగు కబురు పంపించాడు. గర్విష్ఠి అయిన సత్రాజిత్తు కృష్ణుడిపై ద్వేషం పెట్టుకున్నాడు. కృష్ణుడి గురించి ఎన్నో విశేషాలు విన్నా, ఒక యాదవ ప్రముఖుడుగా తప్పితే కృష్ణుడిపై అతనికి పెద్ద అభిప్రాయం ఏర్పడలేదు. 

    సత్రాజిత్తుకు సత్యభామ అనే అసమాన సౌందర్యవతియైన కుమార్తె ఉన్నది. శమంతకమణితో బాటు సత్యభామ సౌందర్యం కూడా విఖ్యాతి కెక్కింది. జరాసంధుడిలాంటి రాజాధిరాజులు సైతం సత్యభామను చేపట్టాలని కాచుకొని ఉన్నారు. 


    


23, నవంబర్ 2025, ఆదివారం

 

:: విఘ్నేశ్వరచరిత్రలో సుందరకాండ ::

వినాయకచవితినాటి మునిమాపువేళ విఘ్నేశ్వరుడు తన దంతంలాగే ఉన్న చంద్రుణ్ణిచూస్తూ, నిండుబొజ్జతో మందంగా అడుగులు వేస్తున్నాడు. చిట్టెలుక వెంట వస్తున్నది.

నెలవంక విఘ్నేశ్వరుడి సంకేతం అంటారు. విఘ్నేశ్వరుడి నుదుట తెల్లని మంచి గంధంతో తీర్చిదిద్దిన బాలచంద్ర తిలకం, ఆకాశంమీది చవితి చంద్రుడి ప్రతిబింబంలాగ ప్రకాశిస్తున్నది. ఫాలచంద్రుడు, బాలచంద్రుడు అని కూడా విఘ్నేశ్వరుడికి పేర్లున్నవి.

కాలి బొటనవ్రేలికి చిన్నరాయి తగిలి వినాయకుడు అమాంతంగా బోర్లాపడ్డాడు. కడుపు పగిలిపోయింది. తినుబండారాలు వెలికివచ్చి నేల విరజిమ్ముకున్నాయి. అదే అదనుగా ఎలుక వాటిని గబగబా తినసాగింది. ఆ వినోదానికి ఆకాశపు చిరునవ్వులా ప్రకాశించే చందమామ పకపకా నవ్వాడు. దేవతలు మొదలైన వారంతా వచ్చి, పెద్ద సర్పంతో వినాయకుడి బొజ్జ కలిపి కుట్టారు.

పార్వతికి చంద్రుడిమీద చాలా కోపం వచ్చింది. ఆమె “ వినాయకచవితి నాడు చంద్రుణ్ణి చూస్తే, నీలాపనిందలు వచ్చి పడతాయి “ అని శపించింది.

అది మొదలు పిల్లల్నిసైతం చూడనివ్వకుండా వినాయకచవితి నాడు చంద్రదర్శనం కాకుండా, అంతా జాగ్రత్త పడుతూ వచ్చారు.  

ద్వాపరయుగం వచ్చింది. దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టి, గోకులంలో యశోద ముద్దులపట్టిగా పెరుగుతున్న బాలకృష్ణుడు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు అనే రాక్షసుల్ని అప్పటికే చంపేశాడు. బాగా మాటలు నేర్చాడు.

ఆరోజు వినాయక చవితి. యశోద పాలు పితుకుతున్నది. బాలకృష్ణుడు యశోద వీపుమీద నుంచి వంగి పాత్రలోని పాలలో ప్రతిబింబించిన చంద్రవంకను చూసి “ చందమామ! పాలలో చందమామ “ అంటూ చప్పట్లు చరిచాడు.

యశోద గతుక్కుమని “ ఎంతపని చేశావు కన్నా! ముందుముందు ఎన్ని నీలాపనిందలు పడవలసి వస్తుందో మరి, అని నొచ్చుకుంది.

“ నీలాపనింద అంటే ఏమిటమ్మా? “ అన్నాడు కృష్ణుడు.

“ ఉత్తినే నిన్ను దొంగ అంటారు “ అన్నది యశోద.

“ విచారించకమ్మా! పాలూ, వెన్న దొంగతనం చేస్తూంటానమ్మా! అప్పుడది నీలాపనింద అవదుగా! “ అన్నాడు కృష్ణుడు.

“ ఆరి పిడుగా! నీనోట బ్రహ్మాండాలు విరుచుకుపడా! “అని అంటూ గోపమ్మ బుగ్గలు నొక్కుకున్నది.

“ బ్రహ్మాండాలు చూశావా అమ్మా? “ అని కృష్ణుడడిగాడు.

యశోద “ బ్రహ్మాండాలకెం గాని, పెద్దయినా నీమీద అభాండాలు పడ్డం ఖాయం “ అంటూ సున్నితంగా బాలుడి తలమీద మొట్టికాయ పెట్టింది.

“ అప్పుడు మళ్ళీ ఇలాగే చందమామను చూడాలికదూ? “ అన్నాడు కృష్ణుడు.

“ పెద్దయ్యాకచూస్తే మరీ తప్పు” అంది యశోద. మనసులో “ విఘ్నేశా! అభం శుభం తెలియని పసివాడు. నీడ చూశాడు. అంతే! మన్నించు అని అనుకుంది. 

ఆ మర్నాడు బలరాముడు గబగబా వచ్చి యశోదతో “ అమ్మా! తమ్ముడు మన్ను తింటున్నాడు. అబద్ధం కాదు. వాడి నోరు చూడు “ అని చెప్పాడు. యశోద చరచరా వెళ్ళింది.

కృష్ణుడు మట్టి ముద్దలు వరుసగా పేరుస్తున్నాడు. యశోద కృష్ణుడి చెవిబట్టి “ ఏది, నోరు తెరు “ అన్నది.

“ నన్ను నీచేత కొట్టించాలని ఎవరో ఏదో చాడీ చెప్పినట్టుంది. నీలాపనిందలు పడతాయని నిన్ననే కదా నువ్వు చెప్పావు? మట్టితో ఉండ్రాళ్ళు, లడ్లు చేస్తున్నానమ్మా! మట్టితో చేసిన వినాయకుడు మన్నుతో చేసినవయితేనే నిజంగా తింటాడమ్మా “ అన్నాడు కృష్ణుడు.

యశోద లెంపలు వేసుకుంటూ “ తప్పు నాయనా! తప్పు. మన్నుతో చేసినా, రాయితో చెక్కినా దేవుడు దేవుడే. అపచారం స్వామీ! విఘ్నేశా! పిల్లవాడి మాటలు ఏ మాత్రం పట్టించుకోకు “ అని ధ్యానించింది.

“ అయితే, వచ్చే వినాయక చవితికి వెన్న ఉండ్రాళ్ళు నేతిలడ్లు బోలెడన్ని చెయ్యి. ఎన్ని తింటాడో చూస్తా, తినకపోతే తినిపించుతా “ అన్నాడు కృష్ణుడు.

“ ముందు నీ నోరు చూపించు” అంటూ యశోద వంగి చూడబోతుంటే కృష్ణుడు “ ఆ” అంటూ బార్లా నోరు తెరిచాడు.

యశోద అలా చూస్తూనే ముచ్చెమటలు పట్టి చతికిల కూలబడింది. కృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలు, నక్షత్రమండలాలు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, సముద్రాలు, పర్వతాలు, సమస్తమూ కనిపించాయి. పాలు పితుకుతున్న యశోద వీపున వాలి, మెడ చుట్టూరాచిట్టి చేతులు చుట్టి, పాలల్లో చందమామను చూపిస్తూన్న కృష్ణుడు కనిపించాడు. యశోద కల అనుకొని గిల్లుకుని కళ్ళు నులుముకుంది. కలకాదు. ఏ దేవతో, వినాయకుడో తనను మాయలో ముంచేస్తున్నాడని అనుకుంటూ చుట్టూరాచూసింది. యశోద వెర్రిచూపులకు చుట్టూచేరిన పిల్లవాళ్ళు కేరింతలు కొడుతున్నారు. స్తంభం చాటున బలరాముడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

కృష్ణుడు యశోద ముఖం మీదికి వంగి " చూడమ్మా! చూడు. మన్ను కనిపించిందా? బాగా చూడు " అంటూ తెరచిన నోరు మరింత దగ్గరగా చాపుతూంటే, యశోదకు దేవాదిదేవుళ్ళు కనిపించారు. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుతూంటే, విఘ్నేశ్వరుడు తాండవం చేస్తూ కనిపించాడు. కృష్ణుడు నల్లని పెద్ద సర్పం తలలమీద తంతున్నాడు. అది కృష్ణుణ్ణి చుట్టివేస్తున్నది. 

యశోద కెవ్వున అరచి మూర్చపోయింది. 

యశోద తిరిగి కళ్ళు తెరిచేసరికి మంచం చుట్టూరా గొల్లభామలూ, గొల్ల అవ్వలూ కనిపించారు. 

" నాకేమయింది? " అని ఆశ్చర్యంగా అడిగింది యశోద. 

ఆమెకు ఏదీ జ్ఞాపకం లేదు. ఏమీ జరగనట్టే అంతా మరచిపోయింది. 

" నీకేమయిందో మాకు తెలియదు గాని, మా ఇళ్ళలో దొంగతనాలు జరిగాయి. ఆ దొంగ నీ ముద్దుల కొడుకే! వెన్న, మీగడ, పాలు, పెరుగులూ కుర్ర మూకకీ, కోతులకూ పంచిపెడుతూండగా కళ్ళారా చూశాము " అని చెప్పారు గోపకాంతులు. 

యశోద, " ఏమిటేమిటి? అవన్నీ మీ ఇళ్ళలోవని ఎలాగ అనుకొన్నారు? మా ఇంట లేవనుకున్నారా? గోకులం ఊళ్ళోని ఇల్లన్నీ కలిపినా మా ఇంట ఉన్నవాటిలో సగానికైనారావు. వెళ్ళండి " అంటూ వాళ్ళని సాగనంపింది. 

కృష్ణుడు మెల్లగా వచ్చి " ఏం జరిగిందమ్మా? " అని అడిగాడు. 

" ఏం జరుగుతుందని అన్నానో అదే జరిగింది. నీమీద నీలాపనింద పడింది " అన్నది యశోద. 

" నీలాపనింద తప్పించేసుకున్నానమ్మా! వాళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా! " అన్నాడు కృష్ణుడు. 

యశోదకు పట్టరాని కోపం వచ్చింది. పెద్ద తాడుతో కృష్ణుణ్ణి పెద్దరోలుకు వేసి కట్టింది. కృష్ణుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి, జంటగా పెరిగిన రెండు మద్దిమానుల సందున దూరి రోటిని లాగాడు. మహావృక్షాలు రెండూ వ్రేళ్ళతో పెళ్ళగించుకొని కూలాయి. శాపవిముక్తులైన గంధర్వులు కృష్ణుణ్ణి నుతించి ఆకాశాని కెగసి అదృశ్యులయ్యారు. 

ఏడాది తిరిగింది. వినాయక చవితి వచ్చింది. రంగురంగుల పెద్ద వినాయక విగ్రహాన్ని నందుడు చేయించాడు. యశోద పాలమీగడతో పిండి కలిపి ఉండ్రాళ్ళు, వెన్న అప్పాలు, నేతి లడ్లు, పాలతో జిల్లేడు కాయలు దండిగా చేసింది. 

నైవేద్యాలన్నీ పళ్ళేలనిండా నింపి, పూజామందిరంలో అమర్చి తలుపు చేరవేసి, యశోద అలా వెళ్ళింది. 

కృష్ణుడు మెల్లగా పూజామందిరం ప్రవేశించి, తలుపు మూసి, తినుబండారాల్ని వినాయక విగ్రహానికి అందిస్తూ, " తినవయ్యా తిను " అంటూ ప్రతిమ బొజ్జ నిమిరాడు. 

ప్రతిమ విఘ్నేశ్వరుడై తొండంతో అందుకుంటూ, " కృష్ణా! నేనందించేవి నువ్వూ తినాలి. విఘ్నేశ్వర చరిత్రలో ఇది సుందర కాండ " అంటూ వెన్నతో చేసిన తినుబండారాల్ని కృష్ణుడి నోట కుక్కాడు. పళ్ళేలు ఖాళీ అవుతున్నాయి. 

యశోద పూజామందిరానికి వస్తూ గవాక్షం గుండా లోపల జరుగుతున్న సుందర కాండ చూచి కొయ్యబారి పోయింది. ముచ్చెమటలు పట్టాయి. మళ్ళీ తమాయించుకుని, " అబ్బే! నేనేదో భ్రమ పడుతున్నాను. నాకళ్ళకేదో మాయ తెగులు పట్టుకుంది " అని సర్దిచెప్పుకుంటూ తలుపు తెరచి వచ్చింది. 

వినాయక విగ్రహం విగ్రహంలాగే ఉన్నది. అమర్చిపెట్టిన తినుబండారాలు కనిపించటంలేదు. కృష్ణుడు బిక్కమొహం పెట్టి చూస్తున్నాడు. 

" నీ తిండి తగలడా! పూజ కాకుండా అంతా పాడుచేశావు " అంటూ యశోద కృష్ణుడి వీపుమీద గట్టిగా నాలుగు చరిచింది. 

కృష్ణుడు ఏడుస్తూ, ఎవరికీ చిక్కకుండా పరుగుదీసి, కాళింది మడుగు చేరాడు. ఆ వెనుకనే యశోదతోబాటు గోకులంలోని వారంతా ఆదుర్దాగా వెళ్ళారు. 

కాళింది మడుగులో ఉంటున్న కాళీయ మహాసర్పం వల్ల గోకుల వాసులకు ఎన్నో విధాలుగా హాని జరుగుతూ వస్తున్నది. కృష్ణుడు మడుగు ఒడ్డునే ఉన్న చెట్టెక్కి, మడుగు మధ్యకు వ్యాపించి ఉన్న కొమ్మ మీద నుంచి, మడుగులోకి దూకి కాళీయ నాగుడి నెత్తిమీద పిడుగులాగ పడ్డాడు. గజ్జెలందెలు ఘల్లుఘల్లు మనగా కృష్ణుడు కాళీయుడి తలలమీద తాండవం చేశాడు. అద్భుతంగా కాళీయమర్దనం జరిగింది. కాళీయుడి శాపం తీరింది. కుమార్తెలను తీసుకెళ్ళి పాతాళంలో వాసుకికి అప్పగించి, కాళీయరూపం ఉపసంహరించుకొని, విఘ్నం విఘ్నేశ్వరుడికి అధీనమయింది. 

కొడుకు నెత్తుకొని యశోద ఇంటికొచ్చి చూసేసరికి, పూజామందిరంలో పళ్ళాలన్నీ నిండుగా ఎలాగ పేర్చినవి అలాగే ఉన్నాయి. బాలకృష్ణుడి వీపుమీద మాత్రం యశోద వ్రేలితట్లు కనిపిస్తున్నాయి. యశోద వాటిని చూసి " నా చేతులు పడిపోను! నాకళ్ళకేదో మాయరోగం వచ్చి నిష్కారణంగా కొట్టాను. పాపిష్ఠిదాన్ని " అని వలవలా ఏడ్చింది. 

" అమ్మా! బోలెడు వేళ ఉంది. పూజచెయ్యవూ, మరి! " అన్నాడు కృష్ణుడు. నందుడు యశోద కృష్ణుడిచేతే పూజ చేయించారు. నైవేద్యాన్ని ఊరందరికీ పంచారు. ఆ తినుబండారాల్లో అమృతం ఉందనిపించింది. గోకులమంతా ఆనందం పొంగి పొర్లింది.

( ఇప్పటికి సశేషం. తరువాయి కథ వచ్చే వారం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! ) 

                    

14, నవంబర్ 2025, శుక్రవారం

:: విఘ్నేశ్వరుడు హనుమంతునికిచ్చిన జ్యోతిర్లింగమేమయింది? :: 

    త్రేతాయుగంలో ఆర్యావర్తంలో కోసలుడు, కైకయుడు, వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురు ఆప్తమిత్రులుగా ఉండేవారు. కోసలుడికి కౌసల్య, కేకయుడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలున్నారు. అయోధ్యను పాలించే దశరథుడికి తమ కుమార్తెలను యిచ్చి పెళ్ళిచేయాలని ముగ్గురు రాజులకూ ఏకాభిప్రాయం కలిగింది. దశరథుడు అంగీకరించాడు. 

    ముగ్గురు రాజులూ జైమిని మహర్షిచేత వివాహానికి లగ్నం పెట్టించారు. జైమిని ముహూర్తం నిర్ణయించి " నేను పెట్టిన ముహూర్త బలం ఎటువంటిదంటే విఘ్నేశ్వరుడి సాక్షిగా ఈ ముగ్గురి వివాహం దశరథుడితో జరిగి తీరుతుంది. అయితే, వివాహం జరిగేముందు రాకుమార్తెలకు రాక్షసగండం కనిపిస్తున్నది. కనుక, ముగ్గుర్నీ జాగ్రత్తగా ఉంచాలి " అని చెప్పాడు. 

    ముగ్గురు కన్యలనూ రాజులు ఒక పెద్ద పెట్టెలో భద్రంగా దాచారు. 

    నారదుడు రావణాసురిడితో " లంకేశ్వరా! అతి త్వరలోనే దశరథుడికి వివాహం కాబోతున్నది. దశరథుడికుమారుడు నిన్ను హతమారుస్తాడు " అని చెప్పాడు. 

    రావణుడు రాకుమార్తెలను ఎత్తుకురమ్మని మహోదరుడు అనే గొప్ప రాక్షసుణ్ణి పంపాడు. మహోదరుడు కన్యలను పెట్టెలో భద్రపరచినది కనిపెట్టి, ఆ పెట్టెను మ్రింగేశాడు. వాడు ఆకాశమార్గంగా సముద్రం మీదుగా లంకకు వెడుతూండగా, కడుపునొప్పి వచ్చి పెట్టెను కక్కేశాడు. సముద్రంలో పడి పెట్టె కెరటాలమీద కొట్టుకొంటూ పోయింది. 

    దశరథుడు సముద్రంమీద దూరతీరాలకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు. ప్రయాణం ఆలస్యమయింది. అనుకున్న నాటికి చేరలేకపోతున్నందుకు విచారిస్తూ, దశరథుడు సముద్రాన్ని చూస్తూండగా నౌకవేపే కొట్టుకొని వస్తూన్న పెద్ద పెట్టె కనిపించింది.  పెట్టె నౌకను ఢీకొని పైకప్పు ఊడిపోయింది. అందులో రాకుమార్తెలు కనిపించారు. తాళ్ళనిచ్చెనలతో వారిని నౌకమీదకు రప్పించాక, ఆ ముగ్గురూ తాను వివాహం చేసుకోనున్న పెండ్లికుమార్తెలేనని దశరథుడు తెలుసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి జైమిని మహర్షి ముహూర్తం పెట్టాడు. అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, ముగ్గురు రాకుమార్తెలతో దశరథుడి వివాహం జరిపించి అంతర్థానమయ్యాడు. ముగ్గురు వధువులతో దశరథుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు. 

    చిరకాలానికి దశరథుడికి నలుగురు కుమారులు పుట్టారు. పెద్దవాడయిన రాముడు కైకేయి కారణంగా సీతతో, లక్ష్మణుడితో అరణ్యవాసం వెళ్ళాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు. రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వానరుల సహకారంతో లంకను ముట్టడించి రావణ సంహారం చేశాడు. సీతతో పుష్పక విమానంలో బయలుదేరి, వారధికట్టడం ప్రారంభించిన సముద్రతీరంలో ఆగి, అక్కడ శివపూజ జరిపి, అయోధ్యకు వెళ్ళాలనుకున్నాడు. 

    శివలింగ ప్రతిష్ఠకు తగిన లింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపాడు. హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరుకొని, అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్దలింగాన్ని చూసి రెండు చేతుల్తో ఎత్తబోయాడు. లింగం కొంచెమైనా కదల్లేదు. దానికంటే చిన్నలింగాన్ని తీయబోయాడు. అదీ కదల్లేదు. చివరికి అన్నిటికంటే చిన్నలింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు. 

    కాలం మించిపోతున్నది. తన అసమర్థతకు హనుమంతుడు విచారిస్తుండగా, బుడిబుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు. " ఎవరయ్యా నీవు? హనుమంతుడిలాగే ఉన్నావు, కానీ కావు " అన్నాడు పిల్లవాడు. 

    " నేను హనుమంతుడినే. ఒక శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు. ఇంతకూ, నీవెవరివోయి బాలుడా? " అన్నాడు హనుమంతుడు. 

    " ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకుపోకుండా నన్ను కాపలా ఉంచారు గాని, నీవు హనుమంతుడవని చెబుతున్నావు. హనుమంతుడు శివుని అవతారమే అనీ, పంచముఖాంజనేయుడనీ విన్నాను. నీ పంచముఖాలు ఏవి? " అన్నాడు బాలుడు. 

    అప్పుడు హనుమంతుడు గరుడ,వరాహ, సింహ, అశ్వముఖాలను కలుపుకొని, పంచముఖాంజనేయుడై, ఉన్నతంగా పెరిగి పిల్లవాడితో నవ్వుతూ " విఘ్నేశ్వరా! నా వంతు అయింది. పంచముఖ విఘ్నేశ్వరుడి రూపంలో కనిపించడం నీ వంతు " అన్నాడు. 

    అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, అయిదు తలలతో సమాన ఎత్తున పెరిగి విశ్వరూపంతో కనిపించాడు. 

    హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వరుడికి నమస్కరించి " పిల్లవాడి రూపంలో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుడవని గ్రహించాను. శివలింగాలు కదలకుండా చేసింది నీవే కదా! నీవే ఒక లింగాన్ని ప్రసాదించు " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " హనుమా! నీ పంచముఖరూపం చూడాలని నేను అలా చేసాను. నీవు శివాంశలో పుట్టినవాడవు. నీకు అడ్డేమిటి? అయినా, అడిగావు కనక విశేషాంశలుగల లింగాన్ని నీకు యివ్వాలనే ఎంచి ఉంచాను. తీసుకువెళ్ళు " అని చెబుతూ, హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు. 

    హనుమంతుడు మామూలు రూపంతో దోసిట్లోని లింగాన్ని పదిలంగా పట్టుకొని రివ్వున ఎగిరివెళ్ళాడు. అప్పటికి కాలాతిక్రమణ జరిగింది. 

    సమయం మించిపోకుండా సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేసింది. రాముడు జలాభిషేకం చేసి, పూజకు ఉపక్రమించబోతూండగా, హనుమంతుడు లింగంతో అక్కడ వ్రాలాడు. 

    హనుమంతుడు జరుగుతున్నది చూసి, తోకతో సైకత లింగాన్ని చుట్టి తీసివేయ బోయాడు. కానీ, ఇసుకలింగం చెక్కుచెదరలేదు. హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించి లాగితే తోక నొప్పిపెట్టిందే కాని లింగం కదలలేదు. 

    అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంతపరచి " హనుమా! బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు పడుతూంటారు సుమీ! అన్నీ తెలిసిన వాడివి. సైకత లింగమైనా, అది శివునికి ఆనవాలు కదా! ఇంతకూ, ఇప్పుడేం మించిపోతుంది గనక, నీవు తెచ్చిన లింగాన్ని సైకత లింగం దాపునే ప్రతిష్ఠించి, పూజించి మరీ వెడతాను " అని చెప్పాడు. 

    హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికి ఇచ్చి, లెంపలు వేసుకొని సైకత లింగానికి మ్రొక్కాడు. 

    రాముడు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి, యధావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపిన పిమ్మట అందరితో పుష్పకం మీద అయోధ్యకు చేరి, పట్టాభిషిక్తుడయ్యాడు. 


5, నవంబర్ 2025, బుధవారం

:: స్వామి జయశ్రీల కళ్యాణం ::  

    ఒకానొకప్పుడు లక్ష్మి మానససరోవరంలో జలకమాడుతూండగా, పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహనంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూచింది. నారాయణుని వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ సాభిప్రాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది. అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. 

    లక్ష్మి నారాయణుని దగ్గర చేరి కౌగలించుకున్నది. పార్వతి పగలబడి నవ్వుతూ " నేను నారాయణుడిని కాను లక్ష్మి " అని నిజరూపంతో కనిపించింది. 

    లక్ష్మి " అన్నకు తగ్గ చెల్లెలివే. నారాయణి అనిపించుకున్నావులే " అన్నది. 

    పార్వతి " అప్పుడు మోహినీ రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు వేసుకో " అన్నది. 

    స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు. అపార ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, " తల్లులారా! మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతి పరంగా జయ, లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీ గా పెరుగుతుంది. ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు " అనిచెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని కావేరి నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు. వాయుదేవుడలాగే జయశ్రీని కావేరి నదికి చేర్చాడు. 

    దక్షిణప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణకమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకెళ్ళి నామకరణ మహోత్సవం జరిపించుతూండగా, ఆకాశవాణి " జయశ్రీ అని పిలవండి " అని పలికింది. జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి, సాహసవంతురాలు ఉండదనిపించుకొన్నది. 

    జయశ్రీకి రాజభవనం కంటే, ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహరించడమే యిష్టంగా ఉండేది. విల్లమ్ములు ధరించి, వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూండేది. 

    హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుని, కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాడు. ఒకనాడు అలాగే వెళ్ళాడు. స్వామి, విఘ్నేశ్వరుడు, కుమారస్వాని ఆనందంగా ముచ్చటలాడుతూ,  మానససరోవరంలో జలవిహారం చేస్తూండగా, విఘ్నేశ్వరుడు " ఈ మానససరోవరంలోనే లక్ష్మి పార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది " అని ఊరుకున్నాడు. 

    స్వామికి కుతూహలం కలిగినా అణచుకొని, మరికొంత కాలం అక్కడ గడిపి వెళ్ళబోతున్నప్పుడు, విఘ్నేశ్వరుడు " స్వామీ! మాకంటే పెద్దవాడవైన నీవు బ్రహ్మచారిగా ఉండడం బాగాలేదు. సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు " అన్నాడు. 

    కుమారస్వామి, విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు యిచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. 

    ఒకనాడు స్వామి వినోదంగా పెద్దపులి మీద స్వారీచేస్తూ అరణ్యంలో తిరుగుతూండగా, పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటాపంచలైంది. విల్లమ్ములతో ఠీవిగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించి, స్వామి గుండెలో బాణంలాగ గ్రుచ్చుకొన్నది. స్వామి అంతర్ధానమయ్యాడు. 

    జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు. అతని కోసమే అరణ్యాలలో తిరుగుతున్నది. 

    నారదుడి ఆదేశంతో, చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాధిరాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లమ్ములు ధరించి, పెద్ద నల్లనికుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. 

    రాజాధిరాజులు ఠీవి ఒలకబోస్తూ శబర యువకుణ్ణి, అతడి పెంపుడు కుక్కనూ ఎకసెక్కెం చేశారు. 

    స్వామి సింహద్వారానికి అడ్డంగా, అందర్నీ కారాగారంలో బందీలను చేసినట్లు కుక్కమీద కూర్చున్నాడు. కుక్క పెద్దపులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులిమీద ముందు కూర్చుండ బెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబర యువకుడి మీద ఒక్కుమ్మడిగా విరుచుకు పడి, ఆయుధాలు తీశారు. స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. 

    అతని బలప్రయోగ ధాటికి దేవతలు చెల్లా చెదురై నిజరూపాలతో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రమూ తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలినదైంది. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహరస్వామిగా సాక్షాత్కరించాడు దేవతలు చేతులు మోడ్చారు. " శరణం స్వామీ! " అన్నారు.

    స్వామి, జయశ్రీల కళ్యాణం దేవాదిదేవతల మధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు. 

    

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" ప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ ను...