20, మార్చి 2025, గురువారం

:: కుమారస్వామి ప్రభవాభి వర్ణనము ::

    ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరింపలేక ఆ అగ్ని సృష్టికర్తకు తెలుపగా, ఆ బ్రహ్మ దానిని గంగానదీగర్భంలో విడిచిపెట్టమనగా అతడు అట్లే చేశాడు. ఆ సమయంలో గంగానదిలో స్నానమాడుతున్న షట్ కృత్తికల గర్భాలలో ఆ తేజం ప్రవేశిస్తుంది. వారు గూడా ఆ రుద్రతేజాన్ని భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అందునుండి అప్పుడు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించి అగ్నిభవుడుగాను, గాంగేయుడుగాను, శరజన్ముడుగాను, కార్తికేయుడుగాను అయ్యాడు. బృహస్పతి వచ్చి అతడికి జాతకర్మాది ఆచారాలను జరిపి వెళ్ళాడు. ఆ కుమారుడు ఉత్తమమైన తపస్సు విహారంగా, భూమిదాదిగా ధనుర్వేదాది వేదాలు తనను సేవించగా వృద్ధిపొందాడు. 

    ఒకనాడు కుమారుడను చూచే ఆసక్తితో పరమేశ్వరుడు పార్వతితో విశేషబలాన్ని, శక్తినీ, అనేక విధాలయిన శరీరాలు కలిగిన ప్రమథగణాలు సేవించగా ఆ చోటునకు వచ్చారు. అప్పుడు బ్రహ్మ విష్ణులు, ఇంద్రాది దిక్పాలురు, ఏకాదశ రుద్ర ద్వాదశాదిత్య సప్తమరుత్తులు, అష్టవసువులు మొదలయిన సమస్త దేవతలును, గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధవిద్యాధర యక్షాది దివ్యులును, తాపసులును, ఇంకను పితృదేవతలును వారి పరివారంతో కూడి వచ్చారు. ఓషధులు, నదులు, సప్తసముద్రాలు, సప్తకులపర్వతాలు, మూర్తిమంతములై వచ్చాయి. ఈవిధంగా తనను చూడగా ఆసక్తులై వచ్చిన ఆ గొప్ప సమూహానికి ఎదురేగి యోగబలంతో కూడుకొన్న ఆ పసివాడు నాలుగు ఆకారాలతో శివుడు, పార్వతి, అగ్ని, గంగల వద్దకు వెళ్ళాడు. ఆప్పుడు ఆ నలుగురూ సంతోషంతోనూ, వినయంతోనూ తగువిధంగా బ్రహ్మవద్దకు వెళ్ళి మహనీయుడా! ఈ బాలుడి తేజోమయమూర్తికీ, గుణసంపదకూ తగిన గొప్ప పదవిని ఆలోచించి ఈయవలసినదని కోరగా, అందులకు బ్రహ్మ ప్రీతితో ఆ బాలుడు దేవతలకు ప్రియుడనే విషయాన్ని తెలుసుకొని, ' ఈతడు దేవసేనాపతి అగుగాక ' అని నిర్ణయించాడు. అక్కడి వారినంతా కలయజూచాడు. వారందరూ తెలుసుకొనేటట్లు ఆ విషయాన్ని చెప్పాడు. తరువాత అందరూ ఆ బాలుని సరస్వతీనదీ తీరానికి జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. 

    అన్ని రత్నాలను నింపిన దివ్య పీఠాన్ని పర్వతరాజైన హిమవంతుడు పెట్టగా దానిమీద ఆ భూతనాథుడి కుమారుడిని నిలిపి, బృహస్పతి హోమాదికాలు చేయగా ఈశానుడు, విష్ణుడు, బ్రహ్మ కౌశికులు మొదలైన దేవ ప్రముఖులు అభిషేక వస్తువులను సరస్వతి నది నీటితో నింపిన బంగారుమయమైన రత్నాలు తాపిన గిండీలను మోసుకొంటూ గంధర్వాప్సరోగణాలు సంగీతంతో మంగళాశీస్సులు పలుకగా, మహాముని సమూహాలు పుణ్యాహ వేదఘోషలతోను, పార్వతి, లక్ష్మి, సరస్వతి, శచి మొదలయిన ముత్తయిదువులు అక్షతలతో స్నానం చేయించి, సంతోషంతో సేనానాయకత్వానికి పట్టాభిషేకం చేసి ఆధిపత్యాన్ని అందించారు. మునుపాచోట దేవతలు జలాధిపతిగా వరుణుడిని అభిషేకించారు. ఆ వరుణాభిషేకం కంటే కుమారాభిషేకం ఒప్పింది. ఆ అగ్నిదేవ సంభవుడికి పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన ప్రభువులందరూ తమ తమ సేవకులందలి రూపాధిక్యాన్ని, బలాధిక్యాన్ని, పరాక్రమాధిక్యాన్ని కలవారిని ఎన్నుకొని, భీమ కంటాకర్ణ సంక్రమ దండధర సహితులయిన ఎందరో వీరులనొసగి,  వారితో కలసి తిరగటానికి తగినటువంటి సేనాంగాల సమూహాన్ని ఆ శక్తిమూర్తికి మారుబలంగా యిచ్చారు. ఆ సేనలు చిత్రాభరణ వర్మాయుధ ధారులుగా అనేక ప్రకారాకారులైన గజకర్ణ నికుంభ కుముదాదులైన సైనికులుగా యొప్పారు. ఆ సేనలో వైరి భయంకరులైన సప్త మాతృకా గణాలు ప్రభాసినీ విశాలాక్షీ పాలికా పురస్సరంగా నిలిచాయి. అటువంటి సమయంలో పరమేశ్వరుడు ఉదయభానుడికి సమానమైన కాంతిని, ఇంద్రుడు రాక్షసులను నాశనం చేయగల పరిపక్వమయిన శక్తిని, విష్ణుడు బలమును పెంచే వనమాలను, పార్వతి ఏ వేళలోనూ నాశనంకాని తెల్ల పట్టువస్త్రాల జతను, గంగాదేవి ప్రకాశవంతమైనదీ, అమృతంతో నిండినదీ అయిన కమండలాన్ని, బృహస్పతి వెలుగు దండాన్ని, గరుడుడు మహిమగల నెమలిని, వరుణుడు ఉదార రూపమైన కుక్కుటమును, కుబేరుడు పొగరుబోతు మేకను, స్రష్ట అందమైన జింకతోలును, సాటిలేని యుద్ధ విజయాన్ని ఆ షణ్ముఖుడికి ప్రేమతో యిచ్చారు. 

    ఈ విధంగా నిజరూపంతో వెలుగుతున్న వాడిని వదలకుండా చూచిన శివుడు ' ఈతడికి ఈ వైభవంతో సుఖంగా శ్రమలేకుండా రాక్షస వినాశం చేయటానికి సాధ్యమవుతుంది ' అని యోచించి ప్రమథగణాలతో నిండిన మహాసేనను ఇచ్చాడు. అపుడు ఇంద్రుడు మొదలయిన దేవతలు తమ బలాలతో నెమలి వాహనంగా కలిగిన కుమారస్వామిచుట్టూ చేరారు. శంఖం, భేరి, పణవం, గోముఖం మొదలైన తూర్య శబ్దాలు దిక్కులనిండా వ్యాపించాయి. అటువంటి శక్తివంతమైన సుర సైన్యానికి నాయకుడుగా ఆ మహాసేనుడు దేవతలను చూచి ' మీరెవరినైనా చంపటంకాని, నాశనం చేయటం గాని చేయవలసి ఉన్నదా? అటువంటి బలవంతులైన శత్రువులను నాశనం చేస్తాను ' అని మాట యిచ్చాడు. వారంతా చాలా ఆనందించారు. సేన చేసిన సింహనాదానికి ముల్లోకాలు నాదమయములయ్యాయి. ఆ విధంగా విశాఖుని ఉన్నత స్థానంలో నిలిపి బ్రహ్మ విష్ణు శివులు తమకు నచ్చిన చోటులకు వెళ్ళారు. ఆపై షణ్ముఖుడు దేవతలు తారకుడి వలన బాధపడటం తెలుసుకొని తారకునిపైకి దండెత్తినాడు. బలవంతుడైన తారకుడు పలువురు రాక్షస సైనికులతో శౌర్యంతో ఎదురువచ్చాడు. ఆ సేనలు రెంటికి ఆశ్చర్యం కలిగించే యుద్ధం జరిగింది. 

    కుమారస్వామి యొక్క మహత్త్వశక్తిగల అస్త్రం నుండి అనేక కోట్ల శక్తులు పుట్టి, నానా రాక్షస సమూహాలను అలయజేశాయి. ఆ శక్తినుండి అనేకాగ్ని గోళాల పిడుగుల గుంపు మ్రోత క్రమ్ముకోగా, అది ఎందరో దానవ సేనా నాయకులను హతమార్చింది. దేవ సేనలు ఉత్సాహంతో రాక్షస సేనలను తెగటార్చాయి. ఆ బాలుడు శక్త్యాయుధాన్ని వేయగా అది శత్రువులను రూపుమాపి తిరిగి అతడి చేతిలోనికి వస్తూ ఉన్నది. ఆ విధంగా తనవారు చావగా తారకుడు కోపంతో ఆ గుహుడుని తాకి, బలయుతమైన అతడి శక్యాయుధపు దెబ్బకు పడిపోయాడు. ఆ కార్తికేయుడు విజయంతో వెలిగాడు. దేవతలంతా ఆనందించారు. ఆ మీదట క్రౌంచపర్వతాన్ని తన ఉనికిగా చేసుకొని లోకభయంకరుడయి, దేవతలను అమితంగా బాధించే బలిచక్రవర్తి కుమారుడైన బాణుడన్న రాక్షస రాజును గూడా కుమారస్వామి వధించాడు. ఈ విధంగా ముల్లోకాలకూ సంతోషాన్ని కలిగించినవాడై విజయైశ్వర్యంతో ప్రకాశించాడు. సమస్త లోకాలూ గౌరవించవలసిన ఆ ఆరుముఖాల వాడి గాథలు వింటే ధన్యత్వం కలుగుతుంది. 

13, మార్చి 2025, గురువారం

:: మధుకైటభుల వృత్తాంతము ::  

    ఒకప్పుడు సమస్తలోకాలూ మహాప్రళయ కాలంలో జలమయమై పోయాయి. ఎక్కడా భూమి జాడే లేదు. సృష్టిలో ఏ  ప్రాణీలేదు. దేవదేవుడైన శ్రీమహావిష్ణువు ఒక్కడూ మిగిలి శేషపర్యంకం మీద యోగనిద్రలో ఉన్నాడు. గాఢనిద్రలో ఉన్న ఆయన కర్ణముల నుండి  గులిమి జారి పడింది. ఆ గులిమి ఉండలనుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు అసురులు జన్మించారు. అక్కడే సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలవంతులుగా తయారయ్యారు. అన్నదమ్ములవలె సంచరిస్తూ సముద్ర జలాల్లోనే అటూ ఇటూ ఈదులాడుతూ మెలిగారు. తమ ఆహారం కొరకు వివిధ రకాలైన జలచరాలను చంపేవారు. 

    కాలక్రమేణా పెద్దయ్యాక, భారీ శరీరాలు, మరియు తగిన సాధారణ జ్ఞానం కలిగిన ఆ రాక్షస సోదరులు తమకు జన్మనిచ్చిన ఒక భారీ శక్తి  ఉందని గ్రహించారు. గాలినుండి వారు వాగ్బీజమనే  బీజమంత్రపు శబ్దాన్ని విన్నారు. శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెఱుపు మెరిసింది.  వారికి వినిపించిన వాగ్బీజం ఒక మహామంత్రమని వారిద్దరూ గ్రహించారు. నిరాహారులై, జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాలపాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. వారి నిష్ఠకు మెచ్చుకున్నది పరాశక్తి. ప్రసన్నురాలై దర్శనమిచ్చింది. వరం కోరుకొమ్మంది.. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తథాస్తు అంది. 

    దేవీ వరంతో అహంకరించి, పద్మాసనం మీద కూర్చుని నిశ్శబ్దంగా జపం చేసుకుంటున్న బ్రహ్మదేవుని చెంతకేగి ఇద్దరూ మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే మాకు పద్మాసనం అందించి ఎక్కడికైనా వెళ్ళిపొమ్మన్నారు. బలవంతులదే ఈ ఆసనం. ఇది వీర భోజ్యం. నీవు దుర్బలుడవు అని ప్రకటించారు. వారు అజేయులని గ్రహించి, బ్రహ్మ సామ దాన భేద దండో పాయములను ప్రయోగించి సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. కానీ, సఫలీకృతుడు కాలేక పోయాడు. చివరకు యోగనిద్రలో నిశ్చలంగా ఉన్న విష్ణుమూర్తి దరికి చేరి ప్రార్థించాడు బ్రహ్మ. నారాయణుడు ఎంతకీ నిద్రనుండి మేల్కాంచలేదు. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువును మేల్కొల్పమని యోగనిద్రాదేవిని స్తుతించాడు. ఆమె శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. నిద్రలేచిన హరి ఎదురుగా భయంతో నిలుచున్న బ్రహ్మను చూచి తపస్సు మాని ఇక్కడకు వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో స్వామీ! నీ చెవిలోని గులిమినుండి మధుకైటభులనే రాక్షసులు ప్రాదుర్భవించి నా ఆసనాన్ని కోరుతూ నన్ను చంపబోయారు. వారు ఘోరమైన రూపంతో అతిశయిస్తూ మహాబలశాలురై ఉన్నారు. వారినుంచి దయతో నన్ను కాపాడు. నా భయాన్ని పూర్తిగా తొలగించి ఆదుకోమని కోరాడు. ఆ వెంటనే విష్ణుమూర్తి మధుకైటభులను తనతో పోరాడమని ఆహ్వానించాడు. పోరాటం అయిదువేల సంవత్సరాల కాలం కొనసాగింది. కానీ, స్పష్టమైన ఫలితం లేకుండా పోయింది. విష్ణుమూర్తి  అలసట చెందాడు. వాళ్ళిద్దరిలోనూ అలసటే లేదు. కారణం ఏమై ఉంటుందా అని కించిత్ ఆలోచనలో పడ్డాడు శ్రీహరి. 

    మధుకైటభులు విజయ గర్వంతో సంబరపడ్డారు. విష్ణువుతో గంభీరంగా ఇలా అన్నారు. హే విష్ణూ! అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే, మాకు శిరసు వంచి నమస్కరించు. దాసుడనని ప్రకటించు. కాదంటే, సమర్ధుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి, తరువాత ఈ నాలుగు ముఖాలవాడైన బ్రహ్మను గూడా చంపుతామన్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు సాదరమైన మధుర వచనములతో ఈ విధంగా పలికాడు. అలసిన వారిని, భయపడిన వారిని, ఆయుధం విడిచి పెట్టిన వారిని, క్రింద పడిన వారిని, పిల్లలను వీరులైన వారు చంపరు. ఇది సనాతన నీతి. అయిదువేల సంవత్సరాలు మీతో యుద్ధం చేసి అలసిపోయాను. మీరిద్దరూ సమాన బలశాలురు. సోదరులైన మీరు మధ్య మధ్య విశ్రాంతి తీసుకొంటూ యుద్ధం చేస్తున్నారు. నాకు విరామం లేదు. నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకునే వరకు మీరు యుద్ధం ఆపండి. తదనంతరం యుద్ధారంభం చేద్దామన్నాడు. శ్రీహరి అలా అనగానే సరే, కానిమ్మన్నారు, మధుకైటభులు. వాసుదేవుడు గాఢంగా ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వారిది స్వేచ్ఛా మరణమని, దేవి ఆ వరం ప్రసాదించిందనీ గ్రహించాడు. వెంటనే ఆ పరాశక్తిని శరణు వేడుతూ నమస్కరించాడు. 

    పరాశక్తి ప్రసన్నురాలు అయింది. చిన్నగా నవ్వుతూ శౌరితో ఇలా అన్నది. హరీ! మరలా యుద్ధం చెయ్యి. ఈ రాక్షసులను మోసగించి వధించాలి. వేరొక దారి లేదు. నేను వంకర చూపులతో వారిని సమ్మోహ పరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు వారిని మట్టుబెట్టు అంది. అన్నట్టుగానే జగదాంబ తన మాయతో మధుకైటభుల ఎదుట ఒక దివ్య సుందరిగా ప్రత్యక్షమయింది. మన్మధ శరముల వంటి దృక్కులతో రాక్షస వీరులను చూసి అందంగా నవ్వింది. ఆ జగదాంబ అపూర్వ సౌందర్యాన్ని గమనించి మోహపరవశులై పోయారు వారు. ఏ తల్లి దయతో వారికి స్వేచ్ఛా మరణ వరం లభించిందో ఆ తల్లినే మాయకు లోనై కాముక దృష్టితో చూశారు. తమను తామే మరచి పోయారు. వారి మోహావేశాన్ని కనిపెట్టాడు మహావిష్ణువు. వెంటనే, వారితో ఓ మధుకైటభులారా! మీ యుద్ధ నైపుణ్యం, పటిమ నన్ను అమితంగా సంతోషపెట్టాయి. మెచ్చాను. కోరుకోండి. కోరిన వరాలనిస్తాను అని అన్నాడు. అలా అనగానే సుందరీమణి సన్నిధానంలో తన గొప్పతనం చాటడానికి శ్రీహరి అలా అంటున్నాడని భావించి, మూర్ఖులైన ఆ రాక్షస సోదరులు కాముకత, అహంకారం, దురభిమానం అన్నీ ఏకమై మూఢత్వంతో అతిశయిస్తూ శ్రీమహావిష్ణువుతో ఇలా అన్నారు. అపూర్వ సుందరీమణి సన్నిధిలో నీ గొప్పదనం చాటటానికి ఇలా అంటున్నావు. కాని, మాకు వరాలనిచ్చే శక్తి నీ కెక్కడిది? మేము భిక్షుకులం కాదు. నీకే వరాల నియ్యగల దిట్టలం. ఏమి కావాలో కోరుకో, ఇస్తాం అన్నారు. అయితే, దానవులారా! మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వధ్యులు కావాలి. రమాపతి అలా కోరే సరికి మధుకైటభులు ఆశ్చర్యపోయారు. వంచితుల మయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. 

    జనార్దనా! ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు. గుర్తుందిగా. మాట మార్చకు. నీకు మేము వంధ్యుల మవుతాము. కాకపోతే, నిర్జలమైన విశాల ప్రదేశంలో నిర్జించాలి. అదే, నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా. నెరవేర్చు అన్నారు. ఆ నియమానికి శ్రీహరి నవ్వుకొన్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్ములను సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీటిమీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా! ఈ తొడ మీద నీరు లేదు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి, అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జఘన భాగాన్ని రెండువేల యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులూ ఖండించాడు. తలలూ, మొండాలూ తొడలమీద రాలిపడ్డాయి. మధుకైటభులు నిహతులయ్యారు. వారి కళేబరాలనుంచి మేదస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని అంటే, భూమి అయింది. అందుకనే మృత్తిక, అదే, మట్టి తినరానిదయింది. 

    
     

   

    

1, మార్చి 2025, శనివారం

:: జడభరతుడు :: 

    భరతుడు ఆంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణునకు కుమారుడుగా పుట్టాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వలన ఆయనకు తొమ్మిదిమంది పుత్రులు, రెండవ భార్య వలన కవల సంతానంగా ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలిగారు. కవల సంతానములోని మగ శిశువే భరతుడు. భరతుని తండ్రి అయిన ఆ బ్రాహ్మణుడు వేదాధ్యయన సంపన్నుడు, సుగుణ గరిష్ఠుడు, నీతికోవిదుడు. భరతుడు పుట్టినది మొదలు సంసారబంధాలకు దూరంగా ఉంటూ, అచ్యుతుడు, సర్వేశ్వరుడూ అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ కాలం గడపసాగాడు. పూర్వజన్మ స్మృతులవల్ల భరతుడు బంధ విముక్తికోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా జనులకు కనిపిస్తూ జీవితం గడిపినాడు. అందువల్ల ఆ తరువాత అతడు జడభరతుడన్న పేరుతో ప్రసిద్ధిచెందాడు. 

    బ్రాహ్మణ కుమారుడైన జడభరతుడికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కాబట్టి వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి వానికి ఉపనయనంచేసి, గాయత్రీమంత్రోపదేశం చేసి, వేదాధ్యయనం చేయించి, వానికి వానిపట్ల అభినివేశం లేకపోవడం గమనించి తన కోరిక నెరవేరలేదని నిరాశ పడ్డాడు. కొంతకాలానికి ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోక గతుడైనాడు. తండ్రి పోగానే తల్లి సహగమనం చేసింది. సవతి పిల్లలు అవినీతిపరులు. అందువల్ల వారికి భరతుని గొప్పదనం తెలియలేదు. తండ్రి మరణానంతరం సవతి తల్లి పిల్లలు భరతుణ్ణి చదువనీయకుండా ఇంటిపనులు, పొలంపనులు చేయమని శాసించేవారు. ఆ పనులు చేస్తూ భరతుడు ఏ విషయంలోనూ ఆసక్తి లేకుండా ద్వంద్వాలలో సమబుద్ధి కలవాడై, వారేమి తిట్టినా పట్టించుకోకుండా కాలం గడిపాడు. అతడు పనిచేసే పొలానికి సమీపంలో ఒక నగరం ఉంది. దాని నాయకుడు భిల్లరాజు. వానికి సంతానం లేదు. సంతానం కోసం కాళికాదేవిని పూజించి, ఆమెకు బలి యివ్వాలని నిశ్చయించుకున్నాడు. కాళికాదేవికి బలి యివ్వటానికి ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకొని వెడుతూ ఉంటే ఆ మనిషి తప్పించుకొని పారిపోయాడు. వాడు ఎంత వెదికినా దొరకలేదు. అప్పుడు భిల్లరాజు భటులు పొలంలో వీరాసనంలో ధ్యానం చేస్తున్న భరతుణ్ణి చూచి బలికి బలిపశువు దొరికిందని కాళికాలయానికి తీసుకుపోయి బలి యివ్వబోగా సాక్షాద్విష్ణు స్వరూపం అయిన భరతుణ్ణి చూచి కాళికాదేవి బోయరాజు మీద, భటుల మీద విజృభించి వారి శిరస్సులు నేలకూల్చింది. తరువాత జడభరతుడు పొలం దగ్గరకు వచ్చి పూర్వంలా కాపలా కాస్తున్నాడు. ఇలా సంవత్సరాలు గడిచాయి. 

    ఒకసారి సింధు దేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజు కపిలముని దగ్గర ఆత్మవిద్య తెలుసుకోవాలని బుద్ధిపుట్టి ఇక్షుమతీ నదీతీరంలోని కపిలమునిని దర్శించటానికి పల్లకీ ఎక్కి వెడుతున్నాడు. పల్లకీమోసే బోయీలకు పొలాన్ని కాపలాకాసే బలవంతుడైన భరతుడు పల్లకీ మోయటానికి బాగుంటాడని అతనిని తీసుకువచ్చి పల్లకీ బొంగు అతని భుజంమీద పెట్టారు. అలవాటులేని, ఆసక్తిలేని భరతుడు నడుస్తున్నాడు. మిగిలిన బోయీలకు ఇతని నడకతో జత కుదరలేదు. ఎగుడు దిగుడుగా పల్లకి నడుస్తుంటే రాజుకు కోపంవచ్చి బోయీలను మందలించాడు. వారు భరతుడు సరిగా నడవటం లేదని చెప్పారు. రహూగణునకు కోపం వచ్చి బ్రహ్మతేజస్సుతో, నివురుగప్పిన నిప్పులా ఉన్న భరతుణ్ణి నిందించాడు. భరతుడు మారు చెప్పకుండా పల్లకీ మోస్తూనే ఉన్నాడు. భరతునకు తనకిది చివరి జన్మమని తెలుసు. అహంకార మమకారాలకు మనస్సులో అవకాశం యివ్వలేదు. అతడు జ్ఞాని, పరబ్రహ్మస్వరూపుడు. రహూగణుడు పల్లకి ఎగుడు దిగుడుగా పోతుంటే పిచ్చికోపంతో అరిచాడు. ఓరీ! పొగరుబోతా! నడపీనుగా! నీ కుంటి నడకను వదిలించి సరిఅయిన మార్గంలో నడిపిస్తాను అని కారుకూతలు కూసాడు. అది విని భరతుడు ఓ రాజా! నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే గాని నాకేమాత్రం కాదు. జీవన్మృతుడను. నేను మాత్రమే కాదు. జనన మరణాలు కల్గిఉండే వారందరూ జీవన్మృతులే. యజమాని సేవకుడు అనే సంబంధం కర్మవల్ల కలిగింది. " నేను రాజును గదా!" అనే అభిమానంతో నీవు ఆజ్ఞాపించావు. " నీవు మదోన్మత్తుడవై ఉన్నావు. మూగవాడు, పిచ్చివాడు, గుడ్డివాడు ఎలాగో, నేనూ అంతే! జడుడను, మృతుడను అయిన నాకు శిక్ష విధించిన నీ శ్రమ వ్యర్థం " అని చెప్పి పల్లకి ఎప్పటిలాగే మోయసాగాడు. రహూగణుడు భరతుని శాస్త్ర సమ్మతములైన వాక్యాలను విన్నాడు. అహంకారం తొలగింది. బ్రాహ్మణునకు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు. అవధూతలా కనిపిస్తున్నావు. నిగూఢమైన విజ్ఞాన రహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీవు లోకులను పరీక్షించటం కోసం ఎవరూ గుర్తించటానికి వీలుకాని ఆకారంలో తిరుగుతున్న కపిల మహామునీంద్రుడనే అనుకుంటున్నాను, అని రాజు రహూగణుడు బ్రాహ్మణుని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాడు. సంసారమనే అడవిలోని కష్టాలను, దు:ఖాలను సవివరంగా చెప్పగా సింధు దేశాధిపతి రహూగణుడు భరతుడికి నమస్కారం చేశాడు. మీరు జ్ఞానులు. మీ సాంగత్యంతో నాకు తత్త్వం బోధపడింది. దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అన్నాడు. ఇలా ఈ జడభరతుని చరిత్ర వినిపించిన వారినీ, విన్నవారినీ శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారు స్వర్గసుఖం అనుభవిస్తారు. 

    

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

:: శిశుపాలుని చరిత్ర :: 

    శిశుపాలుడు చేది వంశంలో సాత్వతీదమఘోషులకు పుట్టాడు. పుట్టుకతోనే వానికి నాలుగు భుజాలు, నొసట కన్ను, గాడిద కంఠధ్వనితో ఏడ్పు వచ్చాయి. తల్లిదండ్రులు అదిచూచి భయపడ్డారు. ఆశ్చర్యపోయారు. అప్పుడొక అశరీరవాణి ఇలా అన్నది - ఈ బాలుణ్ణి ఇతరులెవ్వరూ చంపలేరు. ఎవరైతే ఇతణ్ణి ఎత్తుకోగానే, ఎక్కువగా ఉన్న రెండు చేతులు, కన్నూ అణగిపోతాయో అతడే ఇతడి పాలిటి యముడు. అశరీరవాణి ఆ విధంగా చెప్పేసరికి, శిశుపాలుని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చూడవచ్చిన వాళ్ళందరి చేతికి ఎత్తుకోవటానికి ఆ బాలుణ్ణి ఇవ్వసాగారు. 

    అద్భుత ప్రతిభావంతులైన బలరామకృష్ణులిద్దరూ వికార రూపంలో ఉన్న బాలుడు శిశుపాలుణ్ణి, మేనత్త అయిన సాత్వతిని ప్రియమార చూడాలని బంధువులతో, మంత్రులతో, మిత్రులతో కలసి ఒకనాడు చేది భూపతి పట్టణానికి వెళ్ళారు. సాత్వతి ఈ విధంగా వచ్చిన బలరామ కృష్ణులను ప్రీతితో గౌరవించి, బాలుడైన శిశుపాలుణ్ణి ఎత్తుకోవటానికి మొదట బలరాముని చేతికిచ్చింది. ఆ తరువాత శ్రీకృష్ణుని చేతికిచ్చింది. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే, అందరూ చూస్తుండగా, ఆశ్చర్యకరంగా - అధికంగా ఉండే అతని చేతులు, కన్ను ఒక్కసారిగా అణగిపోయాయి. దానిని చూసి సాత్వతి ఆశ్చర్యపోయింది. అశరీరవాణి చెప్పిన మాటలను మనసులో తలచు కొన్నది. శ్రీకృష్ణుని వల్లనే తన కొడుకుకు మరణం తప్పదని తెలిసికొని శ్రీకృష్ణునితో ఇలా అన్నది. శ్రీకృష్ణా! ఈ బాలుడు చెడు మార్గంలో నడిచేవాడై అపకారం చేసి నీకు అప్రియుడైనా - నీ మరది చేసే తప్పులు నూఱింటిని దయతో క్షమించుమని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో ఆమె కోరిన వరాన్ని ప్రసాదించాడు. 

    ఆ తరువాత ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగానికి శిశుపాలుడు హాజరయి, శ్రీకృష్ణుని అగ్రపూజకు ఆహ్వానించిన ధర్మరాజుని, భీష్మాచార్యుని తదితర పెద్దలను తీవ్రంగా అధిక్షేపించి, శ్రీకృష్ణునితో ముఖాముఖి ఈ విధంగా అన్నాడు. ఓ కృష్ణా! అవమానించ దగిన నిన్ను స్నేహం చేత, కురువంశపు ముదుసలి అయిన భీష్ముని ప్రేరణ చేత, నిండు సభలో గౌరవించ దగిన వాడవని ఎంచి తప్పుగా పూజించారు. కేశవా! అవివేకులైన పాండవులు,  నీ మీది మోహంతో మతి కోల్పోయిన భీష్ముడు, నీవు నాతో యుద్ధం చెయ్యటానికి సిద్ధంకండి అని మితిమీరిన గర్వంతో అన్నాడు. అప్పుడు చక్రధారి అయిన శ్రీకృష్ణుడు సమస్త రాజసమూహం వినేటట్లు ఈ విధంగా అన్నాడు. ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుని మీద మేము దండెత్తిన సమయంలో ఈ శిశుపాలుడు దుర్మార్గుడై బాలురకు, వృద్ధులకు భయం కలిగేటట్లు ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు. వీరులైన భోజరాజులు భార్యలతో కలసి రైవతకాద్రిమీద క్రీడిస్తూ మైమరచి ఉన్న సమయంలో క్రూరుడై వారిని వధించాడు. దేవతాసమానుడైన వసుదేవుడు అశ్వమేధ యాగానికై పూజించిన గుర్రాన్ని అపహరించి, ఆ యాగానికి చెఱుపు చేశాడు. పాపాత్ముడై బభ్రుని భార్యను తన భార్యగా చేసుకొన్నాడు. అంతేగాక, మాటలకు సంబంధించి అనేక అపకారాలు కూడా చేశాడు. మా అత్త సాత్వతి ప్రార్థించటంచేత ఈ దుర్మార్గుడు చేసిన నూరు తప్పులు సహించాను. ఇప్పుడు మీరంతా చూస్తుండగా నాపట్ల దుర్మార్గ ప్రవర్తన ప్రారంభించి పరమ శత్రువయ్యాడని శ్రీకృష్ణుడనగానే, శిశుపాలుడు మహా కఠినమైన మాటలతో పురుషోత్తముణ్ణి ఇలా అన్నాడు. దుర్జనులకు ప్రియమైన వాడా! నీ స్నేహంతో, నీ కోపంతో నాకేమి పని? మొదట నా కిచ్చిన కన్యను నీ దానినిగా చేసుకొని ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గులేదా? అంటూ శిశుపాలుడు ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుణ్ణి నిందా వాక్యాలతో దూషిస్తుండగా, రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం అగ్నిజ్వాలలు చలిస్తుండగా, అందరు రాజులూ భయపడుతూండగా, శిశుపాలుని శరీరం నుండి రక్తధారలు ఒక్కుమ్మడి మీదికి చిందుతుండగా అతని తలను నరికి వేసింది. నిందిస్తూ మాట్లాడిన శిశుపాలుని నోరు మూతపడింది. రాజులంతా ఆశ్చర్యంతో కళ్ళంతా పెద్దవి చేసికొని చూస్తుండగా, శిశుపాలుని శరీరం, వజ్రాయుధంతో హతమైన కొండలా క్రిందపడింది. ఆ కళేబరం నుండి ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. తరువాత శ్రీకృష్ణుడు శిశుపాలుని మృతదేహానికి అంత్యక్రియలు జరిపించి, అతని కుమారుణ్ణి చేది రాజ్యానికి రాజుగా చేశాడు. 

 

27, ఫిబ్రవరి 2025, గురువారం

:: వ్యాఘ్రేశ్వరలింగావిర్భూతి :: 

    పూర్వం దితి - కశ్యపుల పుత్రుడైన హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టి పాతాళానికి తోసేసాడు. అప్పుడు విష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని ధరించి అతనిని చంపి భూమిని పునరుద్ధరించాడు. అయితే, కొడుకైన హిరణ్యాక్షుని మృతికి అతని తల్లి దితి అమితంగా దు:ఖించింది. అప్పుడు ప్రహ్లాదుని మేనమామ, దుష్టుడూ అయిన దుందుభి నిర్హాదుడనే రాక్షసుడు దితిని ఓదార్చి దేవతలమీద పగదీర్చుకొనటానికి ఉపాయాన్ని ఇలా ఆలోచించాడు. ఎవరికైనా బలాన్నిచ్చేది ఆహారమే కదా! దేవతలయొక్క ఆహారం బ్రాహ్మణులు యజ్ఞాలలో సమర్పించే హవిస్సులు మాత్రమే! యజ్ఞాలకు వేదములే ఆధారం. ఆ వేదాలు బ్రాహ్మణులను ఆశ్రయించి ఉంటున్నాయి. కనుక బ్రాహ్మణులు నశిస్తే, వేదాలు, వేదాలతో బాటు యజ్ఞాలూ నశిస్తాయి. ఆ తరువాత దేవతలకు హవిర్భాగాలు లభించక దుర్బలులవుతారు. అపుడు వారిని తేలికగా జయించవచ్చు. వారి అక్షయ సంపదలను కైవసం చేసికొనవచ్చు - ఇలా ఆలోచించి ఆ దుష్టుడు బ్రహ్మతేజోవిరాజమానులు, వేదాధ్యన సుసంపన్నులు అధికంగా నివసిస్తున్న వారణాసీ నగరానికి వచ్చి వారిని భక్షించటం మొదలుపెట్టాడు. 

    అతడు మాయావి అయిన కారణంగా వనంలో వనచరునిగాను, జలాలలో జలజంతువు రూపంలోనూ, పగటి భాగంలో మనుష్యుల మధ్య ముని రూపంలోనూ, ఇంకా, అనేక రూపాలలో ఉంటూ బ్రాహ్మణులను చంపి భక్షిస్తూ ఉండేవాడు. రాత్రి పెద్దపులి రూపంలో వచ్చి ఎముకలను గూడా విడిచి పెట్టకుండ తినివేసేవాడు. నిన్న కనిపించిన విప్రుడు ఈరోజున కనిపించక పోయేసరికి కాశీ నగరంలో పెద్ద గగ్గోలు పుట్టింది. అప్పటికే చాలామంది బ్రాహ్మణులు మాయావి నోట్లోపడి మాయమయ్యారు. 

    ఒకరోజున శివరాత్రినాడు శివభక్తుడైన ఒక బ్రాహ్మణుడు శివుని అర్చించి ధ్యాన నిమగ్నుడయినాడు. దుందుభినిర్హాదుడు అతనిని కబళించటానికి నిశ్చయించుకొన్నాడు కాని, అస్త్ర మంత్రన్యాసం చేసి ఏకాగ్రచిత్తంతో శివధ్యానం చేస్తూన్న విప్రుని సమీపించ లేకపోయాడు. ధ్యానం నుండి లేచి అర్చన ముగించగానే విప్రుని కబళింపబోయాడు మాయావి. వెంటనే సర్వ వ్యాపకుడైన రుద్రుడు వాని అభిప్రాయాన్నెరిగి బ్రాహ్మణుడు అర్చించిన లింగం నుండి ఆవిర్భవించి మృగరూపంలో ఉన్న రాక్షసుని బాహుబంధంలో ఇరికించి పిడికిలితో నెత్తిపై మొత్తగానే వ్యాఘ్ర రూపంలో ఉన్న రాక్షసుడు వెంటనే భయంకరంగా గర్జిస్తూ మరణించాడు. ఆ అరుపుకు అనేకమంది మునులు, ఋషులు, విప్రులు, ప్రజలు అక్కడకు చేరుకొని జయజయ ధ్వానాలతో శంకరుని స్తుతించి అక్కడనే నిత్యనివాసంగా ఉండమని ప్రార్థించారు. భక్తవత్సలుడైన శంభుడు తానావిర్భవించిన లింగము నందే లీనమయ్యాడు. అప్పటి నుండి ఆ లింగం కాశీ నగరంలో వ్యాఘ్రేశ్వర లింగమనేపేర నిత్య పూజలను అందుకుంటూ భక్తుల కొంగుబంగారమై వారిని రక్షిస్తూనే ఉంది. ఈ గాథ శివప్రీతి కరమయినది, భుక్తిముక్తి దాయకమైనదిగా ప్రఖ్యాతి చెందియున్నది. 

19, ఫిబ్రవరి 2025, బుధవారం

:: సుందోపసుందుల కథ ::  

    పూర్వం దితి కుమారుడైన హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసుందులనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారు నిగ్రహంతో కూడిన మనసు కలవారై తపస్సుచే తప్ప సర్వాన్ని పొందటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి వింధ్య పర్వతానికి వెళ్ళారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, వేసవికాలం అయిదు అగ్నుల మధ్య, వర్షాకాలంలో, చలికాలంలో నీటి మడుగులలో ఉండి, గాలిని భక్షిస్తూ, ఒంటి కాలి మీద నిలబడి, చేతులు పైకెత్తి తలలు వంచి చాలాకాలం తపస్సు చేయగా, వారి భయంకరమైన తపో వేడిమికి వింధ్య పర్వత గుహలలో పొగపుట్టి, ఎంతో పైకెగసి, ఆకాశం అంతా కప్పగా దేవతలు భయపడ్డారు.  అందమైన స్త్రీలచేత వాళ్ళ తపస్సుకు విఘ్నం కలిగించాలని ప్రయత్నించారు. విఫలులయి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, ఆ రాక్షసుల తపస్సు చెడగొట్టాలని అనగా, ముల్లోకాలచే పూజింపబడిన వాడూ, పద్మం పీఠంగా గలవాడూ అయిన ఆ బ్రహ్మదేవుడు దేవతలకు మేలుచేయాలని, దయతో వరం యివ్వటానికి సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు. వారి తపస్సుకు మెచ్చి, వారికి ప్రత్యక్షమై, మీకు యిష్టమైన వరం ఇస్తాను, వేడండి అనగా, వారు చేతులు జోడించి కోరిన రూపం కలిగి ఉండటాన్ని, కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని, అన్ని మాయలు కలిగి ఉండటాన్ని, యితరుల చేత చావు లేకుండటాన్ని, అసలు చావే లేకుండటాన్ని అనుగ్రహించమని కోరారు. బ్రహ్మదేవుడు వారికి ' చావు లేకుండటం ' అనే వరం ఒక్కటి తప్ప తక్కిన వాటినన్నింటినీ దయతో అనుగ్రహించాడు. 

    ఈ విధంగా వారు బ్రహ్మ వలన వరాలు పొంది చెలరేగి, సాటిలేని రాజ్యవైభవంతో వెలిగి, గర్విష్టులై లోకాలను జయించాలన్న కోరికతో దేవతలు, గరుడులు, నాగులు, కిన్నరుల యొక్క పురాలను  కొల్లగొట్టుతూ, భూలోకంలోని రాజులను, ఋషులను, బ్రాహ్మణ శ్రేష్ఠులను బాధిస్తూ, బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞాలు,, వేదాధ్యయనాలు, శ్రాద్ధాలు, హోమాలు, తపస్సులు, దానాలు, జపాల చేత పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తి పొందుతున్నారని కోపించి, పుణ్యవంతుల నిత్య నైమిత్తిక కర్మలకు ఆటంకాలు కల్గిస్తూ, సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలు ధరించి అడవులలో తిరుగుతూ, మునిపల్లెల్లో ప్రవేశించి మునులకు ప్రాణభయం కలిగిస్తూ ఉండగా, మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉపద్రవాలను గూర్చి చెప్పారు. బ్రహ్మ మునులు చెప్పింది విని, ఆశ్చర్యపడి, వారు యితరుల చేత చావరని, ఒకరితో ఒకరు యుద్ధం చేసి మాత్రమే మరణిస్తారని చెప్పి, విశ్వకర్మను పిలిపించి అందం, కాంతి గల ఒక స్త్రీని సృజింపుమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ వెంటనే, తన నేర్పుతో  కాంతివంతమైన  దేహంతో ప్రకాశించే నల్ల కలువల వంటి కన్నులు గల తిలోత్తమను సృజించాడు. 

    దేవేంద్రుడు మొదలైన దేవతల సమూహాలూ, మునుల సమూహాలూ కొలుస్తూ ఉన్న బ్రహ్మదేవునికి ఆ తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి ' పని ఏమి? ' అని ఎదుట నిలిచింది. బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూచి, ' సుందుడు, ఉపసుందుడు ' అనే రాక్షసి లిద్దరు పొగరెక్కి లోకాలకు కీడుచేస్తూ వింధ్యపర్వత గుహల్లో ఉన్నారు. వారిద్దరూ నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్లుగా చేయుమని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ అలాగేనని బ్రహ్మ దగ్గర శలవు తీసుకొని దేవసభకు ప్రదక్షిణ చేసింది. అప్పుడు బ్రహ్మ ఆమె సౌందర్యాన్ని చూడటానికి తనకు నాలుగు దిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడయ్యాడు. దేవేంద్రుడు తన రెండు నేత్రాలతో చూస్తే తృప్తి కలుగదని వేయికన్నులవాడయ్యాడు. దేవతలు కామమోహితులయ్యారు. ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి, మానవ లోకానికి మెరుపుతీగవలె ప్రకాశిస్తూ, వింధ్యపర్వత అరణ్యప్రాంతమంతా వెలుగుతూండగా వచ్చింది. 

    సుందోపసుందులు ఆ తిలోత్తమను చూచి, ఒక్కసారిగా మన్మథపీడితులై, పరస్పర స్నేహాన్ని వదలి, అనురాగంతో ఆమె మీద చూపులు నిలిపారు. ఒకే ఆసనంమీద కూర్చొంటూ, ఒకే ఆహారం భుజిస్తూ, ఒకే వాహనం ఎక్కుతూ, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే పడకమీద పడుకొంటూ, ఒకే పనిచేస్తూ, ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసుందులిద్దరూ దైవ నిర్ణయం వలన ఒకే స్త్రీని కామించారు. వారిద్దరూ మన్మథ బాధితులై మోహావేశంతో ' ఇది నా భార్య, ఇది నా భార్య ' అని ఆమె ఎడమ, కుడి చేతులను పట్టుకొని, సుందరీ! మా యిద్దరిలో నీవు ఎవ్వరిని కోరుతావో చెప్పు ' మని సుందోపసుందులడుగగా ' మీలో మీరు యుద్ధం చేసి, ఎవడు గెలుస్తాడో అతడినే కోరుతాను ' అని తిలోత్తమ చెప్పగా ఇద్దరూ తగ్గక, వజ్రసమదేహం గల వారిద్దరూ విజృంభించి కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వ్యతిరేక బుద్ధితో కోపాత్ములై పిడుగులవంటి గట్టి పిడికిలి పోట్లతో ఒకరితో ఒకరు పోరాడినారు. ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడే వారు, ఒకరి మేలు ఒకరు కోరే వారు అయిన ఆ రాక్షసులు పరాయి వారి వలె కోపంతో రెచ్చిపోయి, ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొంది తుదకు నాశనమయిపోతారు సుందోపసుందుల వలెనే. 

 

18, ఫిబ్రవరి 2025, మంగళవారం

:: పురూరవుని పుట్టుక :: 

    వైవస్వతమనువు కుమారుడైన సుద్యుమ్నుడు ఒకరోజు అశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. మందీమార్బలం కూడా వెంట వెళ్ళింది. ఆ విధంగా అతడు ధనుర్బాణాలతో మృగాలను వేటాడుతూ చివరకు అరణ్యపు ఉత్తర భాగానికి చేరుకున్నాడు. అక్కడ   మేరుపర్వత సానువుల్లో అత్యద్భుతమైన సౌందర్యంతో విరాజిల్లే ఓ ఉద్యానవనం గోచరించింది. ఫలవృక్షాలతోనూ, సౌరభాలను వెదజల్లే పలువిధములైన పూల తరువులతోనూ నిండి, పక్షుల కిలకిలారావాలతో, తుమ్మెదల ఝంకారాలతో సందడి గొలుపుతూ సర్వాంగ సుందరంగా ఎవరో చక్కగా తీర్చి దిద్దినట్లుగా ఉంది ఆ తోట. నిజానికి అది శివుడు ఉమతో గూడి విహరించే సుకుమారమనే వనము. సుద్యుమ్నుడు ఆ వనాన్ని చూడగానే పరవశించి పోయాడు. సేవకులతో సహా  ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అందులోనికి ప్రవేశించిన వారంతా అకస్మాత్తుగా స్త్రీలుగా మారిపోయారు. సుద్యుమ్నుని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. అలా ఎందుకు జరిగిందో వారికేమాత్రం బోధపడలేదు. విచారగ్రస్తులై ఖిన్న వదనాలతో చేసేదిలేక విచారించారు.  

    పూర్వమొకసారి శివపార్వతులు ఆ వనంలో విహరిస్తున్న సమయంలో వారి దర్శనార్థము   బ్రహ్మ మానస పుత్రుల్గగు సనకసనందనాది మహామునులు అక్కడకు వచ్చారు.   ఆ సమయంలో అంబిక వివస్త్రయై ఉండడం వలన హఠాత్తుగా వచ్చిన ఆ మౌనివరులను చూసి సిగ్గుపడి వెంటనే భర్త ఒడిలో నుండి దిగి వస్త్రంతో వక్షస్థలాన్ని కప్పుకొంది.    ఋషులు తమ పొరబాటుని గ్రహించిన వారై వెంటనే అక్కడి నుండి వెనుదిరిగి నరనారాయణాశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు తన పత్నికి ప్రసన్నతను కలిగించగోరి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వర ప్రభావము వలన ఏ పురుషుడు ఆ వనంలో ప్రవేశించినా వెంటనే స్త్రీ రూపాన్ని పొందుతాడు. . అప్పటినుంచి విషయం తెలిసిన వారెవరూ ఆ వనంలోకి వెళ్ళటం మానుకున్నారు. సుద్యుమ్నుడు ఇది తెలియకవెళ్ళాడు. స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతీ అంతే అయింది. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం విడిచి ఇవతలికి వచ్చి అరణ్యంలోనే స్థిరపడిపోయాడు. రాజ్యానికి వెళ్ళేందుకు మనసు ఒప్పలేదు. ఇళ అనే పేరుతో ఆ అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు. పరివారం మొత్తం చెలికత్తెలై సేవలు చేస్తున్నారు. 

    ఇది యిలా ఉండగా - ఒకరోజున బృహస్పతి భార్య తారకు, చంద్రునికి జన్మించిన బుధుడు యవ్వనవంతుడై ఆ అడవికి వేటకైవచ్చి అక్కడ ఇళ పేరుతో స్త్రీరూపంలో ఉన్న సుద్యుమ్నుని చూశాడు. ఇళ అందానికి మోహితుడయ్యాడు. ఆమె హావభావాలు అతణ్ణి అమితంగా ఆకర్షించాయి. ఇళ కూడా అలాగే స్పందించింది. బుధుణ్ణి పతిగా వరించింది. ఇద్దరూ గాంధర్వరీతిని వివాహం చేసుకున్నారు. తరువాత యిద్దరకూ ఒక పుత్రుడు కలిగాడు. వానికి పురూరవుడని పేరు పెట్టారు.

    తరువాత స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడు తన కులగురువైన వశిష్ఠుని స్మరించాడు. అతని దు:ఖకరస్థితికి జాలిచెందిన వశిష్ఠుడు  శివుని ప్రార్థించి సుద్యుమ్నుని స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు. పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలుగకుండా మధ్యేమార్గంగా శివుడు వరం ప్రసాదించాడు. ఈ సుద్యుమ్నుడు ఇకనుంచి ఒక నెల పురుషుడుగా, ఒక నెల స్త్రీగా ఉంటాడని అభయం యిచ్చాడు. దీనికే సంబరపడ్డ సుద్యుమ్నుడు పురుషునిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వశిష్టుని అనుగ్రహంతో పరిపాలన సాగించాడు. స్త్రీ రూపాన్ని పొందిన నెల రోజులూ రాజమందిరం విడిచి బయటకు రాలేదు. పురుష రూపంలో ఉన్న మాసంలో పరిపాలన చేసేవాడు. కాని అది ప్రజలకు నచ్చలేదు. సుద్యుమ్నునికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ధార్మికులైన పుత్రులు కలిగారు. వారంతా దక్షిణాపథానికి రాజులయ్యారు. పురూరవుడు యవ్వనంలోకి ప్రవేశించగానే రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు సుద్యుమ్నుడు. తరువాతి కాలంలో పురూరవుడు  ప్రతిష్ఠాన పురాన్ని చక్కగా పాలించాడు. 




















  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...