మన భారతీయ ఇతిహాసాలు, పురాణాలలోని అద్భుతమైన గాథల సమాహారం. తరతరాలనాటి ధర్మ సూత్రాలను, దైవలీలలను నేటి తరానికి అందించే ఒక నిరంతర కథా ప్రవాహం.
29, జనవరి 2025, బుధవారం
28, జనవరి 2025, మంగళవారం
అజామిళోపాఖ్యానము
24, జనవరి 2025, శుక్రవారం
: ముద్గలోపాఖ్యానము ::
20, జనవరి 2025, సోమవారం
:: సర్పయాగం
మహాభారత యుద్ధానంతరం కౌరవ వంశానికి అంకురంగా నిలచిన వాడు ఉత్తరాభిమన్యులపుత్రుడు పరీక్షితుడు. పాండవుల తరువాత హస్తినాపుర సింహాసనమెక్కి అరవైయేడేళ్ళు నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరిక్షిన్మహారాజు వేటకు వెళ్ళాడు. ఒక మృగంమీద బాణం వేశాడు. అది ఆ గుచ్చుకున్న బాణంతోనే పరుగెత్తడం మొదలుపెట్టింది. రాజు దాని వెంట పడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో శమీకుడనే ముని కనబడ్డాడు. అతడిని మృగాన్ని గురించి అడిగాడు. ఆ ముని ధ్యానంలో మౌనవ్రతంలో ఉండటంచేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ప్రక్కన చచ్చిపడి ఉన్న ఒక పామును వింటి కొప్పుతో ఎత్తి ఆ ముని మెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు.
శమీకుడు సమాధిలో ఉండటంచేత పాము మెడలో పడ్డా ఒళ్ళు తెలియలేదు. అతనికి శృంగి అనే కుమారుడున్నాడు. అతడు తపస్వి అయినా మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని, ఆగ్రహోదగ్రుడై " ఏడు రోజుల్లో తక్షక విషాగ్ని దగ్ధుడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోవు గాక " అని శపించాడు.
శృంగి తండ్రి వద్దకు వచ్చాడు. పామును తండ్రి మెడ నుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియజెప్పాడు. శమీకుడు కోపం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయనీ, క్షమాగుణం తపస్వికి అలంకారమని కొడుకునకు బోధించి శాపాన్ని క్రమ్మరించుమని కోరాడు. శృంగి దానికి అంగీకరించలేదు. శమీకుడు విచారపడ్డాడు. ఒక శిష్యునితో శాప వృత్తాంతాన్ని రాజుకు తెలియపరిచాడు.
శాప వృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు సలిపి ఒంటి కంబపు మేడ కట్టించుకొని అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు, భటులు కాపలా కాస్తూ ఉంటే, వారం రోజుల గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూ ఉన్నాడు.
పూర్వం బ్రహ్మదేవుడు కశ్యపుడనే బ్రహ్మర్షికి " సంజీవని " ని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతనిని తిరిగి బ్రతికించి తన విద్యా బలాన్ని ప్రభువు ముందు వెల్లడించాలని కశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో తక్షకుడు కలిసికొన్నాడు. కశ్యపుని శక్తిని పరీక్షించటానికి తక్షకుడు ఒక మఱ్రిచెట్టును కాటేసి దగ్ధం చేశాడు. వెంటనే కశ్యపుడు ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలిసికొని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా అతడిని తిరిగి పంపించి వేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది.
తక్షకుడు నాగ కుమారులతో కలిసి బ్రాహ్మణ వేషాలతో వెడలి ఏకస్తంభ హర్మ్యానికి చేరుకున్నాడు. వేదఘోషతో వచ్చిన ఆ విప్రులను రాజు పూజించాడు. ఏడవరోజున సూర్యాస్తమయం అవుతున్నది కదా అని, ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒక దానిని తినటానికి పరీక్షిత్తు ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తలయెత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు దగ్ధుడైపోయాడు.
పరీక్షిత్తు చనిపోయే నాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు. పిన్ననాటనే రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. అలా ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్న కాలంలో ఒక రోజు పైలుడు అనే మహర్షికి శిష్యుడైన ఉదంకుడు జనమేజయుని వద్దకు వచ్చి వాని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తుచేసి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సహించటంలో ఉదంకుని స్వార్థం కూడా ఉన్నది. ఉదంకునికి కూడా తక్షకునిపై కోపం ఉన్నది. అతడు ఒకసారి గురుపత్ని కోరికపై మహిమాన్వితమైన కుండలాలు తీసుకొని వెడుతూండగా వాటిని తక్షకుడు అపహరించుకొని పోవటం వలన నాటినుండి ఉదంకుడు తక్షకునిపై కోపాన్ని పెంచుకొని ప్రతీకారంకోసం ఎదురుచూస్తూ సమయోచితంగా జనమేజయునకు వాని తండ్రి మరణ వృత్తాంతాన్ని సాక్ష్యాలతో సహా తెలియజేసి తక్షకునిపై కోపాన్ని రగిలింపజేసి సర్పయాగానికి అనుజ్ఞనివ్వజేసాడు. యాగం ఆరంభమయి తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్ఛారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో పడి తగులబడిపోసాగాయి. కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. " సహేంద్ర తక్షక స్వాహా! " అని హోతలు విధివిహితంగా మంత్రోచ్ఛారణ చేయగానే తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోనారంభించాడు. నాగముఖ్యుడైన వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జగత్కారుడు. వారికి ఆస్తీకుడనే బిడ్డ నాగజాతి రక్షణార్థం కారణజన్ముడై జనించాడు. అది తెలిసిన మిగిలిన నాగముఖ్యులు వాసుకితో సహా వచ్చి సర్పయాగాన్ని మాన్పించమని ఆస్తీకుని ప్రార్థించారు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సమయానికి ఆస్తీకుడు అక్కడకు వెళ్ళి సముచితమైన స్తుతులను చేసి జనమేజయుని మెప్పించి దక్షిణగా యాగాన్ని నిలుపుచేయమని కోరాడు. సత్యదీక్షాపరుడైన జనమేజయుడు ఆ విప్రుని కోరిక మేరకు సర్పయాగాన్ని ఆపించేశాడు. .
15, జనవరి 2025, బుధవారం
:: నరకాసుర వధ ::
నరకాసురుని వధించడానికి శ్రీకృష్ణుడు ఆయత్తమయ్యే సమయంలో సత్యభామ కృష్ణుని దరిచేరి "దేవా! నీవు రాక్షస సంహారం చేస్తుంటే నీ నైపుణ్యం చూడాలని ఉంది. నన్నుకూడా యుద్ధానికి నీతోబాటు తీసుకొని వెళ్ళకూడదా" అని కోరింది. అంతట కృష్ణుడు "నువ్వా! యుద్ధానికా! యుద్ధం అంటే ఏవనుకుంటున్నావు? అవి తుమ్మెదల ఝంకారాలు కావు. ఏనుగుల ఘీంకారాలు. అక్కడ పద్మాల పుప్పొడి ఉండదు. గుర్రాల కాలిగిట్టల దుమ్ము మాత్రమే ఉంటుంది. నీటితరగల మీద నురుగు కాదు. శత్రువుల బాణాలు. అవి సరోవరాలు కావు. సైన్యసమూహాలు. నేను త్వరలో వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు". అనగా, అప్పుడు, కృష్ణుడితో సత్యభామ "నీ బాహువుల దగ్గర ఉంటే అవతలి వారు దానవులయితే నేమి, దైత్యులయితే నేమిటి?" అంటూ నేను వస్తానని మెత్తగా చెప్పింది. చేతులు జోడించింది. కృష్ణుడు ఆమెను కరకమలాలతోగుచ్చి ఎత్తాడు. గరుత్మంతుణ్ణి అధిరోహించాడు. ప్రాగ్జోతిషపురాన్ని సమీపించాడు. గిరిదుర్గం, శస్త్రదుర్గం, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయు దుర్గాలతో అభేద్యంగా ఉంది ఆ పురం. కృష్ణుడు ముందుగా ఆ దుర్గాల్ని ముక్కలుజేసి క్రమంగా రూపుమాపాడు. మురుణ్ణి కప్పిన మురాశరుని పాశాలు ఛేదించాడు. ఆ పట్టణ ప్రాకారాల్ని గదా ఘాతాలతో కూల్చివేశాడు. పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి పంచశిరుడయిన మురాసురుడు ఆవులిస్తూ నీటినుండి బయటకు వచ్చాడు. అగ్నిజ్వాలలతో కూడిన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు. గరుడుని మీద పడవచ్చిన శూలాన్ని కృష్ణుడు ఒడిసి పట్టుకొని మూడుముక్కలుగా చేశాడు. వాడు చేతులు చాచి ముందుకు వచ్చాడు. అంతలోనే కృష్ణుడు వాని తలలను ఖండించాడు. మురుడు నీటిలో కూలిపోయాడు. అతని కొడుకులు ఏడుగురు పీఠడు అనే దండనాథుణ్ణి ముందుంచుకొని హరిని ఎదిరించారు. ఎన్నో బాణాలు గుప్పించారు. వాటినన్నింటినీ నేలకూల్చాడు కృష్ణుడు. వారి చేతులను, ముఖాలను, కంఠాలను నరికివేశాడు. వారందరూ చనిపోవడం నరకునికే ఆశ్చర్యం కలిగించింది. యుద్ధానికి సిద్ధమై వచ్చాడు నరకుడు. సత్యభామతో కూడిన కృష్ణుణ్ణి చూశాడు. పోరుకు సిద్ధమయ్యాడు. అతనిని చూచి సత్యభామ తన జడ ముడిచుట్టింది. కోక సరిచేసుకుంది. నగలు సవరించుకుంది. పయ్యెద బిగించింది. తన భర్త ముందట లేచి నిలబడింది.
ఆ సత్యభామను చూచి కృష్ణుడు "ఈ విల్లందుకో" అని సత్యభామకొక విల్లు అందించాడు. వెంటనే ఒక తేజోవిశేషం పుట్టింది. ఆమె ఆ వింటినారిని సంధించింది. ధనుష్టంకారం చేసింది. వీరశృంగారాలు, భయరౌద్రవిస్మయాలు రూపుదాల్చినట్లుగా ఉంది. ఎప్పుడు వింటికి బాణం తొడుగుతోందో, ఎప్పుడు విడుస్తోందో తెలియటం లేదు. బొమలు ముడిపడ్డాయి. అనురాగమందహాసాలు, వీరశృంగారరసాలు వ్యక్తమవుతూ, అవలీలగా శత్రువును నొప్పిస్తూ, భర్తను అలరిస్తోంది. ఒక పాదం ముందుకు, ఒక పాదం వెనుకకూ పెట్టి నిలబడింది. లక్ష్యాన్ని మాత్రమే చూస్తోంది. ధనుస్సు వలయాకారంగా ఉంది. బాణాలు పుంఖానుపుంఖాలుగా ప్రయోగిస్తోంది. నిజానికి సత్యభామ సుకుమారి. అలా యుద్ధం చేయడం ఆశ్చర్యంగా ఉంది చూచేవారికి. చెలికత్తెల కోలాహల ధ్వనినే ఓర్చుకోలేని ఆమె భేరీభాంకారాలను ఎలా ఓర్చుకొంటోందో తెలియడంలేదు. సత్యభామను ప్రశంసిస్తూ కృష్ణుడు విల్లందుకున్నాడు. అపుడు నరకాసురుడు కృష్ణునితో ఇలా అన్నాడు. "ఆడుది యుద్ధం చేస్తోంది నీకు మగతనం లేదా, దనుజులు ఆడువారితో యుద్ధం చెయ్యరు" అంటూండగానే శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. శత్రుసైన్యమంతా హాహాకారాలు చేస్తూ పారిపోయింది. సత్యాకృష్ణులను మోస్తూనే గరుత్మంతుడు కాలి గోళ్ళతో, ముక్కుతో, రెక్కలతో శత్రువుల గజసమూహాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ గాలివేగం సహించలేక చావగా మిగిలిన సైన్యం పారిపోయింది. అదే సమయంలో నరకాసురుడు ఏనుగుమీద విహరిస్తున్నాడు. కృష్ణునిపైకి విసరడానికి శూలం చేతిలో పట్టుకున్నాడు. కృష్ణుడు తన చక్రంతో నరకుని తల నరికాడు. చప్పుడు చేస్తూ ఆ తల నేలపై పడింది. దేవతలు మునులు ఆకాశంనుండి పూలవాన కురిపించారు.
12, జనవరి 2025, ఆదివారం
:: గోకర్ణొపాఖ్యానము ::
తుంగభద్రానదీ తీరంలో ఒక పట్టణముంది. ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు. అతని భార్య దుందులీ. ఆమె గయ్యాలి. వారికి సంతానం కలుగలేదు. ఆత్మదేవుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి కనిపించాడు. ఆత్మదేవుడు సన్యాసి కాళ్ళపై పడి నమస్కరించి " అయ్యా! నాకు సంతానం లేదు. నేనొక గోవును పెంచుకుంటున్నాను. ఆ గోవుకూడా గొడ్డుదయింది. నేను చెట్టును పెంచినాకూడా అది ఫలాలనివ్వడంలేదు. సంతానంలేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థమే కదా! నాకు సంతానం కలిగే ఉపాయం చెప్పండి." అని ప్రార్థించాడు. ఆ సన్యాసి " ఓ విప్రోత్తమా! నీకు ఒక పండిస్తాను. దాన్ని నీ భార్యతో తినిపించు. కుమారుడు తప్పక జన్మిస్తాడు" అని పండునిచ్చి వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు. ఆమె తన మనస్సులో "ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది. పొట్ట పెద్దదవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ పెరిగినకొద్దీ అనేక దు:ఖాలు కలుగుతాయి. పురుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది " అని అనుకుంటూ ఆ పండును తన చెల్లెలికి ఇచ్చింది. ఆ చెల్లెలు " ఇప్పుడు నేను గర్భవతిని. నాకు పుట్టిన బిడ్డను నీకే ఇచ్చేస్తాను " అని చెప్పింది. వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు. చెల్లెలికి బిడ్డ పుట్టగానే ఆమె దుందులికి ఇచ్చేసింది. దుందులి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది. ఆత్మదేవుడు ఆ కుమారునికి ' ధుంధుకారి ' అని పేరు పెట్టాడు. ఆ పండు తిన్న గోవుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆత్మదేవుడు ఆ పిల్లవానికి ' గోకర్ణుడు ' అని పేరు పెట్టాడు. ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు. గోకర్ణుడు పండితుడు, జ్ఞాని అయ్యాడు. ధుంధుకారి చదువులేని మూర్ఖుడు దుష్టుడు అయ్యాడు. గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు. ధుంధుకారి దొంగ అయి, హింసాపరుడై, దీనులను హింసిస్తూ, దుర్మార్గులతో స్నేహంచేసి, కుక్కలను పెంచుతూ వేశ్యాలోలుడయ్యాడు. ఆత్మదేవుడు చెడుమార్గాల్లో వెళ్తున్న తన కొడుకుని చూసి బాధపడసాగాడు. ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు. అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం నిస్సారమని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు. " తండ్రీ! నీవు భాగవతాన్ని పారాయణంచెయ్యి ముక్తిని పొందుతావు " అని ఉపదేశించాడు. ఆత్మదేవుడు అడవుల్లో నివశిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమస్కంధం పారాయణం చేయసాగాడు. ఆ పుణ్యంవల్ల ఆత్మదేవుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు.
ధుంధుకారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు. ఆమె మరణించింది. ధుంధుకారి ఐదు భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు. దొంగతనం చేసి బట్టలు, నగలు, ధనం తెచ్చి ఇచ్చేవాడు. ఒకసారి ఆ వేశ్యలు బలవంతంగా ధుంధుకారిని చంపి గోతిలో పూడ్చిపెట్టారు. వాడు ప్రేతమై గాల్లో తిరుగసాగాడు. అది గోకర్ణుడికి తెలిసింది. సోదరునికి గయాశ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు. ఒకనాడు గోకర్ణుడు పడుకొని ఉండగా ధుంధుకారి భయంకరమైన ప్రేతరూపంతో కనబడ్డాడు. గోకర్ణుడు వానిపై నీళ్ళు చల్లాడు. వాడి పాపాలు నశించిపోయాయి. కాని, ప్రేతత్వం పోలేదు. గోకర్ణుడు ఎందరో పండితులను ప్రేతత్వ ముక్తికి ఉపాయాన్ని అడిగాడు. ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు గోకర్ణుడు తన యోగ మహిమతో సూర్యవేగాన్ని ఆపి, సూర్యునికి భక్తితో నమస్కరించి " ఓ జగత్సాక్షీ! నీకు నమస్కారం. మోక్ష ఉపాయాన్ని చెప్పు " అని అడిగాడు. అదివిన్న సూర్యుడు గోకర్ణా! నీవు ఏడురోజులు భాగవతాన్ని దీక్షతో పఠించు అని చెప్పాడు. గోకర్ణుడు భాగవత సప్తాహ పారాయణం మొదలుపెట్టాడు. ఆ కథ వినడానికి ధుంధుకారి వచ్చాడు. అక్కడ ఏడు కణుపులతో ఒక వెదురు చెట్టు ఉండగా దాని రంధ్రంలో ధుంధుకారి ప్రవేశించి భాగవత కథ వినసాగాడు. మొదటిరోజు సాయంకాలానికి భాగవతకథ ముగిసింది. ఆ వెదురుగడ కణుపొకటి బద్ధలై పెద్ద శబ్దం వచ్చింది. ఇలా ఒక్కోరోజు ఒక్కో కణుపు బద్ధలవసాగింది. గోకర్ణుడు పన్నెండు స్కంధాల కథను వినిపించి భాగవత సప్తాహాన్ని పూర్తిచేయగానే ధుంధుకారి ప్రేతత్వం తొలగిపోయి దివ్యరూపంతో తులసీమాలను, పీతాంబరాన్ని ధరించి నీలమేఘశ్యాముడై, కవచకుండలాలను ధరించి గోకర్ణునికి నమస్కరించాడు. సోదరా! నీవు చెప్పిన భాగవత కథలను వినడంవల్ల నా ప్రేతత్వం పోయింది. వైష్ణవతత్త్వం వచ్చింది. భాగవత సప్తాహంవల్ల వైకుంఠలోకం ప్రాప్తించిందని చెప్పి విష్ణువిమానమెక్కి ధుంధుకారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
భాగవత సప్తాహం అంత గొప్పది. భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక, మార్గశిర, జ్యేష్ఠ, శ్రావణ మాసాలు భాగవత సప్తాహయజ్ణం చేయడానికి ప్రశస్తమైనవి. భాగవత కథాశ్రవణంవల్ల సకల రోగాలూ, పాపాలూ నశిస్తాయి. సంతానంలేని వారికి సంతానం కలుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు.
29, అక్టోబర్ 2024, మంగళవారం
సుభాషితం:
" స్వభావసిద్ధముగనే ' ఇది అందమైనది ', ' ఇది వికృతమైనది ' అని ఎక్కడనూ ఏదిన్నీ ఉండదు. ఎవరికి ఏది సమ్మతముగా, యిష్టముగా ఉంటుందో అదే వానికి చక్కనిదిగా కనబడుతూంటుంది.
శ్లో. " శీతే అతీతే వసన మశనం వాసరాంతే నిశాంతే,
క్రీడారంభం కువలయదృశాం యౌవనాంతే వివాహం,
సేతోర్బంధం పయసి గళితే వార్ధకే తీర్థయాత్రాం,
విత్తే నష్టే వితరణ మహో! కర్తు మిచ్ఛంతి మూఢా: "
శీతాకాలం వెళ్ళిపోయాక వస్త్రము, పగలు గడిచిపోయాక భోజనము, తెల్లవారిన తరువాత తరుణీ సంగమము, యౌవనాంతనైనాక వివాహము, గతజలసేతుబంధనము, వృద్ధాప్యంలో తీర్థయాత్ర, ధనం పోయాక దానము - వీటిని చేయ సమకట్టు వారెంతటి పరమమూర్ఖులో చెప్పాలా?
:: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట :: శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...
-
:: రామనవమి :: లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...
-
:: మహాగణపతి :: పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి, తల తెగిపడి ఉన్న బాలుణ్ణిచూసి, శివుణ్ణి చురచుర చూస్తూ " ఎంతపని చేశావు. మన ప...
-
:: కుమారస్వామి జననం :: " విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూం...