10, మే 2025, శనివారం

:: నారదుడు ధర్మరాజుకు చెప్పిన కర్ణుని చరిత్ర :: 

    కుంతీదేవి కన్నెగా ఉన్న కాలంలో దుర్వాసోమహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావం వలన సూర్యదేవుడిని ఆసక్తితో ప్రత్యక్షం చేసికొని కొడుకును కన్నందువలన మిక్కిలి సిగ్గుతో ఆ వాస్తవాన్ని ప్రకటించలేక పోయింది. కొడుకును కన్నప్పటికీ ఆమెకు కన్యాత్వం భగ్నం కాకుండా ఉండేటట్లు సూర్యదేవుడి వరం ఉండటంవలన ఆమె ఉత్తమ గృహిణిగా ప్రసిద్ధికెక్కింది. ఇదంతా దేవ రహస్యం. ఆవిధంగా కుంతిచేత నదిలో విడువబడిన ఆమె కొడుకును సూతుడు చూచి ఇంటికి ఎత్తుకొనిపోయాడు. అందువలన కర్ణుడు సూతుడికి పుట్టినవాడనీ, సూతకులంలో పుట్టినవాడనీ లోకంలో ప్రసిద్ధికెక్కుతూ పెరిగాడు. ధర్మరాజు నేర్పరితనం, భీముడి బాహుబలం, అర్జునుడి కోదండపాండిత్యం, అర్జునుడికి, శ్రీకృష్ణుడికి గల స్నేహం - ఇవన్నీ చూచి హృదయం మండి కర్ణుడు బాగా బాధపడుతూ ఉండేవాడు. నకుల సహదేవులకుండే నీతి, శాస్త్ర కళా పాండిత్యాన్ని ప్రజలు మిక్కిలి ప్రీతితో మెచ్చుకుంటూ ఉండటం కర్ణుడికి నచ్చేది కాదు. తోడు దానికి మనసు కలతపడగా బాధపడుతూ ఉండేవాడు. 

    అది అతడి స్వభావం. అంతేగాక విధి సంవిధానం కూడా అటువంటిదే. పాండవులమీది ద్వేషంతో ఆ కర్ణుడు అసూయ పెంచుకొని, దుర్యోధనుడితో చేతులు కలిపాడు. ఆ తరువాత అర్జునుడి విలువిద్యలోని మేటితనాన్ని గమనించి ఒకసారి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు బ్రహ్మాస్త్రాన్ని సాంగోపాంగంగా ఉపదేశించమని కోరాడు. " నేను యుద్ధం చేయటంలో అర్జునుడికి సమానుడను కావాలని కోరి వచ్చాను. నీవా- శిష్యులందరినీ సమానంగా చూచేవాడవు. కాబట్టి నీ దయవలన బ్రహ్మాస్త్రాన్ని పొంది ప్రకాశించవద్దా! " అని అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడితో ద్రోణుడు ఇలా అన్నాడు. " వేదోక్త విధివిధానాలను జీవిత వ్రతంగా పాటించే బ్రాహ్మణ శ్రేష్ఠుడు కానీ, సాటిలేని తమ ప్రభావం వలన పుణ్యశీలుడైన రాజుకానీ,  బ్రహ్మాస్త్రాన్ని దానంచేస్తే స్వీకరించటానికి యోగ్యులౌతారు కానీ ఇతరులు కాదు. కాబట్టి నీకు నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయటం ధర్మంకాదు ". 

    ద్రోణాచార్యుడు ఈవిధంగా అనగానే, మంచిదని కర్ణుడు తన ఇంటికి తిరిగిపోయి, మరునాడు బయలుదేరి మహేంద్రపర్వతానికి వెళ్ళి పరశురాముడిని దర్శించి వినయంతో నమస్కరించాడు. " నేను బ్రాహ్మణుడను. భృగువంశంలో పుట్టాను. అస్త్రవిద్య నేర్చుకోవాలన్న కోరికతో నిన్ను ఆశ్రయించటానికి వచ్చాను." అని అన్నాడు. ఆ మాటలకు సంతోషపడి పరశురాముడు కర్ణుడిని శిష్యుడిగా స్వీకరించాడు. ఆపైన కర్ణుడు అస్త్రవిద్యలో అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఆశ్రమ సమీప ప్రదేశంలో అస్త్రవిద్యాభ్యాసం చేస్తూ ఉండగా అతడి బాణం ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడి హోమధేనువు దూడకు తగలటం చేత అది చనిపోయింది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణుడికి శాపం పెట్టాడు. దానివలన అతడి రథం కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునిడితో పోరుచేసే సందర్భంలో నేలలో క్రుంగి పోయింది. 

    కర్ణుడు భక్తుడై పరశురాముని సేవించటం వలన ఆయన అతడికి బ్రహ్మాస్త్రం మొదలుకొని అనేక అస్త్రాలను నేర్పాడు. ఆ తరువాత ఒకనాడు పరశురాముడు కర్ణుడి తొడమీద తలపెట్టి నిద్రపోయాడు. వికారమైన, భయంకరమైన ఆకారం గలిగిన అళికం అనే పురుగొకటి కర్ణుడి క్రింది తొడభాగాన్ని వడివడిగా తొలిచివేసింది. కర్ణుడు గురువుకు నిద్రాభంగం కావటానికి ఇష్టపడక, ధైర్యంతో ఆ పురుగు చేసే కొరుకుడుకు సహించి కదలకుండా ఉన్నాడు. నెత్తురు కారటం మొదలుపెట్టి క్రమంగా సాగి పరశురాముడి శరీరాన్ని తాకింది. ఆ స్పర్శకు పరశురాముడు మేల్కొని " ఈ రక్తం ఎక్కడిది? " అని అడిగాడు. కర్ణుడు తొడ ఎత్తి కీటకాన్ని చూపి " ఇది తొలుస్తూ ఉండగా మీ నిద్ర చెడకుండా ఉండాలని ఆ బాధను సహించి నేను కదలకుండా కూర్చున్నాను " అన్నాడు. పరశురాముడు ఆ కీటకాన్ని చూడగానే ఆ పురుగు చనిపోయి రాక్షసరూపం పొంది, ఆకాశప్రదేశంలో నిలచి యిలా పలికింది. " ఓ దయామయా! నీకారణంగా నాకు భయంకరమైన శాపం నివృత్తి చెందింది. నేను నా పూర్వ రూపాన్ని పొందగలిగాను. గ్రస్తుడు అనే పేరుతో పిలువబడే ఒక రాక్షసుడిని నేను. భృగుమహర్షి భార్యను అపహరించి అతడి శాపానికి గురిఅయి కీటకంగా ఉంటూ వచ్చాను. ఓ పరశురామా! నీ చూపులనే అమృతపు చిలకరింపుల వలన నేను మరల నిజ రూపాన్ని పొంది సుఖంగా ఉన్నాను " అని చెప్పి నమస్కరించి స్వేచ్ఛగా వెడలి పోయాడా రాక్షసుడు. 

    ఆ తరువాత పరశురాముడు కర్ణుడు ప్రదర్శించిన అపూర్వ ధైర్యాన్ని మనస్సులో లోతుగా భావించి అతడితో " బ్రాహ్మణ జాతికి ఇటువంటి ఓర్పు ఉండదు. నిజంగా నీవెవడవు? " అని అడుగగా " నేను సూత పుత్రు "డనని కర్ణుడు భయపడుతూ సమాధానం చెప్పాడు. అందుకు పరశురాముడు మిక్కిలి కోపించి " బ్రాహ్మణుడనని పలికి నీవు వంచనతో నా శిష్యత్వాన్ని గ్రహించావు. దాని ఫలితాన్ని అనుభవించుము. నావలన నేర్చుకొన్న అస్త్రవిద్యా సంపద మొత్తం భగ్నమైపోవుగాక! " అని శపించాడు. కర్ణుడు గూడా చేయగలిగిందేమీ లేక విచారపడుతూ వచ్చి దుర్యోధనుడిని చూచి " ప్రభూ! నేను పరశురాముడిని ఆశ్రయించి అస్త్రవిద్యను గడించాను. ఇప్పుడీ లోకంలో వీరులెవ్వరూ యుద్ధంలో నన్ను ఎదుర్కొనేవారు లేరు " అంటూ కర్ణుడు అలా అనగా విని దుర్యోధనుడు సంతుష్టాంతరంగుడయ్యాడు. 

     " ఓ ధర్మజా! మీ అన్న అయిన కర్ణుడు నడచిన విధానాలటువంటివంటూ " నారదుడు  ఇంకా ఇలా చెప్పాడు. ఆ విధంగా కర్ణుడు దుర్యోధనుడికి ఆప్తమిత్రుడై ఉండగా, కళింగ రాజ్యాన్ని పరిపాలించే చిత్రాంగదుడనే రాజు తన పుత్రిక శుభాంగికి స్వయంవర మహోత్సవాన్ని చాటాడు. దానికి శిశుపాలుడు, నీలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులెందరో చిత్రాంగదుడి రాజధానీ నగరమైన రాజపురానికి చేరారు. దుర్యోధనుడు కూడా ఉత్సాహంతో చతురంగ బలాలను వెంటబెట్టుకొని, కర్ణ సహాయుడై, రథమెక్కి రాజపురానికి వెళ్ళాడు. అట్లా సమావేశమైన రాజులకందరికీ చిత్రాంగదుడు సముచిత సత్కారాలు చేసి తన కూతురైన శుభాంగికి స్వయంవర మహోత్సవ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. చెలికత్తెలు, దాదులు పేరు పేరున రాజులను చూపి పరిచయం చేస్తూ ఉండగా, ఆ కన్య వారిని చూస్తూ చేతిలో కల్యాణ పుష్పమాలను ధరించి రాజుల నడుమనున్న దారిని మెల్లగా నడుస్తూ దుర్యోధనుడిని దాటి పోయింది. అందుకు రారాజుకి కోపం వచ్చింది. ఆమెను ముందుకు సాగకుండా ఆపి పట్టి రథంమీద ఉంచటానికి ఆజ్ఞాపించి, తాను సభను వీడి వెళ్ళనారంభించాడు. సభలోని రాజులందరూ కలవరపడి గుమికూడి అతిభయంకరమైన విధంగా అతడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు కూడా వెనుకాడక, అందరూ అతడి బలపరాక్రమాలను పొగిడేటట్లు యుద్ధం చేశాడు. ఆ సమయంలో బల్లెములను ప్రయోగించి రాజుల శిరస్సులను భయంకరంగా నేల రాలేటట్లు చేస్తూ ఏనుగుల, రథాల, గుర్రాల, పదాతుల సమూహాలను మట్టుపెట్టుతూ, అందరికీ వారించడానికి శక్యం కాని వాడుగా కర్ణుడు యుద్ధరంగంలో నిలిచాడు. ఆ విధంగా బల పరాక్రమాలను ప్రదర్శించే వీరవర్యుడైన కర్ణుడిని చూచి , చావగా మిగిలిన రాజులు భయపడి పలాయనం చిత్తగించారు. దుర్యోధనుడు సంతోషించి కన్యారత్నమైన శుభాంగిని తీసికొని హస్తినాపురాన్ని చేరుకున్నాడు. అయితే, అప్పటి పగను మనస్సులో పెట్టుకున్న జరాసంధుడు కర్ణుడిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. కర్ణుడు వెళ్ళాడు. 

    కర్ణ జరాసంధు లిరువురూ అసహాయ వీరులై యుద్ధం చేశారు. కర్ణుడు జరాసంధుని దివ్యాస్త్ర సముదాయాన్ని, ధనురాది సాధనాలను ద్వంసం చేశాడు. జరాసంధుడు కూడా కర్ణుడి అస్త్రశస్త్రాలను వమ్ము చేశాడు. ఆపైన ఇరువురూ రథాల పైనుండి నేలకు దిగి, పెరిగిన పట్టుదలతో బాహాబాహీ యుద్ధానికి పూనుకొని తలపడ్డారు. జరాసంధుడు బాధపొంది కీలు విరుగ గొట్టుకున్నాడు. అంతటితో పోరు ఇరువురూ చాలించారు. జరాసంధుడు కర్ణుడి పౌరుషానికి మెచ్చి గారవించి, అధిక సంపదలకు నిలయమైన మాలినీ నగరాన్ని అతడికి ఇచ్చాడు. కర్ణుడు అమిత తేజంతో తిరిగి వచ్చాడు. అట్లా బలపరాక్రమాలలో జగత్ప్రసిద్ధుడైన కర్ణుడి గొప్పతనాన్ని ధ్వంసంచేయదలచి ఇంద్రుడు అతని కవచకుండలాలను భిక్షగా అడిగి పుచ్చుకొన్నాడు. దాని వలన " ధర్మజా! నీకు మేలు జరిగింది. దానివలననే అర్జునుడు కర్ణుడిని సంహరించ గలిగాడు " అని నారదుడు చెప్పి మరలా ఇలా అన్నాడు. " ధర్మజా! నేను చెప్పేది విని గ్రహించుము. బ్రాహ్మణుడు కర్ణుడిని కోపగించి శపించాడు. ఆ తరువాత పరశురాముడు శాపం పెట్టాడు. ఇంద్రుడు మోసం చేసి సహజ కవచకుండలాలను గ్రహించాడు. కుంతి వరమనే నెపంతో కోరి కోపాన్ని మాన్పింది. భీష్ముడు కర్ణుడిని అర్థరథుడుగా చేసి అగౌరవ పరిచాడు. శల్యుడు అనుచిత సంభాషణలతో కర్ణుడి హృదయాన్ని కలతబెట్టాడు. కృష్ణుడు అతడికి దాటరాని విధిగా నిలిచాడు. ఇన్ని జరుగగా అర్జునుడు కర్ణుడిని రణరంగంలో వధించగలిగాడు. ధర్మరాజా! శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ద్రోణుడు, కృపుడూ మొదలయిన వారందరూ లెక్కకుమించిన దివ్యబాణాలను ఉపదేశించటం వలన అర్జునుడి ప్రతాపతేజం కర్ణుడి పరాక్రమ తేజాన్ని ఆర్పగలిగిందిసుమా! " అని నారదుడు చెప్పగా విని తీవ్రమైన దు:ఖం చేత కలతచెంది ధర్మరాజు కన్నీరుమున్నీరుకాగా దీర్ఘనిశ్వాస విడుస్తూ ఉండగా అతడి సమీపంలో ఉన్న కుంతీదేవి అతడి అవస్థను చూచి, అతడి శోకాన్ని మాన్పాలని అతడితో ఇట్లా అన్నది. " కుమారా! పుట్టుకను గురించి నిజాన్ని చెప్పి అతడిని నీవైపు నేను ఆహ్వానించినప్పుడు, ఆ సూర్యభగవానుడు కూడా కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో కుంతి చెప్పిన మాట నిజం. నమ్ము నాయనా! అని పలికాడు. కాని, కర్ణుడు దుర్యోధనుడిని ఆశ్రయించి నీవైపు రావటానికి ఏవిధంగానూ ప్రయత్నం చేయలేక పోయాడు. కాబట్టి అటువంటి కర్ణుడి కొరకు నీవెందుకు ఈవిధంగా మానసిక వేదనను పొందుతావు? " అని మాట్లాడిన కుంతీదేవి పలుకులు ధర్మరాజుకు ఏవగింపు కలిగించటంతో అతడు బాధపడి కుంతీదేవిని చూచి ఇటులన్నాడు. " నీవు నిర్వహించిన ఈ రాచకార్యాన్ని రహస్యంగా ఉంచటం వలననే ఇంతటి విపరీత పరిణామం కలిగింది " అని అంటూ అంతటితో ఆగక అన్ని లోకాలలో ఉండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులలో లేకుండా పోవుగాక! అని ధర్మరాజు శపించాడు. అటుతర్వాత అమిత దు:ఖంతో తమ్ములతో కలిసి కర్ణుడికి తర్పణాలను శ్రద్దగా విడిచిపెట్టాడు. 

4, మే 2025, ఆదివారం

  కాశ్యపగౌతమాఖ్యానం అనబడే బ్రాహ్మణ నాడీజంఘుల కథ

    భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మములను గురించి వివరిస్తూ - క్రూరుడు, పేరాశపరుడు, చాడీలు చెప్పేవాడు, మందకొడి, చేసిన మేలును మరచిపోయేవాడు, తెలివిమాలినవాడు, అబద్ధాలాడేవాడు, నిందపడేవాడు, పిరికివాడు, తెగింపులేనివాడు, నీతిమాలినవాడు, మితిమించిన చెడు అలవాట్లు కలవాడు, రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. అందునా, తగని స్వభావంగల నీచులలోకెల్లా చేసిన మేలు మరచిపోయేవాడు ఎక్కువ తగనివాడు. దీనిని చెప్పే పాతకాలంనాటి కథ ఒకటి చెబుతాను. వినుమంటూ చెప్పాడు. దానిని మీకు నేనిప్పుడు చెబుతాను వినండి. దీనినే కాశ్యప గౌతమాఖ్యానం అంటారు. 

    వెనుకటికి ఓ బాపడు, తన తాతముత్తాతలనుండి వస్తున్న కులవృత్తి గౌరవాన్ని వదులుకొని ఒక బోయ వనితను పెళ్ళాడాడు. బోయవారితో కలిసిపోయి వేటాడేవాడు. మాంసం తినేవాడు. బాగా సుఖాలు మరగిన అతడు ఒకసారి వ్యాపారనిమిత్తం  మరొక దేశానికి పోతున్న ఓ వర్తక బృందంలో చేరి వారితో కలసి తానూ వెళ్ళాడు. అట్లా పోతూ ఉండగా ఒక ఆడఏనుగు తటస్థపడి  ఆ బిడారులోని జనాన్ని పిచ్చెత్తినట్టు నేలమీద పడేసి కాలితో తొక్కి చంపటం మొదలుపెట్టింది. ఆ గుంపంతా చెదిరిపోయి తలోదిక్కుకూ చెల్లాచెదరయింది. ఆ బ్రాహ్మణుడు భయంకొద్దీ దిక్కుతోచక పరుగెత్తాడు. ఉత్తరం వైపుగా చాలాదూరంపోయి ఒక దోవ చూచాడు. అతడు ఆ త్రోవలో వెళ్ళగా ఆ ప్రక్కనే దట్టంగా ఉన్న డొంకల మధ్య గుబురుగా ఉన్న ఒక మర్రిచెట్టును చూచాడు. అది చాలా ఎత్తుగా, వెడల్పుగా ఎంతో గుండ్రంగా అందంగా ఉన్నది. అక్కడ కాసేపు నిలబడాలనిపించి ఆ చెట్టు క్రిందకు పోగా, అడవిపూల వాసనను ఇముడ్చుకున్న సుడిగాలి అతడి అలసటను కొంత పోగొట్టింది. ఆ బ్రాహ్మణుడు తనివితీరా ఆ చెట్టు నీడను కూర్చున్నాడు. అంతలో అక్కడికి చక్కగా నడుచుకొంటూ ఒక పెద్ద కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మ దయను నోచుకొన్నది. నాడీజంఘుడు, రాజధర్ముడు అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మర్రిచెట్టుమీదే కొంగ ఉండేది. ఆ కొంగ అట్లా వచ్చి బాపనయ్యను చూచింది. ప్రేమతో ఆదరించి, " ఓ బ్రాహ్మణోత్తమా! ఎక్కడినుండి ఎక్కడకు ఏమి పనిమీద వెడుతున్నావు? నిన్ను చూచి సంతోషించాను. నాకు తగ్గ అతిథివి. నీ సంగతులు తెలియజెప్పుము " అని అడుగగా " నాది మధ్యదేశం. నాపేరు గౌతముడు. నేను ఉత్తముడైన ఓ బ్రాహ్మణుని కుమారుడను. నేను సోమరిపోతునై, వేదాలు వల్లించటం వంటి మా జాతి కర్మలను మానివేశాను. కామంలో పడి ఒక బోయ స్త్రీని పెళ్ళాడాను. బీదరికంతో విసిగిపోయి వర్తకం వెంబడి ఒక బిడారుతో కలిసి మరో దేశానికి వెడుతున్నాను. కాలుతీసి కాలు పెట్టలేనంత దట్టంగా ఉన్న కొండలలో, అడవులలో సాగుతున్న మాకు ఒక అడవి ఏనుగు తటస్థపడి బిడారుమీద పడి చంపబోయింది. ఆ గుంపులోని వారంతా తత్తరపడి పరుగెత్తారు. నేను భయపడి అడవిలో పరుగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టంకొద్దీ నీవు ఉండే ఈ మర్రిని చూచాను. " అనగానే, ఆ కొంగ " మంచిదే! నీ బీదతనాన్ని పోగొడతాను. నీవు బాధపడకుము " అని చెబుతూ తన ఆతిథ్యాన్ని అందుకొనమన్నది. మంచి రుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్చి తెచ్చింది. తీయటి అడవి పళ్ళు పెట్టింది. అతిథి బ్రాహ్మణుడు తృప్తిపడేటట్లు భోజనం పెట్టింది. ప్రొద్దుపోవటంతో చిగురుటాకులతోనూ, పూలతోనూ ఒత్తుగా ప్రక్కను సిద్ధం చేసింది. ఆ కొంగలరాజు, ఆ బాపడు ముచ్చటలతోనూ, హాయి అయిన నిద్రతోనూ ఆ రాత్రి గడిపారు. 

    తెల్లవారగానే ఆ బ్రాహ్మణుడిని చూచి " వినుము - మనిషి పేదరికం పోవటానికి స్నేహితుడూ, వెండీ, బంగారమూ, ఆలోచన అనే నాలుగింటినీ కారణాలుగా దేవగురువు బృహస్పతి చెప్పాడు. వీటి అన్నింటిలోనూ, ఓ బాపనయ్యా! మిత్రుడు గొప్పవాడు. కశ్యపుడి సంతానంలోని వాడనైన నేను నీతో చెలిమి చేస్తూ ఉంటే, అంతులేని సిరిసంపదలకు యోగ్యుడవు కాకుండా పోతావా? నాకు విరూపాక్షుడనే మిత్రుడొకడున్నాడు. మధువ్రజం అతడి పట్టణం. అది యిక్కడకు మూడామడల దూరంలో ఉంటుంది. దానికి మరీ దూరం, మరీ దగ్గరాకాని త్రోవ వెంబడే గబగబా వెళ్ళుము.ఆ రాక్షస రాజును ఆశ్రయించుము. విరూపాక్షుడిని చూచి అతడితో నేను పంపించినట్లు చెప్పుము. అతడు ఎంతో సంతోషిస్తాడు. బంగారం, మణులూ యిచ్చి సత్కరిస్తాడు " ఆంటూ ఆ కొంగ మధువ్రజం పోయే దిక్కును చెప్పింది. ఆ దారి వెంబడి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుడిని చూచాడు. నేను నాడీజంఘుడికి ఆప్తమిత్రుడనని చెప్పాడు. అతడు పంపబట్టి డబ్బు కోరి వచ్చాను అని బ్రాహ్మణుడు చెప్పగానే విరూపాక్షుడు అతడిని తేరిపార చూచాడు. లోలోపల ఈ బ్రాహ్మణుడు నీచుడిగా అనిపిస్తున్నాడు. సంగతేమిటో అడిగి తెలుసుకోవాలి, అని అనుకొని " నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్లుగా చెప్పుము " అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం జంకలేదు. తన సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు విరూపాక్షుడు కూడా ఎట్లాంటి మానసిక, శారీరక వికారాలకు లోబడని వాడవుతూ, " ఈ బ్రాహ్మణుడు ఎటువంటి వాడైతే నేమిలే. నాడీజంఘుడితో స్నేహమే ఈ బ్రాహ్మణుడి యోగ్యతను తెలుపుతుంది. కాబట్టి ఇతడికి కరువుతీరా ధనమిస్తాను " అని నిర్ణయించుకొని ఆ బ్రాహ్మణుడికి అవసరానికి తగ్గట్టుగా తిండి, బట్టలు సమకూర్చి పెట్టడానికి కొంతమందిని నియమించాడు.

    ఆ మరునాడు కార్తీక పౌర్ణమి. విరూపాక్షుడు తన ఇంట్లో వేలకొద్దీ బ్రాహ్మణులు బంగారు పళ్ళాలలో భోజనాలు ఆరగించటానికి, కానుకలు ఎక్కువగా పుచ్చుకొనటానికి అనువుగా గల కర్మల నాచరించాడు. ఆ మహాజనంతో బాటు ఎంతో ఆదరణతతో దొడ్డమనస్సుగల ఆ విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడికి ఎన్నో సేవలు చేశాడు. కడుపునిండా కమ్మని తిండి పెట్టాడు. మొయ్యలేనంత బంగారం, రత్నాలు యిచ్చి, తిన్న బంగారు పళ్ళాన్ని గూడా మనసారా యిచ్చాడు. బాహ్మణుడు ఆనందంగా అన్నీ పుచ్చుకున్నాడు. బరువు ఎక్కువ అవటంతో భుజాలు చేతులు మార్చుకొంటూ మోస్తున్నాడు. బరువువలన మెడా, వీపు, రెక్కలూ చాలా నొప్పి పుట్టాయి. ఆ నొప్పివలన వంగిపోతున్నాడు. గబగబా అడుగులు వేస్తూ నాడీజంఘుడు ఉండే మర్రిచెట్టును చేరుకున్నాడు. అతడిని చూచి కొంగ సంతోషించింది. అట్లా వచ్చిన బ్రాహ్మణుడిని చూచి కొంగ తృప్తి పడింది. దొప్పలవంటి తన రెండు రెక్కలతో మెల్లగా విసరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయింది. ఆదమరచి నిద్రపోతూండగా ఆ పాడు బాపడు మరునాటి ప్రయాణంలో తిండిని గురించి ఆలోచించాడు. ఈ కొంగ ఒళ్ళు బాగా కొవ్వి కండపట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నది. దీనిని చావమోది, మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకొని రెండు చేతులతోనూ కర్రను బాగా గట్టిగా పట్టుకొని అప్పటికప్పుడే మెడమీదా, తలమీదా దబదబా చితక బాదాడు. ప్రాణం పోయిందని రూఢిచేసుకొన్నాడు. ఈకలన్నీ గబగబా పెరికివేశాడు. పీకను చీల్చాడు. పేగులు బయటకు లాగి మాంసాన్ని పొందికగా మూటకట్టుకున్నాడు. 

    అంతలో తెలవారగా విరూపాక్షుడు నిద్రనుండి లేచి " మాంసం కంపు కొడుతున్నది. ఏం ముంపు ముంచుకొస్తుందో ఏమో! మనస్సులో కలతగా ఉన్నది " అని తన వారితో చెబుతూ భయంతో వణికిపోతున్నాడు. జాము పొద్దెక్కగా రాజధర్ముడిని అంటే నాడీజంఘుడిని గుర్తుతెచ్చుకొని, నా మిత్రుడు ప్రతి నిత్యం ప్రొద్దున్నే వచ్చేవాడు. ఈరోజు ఎందుకు రాలేదో ఏమో! బ్రాహ్మణుడు నీచుడని అపుడే అనుకొన్నాను. ఈ తుచ్ఛుడు ఏమి తలపెట్టాడో ఏమో! అయ్యో! దైవమా! నాడీజంఘుడు ఏమి కానున్నాడో ఏమో! ఏమీ కల్మషం ఎరుగనివాడు. అందరినీ నమ్ముతాడు అనుకొంటూ విరూపాక్షుడు తీవ్రంగా ఆలోచించాడు. తన పరివారానికి కొంగను వెదకండని పురమాయించాడు. ఆ పరిజనం వెళ్ళి వెదకి, కొంగ డొక్కను గుర్తుపట్టి వెంటనే ఆ సంగతి రాజునకు కబురు పంపారు. ఆ బ్రాహ్మణుడు ఎటువైపుగా వెళ్ళాడో ఏమిటో తెలుసుకొని, వడివడిగా పరుగెత్తి అ బ్రాహ్మణుని వెదకి పట్టుకున్నారు. వెంటనే రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు తెచ్చారు. విరూపాక్షుడు " ఇతడు చేసిన మేలు మరచినవాడు. వీడిని నా ఛాయలకు తేకండి. వెంటనే చంపి తినండి " అని సేవకులతో చెప్పాడు. ఆ మాటలు విన్న భటులు " ఈ పాపిష్టి శరీరం తినటానికి మేమంత నీతి లేని వారమా? ఇట్లాంటివి తింటే మాకు పాపం అంటుకొంటుంది." అని ఇష్టపడకపోవడం వలన ఆ విరూపాక్షుడు " తింటే తినండి, లేకపోతే మానెయ్యండి. ఏం చేసినా సరే! ఈ కృతఘ్నుడిని నా ఎదుటికి ఎందుకు తెచ్చారు? " అని రాజు అనగానే ఆ రాక్షసులు, మధువ్రజం వెలుపలికి తీసుకొని వెళ్ళి, అతడి శరీరాన్ని చిన్న చిన్న కండలుగా కోసి, గాయాలనుండి రక్తం చిందుతూ ఉండగా పడదోసారు. అంతలో ఆ పాపి శరీరాన్ని తినటానికి నకనకలాడుతున్న కడుపులతో కుక్కలమంద వచ్చిపడింది. అంత ఆకలితోనూ అవి ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. కృతఘ్నుని మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు. రోత పడతాయని భీష్ముడు ధర్మరాజునకు చెప్పి , ఆ తరువాత జరిగిన వృత్తాంతమును గూడా  ఈ రకంగా వివరించాడు.

    విరూపాక్షుడు విలవిలా ఏడుస్తూ నాడీజంఘుడి డొక్కను తెప్పించాడు. స్నేహితులతో కలసి, తాను గౌరవంగా తలకొరివి పెట్టాడు. అపుడు దేవేంద్రుడు వచ్చాడు. ఇంద్రుడిని చూచాడు విరూపాక్షుడు. అతడిలో తత్తరపాటు, వినయం కలగలుపుగా దీనత్వం తోపగా, విలవిలా ఏడుస్తూ, " నా రాజధర్ముడిని తిరిగి బ్రతికించవా?" అంటూ వేడుకొన్నాడు. విరూపాక్షుడి ప్రార్థన విన్న ఇంద్రుడు " నీ చెలికాడు నాడీజంఘుడు బ్రహ్మకు స్నేహితుడని నీకింతవరకూ తెలియదా? అతడి గురించి ఏడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యము తన దగ్గరకు రావాలని బ్రహ్మ కోరుకుంటాడు. కాబట్టి తరచూ రానందుకు బ్రహ్మ విచారించేవాడు. అతడికి ఇటువంటి దశ పట్టినదంటే, అతడి స్నేహితుడవటంవల్లనే, నీవు స్నేహితుడవటంవలన నీవు ఈ కొంగకు తలకొరివి పెట్టావు. అది చాలా మంచి పని కదా! అటు దహన సంస్కారం ముగించిన నీవు ఇటు వచ్చావో లేదో, ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో ఒక ఆవు తన దూడకు ఎంతో ప్రేమగా పాలిస్తుండగా, చిన్న పాలచేపు రాగానే దూడ నోటినుండి నురగ తుంపర జారి పడింది. అది సుడిగాలికి ఎగిరి చితిమీద పడింది. ఆ నురగ పడిందో లేదో నాడీజంఘుడు తిరిగి బ్రతికాడు. మునుపటి మాదిరిగానే అదే రూపంతో వస్తూ ఉన్నాడు.  ఇట్లా జరిగింది అంటే, అది ఆ బ్రహ్మదేవుడి లోకాతీతమైన దయామహిమే! " అని ఇంద్రుడు చెప్పగానే కొంగల రాజు రానే వచ్చాడు. అతడి రాకకు విరూపాక్షుడు మరింత సంతోషించాడు. అంతకు మునుపే ఇంద్రుడు బ్రహ్మ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడిని తాళ్ళతో కట్టించాడు. ఆ రాజధర్ముడు, బ్రాహ్మణుడికి తన వలన కలిగిన దురవస్థకు తట్టుకొనలేక పోయాడు. అతడిని విడిపించమని ఇంద్రుడిని వరం అడిగాడు. ఈ వరం యివ్వటంలో బ్రహ్మదేవుడి దయ ఉందని ఇంద్రుడు దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణుని విడిచిపెట్టి కొంగ కోరిక తీర్చాడు. రాక్షసరాజు ఆజ్ఞతో బ్రాహ్మణ ధనాన్ని తెచ్చిన వారు తిరిగి అతడికి ముద్రశుద్ధిగా ముట్టచెప్పారు. నాడీజంఘుడిని కొనియాడుతూ ఆ బ్రాహ్మణుడు ధనం మూటను మోసుకొంటూ వెనక్కి తిరిగి చూస్తూ తత్తరపడుతూ పోయాడు. ఆ తరువాత ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. విరూపాక్షుడు ఆ బకరాజు రాజధర్ముడిని సంతోషంగా సాగనంపాడు. అతడూ గొప్పగా తానుండే మర్రిచెట్టును చేరుకొన్నాడు. 

    

    

27, ఏప్రిల్ 2025, ఆదివారం

:: హంస వాయసముల కథ :: 

    సముద్రంలో ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడుండేవాడు. అతడు యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతూండేవాడు. పెక్కుమంది పుత్రులతో, భోగభాగ్యాలతో విలసిల్లుతూ దానాలు చేస్తూండేవాడు. ఒక కాకి అతడి ఇంటికి రాగా అతడి కుమారులు దానికి ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు. అది ఆ ఎంగిళ్ళతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవీ తనకు సాటిరావన్న దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది. ఆవిధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుడితో సమానమైన రెక్కల శక్తి గలిగిన కొన్ని హంసలు సముద్రాన్ని చేరవచ్చాయి.

    వైశ్యకుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో యిలా అన్నారు. " హంసలు ఆకాశవీథిలో కడు వేడుకతో ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి. పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు పలురీతుల గమనాలతో హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి "- అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానులు కోరగానే ఎంగిళ్ళుతిని గర్వించి ఉన్న మూర్ఖమైన ఆ కాకి, తాను అంతటి దాననే అని తలంచి, ఆ హంసల దగ్గరకు వెళ్ళి, వాటిలో మేటిగా గోచరించిన దానిని పిలిచి, తనతో సమానంగా పరుగెత్తమని అడుగగా, ఆ హంసలు నవ్వుతూ కాకితో ఇట్లా అన్నాయి. " మానస సరోవరం మా నివాసం. మా బలాన్నీ, వేగాన్నీ చూచి పక్షులన్నీ పొగిడే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలము. ఇటువంటి మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నావు. అసలు హంసలతో పోటీకి రాగల కాకులు ఇంతవరకూ ఎక్కడైనా ఉన్నాయా? " అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇలా అన్నది. " నూట ఒక్క గతులు వేటిలోనయినా నూరు ఆమడల దూరం వెళ్ళగలను. పొడవుగా మీదికి ఎగిరి అదేవిధంగా నేలకు దిగి రాగలను. మనోహర గతులతో వంకరగా, వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను. మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగ దానిని గెలుస్తాను " అని అనగా ఆ కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన హంస దానిని చూచి " నూరుగతులలో పరుగెత్తగలనన్నావు గదా, అవన్నీ నాకు తెలియవు. ఆకాశమార్గంలో పక్షులన్నీ నిడువుగా ఏవిధంగా ఎగురుతాయో ఆవిధంగా సముద్రంపై ఆకాశమార్గంలో చక్కగా పరుగెత్తుదాము రమ్ము " అని హంస పలుకగా అక్కడ చేరిన కాకులు " శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం పాలు కావలసిందే కాని, ఏవిధంగా సాటి కాగలవు? " అని హంసను పరిహసించగా, ఆ హంస మారు మాటాడక వాటిని వదిలి సముద్రం పైమార్గంలో పరుగెత్తసాగింది. కాకి గూడా దానిని వెంబడించింది. 

    ఈ విధంగా రెండూ పోటీపడి ఎగురుతూ ఉండగా, రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెడుతూంటే, వాయసం ఉత్సాహంతో క్రీడావిలాసంతో తన నేర్పులు చూపుతూ వివిధ గతులలో వేగంగా వెళ్ళటం వలన అలసట చెందుతూ పరుగెత్తుతున్నది. ఆ కాకి హంసను దాటిపోయి తిరిగి వచ్చి పిలిచేది. దాని ముక్కుమీద ముక్కు మోపేది. ఈకలను ఈకలతో రాసేది. దాని చుట్టూ విజృంభించి తిరిగేది. చిత్రమైన నడకలతో వచ్చి తాకేది. తనలో తాను మురిసిపోతూ నవ్వేది. ఈ విధంగా తెగ మిడిసిపాటుతో వ్యవహరించేది. కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరుగెత్తటం చూచిన తోటి కాకులు, సంతోషంతో అరుస్తూ, హంసలను గేలిచేస్తూ చెట్లపై గెంతులు వేయసాగాయి. " హంస ఓడిపోతుంది " అని పెద్ద గొంతులతో అరవసాగాయి. వాటి అరుపులు విన్న హంస నిండు ఉత్సాహంతో పొడవుగా పైకి ఎగిరి పడమటివైపు పారగా, కాకి గూడా దాని వెంట వేగంగా వెళ్ళి ఆ హంసను దాటటానికి శక్యంగాక ఊపిరిబిగబట్టి పరుగెత్తసాగింది. హంస, శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా, దానితోపాటు పరుగెత్తుతూ అలసిపోయిన కాకి శక్తి కోల్పోయి బలహీనమయి మనసు కలత నొందగా ఈ రకంగా చింతించ సాగింది. " ఎరుగక హంసతో పోటీకి సిద్ధపడ్డాను. కాలు నిలుపటానికి మార్గంలో చెట్లు, తీగలు, పొదలు, గట్లు ఏవీ లేవు. నీటిపై దిగుదామా అంటే, సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు. " అని అనుకొంటూ దిగులుతో, భయంతో కలత చెందిన మనసు కలదై కాకి, దప్పితో వశంతప్పి క్రమంగా క్రిందికి దిగసాగింది. 

    దానిని చూసిన హంస ఈ విధంగా అంది. " ఓ వాయసమా! నేను నిన్ను దాటి పిలిచినా నీవు బదులు పలుకక జాప్యం చేస్తున్నావు. నీ రెక్కలు నీకు దూరమై పోయినట్లు చూస్తున్నావు. నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో వివరించగలవా? " అని హంస కాకితో హేళనగా పలికింది.  అప్పుడు సముద్ర జలాలు రెక్కలను, ముక్కును, తోకను తాకుతూ ఉండగా, మాటిమాటికి మీదకు ఎగురుతూ, బలహీనపడి క్రిందికి వాలుతూ ఉండగా అలసిపోయి ఎగురలేక భయపడింది. ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటిమీద పడి, తన బలహీన స్థితికి భయపడుతున్న కాకిని చూచి రాజహంస యిలా అన్నది. " మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. కాని, చెప్పినదంతా చెయ్యటం ఎవరికీ సాధ్యమవుతుంది? గొప్పలు పలికిన నీ పని అయిపోయిందికదా! " అన్న హంస మాటలు విని కాకి ఈవిధంగా అన్నది. " ఎంగిళ్ళుతిని, బలిసిన దేహంతో గర్వించి, నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని సైతం ఓడించగలనని తలచే దానిని. నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకున్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. నాపై దయచూపి నన్ను రక్షించు. నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చుము. ఇది నీకు న్యాయం కదా!" అని ఈ విధంగా వ్యాకులమైన మనసుతో కావుకావు మని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి హంస దయతో కాకిని తన కాళ్ళతో పట్టి పైకెత్తి, దాని ప్రాణాలు కాపాడి, బలమొప్పగా వీపున మోసికొని వస్తున్న హంసను చూచి పక్షులన్నీ పొగడ సాగాయి. హంస ఈ విధంగా కాకిని మోసుకొనివచ్చి దాని స్థానంలో దింపింది. కాకి స్తిమితపడిన తరువాత తోటి కాకులు వినేటట్లుగా ఇకముందెప్పుడూ గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ధి చెప్పి తోడి హంసలతో కలసి వెళ్ళిపోయింది. 

    ఈ రకంగా కాకి హంసల కథను కర్ణునికి వినిపించి శల్యుడు అతడితో వైశ్య కుమారులు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించిన కాకివలె నీవు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని, నీ శక్తి మరచి, నిన్ను మించిన వారితో తలపడుతున్నావు. దీని వలన నీకే హాని జరుగుతుంది. కాబట్టి నా మాటలు విని అర్జునునితో యుద్ధంచేసి ప్రాణంమీదకు తెచ్చుకోకు అని హితోపదేశం చేశాడు. పరిశీలించి చూస్తే, ఈ హంస వాయసముల కథ ద్వారా కర్ణుడిని అవమానపరచాలన్న శల్యుడి ఉద్దేశం ప్రస్ఫుటమవుతున్నది. 

18, ఏప్రిల్ 2025, శుక్రవారం

 :: దక్షయజ్ఞం ::

    దక్షుడు బ్రహ్మ పుత్రుడు. అతనికి ప్రసూతి అన్న ధర్మపత్నియందు పదహారుమంది కన్యలు పుట్టారు. వారిలో పదముగ్గురుని అతడు ధర్మరాజుకిచ్చాడు. ఒకతె అగ్నికీ, మరొకతెని పితృదేవతలకూ, ఇంకొక కుమార్తె సతిని శివునకూ ఇచ్చి పెండ్లిచేశాడు. నరనారాయణులు మూర్తి అనే దక్షపుత్రికకు జన్మించినవారే. వారే తరువాత కృష్ణార్జునులుగా జన్మించి భూభారం తగ్గించారు. సరే! 

    పూర్వం బ్రహ్మలు ఒక సత్త్రం నిర్వహించారు. దానిని చూడాలని ప్రజాపతులు వచ్చారు. దక్షుడుకూడా రాగా అతడిని చూచి బ్రహ్మ, శివుడు తప్ప తక్కిన వారంతా లేచి నిలబడ్డారు. దక్షుడు బ్రహ్మకు ప్రణమిల్లాడు. శివుడు లేవకుండటం చూసి ఆగ్రహించాడు. ఆ దేవుడిని పరుషోక్తులతో తూలనాడాడు. యజ్ఞంలో శివుడు హవిర్భాగం  లేనివాడగుగాక! అని శపించాడు. అతని చర్యను సదస్సు లాక్షేపించగా దక్షుడు కోపంతో సదస్సునుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నందికేశ్వరుడు దక్షుడు పశుప్రాయుడవుతాడనీ, త్వరలో మేషముఖుడు కాగలడనీ శపించాడు. హరుని ద్వేషించే ద్విజులు యాచకులవుతారనీ కూడా శపించాడు. అందుకు భృగువు కోపించి ధూర్జటి వ్రతులు పాషండులవుతారని ప్రతిశాపం యిచ్చాడు. ఇది చూచి విమనస్కుడై శివుడటనుండి వెళ్ళిపోయాడు. యజ్ఞం పూర్తికాగానే ఋషులు తమ తమ ఆశ్రమాలకు పయనమైనారు. 

    ఆ తర్వాత మామ దక్షుడికీ, అల్లుడు శివుడికీ ఒకరిపట్ల ఒకరికి ద్వేషం వర్థిల్లుతూనే చాలాకాలం దొర్లిపోయింది. అంతట్లో శివుడు లేకుండా యాగం మొదలుపెట్టి చేసినా చేయనట్లేనని దక్షుడికి తెలుసు. అయినాసరే, శివుడితో ముందునుంచి కొనసాగిస్తున్న వైరం వల్లా,  బ్రహ్మ దక్షుడిని ప్రజాపతులందరికీ ఏలికను చేయడం వల్ల దక్షుడిలో అహంభావం ఏర్పడింది. బ్రహ్మ నిష్ఠులైన ఈశ్వరాదులను లెక్కచేయక, దక్షుడు శివుడు లేని ' వాజపేయి ' యజ్ఞం చేశాడు. వాజపేయం అంటే, నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవకార్యం. ఆ తరువాత ' బృహస్పతి సవనం ' అనే పేరిట మరో యజ్ఞం చేయ తలపెట్టాడు. తిండి, తీర్థం, పలుకరింపులు ధర్మార్థ కర్మలుగా కాక, స్వార్థ కర్మలుగా ప్రవర్తింప జేసేది బృహస్పతి సవనం. అయినా వీటిని ప్రసాదించే దేవతలు ఈ సవనకర్తను దీవించడం సంప్రదాయం. ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో బ్రహ్మ ఋషులూ, ప్రజాపతులూ, నారదుని వంటి దేవ ఋషులు తమ భార్యలతో కలసి క్రమంగా ఎంతో ఆసక్తితో తరలివచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవనలు పలికారు. దక్షుడి యాగ దక్షిణలను యథార్హంగా స్వీకరించారు. 

    దక్షుడి కూతురు సతీదేవి తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పతనాన్ని, గంధర్వుల స్తోత్రాల కలకలాన్ని ఆసక్తితో చెవులార విన్నది. ఎంతో ఉత్సాహంతో ఆకాశం వైపు చూడగా అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలనే ఉబలాటంతో అన్ని వైపులనుంచి ప్రజలు తరలి వెడుతున్నారు. ఆ వేళలో మితిమించిన ఉత్కంఠతో తమ పతులతో జంటగా గగనచరులైన గంధర్వ, కిన్నర స్త్రీలు విమానాలలో పయనమై నింగికి పోతూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కన్నులారా తిలకిస్తున్న సతీదేవి తానూ ఆ సవనానికి భర్తయైన శివునితో సహా  వెళ్ళాలనుకున్నది. కానీ, శివుడు అందుకు ఒప్పుకొనక వద్దని వారించినా వినకుండా ఆమె తండ్రి యాగభూమికి వెళ్ళింది. అక్కడ తల్లి, సోదరీమణులు తప్ప తక్కిన వారెవరూ ఆమెను ఆదరించలేదు. శివుని పట్ల ద్రోహం చేశావని తండ్రిని ఆక్షేపించింది. అనేక రకాలుగా విమర్శించింది. చివరకు మౌనం పూని సతీదేవి నేలపై కూర్చొని యోగమార్గంలో శరీరాన్ని పరిత్యజించింది. ఆమె శరీరం యోగాగ్నిలో దగ్ధమయింది. అది చూసి రుద్ర పార్షదులు అంటే రుద్ర సహాయకులు దక్షుడిని హతమార్చడానికి ఉద్యమించారు. అందుకు ప్రతిగా భృగువు అభిచార హోమం చేశాడు. ఋభునామక దేవతలాభిర్భవించి రుద్రపార్షదులను పారదోలారు. 

    పిమ్మట నారదుని ద్వారా జరిగిన వృత్తాతం విని ఆ తొలిదైవం, ఆ రుద్రుడు, ఆ నీలగళుడు, ఆ గజాసురసంహారి పట్టలేని కోపంకొద్దీ మునిపళ్ళతో పెదవిని కొరికాడు. మత్తుగొన్న సింహంవలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపులవంటి అగ్నికీలల పరంపరల అన్వయ కాంతితో ప్రకాశిస్తున్నట్టి, అప్పటి కోపతీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను సర్రున పీకి భూమిపైన విసిరికొట్టాడు. ఆ జటనుంచి నల్లటి నిలువెత్తు రూపంతో లోకభయంకరుడుగా ఉన్న వీరభద్రుడు పుట్టుకొచ్చి, ఏమి చేయాలో తెలుపుమని శివుని అభ్యర్థించగా, దక్షవాటికకు పోయి శ్రద్ధాళువై యాగాన్ని భగ్నం చేయడంతో బాటు దక్షుడిని సంహరించు. దుర్లభమైన నా అంశాన జన్మనెత్తిన నీకు సాధ్యం కానిది ఏమీ ఉండదని శివుడు ఆజ్ఞాపించగా ఆ వీరభద్రుడు పట్టరానంత వేగంతో ఒక్క ఊపున కదిలాడు. శివప్రమథగణాలు రకరకాల ఆయుధాలను చేపట్టి వీరభద్రుడిని అనుసరించాయి. దక్షయాగ స్థలం చుట్టూ ఉన్న కంచెలను, నడవలను, ఇళ్ళ భాగాలను అస్తవ్యస్తం చేశారు. ప్రధాన యాగగృహం వెన్నుగాడిని భగ్నమొనర్చారు. ధర్మ గేహినులుండే పాకను, యాగ యజమాని పాకను, సభతీర్చే పాకను, అగ్నివహులైన ఋత్విక్కులుండే పాకను, వంటశాలలను పూర్తిగా ధ్వంసం చేశారు. యాగ పాత్రలను, వహ్నులను పాడుచేశారు. అగ్నిహోత్రాలను ఆర్పివేశారు. అగ్నిగుండాలలో మూత్రాన్ని విసర్జించారు. తీర్చిదిద్దిన వేదికల సోమసూత్రాలను తెంపివేశారు. మునులను కష్టపెట్టారు. మునిపత్నులను గజగజలాడించారు. ప్రమథగణములన్నీ జట్లుజట్లుగా యేర్పడి అలా చేస్తుంటే, భృగు ఋషిని మణిమంతుడూ, దక్షుడిని వీరభద్రుడూ, పూషుని చండీశుడూ, భగమునిని నందీశ్వరుడూ నిర్భంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, ఋత్విక్కుల వర్గాలపైకి రాళ్ళు విసరీ, మోకాళ్ళతో కుమ్మీ, అరచేతులతో చరచీ, మోచేతులతో పొడిచీ, పెక్కురకాలుగా పీడించారు. అక్కడి వారంతా భయంతో దిక్కుతోచక తలకొక దిక్కుకూ పరుగులు తీశారు. అప్పట్లో యాగవాటికలో దక్షుడు శివుని తిట్టిపోశాడు. అప్పుడు కనుసైగ చేసిన భగుని, ఇప్పుడు నందీశ్వరుడు పట్టికట్టేశాడు. రెండుకనులను పెరికివేశాడు. ఇదంతా చూస్తున్న జనంలో ఆర్తనాదాలు చెలరేగాయి. దక్షుడు శివుని దూషించినపుడు పూషుడు పల్లికిలిస్తూ నవ్వాడు. ఆ కారణంగా ఇప్పుడు పూషుడి దంతాలను చండీశుడు ఊడపీకాడు. ఆ సమయంలోనే మీసం, గడ్డం మెలిపెడుతూ నవ్విన భృగువును పట్టి వీరభద్రుడు ఆ ముఖ మీసం, గడ్డం మెలితిప్పి పెరికివేశాడు. ఇంకా ఆ వీరభద్రుడు విర్రవీగినవాడై దక్షుడిని ఆధీనం చేసుకొని అతని తలను తెగిపడేలా నరికివేశాడు. కోపం ఆపుకోలేక దక్షిణాగ్నికి ఆహుతి చేశాడు. 

    పిదప దేవతలు బ్రహ్మచెంతకు పోయి శివసైనికులవల్ల తమకు కలిగిన బాధలను వివరించారు. ఆయన శివుని తిరస్కరించటం తగదని చెప్పి, ఆయనను శరణు వేడమని హితముపదేశించాడు. బ్రహ్మ యితర దేవతలు కైలాసం చేరి అభవుని దర్శించి నమస్కరించారు. బ్రహ్మ శివుని వినుతించి దక్షాధ్వరాన్ని మరల ఉద్ధరించి దక్షుని బ్రతికించమని ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించి శివుడు, దగ్ధ శిరస్కుడైన దక్షుడు అజముఖుడగుగాక, అని చెప్పి ఆ దేవతలననుగ్రహించాడు. పిదప శివుడు బ్రహ్మాదులతో కూడి దక్షాధ్వర వాటికకు వెళ్ళాడు. ఆయన అనుగ్రహంతో క్షతగాత్రులందరూ పూర్వస్థితి పొందారు. దక్షుని మేషముఖుడిని చేయగా అతడు నిద్రమేల్కొన్నట్లు లేచి రుద్రుని స్తుతించి తనను క్షమించమని కోరాడు. ఆపై యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విష్ణు దేవతాకమైన కర్మ చేయగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆ దేవునికి భక్తితో మొక్కారు. పెక్కువిధాల స్తుతించారు. శ్రీహరి దక్షాధ్వరాన్ని ఏ కొరతా లేకుండా జరుగునట్లనుగ్రహించాడు. యజ్ఞానంతరం విష్ణువు మున్నగు వారంతా తమ తమ నెలవులకు వెళ్ళారు. యోగాగ్ని దగ్ధురాలైన సతి జన్మాంతరంలో హిమవంతుని కూతురుగా పుట్టింది. పూర్వదయితుడైన  రుద్రుడినే చేపట్టింది. 
    

20, మార్చి 2025, గురువారం

:: కుమారస్వామి ప్రభవాభి వర్ణనము ::

    ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరింపలేక ఆ అగ్ని సృష్టికర్తకు తెలుపగా, ఆ బ్రహ్మ దానిని గంగానదీగర్భంలో విడిచిపెట్టమనగా అతడు అట్లే చేశాడు. ఆ సమయంలో గంగానదిలో స్నానమాడుతున్న షట్ కృత్తికల గర్భాలలో ఆ తేజం ప్రవేశిస్తుంది. వారు గూడా ఆ రుద్రతేజాన్ని భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అందునుండి అప్పుడు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించి అగ్నిభవుడుగాను, గాంగేయుడుగాను, శరజన్ముడుగాను, కార్తికేయుడుగాను అయ్యాడు. బృహస్పతి వచ్చి అతడికి జాతకర్మాది ఆచారాలను జరిపి వెళ్ళాడు. ఆ కుమారుడు ఉత్తమమైన తపస్సు విహారంగా, భూమిదాదిగా ధనుర్వేదాది వేదాలు తనను సేవించగా వృద్ధిపొందాడు. 

    ఒకనాడు కుమారుడను చూచే ఆసక్తితో పరమేశ్వరుడు పార్వతితో విశేషబలాన్ని, శక్తినీ, అనేక విధాలయిన శరీరాలు కలిగిన ప్రమథగణాలు సేవించగా ఆ చోటునకు వచ్చారు. అప్పుడు బ్రహ్మ విష్ణులు, ఇంద్రాది దిక్పాలురు, ఏకాదశ రుద్ర ద్వాదశాదిత్య సప్తమరుత్తులు, అష్టవసువులు మొదలయిన సమస్త దేవతలును, గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధవిద్యాధర యక్షాది దివ్యులును, తాపసులును, ఇంకను పితృదేవతలును వారి పరివారంతో కూడి వచ్చారు. ఓషధులు, నదులు, సప్తసముద్రాలు, సప్తకులపర్వతాలు, మూర్తిమంతములై వచ్చాయి. ఈవిధంగా తనను చూడగా ఆసక్తులై వచ్చిన ఆ గొప్ప సమూహానికి ఎదురేగి యోగబలంతో కూడుకొన్న ఆ పసివాడు నాలుగు ఆకారాలతో శివుడు, పార్వతి, అగ్ని, గంగల వద్దకు వెళ్ళాడు. ఆప్పుడు ఆ నలుగురూ సంతోషంతోనూ, వినయంతోనూ తగువిధంగా బ్రహ్మవద్దకు వెళ్ళి మహనీయుడా! ఈ బాలుడి తేజోమయమూర్తికీ, గుణసంపదకూ తగిన గొప్ప పదవిని ఆలోచించి ఈయవలసినదని కోరగా, అందులకు బ్రహ్మ ప్రీతితో ఆ బాలుడు దేవతలకు ప్రియుడనే విషయాన్ని తెలుసుకొని, ' ఈతడు దేవసేనాపతి అగుగాక ' అని నిర్ణయించాడు. అక్కడి వారినంతా కలయజూచాడు. వారందరూ తెలుసుకొనేటట్లు ఆ విషయాన్ని చెప్పాడు. తరువాత అందరూ ఆ బాలుని సరస్వతీనదీ తీరానికి జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. 

    అన్ని రత్నాలను నింపిన దివ్య పీఠాన్ని పర్వతరాజైన హిమవంతుడు పెట్టగా దానిమీద ఆ భూతనాథుడి కుమారుడిని నిలిపి, బృహస్పతి హోమాదికాలు చేయగా ఈశానుడు, విష్ణుడు, బ్రహ్మ కౌశికులు మొదలైన దేవ ప్రముఖులు అభిషేక వస్తువులను సరస్వతి నది నీటితో నింపిన బంగారుమయమైన రత్నాలు తాపిన గిండీలను మోసుకొంటూ గంధర్వాప్సరోగణాలు సంగీతంతో మంగళాశీస్సులు పలుకగా, మహాముని సమూహాలు పుణ్యాహ వేదఘోషలతోను, పార్వతి, లక్ష్మి, సరస్వతి, శచి మొదలయిన ముత్తయిదువులు అక్షతలతో స్నానం చేయించి, సంతోషంతో సేనానాయకత్వానికి పట్టాభిషేకం చేసి ఆధిపత్యాన్ని అందించారు. మునుపాచోట దేవతలు జలాధిపతిగా వరుణుడిని అభిషేకించారు. ఆ వరుణాభిషేకం కంటే కుమారాభిషేకం ఒప్పింది. ఆ అగ్నిదేవ సంభవుడికి పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన ప్రభువులందరూ తమ తమ సేవకులందలి రూపాధిక్యాన్ని, బలాధిక్యాన్ని, పరాక్రమాధిక్యాన్ని కలవారిని ఎన్నుకొని, భీమ కంటాకర్ణ సంక్రమ దండధర సహితులయిన ఎందరో వీరులనొసగి,  వారితో కలసి తిరగటానికి తగినటువంటి సేనాంగాల సమూహాన్ని ఆ శక్తిమూర్తికి మారుబలంగా యిచ్చారు. ఆ సేనలు చిత్రాభరణ వర్మాయుధ ధారులుగా అనేక ప్రకారాకారులైన గజకర్ణ నికుంభ కుముదాదులైన సైనికులుగా యొప్పారు. ఆ సేనలో వైరి భయంకరులైన సప్త మాతృకా గణాలు ప్రభాసినీ విశాలాక్షీ పాలికా పురస్సరంగా నిలిచాయి. అటువంటి సమయంలో పరమేశ్వరుడు ఉదయభానుడికి సమానమైన కాంతిని, ఇంద్రుడు రాక్షసులను నాశనం చేయగల పరిపక్వమయిన శక్తిని, విష్ణుడు బలమును పెంచే వనమాలను, పార్వతి ఏ వేళలోనూ నాశనంకాని తెల్ల పట్టువస్త్రాల జతను, గంగాదేవి ప్రకాశవంతమైనదీ, అమృతంతో నిండినదీ అయిన కమండలాన్ని, బృహస్పతి వెలుగు దండాన్ని, గరుడుడు మహిమగల నెమలిని, వరుణుడు ఉదార రూపమైన కుక్కుటమును, కుబేరుడు పొగరుబోతు మేకను, స్రష్ట అందమైన జింకతోలును, సాటిలేని యుద్ధ విజయాన్ని ఆ షణ్ముఖుడికి ప్రేమతో యిచ్చారు. 

    ఈ విధంగా నిజరూపంతో వెలుగుతున్న వాడిని వదలకుండా చూచిన శివుడు ' ఈతడికి ఈ వైభవంతో సుఖంగా శ్రమలేకుండా రాక్షస వినాశం చేయటానికి సాధ్యమవుతుంది ' అని యోచించి ప్రమథగణాలతో నిండిన మహాసేనను ఇచ్చాడు. అపుడు ఇంద్రుడు మొదలయిన దేవతలు తమ బలాలతో నెమలి వాహనంగా కలిగిన కుమారస్వామిచుట్టూ చేరారు. శంఖం, భేరి, పణవం, గోముఖం మొదలైన తూర్య శబ్దాలు దిక్కులనిండా వ్యాపించాయి. అటువంటి శక్తివంతమైన సుర సైన్యానికి నాయకుడుగా ఆ మహాసేనుడు దేవతలను చూచి ' మీరెవరినైనా చంపటంకాని, నాశనం చేయటం గాని చేయవలసి ఉన్నదా? అటువంటి బలవంతులైన శత్రువులను నాశనం చేస్తాను ' అని మాట యిచ్చాడు. వారంతా చాలా ఆనందించారు. సేన చేసిన సింహనాదానికి ముల్లోకాలు నాదమయములయ్యాయి. ఆ విధంగా విశాఖుని ఉన్నత స్థానంలో నిలిపి బ్రహ్మ విష్ణు శివులు తమకు నచ్చిన చోటులకు వెళ్ళారు. ఆపై షణ్ముఖుడు దేవతలు తారకుడి వలన బాధపడటం తెలుసుకొని తారకునిపైకి దండెత్తినాడు. బలవంతుడైన తారకుడు పలువురు రాక్షస సైనికులతో శౌర్యంతో ఎదురువచ్చాడు. ఆ సేనలు రెంటికి ఆశ్చర్యం కలిగించే యుద్ధం జరిగింది. 

    కుమారస్వామి యొక్క మహత్త్వశక్తిగల అస్త్రం నుండి అనేక కోట్ల శక్తులు పుట్టి, నానా రాక్షస సమూహాలను అలయజేశాయి. ఆ శక్తినుండి అనేకాగ్ని గోళాల పిడుగుల గుంపు మ్రోత క్రమ్ముకోగా, అది ఎందరో దానవ సేనా నాయకులను హతమార్చింది. దేవ సేనలు ఉత్సాహంతో రాక్షస సేనలను తెగటార్చాయి. ఆ బాలుడు శక్త్యాయుధాన్ని వేయగా అది శత్రువులను రూపుమాపి తిరిగి అతడి చేతిలోనికి వస్తూ ఉన్నది. ఆ విధంగా తనవారు చావగా తారకుడు కోపంతో ఆ గుహుడుని తాకి, బలయుతమైన అతడి శక్యాయుధపు దెబ్బకు పడిపోయాడు. ఆ కార్తికేయుడు విజయంతో వెలిగాడు. దేవతలంతా ఆనందించారు. ఆ మీదట క్రౌంచపర్వతాన్ని తన ఉనికిగా చేసుకొని లోకభయంకరుడయి, దేవతలను అమితంగా బాధించే బలిచక్రవర్తి కుమారుడైన బాణుడన్న రాక్షస రాజును గూడా కుమారస్వామి వధించాడు. ఈ విధంగా ముల్లోకాలకూ సంతోషాన్ని కలిగించినవాడై విజయైశ్వర్యంతో ప్రకాశించాడు. సమస్త లోకాలూ గౌరవించవలసిన ఆ ఆరుముఖాల వాడి గాథలు వింటే ధన్యత్వం కలుగుతుంది. 

13, మార్చి 2025, గురువారం

:: మధుకైటభుల వృత్తాంతము ::  

    ఒకప్పుడు సమస్తలోకాలూ మహాప్రళయ కాలంలో జలమయమై పోయాయి. ఎక్కడా భూమి జాడే లేదు. సృష్టిలో ఏ  ప్రాణీలేదు. దేవదేవుడైన శ్రీమహావిష్ణువు ఒక్కడూ మిగిలి శేషపర్యంకం మీద యోగనిద్రలో ఉన్నాడు. గాఢనిద్రలో ఉన్న ఆయన కర్ణముల నుండి  గులిమి జారి పడింది. ఆ గులిమి ఉండలనుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు అసురులు జన్మించారు. అక్కడే సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలవంతులుగా తయారయ్యారు. అన్నదమ్ములవలె సంచరిస్తూ సముద్ర జలాల్లోనే అటూ ఇటూ ఈదులాడుతూ మెలిగారు. తమ ఆహారం కొరకు వివిధ రకాలైన జలచరాలను చంపేవారు. 

    కాలక్రమేణా పెద్దయ్యాక, భారీ శరీరాలు, మరియు తగిన సాధారణ జ్ఞానం కలిగిన ఆ రాక్షస సోదరులు తమకు జన్మనిచ్చిన ఒక భారీ శక్తి  ఉందని గ్రహించారు. గాలినుండి వారు వాగ్బీజమనే  బీజమంత్రపు శబ్దాన్ని విన్నారు. శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెఱుపు మెరిసింది.  వారికి వినిపించిన వాగ్బీజం ఒక మహామంత్రమని వారిద్దరూ గ్రహించారు. నిరాహారులై, జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాలపాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. వారి నిష్ఠకు మెచ్చుకున్నది పరాశక్తి. ప్రసన్నురాలై దర్శనమిచ్చింది. వరం కోరుకొమ్మంది.. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తథాస్తు అంది. 

    దేవీ వరంతో అహంకరించి, పద్మాసనం మీద కూర్చుని నిశ్శబ్దంగా జపం చేసుకుంటున్న బ్రహ్మదేవుని చెంతకేగి ఇద్దరూ మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే మాకు పద్మాసనం అందించి ఎక్కడికైనా వెళ్ళిపొమ్మన్నారు. బలవంతులదే ఈ ఆసనం. ఇది వీర భోజ్యం. నీవు దుర్బలుడవు అని ప్రకటించారు. వారు అజేయులని గ్రహించి, బ్రహ్మ సామ దాన భేద దండో పాయములను ప్రయోగించి సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. కానీ, సఫలీకృతుడు కాలేక పోయాడు. చివరకు యోగనిద్రలో నిశ్చలంగా ఉన్న విష్ణుమూర్తి దరికి చేరి ప్రార్థించాడు బ్రహ్మ. నారాయణుడు ఎంతకీ నిద్రనుండి మేల్కాంచలేదు. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువును మేల్కొల్పమని యోగనిద్రాదేవిని స్తుతించాడు. ఆమె శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. నిద్రలేచిన హరి ఎదురుగా భయంతో నిలుచున్న బ్రహ్మను చూచి తపస్సు మాని ఇక్కడకు వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో స్వామీ! నీ చెవిలోని గులిమినుండి మధుకైటభులనే రాక్షసులు ప్రాదుర్భవించి నా ఆసనాన్ని కోరుతూ నన్ను చంపబోయారు. వారు ఘోరమైన రూపంతో అతిశయిస్తూ మహాబలశాలురై ఉన్నారు. వారినుంచి దయతో నన్ను కాపాడు. నా భయాన్ని పూర్తిగా తొలగించి ఆదుకోమని కోరాడు. ఆ వెంటనే విష్ణుమూర్తి మధుకైటభులను తనతో పోరాడమని ఆహ్వానించాడు. పోరాటం అయిదువేల సంవత్సరాల కాలం కొనసాగింది. కానీ, స్పష్టమైన ఫలితం లేకుండా పోయింది. విష్ణుమూర్తి  అలసట చెందాడు. వాళ్ళిద్దరిలోనూ అలసటే లేదు. కారణం ఏమై ఉంటుందా అని కించిత్ ఆలోచనలో పడ్డాడు శ్రీహరి. 

    మధుకైటభులు విజయ గర్వంతో సంబరపడ్డారు. విష్ణువుతో గంభీరంగా ఇలా అన్నారు. హే విష్ణూ! అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే, మాకు శిరసు వంచి నమస్కరించు. దాసుడనని ప్రకటించు. కాదంటే, సమర్ధుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి, తరువాత ఈ నాలుగు ముఖాలవాడైన బ్రహ్మను గూడా చంపుతామన్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు సాదరమైన మధుర వచనములతో ఈ విధంగా పలికాడు. అలసిన వారిని, భయపడిన వారిని, ఆయుధం విడిచి పెట్టిన వారిని, క్రింద పడిన వారిని, పిల్లలను వీరులైన వారు చంపరు. ఇది సనాతన నీతి. అయిదువేల సంవత్సరాలు మీతో యుద్ధం చేసి అలసిపోయాను. మీరిద్దరూ సమాన బలశాలురు. సోదరులైన మీరు మధ్య మధ్య విశ్రాంతి తీసుకొంటూ యుద్ధం చేస్తున్నారు. నాకు విరామం లేదు. నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకునే వరకు మీరు యుద్ధం ఆపండి. తదనంతరం యుద్ధారంభం చేద్దామన్నాడు. శ్రీహరి అలా అనగానే సరే, కానిమ్మన్నారు, మధుకైటభులు. వాసుదేవుడు గాఢంగా ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వారిది స్వేచ్ఛా మరణమని, దేవి ఆ వరం ప్రసాదించిందనీ గ్రహించాడు. వెంటనే ఆ పరాశక్తిని శరణు వేడుతూ నమస్కరించాడు. 

    పరాశక్తి ప్రసన్నురాలు అయింది. చిన్నగా నవ్వుతూ శౌరితో ఇలా అన్నది. హరీ! మరలా యుద్ధం చెయ్యి. ఈ రాక్షసులను మోసగించి వధించాలి. వేరొక దారి లేదు. నేను వంకర చూపులతో వారిని సమ్మోహ పరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు వారిని మట్టుబెట్టు అంది. అన్నట్టుగానే జగదాంబ తన మాయతో మధుకైటభుల ఎదుట ఒక దివ్య సుందరిగా ప్రత్యక్షమయింది. మన్మధ శరముల వంటి దృక్కులతో రాక్షస వీరులను చూసి అందంగా నవ్వింది. ఆ జగదాంబ అపూర్వ సౌందర్యాన్ని గమనించి మోహపరవశులై పోయారు వారు. ఏ తల్లి దయతో వారికి స్వేచ్ఛా మరణ వరం లభించిందో ఆ తల్లినే మాయకు లోనై కాముక దృష్టితో చూశారు. తమను తామే మరచి పోయారు. వారి మోహావేశాన్ని కనిపెట్టాడు మహావిష్ణువు. వెంటనే, వారితో ఓ మధుకైటభులారా! మీ యుద్ధ నైపుణ్యం, పటిమ నన్ను అమితంగా సంతోషపెట్టాయి. మెచ్చాను. కోరుకోండి. కోరిన వరాలనిస్తాను అని అన్నాడు. అలా అనగానే సుందరీమణి సన్నిధానంలో తన గొప్పతనం చాటడానికి శ్రీహరి అలా అంటున్నాడని భావించి, మూర్ఖులైన ఆ రాక్షస సోదరులు కాముకత, అహంకారం, దురభిమానం అన్నీ ఏకమై మూఢత్వంతో అతిశయిస్తూ శ్రీమహావిష్ణువుతో ఇలా అన్నారు. అపూర్వ సుందరీమణి సన్నిధిలో నీ గొప్పదనం చాటటానికి ఇలా అంటున్నావు. కాని, మాకు వరాలనిచ్చే శక్తి నీ కెక్కడిది? మేము భిక్షుకులం కాదు. నీకే వరాల నియ్యగల దిట్టలం. ఏమి కావాలో కోరుకో, ఇస్తాం అన్నారు. అయితే, దానవులారా! మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వధ్యులు కావాలి. రమాపతి అలా కోరే సరికి మధుకైటభులు ఆశ్చర్యపోయారు. వంచితుల మయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. 

    జనార్దనా! ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు. గుర్తుందిగా. మాట మార్చకు. నీకు మేము వంధ్యుల మవుతాము. కాకపోతే, నిర్జలమైన విశాల ప్రదేశంలో నిర్జించాలి. అదే, నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా. నెరవేర్చు అన్నారు. ఆ నియమానికి శ్రీహరి నవ్వుకొన్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్ములను సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీటిమీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా! ఈ తొడ మీద నీరు లేదు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి, అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జఘన భాగాన్ని రెండువేల యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులూ ఖండించాడు. తలలూ, మొండాలూ తొడలమీద రాలిపడ్డాయి. మధుకైటభులు నిహతులయ్యారు. వారి కళేబరాలనుంచి మేదస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని అంటే, భూమి అయింది. అందుకనే మృత్తిక, అదే, మట్టి తినరానిదయింది. 

    
     

   

    

1, మార్చి 2025, శనివారం

:: జడభరతుడు :: 

    భరతుడు ఆంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణునకు కుమారుడుగా పుట్టాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వలన ఆయనకు తొమ్మిదిమంది పుత్రులు, రెండవ భార్య వలన కవల సంతానంగా ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలిగారు. కవల సంతానములోని మగ శిశువే భరతుడు. భరతుని తండ్రి అయిన ఆ బ్రాహ్మణుడు వేదాధ్యయన సంపన్నుడు, సుగుణ గరిష్ఠుడు, నీతికోవిదుడు. భరతుడు పుట్టినది మొదలు సంసారబంధాలకు దూరంగా ఉంటూ, అచ్యుతుడు, సర్వేశ్వరుడూ అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ కాలం గడపసాగాడు. పూర్వజన్మ స్మృతులవల్ల భరతుడు బంధ విముక్తికోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా జనులకు కనిపిస్తూ జీవితం గడిపినాడు. అందువల్ల ఆ తరువాత అతడు జడభరతుడన్న పేరుతో ప్రసిద్ధిచెందాడు. 

    బ్రాహ్మణ కుమారుడైన జడభరతుడికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కాబట్టి వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి వానికి ఉపనయనంచేసి, గాయత్రీమంత్రోపదేశం చేసి, వేదాధ్యయనం చేయించి, వానికి వానిపట్ల అభినివేశం లేకపోవడం గమనించి తన కోరిక నెరవేరలేదని నిరాశ పడ్డాడు. కొంతకాలానికి ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోక గతుడైనాడు. తండ్రి పోగానే తల్లి సహగమనం చేసింది. సవతి పిల్లలు అవినీతిపరులు. అందువల్ల వారికి భరతుని గొప్పదనం తెలియలేదు. తండ్రి మరణానంతరం సవతి తల్లి పిల్లలు భరతుణ్ణి చదువనీయకుండా ఇంటిపనులు, పొలంపనులు చేయమని శాసించేవారు. ఆ పనులు చేస్తూ భరతుడు ఏ విషయంలోనూ ఆసక్తి లేకుండా ద్వంద్వాలలో సమబుద్ధి కలవాడై, వారేమి తిట్టినా పట్టించుకోకుండా కాలం గడిపాడు. అతడు పనిచేసే పొలానికి సమీపంలో ఒక నగరం ఉంది. దాని నాయకుడు భిల్లరాజు. వానికి సంతానం లేదు. సంతానం కోసం కాళికాదేవిని పూజించి, ఆమెకు బలి యివ్వాలని నిశ్చయించుకున్నాడు. కాళికాదేవికి బలి యివ్వటానికి ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకొని వెడుతూ ఉంటే ఆ మనిషి తప్పించుకొని పారిపోయాడు. వాడు ఎంత వెదికినా దొరకలేదు. అప్పుడు భిల్లరాజు భటులు పొలంలో వీరాసనంలో ధ్యానం చేస్తున్న భరతుణ్ణి చూచి బలికి బలిపశువు దొరికిందని కాళికాలయానికి తీసుకుపోయి బలి యివ్వబోగా సాక్షాద్విష్ణు స్వరూపం అయిన భరతుణ్ణి చూచి కాళికాదేవి బోయరాజు మీద, భటుల మీద విజృభించి వారి శిరస్సులు నేలకూల్చింది. తరువాత జడభరతుడు పొలం దగ్గరకు వచ్చి పూర్వంలా కాపలా కాస్తున్నాడు. ఇలా సంవత్సరాలు గడిచాయి. 

    ఒకసారి సింధు దేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజు కపిలముని దగ్గర ఆత్మవిద్య తెలుసుకోవాలని బుద్ధిపుట్టి ఇక్షుమతీ నదీతీరంలోని కపిలమునిని దర్శించటానికి పల్లకీ ఎక్కి వెడుతున్నాడు. పల్లకీమోసే బోయీలకు పొలాన్ని కాపలాకాసే బలవంతుడైన భరతుడు పల్లకీ మోయటానికి బాగుంటాడని అతనిని తీసుకువచ్చి పల్లకీ బొంగు అతని భుజంమీద పెట్టారు. అలవాటులేని, ఆసక్తిలేని భరతుడు నడుస్తున్నాడు. మిగిలిన బోయీలకు ఇతని నడకతో జత కుదరలేదు. ఎగుడు దిగుడుగా పల్లకి నడుస్తుంటే రాజుకు కోపంవచ్చి బోయీలను మందలించాడు. వారు భరతుడు సరిగా నడవటం లేదని చెప్పారు. రహూగణునకు కోపం వచ్చి బ్రహ్మతేజస్సుతో, నివురుగప్పిన నిప్పులా ఉన్న భరతుణ్ణి నిందించాడు. భరతుడు మారు చెప్పకుండా పల్లకీ మోస్తూనే ఉన్నాడు. భరతునకు తనకిది చివరి జన్మమని తెలుసు. అహంకార మమకారాలకు మనస్సులో అవకాశం యివ్వలేదు. అతడు జ్ఞాని, పరబ్రహ్మస్వరూపుడు. రహూగణుడు పల్లకి ఎగుడు దిగుడుగా పోతుంటే పిచ్చికోపంతో అరిచాడు. ఓరీ! పొగరుబోతా! నడపీనుగా! నీ కుంటి నడకను వదిలించి సరిఅయిన మార్గంలో నడిపిస్తాను అని కారుకూతలు కూసాడు. అది విని భరతుడు ఓ రాజా! నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే గాని నాకేమాత్రం కాదు. జీవన్మృతుడను. నేను మాత్రమే కాదు. జనన మరణాలు కల్గిఉండే వారందరూ జీవన్మృతులే. యజమాని సేవకుడు అనే సంబంధం కర్మవల్ల కలిగింది. " నేను రాజును గదా!" అనే అభిమానంతో నీవు ఆజ్ఞాపించావు. " నీవు మదోన్మత్తుడవై ఉన్నావు. మూగవాడు, పిచ్చివాడు, గుడ్డివాడు ఎలాగో, నేనూ అంతే! జడుడను, మృతుడను అయిన నాకు శిక్ష విధించిన నీ శ్రమ వ్యర్థం " అని చెప్పి పల్లకి ఎప్పటిలాగే మోయసాగాడు. రహూగణుడు భరతుని శాస్త్ర సమ్మతములైన వాక్యాలను విన్నాడు. అహంకారం తొలగింది. బ్రాహ్మణునకు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు. అవధూతలా కనిపిస్తున్నావు. నిగూఢమైన విజ్ఞాన రహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీవు లోకులను పరీక్షించటం కోసం ఎవరూ గుర్తించటానికి వీలుకాని ఆకారంలో తిరుగుతున్న కపిల మహామునీంద్రుడనే అనుకుంటున్నాను, అని రాజు రహూగణుడు బ్రాహ్మణుని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాడు. సంసారమనే అడవిలోని కష్టాలను, దు:ఖాలను సవివరంగా చెప్పగా సింధు దేశాధిపతి రహూగణుడు భరతుడికి నమస్కారం చేశాడు. మీరు జ్ఞానులు. మీ సాంగత్యంతో నాకు తత్త్వం బోధపడింది. దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అన్నాడు. ఇలా ఈ జడభరతుని చరిత్ర వినిపించిన వారినీ, విన్నవారినీ శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారు స్వర్గసుఖం అనుభవిస్తారు. 

    

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...